- అచ్చంగా తెలుగు

 ఆక్రోశ గంగ

శెట్టిపల్లి అరుణా ప్రభాకర్



ఆకాశం నుంచి శంభుని శిరస్సు మీదికి

ఆనందంగా దూకిన నేను

హిమాలయాల్నించి బంగాళాఖాతం దాకా

ఏడుస్తూ సాగుతున్నాను.

 

పుణ్య భూమి మీద పుట్టిన భారతీయుడా,

లక్షల సంవత్సరాల్నించీ

మండే సూర్యుడు కరిగించలేని మంచు కొండల్ని

నువ్వు చిటికెలో కరిగిస్తే,

ఆ నీరు కన్నీరై నేను ప్రవహిస్తే,

మనసులో నిండిన పాపాల్ని వదిలించుకోలేక నీ తనువు మీది మాలిన్యాన్ని

నువ్వు నా వంటిమీద దులిపేస్తే,

నీ ఆప్తులు మాత్రం స్వర్గానికి చేరాలనే ఆతృతతో-

అగ్ని దేవతా దగ్ధ పునీతాత్మలు  కావల్సిన భౌతిక కాయాల్నీ, పిండాల్నీ

వేద మంత్రాల సాక్షిగా నువ్వు నాలో కలిపేస్తే..

ఆఖరికి మిగిలేది

భవ్య మందాకినీ దివ్య జలం కాదు

నా అశ్రు ప్రవాహ ఘోర కాలుష్య ధార!

 

నీ ఇంట జన్మించిన ఆడ బిడ్డని

నిత్య సౌభాగ్యంతో  వర్ధిల్లమని

స్వర్ణాలంకార భూషిత సౌందర్య రాశిగా కన్యాదానం చేసి

వరుని ఇంటికి   సాగనంపుతావే

నీ ఇంట సిరులు పండించే గంగను

నీ గడ్డ మీద పుట్టిన నిర్మలా హిమానీ జలాభంగను

ఇలాగేనా పంపించేది నా ప్రియ సాగర భర్తృ పరిష్వంగానికి.

 

నాకెందుకీ పుష్కరాలు ?

నాకెందుకీ పితృదేవతా తర్పణాలు ?

ఎందుకీ హారతులు, ఎందుకీ దీపాలు?

ఎందుకు నాకు నీ పాపాలు?

మనిషి తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా

మురికి మురికే గాని నీ మనసు మారునా!

 

తోలు బొమ్మను చేసి

నా గుండెల మీద కరాళంగా నర్తింప జేసి

నిన్ను నడిపించే నాయకులు 

నా పేరు చెప్పుకుని మింగిందెంత , నాకు విదిల్చిందెంత ?

 

ఇకనైనా మౌఢ్యాలు  వదిలించుకో !

మనసు లోని జాఢ్యాలు  వదిలించుకో!

 -*-

No comments:

Post a Comment

Pages