శంతనుని ప్రేమ కథలు
నాగమంజరి గుమ్మా
ప్రేమ .. జాతి, మత, కుల బేధాలు లేనిది… అప్పుడప్పుడు వయో పరిమితులు కూడా లెక్క చేయదు. ఆస్తి అంతస్తు అవసరం లేదు. ప్రేమ సఫలమైన జంటలెన్ని ఉన్నాయో విఫలమైనవి అంతకు వందరెట్లు ఉన్నాయి. ఒక్కోసారి ప్రేమ సఫల మైనా వాటివలన వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఆ పరిణామాలు లోకోపకారానికి దారి తీయచ్చు.
చంద్రవంశ మహారాజు శంతనుడు ప్రదీపుని కుమారుడు. వేటకు వెళ్లి వస్తుండగా ఒక ముగ్ధ సుందర మూర్తిని చూసాడు. చూసిన క్షణం లోనే మనసు వశం తప్పింది. ఆమెకు దగ్గరగా వెళ్లి “సుందరీ.. నీవెవ్వరు? ఒంటిగా ఇచటేల ఉంటివి?” అని అడిగాడు.
“నేను గంగను” బదులిచ్చిందా నవయవ్వని.
“దేవీ.. నిన్ను చూడగానే నా మనసు నీ వశమైనది. నేను కురు రాజ్య సింహాసనాధీశుడను , శంతనుడు నా పేరు. ప్రదీపుని కుమారుడును. నీకు ఇష్టమైతే మనం గాంధర్వ విధిని వివాహం చేసుకుందాం” అన్నాడు శంతనుడు.
“నాకు కొన్ని షరతులు ఉన్నాయి. వాటికి అంగీకరిస్తే తప్పక వివాహమాడుతాను” అన్నది గంగ.
“ఏమిటవి? త్వరగా చెప్పు జాహ్నవి” అన్నాడు శంతనుడు.
“అబ్బే పెద్ద కష్టం తో కూడుకున్నవో, లెక్కకు మిక్కిలిగానో లేవు. ఒక్కటి కేవలం ఒక్కటి” అన్నది గంగ.
“సరేలే… అదే.. చెప్పు ప్రేయసీ.. “
“నేను చేసే పనికి అడ్డు చెప్పకూడదు. ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించను అంటే మీ వెంట రావడానికి నేను సిద్ధం” అన్నది గంగ.
“ఓస్.. అంతే కదా… నీ ఇచ్ఛ వచ్చినట్లు నీవు ఉండవచ్చు. నిన్ను ప్రశ్నించేవారు ఎవరు లేరు… నాతో సహా… “ అన్నాడు శంతనుడు
“ఆర్యపుత్రా… అలా ప్రశ్నిస్తే మాత్రం నేను నిన్ను వీడి వెళ్లిపోతాను సుమా” చెప్పింది గంగ.
“నిన్ను పోనిస్తానా భాగీరధీ..” అన్నాడు శంతనుడు.
గాంధర్వ విధిని గంగా శంతనుల వివాహం జరిగింది. వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది. ఇంతలో గంగ గర్భం దాల్చింది. శంతనుడు చాలా సంతోషించాడు. గంగకు కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినందుకు ఎంతో ఆనందించాడు శంతనుడు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పసికందును తీసుకువెళ్లి నీళ్లపాలు చేసింది. గంగకు ఇచ్చిన మాట ప్రకారం ఏమి అనలేక మౌనం వహించాదు శంతనుడు.
తరువాత వరుసగా మరొక ఆరుగురు శిశువులను కూడా అలాగే గంగ పాలు చేసింది. మనసును దుఃఖం మెలిపెడుతున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందుకలా చేస్తున్నావని గంగను అడగలేకపోయాడు. వారసుని మిగలనివ్వని గంగను చూస్తే కోపం వచ్చేది.
ఎనిమిదవ పర్యాయం కూడా గంగ అప్పుడే పుట్టిన శిశువును తీసుకుని మళ్ళీ బయలుదేరింది. ఈ సారి శంతనుడు ఆగలేకపోయాడు.
“గంగా! లోకంలో ఏ తల్లి చేయని పాపం చేస్తున్నావు. ఎందుకలా పుట్టిన ప్రతి పసికందును నీటిపాలు చేస్తున్నావు? కనీసం ఈ బిడ్డనైనా దక్కనివ్వు.” అని అడ్డుకున్నాడు.
“మహారాజా! నేను నిర్దయురాలిని కాదు. ఈ శిశువులందరూ శాపవశాన నా గర్భాన పుట్టిన అష్ట వసువులు. వారికి శాప విమోచనం కలిగించాను. ఇదిగో ఈ ఎనిమిదవ బిడ్డను మీకు వారసునిగా తీర్చి దిద్దుతాను. నా షరతు ప్రకారం మీరు నన్ను ప్రశ్నించారు కనుక ఇక నేను మీ దగ్గర ఉండను.” అని చెప్పి బిడ్డతో సహా వెళ్ళిపోయింది గంగ.
గంగనే తలచుకుంటూ కాలం గడుపుతున్నాడు శంతనుడు. ఒక రోజు గంగ వడ్డున స్ఫురద్రూపియైన ఒక నూత్న యవ్వనుని చూసాడు. ఎవరని విచారించాడు.
“గాంగేయుడను, దేవవ్రతుడు నా పేరు, శంతన మహారాజు నా తండ్రి” అని చెప్పాడు ఆ కుర్రవాడు.
“నాయనా నేనే నీ తండ్రిని, శంతనమహారాజును” అని పుత్ర వాత్సల్యంతో దగ్గరకు తీసుకున్నాడు. తనతో రాజధానికి తీసుకుపోయాడు. మరి కొన్నేళ్ళు పుత్రుని సమక్షంలో , తల్లి తనయునకు నేర్పిన విద్యలను పరిశీలిస్తూ ఆనందంగా గడిపాడు.
ఒక నాడు వేటకు వెళ్లిన సందర్భంలో కమ్మని పద్మాల పరిమళం గాలివాలున శంతనుని నాసికాపుటాలను తాకింది. దగ్గరలో ఎక్కడైనా పద్మ సరోవరం ఉందేమోనని వెదికాడు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కానరాలేదు. కుతూహలంగా వాసన వచ్చిన దిక్కుగా గుఱ్ఱాన్ని నడిపించాడు. బెస్త పేట నుంచి ఆ పద్మ గంధం రావడంతో ఆశ్చర్యపోయాడు. చేపల వాసనతో నిండి ఉండాల్సిన ఆ ప్రాంతం కమలాల పరిమళంతో నిండి ఉండటానికి కారణాన్ని అన్వేషించాడు. పడవ నడుపుతున్న ఒక అన్నులమిన్న శరీర గంధం అని పోల్చుకున్నాడు. వెంటనే ఆమెను చేరుకున్నాడు. “కమల గంధి నీవెవ్వరు?” అని ప్రశ్నించాడు.
“నేను మత్స్య కన్యను. నా పేరు సత్యవతి. దాసరాజు మా తండ్రి” అని చెప్పింది ఆ మీననేత్రి.
వెంటనే శంతనమహారాజు దాసరాజు వద్దకు చేరి, తాను సత్యవతిని మోహించానని, తనకు ఇచ్చి పెళ్లి చెయ్యమని కోరాడు.
దాసరాజు శంతన మహారాజుకు నమస్కరించాడు. ఉచితాసనం సమర్పించాడు. అతిథి సత్కారాలు తనకు తోచిన రీతిలో చేసాడు. “మహారాజా! కూతురి బాగు కంటే ఏ తండ్రి అయినా కోరుకునేది ఏముంటుంది? మీరు మా అమ్మాయిని వివాహమాడుతాననడం మాకు ఎంతో మర్యాద. కానీ ఒక చిన్న కోరిక మహారాజా.. “ అని ఆగాడు.
శంతనుడు క్షణం ఆలోచించాడు. మళ్ళీ గంగ మాదిరిగా ఏం వినాల్సి వస్తుందో అనుకున్నాడు. దాసరాజును చెప్పమన్నాడు.
“మరింకేం లేదు మహారాజా… నా కూతురు మీకు పట్టపురాణి కావాలి. సత్యవతికి పుట్టే బిడ్డ హస్తినాపురానికి రాజు అవ్వాలి” అన్నాడు.
మహారాజు ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు. “నాకు కొడుకు ఉన్నాడు కదా!” అన్నాడు నోరు పెగుల్చుకుని.
“అందుకే మహారాజా ఇలా అడుగుతున్నాను. మీ బిడ్డ రాజైతే నా కూతురు, మనుమలు వారికి ఊడిగం చేయాలి. అందుకే నా బిడ్డకు పుట్టిన బిడ్డనే రాజును చేస్తానని మాట ఇస్తే నా కూతురును మీకు ఇచ్చి వివాహం చేస్తాను. ఈ నా నిర్ణయంలో తిరుగులేదు.” అన్నాడు.
హతాశుడయ్యాడు రాజు. చేసేది లేక వెనుదిరిగి వచ్చాడు.
ఇంటికి తిరిగి వచ్చాడన్న మాటే కానీ సత్యవతిని మరువలేక పోయాడు. అలాగని దేవవ్రతునికి అన్యాయం చేయలేడు. ఈ వారసుని కోసమే కదా గంగకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేక పోయాడు. ఎటూ తేల్చుకోలేక చింతాక్రాంతుడైనాడు.
తండ్రి ఎందుకో వ్యాకులపడుతున్నాడని గ్రహించాడు గాంగేయుడు. తరచి తరచి ప్రశ్నించిన మీదట నోరువిప్పాడు శంతనుడు. సత్యవతి గురించి చెప్పాడు.
గాంగేయుడు వెంటనే బెస్తపల్లెకు బయలుదేరి వెళ్లారు. దాసరాజును కలిసాడు. సత్యవతిని తన తండ్రికి ఇచ్చి వివాహం చేయమన్నాడు.
దాసరాజు తన షరతు చెప్పాడు. సింహాసనం వదులుకోడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు గాంగేయుడు. కానీ దాసరాజు మరో మెలిక పెట్టాడు.
“ఈరోజు నీవు సింహాసనం వదులుకుంటావు బాబు… కానీ తర్వాత నీకు ఆశ పుట్టవచ్చు. లేదా నీకు వివాహమైతే నీకు పుట్టిన బిడ్డలు నా కూతురి బిడ్డలతో రాజ్యం కోసం యుద్ధాలు చేయవలసిన పరిస్థితి వస్తే ఎలా?” అన్నాడు.
“ఓస్ అంతే కదా… ఇదిగో విను, నా తల్లిదండ్రుల సాక్షిగా, ఈ పంచభూతాల సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ హస్తినాపుర సింహాసనాన్ని నేను వదులుకుంటున్నాను. అంతేకాదు, ఉత్తరోత్తరా నా వారసులు ఆశ పడటానికి వీలు లేకుండా నేను వివాహమే చేసుకొనని భీషణ ప్రతిజ్ఞ చేస్తున్నాను” అన్నాడు గాంగేయుడు.
గాంగేయుని ప్రతిజ్ఞకు సంతోషించాడు దాసరాజు. తన కుమార్తె సత్యవతిని శంతనుని కు ఇచ్చి వివాహం చేసాడు. శంతనుడు తన కుమారుని భీషణ ప్రతిజ్ఞకు చలించిపోయాడు. తన సుఖం కోసం యవ్వనవంతుడైన కుమారుని జీవితాన్ని బలిచేసినందుకు కుమిలిపోయాడు. తండ్రిని ఓదార్చాడు దేవవ్రతుడు. పరిపాలనలో తన తమ్ముళ్లకు సహాయం చేస్తానన్నాడు. భీషణ ప్రతిజ్ఞ కారణంగా భీష్ముడు గా పిలవబడ్డాడు.
శంతనుడు భీష్మునికి ఇచ్చామరణం వరంగా ఇచ్చాడు. కురువృద్ధునిగా మహాభారత యుద్ధం పూర్తి అయ్యేవరకు భీష్ముడు జీవించే ఉన్నాడు.
శంతనుని రెండు ప్రేమకథలు షరతులకు లోబడినవే.. చూడగానే ఆ షరతులు తప్పుగా అనిపించినా, లోకకల్యాణం కోసమే అని తెలుస్తుంది.
సర్వేజనా సుఖినో భవంతు
స్వస్తి.
***
No comments:
Post a Comment