తిరువత్తిగై శయన నరసింహార్, సార నారాయణ్ ఆలయం - అచ్చంగా తెలుగు

తిరువత్తిగై శయన నరసింహార్, సార నారాయణ్ ఆలయం

Share This

 తిరువత్తిగై శయన నరసింహార్, సార నారాయణ్ ఆలయం

 భావరాజు పద్మిని 



ఈ ఆలయం తమిళనాడు లోని కుడ్డలోర్ జిల్లాలో పనృతి వద్దగల, తిరువత్తిగైలో ఉంది.
 
వివరణ:
పనృతికి తూర్పున మూడు‌ కి.మీల దూరంలో  తిరువత్తిగైలో ఈ సారనారాయణ ఆలయం ఉంది. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రహ్మ నారదుడికి చెప్పినట్లుగా భావించే బ్రహ్మాండ పురాణం లోని తిరుపుర వతిగై లో  ఈ ఆలయ ప్రస్తావన ఉంది. ఈ సార నారాయణుడి విశేషాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే నారదుడికి చెప్పినట్లుగా ఉంది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం తో కూడుకుని భక్తులను ఆకర్షించే భారతదేశంలోని 274 శివాలయాల్లో ఇది ఒకటి. 
 
చరిత్ర:
శయన నరసింహస్వామిని మరే విష్ణు ఆలయంలోనూ చూడము. ఈ పవిత్రమైన దేవాలయాన్ని కోవిలూర్ దైవమైన ఉలగలండ పెరిమాళ్ ఏడాదికొకసారి, మాఘ మాసంలో దర్శిస్తారు. త్రిపురాసుర సంహారం కోసం శివుడికి విష్ణువు ఒక ధనస్సును ఇచ్చారు. ఈ కారణంగానే తిరువత్తిగై లో ఉన్న నరసింహ స్వామిని సార నారాయణుడు అంటారు.
     
ప్రాధాన్యత:
కల్యాణ భంగిమలో ఉన్న తాయార్ ను ఇక్కడ చూడవచ్చు. మామగారైన మార్కండేయ ఋషిని కూడా ఇక్కడ సార నారాయణునికి, తాయార్ కు దగ్గరగా చూడవచ్చు. మహాభారత యుద్ధం ముగిశాక అర్జునుడు ఈ ఆలయాన్ని దర్శించాడని పురాణాల్లో ఉంది.అప్పుడు అర్జునుడు చెప్పిన 'తిరువత్తిగై కాండ' ను వేదవ్యాస మహర్షి రచించారు. పల్లవుల పాలన సమయంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. వంశపారంపర్యంగా ఇక్కడి దేవాలయ నిర్వాహకులు చూపిస్తున్న భక్తి, అంకితభావం వల్ల ఈ పవిత్రమైన ఆలయంలోని ఆచారాలు ఇంకా అద్భుతంగా జరుగుతున్నాయి.
 
పురాణ కథనం:
ఇక్కడ నరసింహస్వామి దక్షిణముఖంగా తలపెట్టుకుని శయనిస్తూ ఉంటారు. వక్రాసురునితో యుద్ధం చేసి అతనిని సంహరించిన తర్వాత, విశ్రాంతి కోసం నరసింహ స్వామి ఇక్కడకు వచ్చి శయనించారని తెలుస్తుంది. అందుకే ఆయన ఇక్కడ శయన భంగిమలో ఉంటారు. దీనికి సంబంధించిన ప్రమాణం నరసింహ పురాణంలో ఉంది. 
   
ఉత్సవాలు:
'కన్నడి ఆరై' అనే ఉత్సవం అనాదిగా ఇక్కడ జరుగుతోంది. స్వాతి నక్షత్రం/ప్రదోషం ఈ సమయంలో జరిగే తిరుమంజనం చాలా విశేషమైనది‌. ఈ సమయంలో స్వామివారికి పానక ఆరాధన కూడా చేస్తారు. పురతశి సమయంలో ఈ స్వామికి అత్యంత వైభవంగా ఉత్సవం చేస్తారు. అది ముగిసిన తర్వాత ఒక నెల సమయంలోనే విశేషమైన నేతి దీపాల ఉత్సవం, జరుగుతుంది. ఇది తిరుమలలో శ్రీనివాసుడికి జరిగే ఉత్సవాన్ని పోలి ఉంటుంది. పురతశి సమయంలో జరిగే ఒక్క రోజు బ్రహ్మోత్సవాన్ని చూసి తీరాల్సిందే. ఈ సమయంలో భగవానుడికి విశేషమైన అలంకారాలు చేస్తారు. ఇతర ఉత్సవాలలో మార్గళి అధ్యయన ఉత్సవం, రథసప్తమి ఫాల్గుణ ఉత్తిరం సెర్తి ముఖ్యమైనవి.
    
*****

No comments:

Post a Comment

Pages