విశ్వామిత్రుడు - అచ్చంగా తెలుగు
విశ్వామిత్రుడు
అంబడిపూడి శ్యామసుందర రావు  
 



హిందు పురాణాల్లో గొప్ప ఋషులలో ఒకడిగా పేరుపొందినవాడు విశ్వామిత్రుడు. గాయత్రి మంతాన్ని సృష్టించి  లోకానికి అందించిన మహానుభావుడు విశ్వామిత్రుడు.

 ఋగ్వేదంలోని 3 వ మండలము లో ఎక్కువ భాగము వ్రాసిన వాడు విశ్వామిత్రుడు, ఆ భాగములోనే గాయత్రి మంత్రము ఉన్నది. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. గాయత్రీ మంత్ర సృష్టి కర్తగా, శ్రీరామునికి గురువుగా, హరిశ్చంద్రుని పరీక్షించినవానిగా, త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవానిగా, శకుంతలకు తండ్రిగా ఈయన ప్రఖ్యాతి గాంచారు. శకుంతలా దుష్యంతుల కొడుకే భరతుడు, అంటే విశ్వామిత్రుని మనుమడు.  అందువలన భరతుడు ఏలినదేశము కాబట్టి మనది భారత దేశము అయింది. 

విశ్వామిత్రుని జన్మ వృత్తాంతాన్ని శ్రీరామునికి గౌతమ మహర్షి, అహల్య ల కుమారుడైన శతానందుడు వినిపిస్తాడు. దీనిని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం లోని బాలకాండలో 51-65 సర్గల మధ్య వర్ణించాడు. ఇంత  ఘనత కలిగిన విశ్వామిత్రుడు అరిషడ్వార్గాలను జయించలేక, చాలా కాలము తపస్సు చేసి, దేవతలను మెప్పించిన వశిష్ఠుడిని మెప్పించి, అయన చేత బ్రహ్మర్షి అనిపించుకోలేకపోతాడు. చివరకు తన ప్రయత్నాలలో కోపాన్ని జయించి బ్రహ్మర్షి అవుతాడు.

బ్రహ్మ కుమారుడు కుశుడు. ఆయన పుత్రుడు కుశనాభుడు. ఆయనకు నూరుగురు కుమార్తెలు. ఆ నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత కుశనాభుడికి పుత్రసంతానం లేకపోవడం వల్ల పుత్రకామేష్టి యాగం చేస్తాడు. తండ్రి అయిన కుశ మహారాజు ప్రత్యక్షమై, అత్యంత పరాక్రమం కలిగి, కీర్తిని ఇవ్వగల పుత్రుడుగా 'గాధి' జన్మిస్తాడు అని వరమిస్తాడు. ఆ విధంగా కుశనాభుడికి జన్మించిన గాధి కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది. విశ్వ శబ్దాన్ని స్త్రీలింగంగా విశ్వా అని పరిగణిస్తే విశ్వా + మిత్రుడు = విశ్వానికి మిత్రుడు అన్న అర్థం వస్తుంది.

 అలాకాక, విశ్వ శబ్దాన్ని పుంలింగంగా పరిగణిస్తే విశ్వ + అమిత్రుడు = విశ్వామిత్రుడు అవుతుంది. ఇది సవర్ణదీర్ఘ సంధి. ఈ విధంగా తీసుకుంటే విశ్వానికి విశ్వామిత్రుడు శత్రువు అని అర్థం వస్తుంది. కాని, మహామహుల విషయంలో దుష్టమైన అర్థం తీసికోరాదు కనుక, విశ్వానికి మిత్రుడు అనే అర్థం లోనే విశ్వామిత్ర పదాన్ని తీసుకోవాలి.

విశ్వామిత్రుడు రాజ్య పాలన చేస్తూ ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి, అలసి, వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు. కుశల ప్రశ్నలు, అర్ఘ్యపాద్యాదులు అయ్యాక, విశ్వామిత్రుడు సెలవు తీసుకోబోగా, వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు "మీ దర్శనం వల్ల, అర్ఘపాద్యాదుల వల్ల ఇప్పటికే సంతుష్టుడనయ్యాను. కాబట్టి సెలవు ఇప్పించవలసింది" అని అంటాడు. కానీ వశిష్ఠుడు ఆతిథ్యం తీసుకోమని బలవంతపెట్టడంతో, విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు. వశిష్ఠుడు తన హోమధేనువు, కామధేనువు సంతతికి చెందినదీ అయిన శబల అనే గోవును పిలిచి మహారాజుకు, ఆయన సైన్యానికి వారివారి ఇచ్ఛానుసారం పదార్ధాలు తయారు చేసి, విందు చెయ్యమంటాడు. వశిష్ఠుని ఆజ్ఞ మేరకు శబల సైనికుల ఇష్ఠాలను గ్రహించి, ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి, అతిథి సత్కారాలు చేస్తుంది.
ఆశ్చర్య చకితుడైన విశ్వామిత్రుడు, ఆ శబలను తనకు ఇచ్చి, లక్ష గోవులను దానంగా స్వీకరించమంటాడు. లక్ష గోవులు ఇచ్చినా శబలని ఇవ్వడానికి వశిష్ఠుడు అంగీకరించడు. దానితో విశ్వామిత్రుడు కోపించి "నేను రాజును, రత్నం లాంటి ఈ గోవు నా వద్దే ఉండాలి" అంటాడు. అప్పుడు వశిష్ఠుడు శబల వల్లనే ఆశ్రమంలో హవ్యం (హవిస్సులు), కవ్యం (పితృకార్యాలు) జరుగుతున్నాయి, అసలు ఈ గోవు వల్లే ప్రాణయాత్ర నడుస్తోంది అన్నాడు. పద్నాలుగు వేల ఏనుగులు, ఎనిమిది బంగారు రథాలు, పదకొండు గుర్రాలు, కోటి గోవులు, బంగారం, వెండి బదులుగా ఇస్తాను, శబలను ఇమ్మంటాడు విశ్వామిత్రుడు. వాటిని కూడా వశిష్ఠుడు నిరాకరించి మౌనం పాటిస్తాడు. ఆ మహారాజు కోపించి శబలను రాజ్యానికి తోలుకొని పొమ్మని తన సైన్యానికి ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడి సైన్యం శబల మెడలో గొలుసు వేసి, తోలుకొని పోతుండగా శబల ఏడుస్తూ వశిష్ఠ మహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది "నేనేమైనా లోపం చేశానా, నన్ను పరిత్యజిస్తున్నారు? మీరు నన్ను రక్షిస్తారా లేక నన్ను నేను రక్షించు కొనుమంటారా?" వశిష్ఠ మహర్షి దానికి అంగీకారాన్ని తెలుపుతాడు. అప్పుడు శబల ఒక హూంకారం (అంబా నాదం) చేసి, వెంటనే శూలాయుధులైన పహ్లవులు అనే యవనులకు జన్మనిచ్చి వారి ద్వారా విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది. అది చూసి క్రోధ పరవశుడైన విశ్వామిత్రుడు అనేక శస్త్రాస్త్రాలతో పహ్లవులను సంహరిస్తాడు. దానికి క్రుద్ధ అయిన శబల తన శరీరం నుంచి కాంభోజ వంశీయులను, పొదుగు నుండి పహ్లవులను, యోని స్థానం నుండి యవనులను, గోమయం వచ్చే స్థానం నుండి శకులను, రోమకూపాలనుండి హరీకులను, కిరాతకులను పుట్టించగా వారు విశ్వామిత్రుని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. అది చూసిన విశ్వామిత్రుడి నూరుగురు కుమారులు వశిష్ఠమహర్షిని చంపేందుకు వెళ్తారు. వశిష్ఠ మహర్షి ఒక హుంకారం చేయడంతో నూరుగురు భస్మరాశులై పడిపోతారు. అది చూసిన విశ్వామిత్రుడు విచారించి, తన దగ్గర ఉన్న శక్తులతో వశిష్ఠుని గెలవజాలనని తెలిసి, రాజ్యానికి తిరిగి వెళ్ళి, మిగిలిన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి, హిమాలాయాలకు వెళ్ళి పరమశివుడి తీవ్రమైన తపస్సు చేస్తాడు.

విశ్వామిత్రుడి ఘోర తపస్సుకు మెచ్చి, శివుడు ప్రత్యక్షమవగా, ధనుర్వేదం లోని సర్వ రహస్యాలు సాంగోపాంగంగా ఇప్పటికిప్పుడు బోధించమని విశ్వామిత్రుడు కోరుతాడు. శివుడు తథాస్తు అని దీవిస్తాడు. ఆ వరాన్ని పొందిన వెంటనే విశ్వామిత్రుడు పౌర్ణమి నాడు సముద్రం పోటెత్తినట్లుగా ఉత్సాహంతో ఉప్పొంగి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. తాను నేర్చిన అస్త్రాలను ఆశ్రమంపై ప్రయోగించగా ఆశ్రమవాసులు కకావికలై ప్రాణభయంతో పరుగులుతీస్తారు. విశ్వామిత్రుడు వశిష్టునిపై  అగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు.అప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మదండమును అడ్డు పెడితే ఆ ఆగ్నేయాస్త్రం బ్రహ్మదండంలోకి చేరిపోతుంది. 

విశ్వామిత్రుడికి కోపం వచ్చి తనకు వచ్చిన అస్త్రాలు వరసగా ఒకదాని వెంట మరొకటి ప్రయోగిస్తాడు. చివరకు బ్రహ్మాస్త్రాన్ని  సంధించి వశిష్ఠుడి మీద ప్రయోగిస్తాడు. అప్పుడు బ్రహ్మాస్త్రం కూడా వశిష్ఠుడి బ్రహ్మదండం లోకి చేరి పోతుంది. అది చూసిన విశ్వామిత్రుడు చింతించి, బ్రహ్మబలాన్ని క్షత్రియ బలంతో జయించడం జరగదని భావించి, తాను కూడా బ్రహ్మర్షి కావాలని భావిస్తాడు.

భార్యాసమేతంగా దక్షిణ తీరానికి వెళ్ళి బ్రహ్మ గురించి వెయ్యి సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేస్తాడు. ఆ సమయంలోనే విశ్వామిత్రుడికి హనిషేంద్రుడు, మధుస్సందుడు, ధృఢనేత్రుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మిస్తారు. చతుర్ముఖ బ్రహ్మ ఆ తపస్సుతో ప్రీతి చెంది, "విశ్వామిత్రా నువ్వు రాజర్షి వి అయ్యావు" అని దీవించి అంతర్ధానమౌతాడు.

 విశ్వామిత్రుడు దానితో సంతృప్తి చెందక "ఎప్పటికి నేను బ్రహ్మర్షిని అవుతాను?" అని చింతిస్తాడు.

ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజుకు తన పూర్వ వంశీయుల వలె కాక, తాను సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలి అనే కోరిక పుడుతుంది. కులగురువులైన వశిష్ఠుడికి తన కోరిక విన్నవిస్తాడు. బొందితో స్వర్గానికి వెళ్ళడానికి తనచేత ఏదైనా యాగం చేయించమని కోరగా అది కూడని పని, ధర్మశాస్త్ర విరుద్దమని వశిష్ఠుడు వారిస్తాడు. అంతట వశిష్ఠుని నూరుగురు కొడుకుల వద్దకు వెళ్ళి తన కోరికను  ప్రకటిస్తాడు. వారు కూడా నిరాకరించటం  సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కూడని పని అని వశిష్టుని కుమారులు కూడా బోధిస్తారు. మీ వల్ల ఆ కార్యం కాకపోతే నేను వేరే గురువుని చూసుకొంటాను అని త్రిశంకుడు వశిష్ఠుడి కుమారులతో అంటాడు. ఆ మాట విన్న వశిష్ఠకుమారులు కోపించి ఛండాలుడివి కమ్మని త్రిశంకుని శపిస్తారు. ఛండాలుడిగా మారిన త్రిశంకుడు దేశద్రిమ్మరిలా తిరుగుతూ దక్షిణ తీరంలో తపస్సు ముగించిన విశ్వామిత్రుడి కంటపడి, తన వృత్తాంతాన్నంతా విశదీకరిస్తాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు చెయ్యలేని పనిని తాను చెయ్యాలనే కోరికతో త్రిశంకుడికి అభయం ఇచ్చి, తాను యాగం నిర్వహించి త్రిశంకుడిని సశరీరంగా ఛండాలావతారంతో స్వర్గానికి పంపుతానని చెబుతాడు. విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి సమస్త భూగోళంలో ఉన్న బ్రహ్మణులను యజ్ఞానికి అహ్వానించమంటాడు.
వశిష్ఠుడి కుమారులు, మహోదయుడు అనే బ్రాహ్మణుడు యజ్ఞానికి రామన్నారని, యజ్ఞంలో ఛండాలుడు హవిస్సులు ఇస్తే దేవతలు తీసుకోరని అన్నారని  విశ్వామిత్రుని కుమారులు తండ్రికి విన్నవిస్తారు. ఇది విన్న విశ్వామిత్రుడు క్రోధావేశంతో వశిష్ఠుని నూరుగురు కుమారులను భస్మరాసి అవుతారనీ, 700 జన్మలు శవమాంసాన్ని తింటూ బ్రతుకుతారనీ, ఆ తరువాత ముష్టికులుగా పుట్టి కుక్కమాంసం తింటూ బ్రతుకుతారనీ శపిస్తాడు. మహోదయుడు నిషాదుడిగా హీనమైన బ్రతుకు బ్రతుకుతాడని కూడా శపిస్తాడు. యాగంలో హవిస్సులు సమర్పిస్తుంటే హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రారు. అది గమనించిన విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపుతాడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గ ప్రవేశం లేదని, వచ్చిన దారినే పొమ్మని త్రిశంకుడిని భూలోకానికి నెట్టేస్తాడు. అలా నెట్టి వేయబడ్డ త్రిశంకుడు తలక్రిందులుగా పడిపోతూ, 'విశ్వామిత్రా! రక్షించు' అని ఆర్తనాదం చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గమధ్యంలో ఆపి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి (స్వర్గాన్ని, నక్షత్రమండలాన్ని) చేయనారంభిస్తాడు. దీనిని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయడం తగదని వారిస్తారు. వారి అభ్యర్థన మేరకు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్రమండలానికి ఆవల సృష్టించి, త్రిశంకుడు తలక్రిందులుగా ఆ త్రిశంకు స్వర్గంలో ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు.

 పశ్చిమ తీరంలోని పుష్కర క్షేత్రంలో తపస్సు మొదలు పెట్టబోతాడు. ఆసమయంలో మేనక పుష్కరక్షేత్రంలో స్నానం చేయడానికి వస్తుంది. మేనకను చూసి కాముకుడై విశ్వామిత్రుడు మేనకతో రమించడం ప్రారంభిస్తాడు. ఒకటి రెండు రోజులలో రతి క్రీడ ముగించి తపస్సు ప్రారంభిద్దాం అనుకొంటాడు. కాని అది పది సంవత్సరాలకు చేరుకొంటుంది. ఇలా ఉండగా ఒక రోజు విశ్వామిత్రుడికి పది సంవత్సరాలు అయిపోయాయి అని స్ఫురణలోకి వస్తుంది. ఇది దేవతల పని అని గ్రహించి, కామక్రోధాలకు వశుడునైయ్యాను అని భావించి పశ్చిమ తీరం నుండి మరల బయలు దేరి ఉత్తరాన హిమాలయాలకు చేరుకొంటాడు. మేనక, తనకు విశ్వామిత్రుడికి జన్మించిన ఆడుబిడ్డను మేనక అక్కడే విడిచి వెళ్ళి పోతుంది. అప్పుడు ఆ బిడ్డను పక్షులు తమ రెక్కల సహాయంతో నీడ కల్పించి రక్షిస్తాయి. ఆ మార్గంలో శిష్యులతో వెళ్ళుతున్న కణ్వ మహర్షి ఆ బాలికను చూసి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్లి, పెంచుతాడు. కణ్వుడు ఆ బిడ్డకు శకుంతల అని నామకరణం చేసి పెంచి పెద్దచేస్తాడు. శకుంతల దుష్యంతుని వివాహము చేసుకొని తద్వారా భరతునికి జన్మనిస్తుంది. ఈ భరతుని పేరు మీదగానే భారత దేశానికి భరతఖండమని పేరువచ్చిందని ప్రతీతి.

వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ తపస్సుకి ప్రీతి చెంది చతుర్ముఖ బ్రహ్మ వచ్చి "విశ్వామిత్రా! నీ తపస్సుకి మెచ్చాను. నువ్వు మహర్షి వి అయ్యావు" అని అంటాడు. విశ్వామిత్రుడు బాధపడక, ఆనందించక బ్రహ్మతో తాను జితేంద్రియుడిని అయ్యానా అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా బ్రహ్మ ఇంకా జితేంద్రుడివి కాలేదు ఇంకా తపస్సు చేయవలసి ఉందని చెప్పి అంతర్ధానం అవుతాడు. 

మళ్ళీ  ఘోరాతి ఘోరమైన తపస్సు చేయడం ఆరంభిస్తాడు. చేస్తున్న తపస్సుకు ఇంద్రుడు కంగారు పడి, పరీక్ష కోసం రంభను విశ్వామిత్రుడి వద్దకు పంపిస్తాడు. రంభ సంకోచిస్తుంటే ఇంద్రుడు తాను, వసంతుడు, మన్మథుడు ఆమె వెంట వస్తామని చెబుతారు. రంభ విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరుకోగా, ఆశ్రమమంతా వసంత ఋతువులా మారిపోయింది. ఆశ్రమం అంతా వసంత ఋతువులా మారిపోవడంతో విశ్వామిత్రుడికి సందేహం వచ్చి ఇది అంతా ఇంద్రుడి మాయ అని గ్రహించి, రంభ తనను ప్రలోభ పెట్టడానికి వచ్చి నట్లు గ్రహించి, ఆమె పదివేల సంవత్సరాలు పాషాణ రూపంగా మారిపోయేటట్లు శపిస్తాడు. ఆ తరువాత క్రోధ వశుడనైనాను అని భావించి, రంభతో బ్రాహ్మణోత్తముడు ఆవిడను ఉద్ధరించగలడు అని శాప విమోచనం చెప్పి తూర్పు తీరానికి తపస్సు చేసు కోవడానికి వెళ్ళి పోతాడు.
విశ్వామిత్రుడు తూర్పు దిక్కుకు వెళ్ళి మౌనంతో కామక్రోధాలను నిగ్రహిస్తూ బ్రహ్మాండమైన తపస్సు చేయడం ప్రారంభించి  వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే, శరీరం కాష్ఠం క్రింద (ఒక పుల్ల లా) మారిపోయింది. ఆ కాష్ఠాన్ని నిలబెట్టు కోవడం కోసం ఒకరోజు ఇంత అన్నం తినడం కోసం కూర్చొండగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడుగు తాడు. విశ్వామిత్రుడు అది గ్రహించి ఇంద్రుడుకి తాను తిన బోయే అన్నాన్ని (కబలం)ఇచ్చేస్తాడు. మళ్లీ కుంభకం అనే తపస్సు చేయనారంభిస్తాడు. అప్పుడు ఆయన బ్రహ్మ స్థానం నుండి పొగ వచ్చి లోకాలను కప్పేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి కౌశికా! బ్రహ్మర్షీ! అని పిలిస్తే సంతోషించి, బ్రహ్మను ఒక కోరిక కోరుతాడు. వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది అంటాడు. అప్పుడు దేవతలు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడి మనోగతాన్ని వ్యక్తం చేస్తారు. వశిష్టుడు చీదరించుకోవడం జరిగింది. అలా నాలుగైదు మార్లు జరిగాక. విశ్వామిత్రుడిలో పూర్తిగా కోపం పోయిందని, ఆయన బ్రహ్మర్షిగా అర్హుడని భావించాక "బ్రహ్మర్షీ" అని పిలుస్తాడు.

 విశ్వామిత్రుడు సంతోషించి వశిష్ఠునికి అర్ఘ్యపాద్యాలు ఇస్తాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడు.
హిందూ వర్ణవ్యవస్థలో విశ్వామిత్ర, కౌశిక గోత్రాలకు చెందినవారు విశ్వామిత్రుడు తమ వంశానికి ఆది పురుషునిగా భావిస్తారు. విశ్వామిత్ర గోత్రజులు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తమ మూలపూరుషునిగా భావిస్తారు.కౌశిక గోత్రజులు రాజర్షి కౌశికుడు తమ మూలపురుషుడని అంగీకరిస్తారు. విశ్వామిత్రుని మరో పేరే కౌశికుడు. 96 మరాఠా వంశాలలో 11 రాజవంశాలు కౌశిక గోత్రానికే చెందినవి. ప్రసిద్ధి చెందిన ఛత్రపతి శివాజీ వంశము, రాష్ట్రకూట వంశములు కౌశిక గోత్రానికి చెందినవేనని భావిస్తారు. మరాఠా వంశాలలో రెండు వంశాలు విశ్వామిత్ర గోత్రానికి చెందినవి.ఆ విధముగా విశ్వామిత్రుడు తన కోపాన్నితగ్గించుకొని, వశిష్టునిచే బ్రహ్మర్షి అనిపించుకుంటాడు.

***

No comments:

Post a Comment

Pages