శివం - 69 - అచ్చంగా తెలుగు
శివం - 69
- రాజ కార్తీక్ 



(హర సిద్దు కి బొజ్జ లింగం కథ ఆ ఆలయంలో చెప్తున్నాడు ధర్మయ్య ...గర్భ గుడిలో శివలింగం ఎప్పటికీ కుదరక పోవటం గురించి ఇలా చెప్పసాగాడు.)

ఎంతసేపటికీ శివలింగము దూరమైపోతూ వచ్చేసరికి ఇది మా ఊరికి పట్టిన అరిష్టం అని భయపడుతూ వచ్చాం. సరే ఇక గర్భాలయంలో ప్రతిష్ట కాకుండా స్వర్ణ లింగాన్ని పూజిస్తామని పండితుల సలహా మేరకు అది చేద్దాం అని నిర్ణయించుకున్నాం.

మరో ప్రయత్నంగా మరొకసారి గర్భాలయంలో ఉండే శివలింగాన్ని చెక్కినా కూడా పిడుగు పడిన దానివల్లే ఛిద్రం అయిపోయింది.

రాజుగారు, పండితులందరూ బంగారు శివ లింగాన్ని పూజించపోతున్నాము అని చాటింపు వేశారు. ఆ రోజే ఆలయంలో అన్న దానం కూడా ఏర్పాటు చేశారు. వంట వార్పులు జరుగుతున్నాయి...

అక్కడికి వచ్చాడు తలమీద శివలింగం వంటి ఆకారం కలిగిన ఒక జంగమ స్వామి.  నేను కూడా ఇది జరిగేనాటికి చిన్న బాలుడిని, ఆయన రావడంతో ఉన్నట్టుండి చల్లని గాలులు వీచాయి. ఎంతో పరిణితి చెందిన యోగిపుంగవుడిలాగా ఆయన మొహం వికసింపబడింది. స్వచ్ఛమైన నిజాయితీ, అనుభూతి, ఆయన ప్రశాంత వదనంలో ఉన్నాయి.

"ఇక్కడ ఏం జరుగుతోంది?" అని ఆయన ప్రశ్నించగా అక్కడున్న వారందరూ ఇప్పటిదాకా జరిగింది మొత్తం చెప్పారు.
దానికి ఆ జంగమదేవర "ఇప్పటిదాకా మీకు ఉన్న దోషాలు అన్నీ పోవాలంటే మహాభోక్తకి అన్న సంతర్పణ చేయాలి." అన్నాడు.

అక్కడివారు "దానికి అర్హులు ఎవరో వారికి ఎవరికీ తెలియద"న్నారు.
 
దయచేసి  జంగమదేవరని కడుపునిండా ఆరగించి వారిచ్చే 100 గోవులను స్వీకరించి ఇంకా వారికేం కావాలో తెలియజేసి, తరింప చేయవలసిందిగా ప్రార్థించారు.
ఆ సంఘటన అంతా ఒక లీల లాగా నాటకీయంగా జరిగింది.
దానికి ఆ జంగమదేవర సరే అని చెప్పి తనకి భోజనం పెట్టవలసిందిగా గర్భ గుడి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర కూర్చున్నాడు.
మా ఊరిలో కొంతమంది ఈ ముక్కు మొహం తెలియని జంగమయ్య ఏదో చెప్తే అది మన పాటించాలని ప్రశ్నలు వేసినా, ఒక మనిషి భోజనం ఏముందిలే అని ఎవరిలో ఏ మహత్వం ఉందో అని అప్పటికి బాలుడు అయిన రాజుగారు సమాధానం చెప్పారు.

ఉన్నట్టుండి పిడుగులు మెరుపులు మెరుస్తున్నాయి. ఏదో భీకరమైన ప్రకృతి బీభత్సం జరగబోతుంది అని భయపడ్డాం.

జంగమదేవర భోజనానికి కూర్చున్నాడు. ఈ వాతావరణంలో భోజనం ఏంట్రా బాబు అని అందరం అనుకున్నాం. ఉన్నట్టుండి  ఒక పిడుగు సరిగ్గా ఆలయంలో పైన పడింది. ఆ దెబ్బకు దాదాపు అందరూ చనిపోయారని అనుకున్నాం. జంగమదేవర మసి అయిపోయాడు అనుకున్నాం. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ, ఇదంతా జంగమదేవరలో లీనమైంది. ఆలయ గోపురాలు కింద పడకపోగా "ఊ, ఊ" అని ఆయన చేసిన ఘీంకరంతో వెనక్కిపోయాయి.
అందరికీ అర్థమైంది ఆయన సామాన్య వ్యక్తి కాదు, మహిమ కలిగిన వ్యక్తిని. మోకాలు దండ వేసి దండం పెట్టాము. ఒక్కసారి కళ్ళు తెరిచి చుట్టుపక్కల చూశాం ఆలయానికి కొత్త శోభ వచ్చింది.‌ ఆలయము పూర్తి శోభ చేకూరి, అద్భుతమైన నిర్మాణమల్లే మారింది. పిడుగుల ధాటికి శిధిలమైనవేమీ లేవు. 
భోజనానికి ముందు కూర్చుని, జంగమ దేవర ఒక చూపు చూసాడు.
అక్కడ కొంత మంది పరిగెత్తుకుంటూ వెళ్లి, అప్పుడే వండిన పదార్థాలు అన్ని తీసుకు వచ్చి వడ్డిస్తున్నారు.

నిజంగా ఆయన దేవుడే లేకపోతే పిడుగు ఎట్లా ఆపుతాడు? ఈ ఆలయాన్ని మంచిగా ఎలా మారుస్తాడు? గోపురాన్ని తన చూపులతో ఎలా నిలపెట్టాడు? ఆ శివయ్యే ఈ గుడి కోసం ఎవరినైరైనా పంపించాడేమో. అందరూ హర హర మహాదేవ అని ఆనందంగా అరుస్తున్నారు.

జంగమయ్య మాత్రం భోజనం చేస్తూనే ఉన్నాడు.దాదాపు ఒక పది మనుషులు తినే భోజనం తిన్నారు. అయినా ఆయనకు వడ్డిస్తూ ఉన్నాం...

హర సిద్దు అంతా చాలా ఆసక్తిగా వింటున్నాడు. అందులో తనకు ఎటువంటి సందేహం రావట్లేదు.‌ ఆలయ చరిత్రలో లీనమయ్యాడు...

ధర్మయ్య చెబుతూనే ఉన్నాడు...

"కొన్ని వేలమంది తినాల్సింది ఇంకా ఉంది. క్రమేణా జంగమదేవర స్వామి వంద మంది మనుషుల భోజనం చేశాడు. ఇంకా పెడుతూనే ఉన్నాము. ఎవరు మారుమాట్లాడకుండా జరిగిందంతా చూస్తున్నారు.
ఆయన వెయ్యి మందికి సరిపడా భోజనం చేశారు. ఇలాంటి అరుదైన సంఘటనలు పురాణాల్లో చదవడమే కానీ చూడలేదు. కానీ మా ఊరంతా సాక్ష్యంగా చూస్తుందని మేమందరం పులకించిపొయాము.

3000 మందికి సరిపడా భోజనం చేశారు ఆయనొక్కరే. ఆయన ఉదరం ముందుకు వస్తా ఉంది. అందుకే ముందుకు ముందుకు పెరుగుతోంది ఆయన ఉదరం.
అలా దాదాపు లక్ష మందికి దరిదాపుగా ఉన్న భోజనం అంతా చేశారు.
వడ్డనలో ఉన్న రాజ ప్రముఖులందరూ
మోకాళ్ళ మీద కూర్చుని ఇక ఏమీ లేదని సైగ చేసి తమ అసహాయతను చూపారు.

అప్పుడు ఆ జంగమదేవర స్వామి నుంచున్నారు. ఆయన ఉదరం చాలా ముందుకు వచ్చింది. నేను 
జంగమదేవరని "బొజ్జస్వామి, నన్ను కాపాడు" అని గట్టిగా వేడుకున్నాను. ఆ చుట్టుపక్కలలో ఉన్న వారంతా "బొజ్జస్వామి, మమ్మల్ని కాపాడు, ఏమైనా తప్పులు ఉంటే క్షమించు" అని వేడుకున్నారు.

జంగమదేవర బొజ్జ స్వామి చూసిన ఒక చూపు కి అర్థంగా రాజుగారు "జంగమ బొజ్జ స్వామి... దాదాపు లక్ష మంది కోసం సిద్ధం చేసింది అంతా అయిపోయింది. మీరు చెప్పిన మహాభోక్తా .." అని అనబోతుండగా.. ధ్వజస్తంభం దగ్గర నుంచొని ఉన్న బొజ్జ స్వామి గర్భగుడి వైపు నడుచుకుంటూ వెళ్లారు. ఏమౌతుందోనని అందులో ఒకటే ఆత్రం.
ప్రకృతే "జై జయ శంకర జయ జయ శంకర" అన్నట్లు అక్కడ ఆ నినాదాలు మారుమోగుతున్నాయి.

హరసిద్ధుడు గమనిస్తూనే ఉన్నాడు. ధర్మయ్య చెబుతుంటే చుట్టుపక్కల వారు కూడా ఎంతో తన్మయత్వం చెంది నాలో మునిగిపోయారు.

బొజ్జస్వామి నడుచుకుంటూ వెళ్తుండగా గర్భగుడి వైపుకి అందరూ ఆమె వెనక గుమి కూడా మొదలుపెట్టారు.

వెనకనుండి చూసేవారికి కూడా ఆయన బొజ్జ కనపడుతుంది.

ఆయన అలా గర్భ గుడి లోలోకి వెళ్ళాడు.

తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి.

అందరూ "హరోం హరా " అని గట్టిగా నన్ను తలుచుకున్నారు.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages