కణికుడు (కణిక నీతి) - అచ్చంగా తెలుగు

 కణికుడు (కణిక నీతి)

అంబడిపూడి శ్యామసుందర రావు



పంచమ వేదంగా కీర్తించబడే మహాభారతములో వివరించబడని విషయం అంటూ ఏది లేదు. అన్నిటి సారాంశం మంచి చెడుల తారతమ్యాన్ని తెలియజేయడమే. అందుచేతనే భారతములో వివరింపబడిన ప్రతి అంశం నేటికీ సజీవంగా ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయాల గురించి ప్రస్తుతం రాజకీయాలలో నడుస్తున్నది  కణిక నీతి అని నిస్సందేహముగా చెప్పవచ్చు ఇంతకీ కణిక నీతి అంటే ఏమిటి? కణికుడు ఎవరు? అని తెలుసుకుందాం భారతములో చాలా తక్కువగా వినపడే పేరు కణికుడిది ఎందుకంటే కణికుడు దుష్ట పాత్ర. దుర్యోధనుడికి దుష్ట సలహాలు ఇచ్చేది శకుని అయితే దృతరాష్ట్రునికి  చెడు సలహాలు ఇచ్చే వాడు కణికుడు. అందుకనే కణికుడు బోధించిన నీతిని కూట నీతి గా ప్రసిద్ధి చెందింది ఈ నీతి ప్రధాన ఉద్దేశ్యం ఏ రకంగానైనా అంటే సామ దాన దండోపాయాలతో మాత్రమే కాకుండా, కుట్రలు కుతంత్రాలతో అయినా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి. 

ముఖ్యంగా ప్రత్యర్ధులు బలవంతులైనప్పుడు ధృతరాష్ట్రునికి ఉన్న మంత్రులలో ముగ్గురు ముఖ్యలు వారు విదురుడు, సంజయుడు,కణికుడు.  విదురుని విషయానికి వస్తే ధర్మ పరాయణుడు, నీతి  కోవిదుడు, రాజు కోసం ముఖ ప్రీతి మాటలు చెబుతూ అధర్మము, అన్యాయమైన సలహాలు పరులకు హాని కలిగించేవి ఇవ్వడు విదురుడు చెప్పిన విషయాలన్నింటిని విదుర నీతిగా చెబుతారు. కొన్ని సందర్భాల్లో ధృతరాష్ట్రుని తో విభేదించి అరణ్యవాసంలో ఉన్న పాండవుల దగ్గరకు వెళతాడు కానీ ధృతరాష్ట్రుడు విదురుని మళ్ళీ తన దగ్గరకు పిలిపించుకుంటాడు. రెండవవాడు సంజయుడు ఇతను  దృతరాష్ట్రునికి అంతరంగికుడు అంధుడైన  ధృతరాష్ట్రునికి తన కున్న ప్రత్యేకమైన దైవ దత్త మైన వరముతో కురుక్షేత్ర యుద్ధాన్ని అంతఃపురంలో ధృతరాష్ట్రునికి  ఎదురుగా కూర్చుని కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తాడు సంజయుని మరో ప్రత్యేకత రాయబారాలు విజయవంతంగా నిర్వహించడం  మూడవవాడు కణికుడు విప్రుడు, కూట నీతి ప్రావీణ్యుడు ఇతని ప్రస్తావన భారతం లోని ఆదిపర్వం. షష్ఠాశ్వాసము లో వస్తుంది.

కురు పాండవులు వారి అస్త్ర విద్యా ప్రదర్శన తరువాత ధృతరాష్ట్రుడు భీష్మ విదురల సలహా మేరకు ధర్మరాజును  యువరాజ్యాభిసక్తుడిగా చేస్తాడు. బలవంతులైన తమ్ముళ్లు తమ బలం తో నాలుగు దిక్కులను జయించి రావడం వలన ధర్మ రాజు యువరాజు అయినప్పటికీ చక్రవర్తిగా వెలగ సాగాడు.ఆ విధంగా పాండవులు అందరికి పూజ్యులై  వర్ధిల్లుతుండగా కౌరవులలో  ఈర్ష్య అసూయలు బయలు దేరి కర్ణ శకుని దుశ్శాసన,  దుర్యోధనులు  దురాలోచనలు  చేయడం మొదలు పెట్టసాగారు. ధర్మరాజును యువరాజుగా చేసినందుకు ధృతరాష్ట్రుడు  చింతించసాగాడు. ఆ సందర్భములో  పాండవులతో ఎలాంటి రాజనీతి పాటించాలి అని ధృతరాష్ట్రుడు కణికుడు ని  అడిగినప్పుడు కణికుడు ఈ కూటనీతి ఒక కధ  రూపం లో  వివరిస్తాడు. కణికుడు దుర్యోధనుడి కోరిక ధృతరాష్ట్రుని అభీష్టాన్ని గ్రహించి ఈ విధంగా చెపుతాడు.

ఒక పిరికివాడిని ఎప్పటికి పిరికివాడుగా ఉండేటట్లు వాడిని భయపడుతూ ఉండాలి. మనకన్నా అధికుడైన  వాడిని  మన అవసరం తీరేదాకా గౌరవిస్తూ, అవసరం తీరాక వాడిని మట్టుబెట్టాలి. అత్యాశ పరులకు ధనము కానుకలతో లొంగదీసుకోవాలి శత్రువైన వాడు ఎవరైనా ఏ స్థానంలో  ఉన్నవాడైన  ఆఖరికి స్వంత వాళ్ళు అయినా వదలి పెట్టకూడదు చంపాలి. ఈ క్రమంలో ఎదుటి వారిని కోపంలో తూలనాడ కూడదు. అవమానించ కూడదు. శత్రువునైనా అభిమానంతో మాట్లాడుతూ గౌరవిస్తున్నట్లు నటిస్తూ అదను చూసి దెబ్బతీయాలి మాయోపాయాలతో శత్రువును సంహరించి ఆ  తర్వాత జాలి చూపిస్తూ అవసరమైతే విచారాన్ని నటించాలి. శత్రువు ఎంత వేడుకున్నా,శత్రువు దుర్బలుడే కదా అని విడిచి పెట్టకూడదు ఎన్ని రకాల వేషాలు వేసి అయిన లోకులను నమ్మించాలి.మన లోపాలను ఇతరులకు తెలియనీయకుండా ఇతరుల లోపాలను కనిపెడుతూ ఉండాలి అన్ని పనులు రహస్యముగా చేసుకోవాలి. ఇలాంటి కుయుక్తులు కణికుడు చెప్పిన కూటనీతిలో భాగాలే. భారతంలో శకుని, కణికుడు దుష్టబుద్దితో చెడును మంచిగా చూపిస్తూ వారి వేళ్ళతో వారి కళ్ళను పొడుచుకొనే  విధంగా చేశారు ప్రస్తుతం రాజకీయవేత్తలు ఈ కూటనీతిలో ప్రావీణ్యులని వేరేగా చెప్పనవసరం లేదు.

కణికుడు ధృతరాష్ట్రునికి తన కణిక నీతికి ఉదాహరణగా ఒక కథను చెపుతాడు ఈ కధలో పంచతంత్రము కధలో లాగా తెలివైన అవకాశం వాది  అయిన  నక్క తో పాటు ,పులి తోడేలు ముంగిస ఎలుక అనే మరో నలుగురు స్నేహితులు ఉంటారు. నక్క ఇతరుల చేత తన పనులు చేయించుకుని పని పూర్తి అవగానే మోసం చేసి ఆ ఫలాన్ని తానొక్కటే అనుభవిస్తుంది.కానీ మంచి స్నేహితుడిగా నటిస్తూ ఇతర జంతువులతో కాలం గడుపుతూ ఉంటుంది.ఒక రోజు అరణ్యములో హాయిగా గంతులేస్తూ తిరుగుతున్న పిక్క బలిసిన లేడి నక్క దృష్టిలో పడింది దానిని తినాలని కోరికతో వెంట బడిన లేడితో పరుగెత్త లేక పోయింది కాబట్టి లేడిని మట్టు  పెట్టాలంటే తన కుయుక్తులను స్నేహితుల దగ్గర ఉపయోగించి వారి సహాయంతో లేడిని చంపి మిగతా వారికి దక్కకుండా తానె లేడిని ఎలా తిన్నదో  కణికుడు వివరిస్తాడు.

నక్క బాగా ఆలోచించి తన స్నేహితులను కూర్చోబెట్టుకొని లేడి మాంసం గురించి నోరు ఊరేలా చెప్పి మనమెవరం లేడీ తో సమానంగా పరుగెత్తి పట్టుకోలేము,కాబట్టి లేడిని తినాలంటే ఎదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి అని చెప్పింది మిగిలిన జంతువులు ఆ ఉపాయమేదో నీవే ఆలోచించి చెప్పు అని నక్కతో అన్నారు. నక్క తన పథకాన్ని స్నేహితులతో చెప్పింది. లేడీ అలిసిపోయి పడుకున్న సమయంలో ఎలుక చప్పుడు కాకుండా వెళ్లి లేడి కాళ్ళను కొరకాలి అప్పుడు లేడీ వేగంగా పరుగెత్తలేదు కాబట్టి పులి లేడిని సులభముగా చంపచ్చు  చంపిన లేడిని మనము హాయిగా తినవచ్చు అని తన పథకాన్ని స్నేహితులకు వివరించింది పథకం ప్రకారం  నిద్రపోతున్న లేడీ కాళ్ళను ఎలుక కొరికినాక  పులి లేడిని చంపేస్తుంది. ఆ విధంగా పథకాన్ని విజయవంతముగా ముగిస్తాయి  ఆ జంతువులు.  నక్క మిగిలిన నాలుగు జంతువులూ లేడిని తినడానికి చుట్టూ చేరాయి ఆ సమయంలో నక్క మిగిలిన జంతువులతో మీరంతా శుభ్రంగా స్నానం చేసి వస్తే అందరము  లేడి మాంసం తినవచ్చు కాబట్టి మీరంతా దగ్గరలో ఉన్న సెలయేటికి  వెళ్లి స్నానం చేసి రండి నేను ఇక్కడ కాపలా ఉంటాను అని చెప్పి వాటిని పంపింది. 
                       
స్నానానికి వెళ్లిన నాలుగింటిలో ముందు పులి స్నానం చేసి వచ్చింది పులిని చుసిన నక్క ఏడవటం మొదలు పెట్టింది ఏమైంది అని పులి అడిగితె  ఎలుక  వచ్చి 'పులికి అసలు సిగ్గు లేదు. నేను లేడీ కాళ్ళు కొరికితే తప్ప లేడిని పులి చంపలేకపోయింది. పైకేమో పెద్ద బలవంతుడిని  అని గొప్పలు చెప్పుకుంటుంది' అని నీ గురించి హేళన మాట్లాడింది అని పులికి ఎలుక మీద బాగా చాడీలు చెప్పేటప్పటికీ పులికి కోపం వచ్చి ఛీ ఛీ నాకేమి శక్తి లేదా అల్పప్రాణి ఎలుక ముట్టిన ఆహారాన్ని నేను తినను నేను స్వయంగా వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటాను అని పౌరుషముగా  వెళ్ళిపోయింది.ఆ తర్వాత ఎలుక వచ్చింది ఆ ఎలుకతో పులి నీ మీద కోపంగా ఉంది నీవు  లేడిని కొరికి విషపూరితం చేసావుట నిన్ను చంపుతానని బయలు దేరింది అని ఎలుకను భయపెట్టే సరికి  ఎలుక భయపడి కలుగులోకి పారిపోయింది.ఆ తర్వాత వచ్చిన తోడేలును కూడా పులి నిన్ను చంపుదామని అనుకుంటుంది అనేసరికి తోడేలు కూడా పారిపోతుంది. చివరగా ముంగిస వస్తే ఆ ముంగిసను నేను పులిని, తోడేలును ఎలుకను చంపిపారేసాను  నీకు బలము ఉంటే నాతో పోట్లాడి ఈ లేడి  మాంసం  తిను అనేసరికి నిజమనుకొని ముంగిస భయపడి పారిపోయింది అప్పుడు ప్రశాంతంగా లేడీ మాంసాన్ని నక్క ఒక్కటే తినేసింది.
ఈ కథను చెప్పిన కణికుడు దృతరాష్ట్రునితో తెలివితో వంచనతో వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి అని చెపుతాడు. రాజు శత్రువుల సమాచారాన్ని తెలుసుకోవడానికి తెలివైన వేగులను నియమించుకోవాలి రాజు సభలకు పుణ్యతీర్ధాలకు వెళ్ళేటప్పుడు ఆయా ప్రదేశాలను  ముందుగా క్షుణ్ణంగా పరిశీలించి ప్రమాదం కలిగించే వ్యక్తులు లేదా ఆయుధాలు ఉంటే తొలగించుకొని జాగ్రత్త పడాలి (ప్రస్తుత పాలకులు చేస్తున్న పనే ఇది)  కణికుడు చెప్పిన నీతిని కూటనీతి అంటారు.ప్రస్తుతం అధికార దాహంతో అలమటించేవాళ్ళు, ధనాశాపరులు ఈ నీతినే అవలంబిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభాలకు చాలా మటుకు ఈ నీతి  కారణం. 

***

No comments:

Post a Comment

Pages