ధర్మో రక్షతి రక్షిత: - అచ్చంగా తెలుగు

ధర్మో రక్షతి రక్షిత:

Share This

ధర్మో రక్షతి రక్షిత:

సి.హెచ్.ప్రతాప్ 




ధర్మో రక్షతి రక్షిత: అజరామరమైన వేదవాక్కు. ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకం లోనిది.  ఈ వాక్యం అర్ధం "ధర్మాన్ని మనము అనుసరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మననే బాధిస్తుంది. ధర్మ రక్షణ చేస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదని దీని అర్థం.కురుక్షేత్ర రణరంగంలో ధర్మ పరిరక్షణ కోసం మహాభారత యుద్ధం జరిగింది. ధర్మం వైపు నుండి ఎవరైతే ఉంటారో వారు రక్షించబడతారు మరియు ఎవరు అధర్మం వైపు నుండి ఉంటారో వారు నాశనం చేయబడతారు మరియు ధర్మ రక్షకులైన పాండవులచే యుద్ధం గెలిచింది. ధర్మం అంటే ఒకరి స్వంత విధులు, నైతిక నియమాలు, ప్రవర్తన మొదలైనవి.వాటిని అనుసరించే వ్యక్తి ధర్మ రక్షకుడు. ఇది సమాజంలోని వ్యక్తి యొక్క నిర్దిష్ట కర్మ, విధి, ప్రవర్తన మొదలైన వాటికి సంబంధించినది. ధర్మం అనేది ఒక సమాజం లేదా వ్యక్తి యొక్క విలువ వ్యవస్థ, సంప్రదాయాలు మరియు సంస్కృతిని సూచిస్తుంది.

చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది;కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి అన్న ఈ వాక్యం సదా అనుసరణీయమైనది.

సర్వాకాల సర్వావస్థలలో ధర్మాచరణ భారతీయుల కర్తవ్యం ధైర్యం,ఓర్పు, మనోనిగ్రహం , ఇంద్రియ నిగ్రహం, శాంతం , సమాజ సేవ, సత్య భాషణం విధిగా అలవర్చుకోవల్సిన  సద్గుణాలు. ధర్మ హీనమైన జీవితం చంద్రుడు లేని రాత్రిలా శోభించవు. ఎన్ని హంగులు సమకూరినా ధర్మాన్ని పాటించని జీవితం నిరర్ధకం.

కామ క్రోధాధి దుర్గుణాలను జయించి వీలైనంతగా దాన ధర్మాలను చేస్తూ మన శాస్త్రాలు విధించిన కర్మలను క్రమం తప్పక  ఆఆచరించేవారే ధర్మాత్ముల వలే ప్రసిద్ధి పొందుతారు.మంచి పనిచేసే విషయంలో ఆలస్యం పనికిరాదు. అప్పుడు ఆలస్యం అమృతం విషం అనే సూక్తిని పాటించాలి. చెడు పని  చేసే విషయంలో నిధానమే ప్రధానం అనే సూక్తిని పాటించాలి. అదే ధర్మసూక్ష్మం. ఈ సూక్ష్మాన్ని గ్రహించగలిగిన వాడే ధర్మాన్ని రక్షిస్తాడు. ధర్మం చేత రక్షింపబడతాడు.

శ్రద్ధాభక్తులతో ధర్మాన్ని కాపాడుకుంటుందాలి కాని, ధర్మహానికి పూనుకోరాదు అని శాస్త్రం మానవాళిని పదే పదే హెచ్చరిస్తుంటుంది. “ధర్మ ఏవహతో హంతి! ధర్మో రక్షత రక్షితః!” ధర్మానికి హాని చేసిన వారిని హతమార్చుతూ, ధర్మాన్ని కాపాడుకునే వారిని రక్షిస్తుంటుంది ధర్మం!ఉదాహరణకు కౌరవ సభలో ద్రౌపదిని వివస్త్రను చేస్తూ ధర్మహానికి పూనుకొన్న దుర్యోధనాదులతో పాటు, వారిని ఖండించకుండా మిన్నకుండిన, భీష్మ ద్రోణ కర్ణాదులనూ హతమార్చింది ధర్మం. అందుకా ధర్మానికి గ్లాని జరుగుతున్నప్పుడు మనకు చేతనైనంతగా ప్రతిఘటించాలి , అందుకు వీలుకాకపోతే అక్కడి నుండి దూరంగా వెళిపోవాలి అంతే తప్ప ధర్మ గ్లానిని సమర్ధించకూదదు అని మహాభారతం వలన మనకు తెలుస్తోంది. ఇచ్చిపుచ్చుకునే ఈ సనాతన ధర్మాన్ని పాటించకుంటే అన్నం, నీళ్ళూ తీసుకొని, మల, మూత్రాలను వదలని మన దేహం లాగే ఈ సృష్టి అంతా జబ్బున పడి నశిస్తుంది!” అన్నారు శ్రీరామకృష్ణ పరమ హంస! 

***

No comments:

Post a Comment

Pages