త్యాగరాజ ఆరాధనోత్సవాలు - అచ్చంగా తెలుగు
త్యాగరాజ ఆరాధనోత్సవాలు - 2021
శ్రీరామభట్ల ఆదిత్య

 




కర్ణాటక సంగీతంలో అత్యంత ప్రసిద్ధినొందిన వాగ్గేయకారుడు సద్గురు శ్రీత్యాగరాజస్వామి.
1767వ సంవత్సరం మే 4న తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ గ్రామంలో తెలుగువారి కుటుంబంలో కాకర్లవారింట మూడవ సంతానంగా కాకర్ల రామబ్రహ్మం మరియు సీతమ్మ దంపతులకు త్యాగబ్రహ్మం జన్మించాడు. త్యాగరాజు తాత( తండ్రి తండ్రి ) గిరిరాజకవి ప్రసిద్ధ వాగ్గేయకారుడు. ఇంకో తాత( తల్లి తండ్రి ) వీణాకాళహస్తయ్య ప్రసిద్ధ వైణికుడు. తంజావూరు రాజు శరభోజి ఆస్థానంలో ఉండేవాడు కాకర్ల రామబ్రహ్మం. సంస్కృత, తెలుగు భాషల్లో పాండిత్యం గడించిన త్యాగరాజు శొంఠి వెంకట రమణయ్యగారి వద్ద చేరి సంగీతం అభ్యసించారు.

త్యాగరాజస్వామి తన 13వ ఏటనే 'నమో నమో రాఘవాయ' అనే కీర్తనను రచించారు. ఇదే ఆయన మొదటి కీర్తన. నారదుడు యతి రూపంలో వచ్చి త్యాగరాజుకి ‘స్వరార్ణవం’ అనే సంగీత గ్రంధాన్ని అనుగ్రహించారని చెప్తారు. త్యాగరాజు తన కృతులలో అనేక విధాలుగా వారిని స్తుతి చేశారు. త్యాగయ్యకు పద్దెనిమిదవయేటనే పార్వతమ్మతో వివాహము జరిగింది. తదనంతరం రెండేడ్లకు తండ్రి మరణించాడు. పార్వతమ్మ ఐదు సంవత్సరాల తరువాత మరణించగా, ఆమె చెల్లెలు కమలాంబతో మరల వివాహము జరిగింది. త్యాగరాజువారి సంగీత ప్రతిభను గమనించిన తంజావూరు రాజు శరభోజి ఎన్నో కానుకలను ఇచ్చి వారి సంస్ధానానికి ఆహ్వానించారు. కాని త్యాగయ్య తిరస్కరించారు. అప్పుడు ‘‘నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా’’ అని కళ్యాణి రాగంలో ఆలాపించారు.

ఒకసారి త్యాగరాజు అన్నయ్య పంచపకేశుడు త్యాగయ్య పూజించే రామపంచాయతన విగ్రహాలను కావేరీలో పాడవేయగా తెల్లవారుజామున ఆ సంగతి తెలిసి ‘‘ ఎందు దాగినావో ’’ అనే కృతికి ఆకృతి నిచ్చారని ప్రతీతి. దుఃఖంతో భార్య కమాలాంబ మరియు కూతురు సీతాలక్ష్మిని వదిలి అనేక తీర్థయాత్రలు చేసి అనేకానేక ప్రసిద్ధ కీర్తనలు రాసారు. స్వామి తీర్థ యాత్రలు చేసే సమయంలో చాలా క్షేత్రాలు సందర్శించారు. ఆ క్షేత్రాలకు సంబంధించి‌ ప్రత్యేక కీర్తనలు కూడా రచించారు. కొంతకాలానికి తిరువారూరు తిరిగివచ్చిన త్యాగరాజస్వామి ఒకానొక రోజున కావేరీనదిలో స్నానం చేసే సమయంలో త్యాగరాజుకి రామపంచాయతన విగ్రహాలు దొరికాయి. త్యాగరాజు విగ్రహమూర్తులను తెచ్చుకుంటూ ‘‘రారా మాయింటి దాకా’’ అని అసావేరి రాగంలో పాడారట.

త్యాగరాజస్వామివారు ఎన్ని కీర్తనలు రచించారో సరిగ్గా తెలియదు కానీ నేడు మాత్రం కేవలం 700 పైచిలుకు మాత్రమే లభ్యం అవుతున్నవి. ఈయన 72 మేళకర్త రాగాలు మరియు ఎన్నో జన్యరాగాలలో కీర్తనలు రచించారు. అయితే అది కూడా వరుస క్రమంగా లభ్యం కావడంలేదు. వీరి రచనలలో అత్యున్నతమైన "ఘనరాగ పంచరత్న కృతులు" చాలా ప్రసిద్ది కెక్కాయి.
త్యాగరాజు ప్రహ్లాద భక్తవిజయము, నౌకా చరిత్రము, సీతారామ విజయం అనే సంగీత నాటికలను కూడా రచించారు. ఈ భక్తాగ్రేసరుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీత్యాగరాజ స్వామి నాదోపాసనలో ముక్తి పొంది భక్తుల కందరికి దారి చూపిన మాహా వాగ్గేయకారుడు. పురందరదాసు, కబీరు తులసీదాసు, రామదాసు వంటి వారు కూడా భక్తిలో నాద యోగస్ధితిని పొంది మోక్షం పొందిన వారే. త్యాగరాజు కారణజన్ముడు.1847వ సంవత్సరం జనవరి 6న అంటే పుష్యబహుళ పంచమినాడు పరమపదించారు. ఈయన తన జీవిత చరమాంకంలో సన్యాసదీక్ష స్వీకరించాడు. 

ఆనాటి నుండి ఎంతోమంది సంగీతప్రియులు ఆయన పుణ్యతిథినాడు 'త్యాగరాజ ఆరాధనోత్సవాల' పేరిట ప్రతి యేటా ఐదు రోజుల పాటు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నారు. ఆరాధనోత్సవాలు ఆయన పుణ్యతిథికి ఐదు రోజుల ముందు ప్రారంభమై సరిగ్గా పుణ్యతిథి నాడు ముగుస్తాయి. ఆరాధనోత్సవాల పరంపరని మొదటగా ప్రముఖ నర్తకీమణి 'బెంగుళురు నాగరత్నమ్మ' మొదలుపెట్టింది. తన యావదాస్తినీ సమాధిమందిర నిర్మాణానికై, ఆరాధనోత్సవాల నిర్వహణ కొఱకై వినియోగించిధన మహాభక్తురాలు. కానీ కోవిడ్ - 19 కారణంవలన ఈ సంవత్సరం రెండురోజులపాటు అంటే 01-01-2021 మరియు 02-02-2021న 174వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరగుతున్నాయి.... జై శ్రీ రామ...

No comments:

Post a Comment

Pages