గోదావరి తీరాన శింజారవం - అచ్చంగా తెలుగు

గోదావరి తీరాన శింజారవం

Share This

గోదావరి తీరాన శింజారవం 

- బ్నిం


ఇది గోదావరి పుష్కర సంవత్సరం!
తీర్థాలన్నీ భక్తుల అలజడితో మునుగుతుంటే తీరాలన్నీ శింజాసవ్వడితో పులకితమౌతోంది!
పుష్కరాల్లో ప్రతీ పుణ్యక్షేత్రం రంగస్థలమైంది!
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేస్తున్న ఈ సాంస్కృతిక సేవని అభినందించి తీరాల్సిందే.
అయితే ఇపుడు తెలుస్తోంది నాట్యగురువులు తలమునకల తాపత్రయం! లైవ్ ఆర్కెస్ట్రా దొరకడం ఓ గగనం –
‘పాడుతా తీయగా’ అంటున్న ఓ నవతరానికి… సినీ లాలిత్యం తప్ప.. శాస్త్రీయ నృత్యగీతగానం రాదు!
‘పాడుతా మొర్రో అనే నడిమితరానికి సహకార వాద్య కళాకారుల కొరత తప్పదు!
నిజంగానే.. రాన్రానూ ఏ రంగమ్లోనైనా శాస్త్రీయ కళాతపస్సిద్ధులూ అభినవ సిద్ధేంద్రులూ ఉంటారని ఆశించడం ఆకాశఫలం అవుతుందేమో?
కొత్తతరం స్థానే క్రొంగొత్తతనం తోసుకొస్తోంది.
గతవైభవ శాస్త్రీయవార సత్వాభినయం అంతరిస్తోందని అనిపిస్తోంది!
గత కళావైభవం నిలబెట్టుకోలేమేమోఅనిపిస్తోంది.
ఇప్పటి నాట్యగురువుల్లో కూడా చాలా తక్కువ మందే నాట్య కళాభ్యాసం శాస్త్రీయంగా చేసేరేమోనని బాధేస్తోంది.
ఇలా ఉండగా ప్రభుత్వ పూనకం (పూనుకోవడం అనాలేమో) వల్ల సరళీకృతవిధానాల ద్వారా శాస్త్రీయ మూలాల్ని సవరించి, దాదాపుగా  తొలగించి శంకరాభరణంలో చెప్పినట్లు బ్రోచే… వా..రె..వ..రు..రా.. అంటూ క్రొత్తకొత్త రాగాలూ తాళాలూ కనిపెట్టి ఉన్న దాన్లోనే శాఖలూ, ఉపశాఖలూ పాయలూ పాపిళ్ళూ చేస్తున్నారు.
గురువు కొచ్చిందే వేదం విస్సన్న చెప్పిందే వినడం అయితే కళాసరస్వతికి మంగళహారతి స్థానే క్రొవ్వువత్తుల నీరాజనం ఇవ్వాలేమో –
మహాసముద్రాన్ని గిన్నెలోకో గిన్నెస్బుక్ లోకీ ఇమడ్చగలమా అనేదే నేటి శాస్త్రీయ నాట్యకారుల ఎక్కువ మంది దిగులు! దాని పేరు గుబులు అంటున్నదో వర్గం-
ఏతావాతా బరువులు ఎవరిమీద పడతాయ్!
శంకరాభరణంలో ‘మంజుభార్గవి’లాగో సాగరసంగమంలో కమల్ హాసన్ లాగో తమ పిల్లల్ని చూసుకోవాలనుకునే తల్లితండ్రుల మీద -!!
ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ కి పిల్లల్ని సామాన్య జీతగాళ్ళు పంపలేరు.. ఖరీదైన కళ అయిపోయింది.
కాస్త ఈ సందట్లో అయినా గోదావరికి నిర్య నృత్య హారతి సమర్పించే సమయాల్లో నైనా ప్రభుత్వాలో నిర్వహించే సంస్థలో ఫ్రీ మేకప్ ఫ్రీ దుస్తులూ ఆభరణాలూ ట్రాన్స్ పోర్టూ ఇస్తే తల్లిదండ్రులకి భారం పడకుండా ఉంటుందని మొన్నో డ్యాన్స్ గురువు అన్నారు.
నా కెందుకో “అయ్యవారికి చాలు అయిదువరహాలు పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలూ” అంటూ దసరాలవేళ ఇంటింటికీ పిల్లల్నేసుకు తిరిగే నాటి బడుగు  బడి పంతుళ్ళు గుర్తొస్తున్నారు. ఈ నాట్యగురువులు తమ శిష్యుల్ని పోగేసుకుని గోదావరికి హారతి ఇచ్చే ఘట్టం తల్చుకుంటుంటే –-

No comments:

Post a Comment

Pages