తెలుగింటి బొమ్మల సుమ'గంధం' - అచ్చంగా తెలుగు

తెలుగింటి బొమ్మల సుమ'గంధం'

Share This

తెలుగింటి బొమ్మల సుమ'గంధం'

భావరాజు పద్మిని 


జి.కె.దుర్గా ప్రసాద్ గారు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన కుంచె పేరు ‘గంధం’. అదేమిటో ఆయన బొమ్మల నిండా తెలుగుదనం, అనేక కోణాల్లో ఆవిష్కరించిన జీవితపు ఉద్వేగాల సుగంధమే ! ‘అరె, అచ్చం బాపు గారి బొమ్మలా ఉందే,’ అనిపించే బొమ్మలు చూస్తే, అది మొదట బాపు గారి ఏకలవ్య శిష్యులుగా ప్రస్తానం ప్రారంభించి, మెల్లగా ఆయనతో తన ‘పెద్ద కొడుకు’ గా పిలిపించుకోబడి, ఆయనమార్గదర్శకత్వంలో గీతాల్ని దిద్దుకున్న ‘గంధం ‘ గారివే. వారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల ప్రత్యేకించి మీ కోసం...
చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేవారా ? అసలు బొమ్మలు వెయ్యటం ఎప్పుడు మొదలుపెట్టారు ?
1974 లో మా అన్నయ్యగారు ఆర్ట్ లో గోల్డ్ మెడలిస్ట్. ఆయన్ను చూసి, చిన్నప్పటి నుంచి నేను బొమ్మలు వేసేవాడిని. నేను 6, 7 తరగతిలో ఉండగా ఆయన నాకు కొన్ని బొమ్మలు ఇచ్చి, డ్రాయింగ్స్ గీయించి, పంపించేవారు. బాల్యంలో గుంటూరు బాలానందం కేంద్రంలో 1969,70,71 లలో వరుసగా మూడు సంవత్సరాలు ఉత్తమ చిత్రకారుడిగా బహుమతులు లభించాయి. అన్నయ్యగారు 1974 లో సి.ఎ  చదివేందుకు చెన్నై వెళ్తూ, ‘నీకు బొమ్మలంటే బాగా ఆసక్తి, నువ్వు బాగా బొమ్మలు వెయ్యగలవు,’ అని చెప్పి నాకు ‘కవితా పుష్పకం’ అని బాపు గారు బొమ్మలేసిన పుస్తకం ఒకటిచ్చి, ‘దీన్ని చూసి ప్రాక్టీసు చెయ్యి, బాగుంటుంది,’ అన్నారు.  ఆ కవితా పుష్పకం అనేది దాశరధి గారి కవితలకి బాపు గారు బొమ్మలు వేసిన పుస్తకం . ‘మంచి బొమ్మలు, ఉత్తమమైన
బొమ్మలు అనేందుకు ఇది నిర్వచనం’ అని చెప్పారు మా అన్నయ్య. అప్పటినుంచి నేను బాపు గారి బొమ్మలు చూసి వేస్తూ, విద్యార్ధిగా ఉండగా ఎవరైనా ఫ్రెండ్స్ కి బొమ్మలు వేసి ఇవ్వడం, అడిగినవాళ్ళకి ఆర్ట్ వేసి ఇవ్వడం చేసేవాడిని.
అలా బాపు గారి బొమ్మలు ఎక్కడ కనపడినా కలెక్ట్ చెయ్యడం, అవి భద్రపరచుకోవడం, చూసి బొమ్మలు గియ్యడం, ఇలా నా ప్రస్తానం దాదాపు 7 వ తరగతి నుంచి కొనసాగింది. క్రమంగా బాపు బొమ్మలు అనేవి నా జీవితంలో అంతర్భాగం అయిపోయాయి.
చదవు తర్వాత ఉద్యోగం ఏదైనా చేసేవారా? పత్రికలకు బొమ్మలు వెయ్యటం ఎలా మొదలుపెట్టారు ?
నేను కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటులో ప్రస్తుతానికి అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నానండి. 
ఉద్యోగరీత్యా నేను 1981 లో మచిలీపట్నం నుంచి విజయవాడ బదిలీ అయ్యి వచ్చేసానండి. అప్పుడు నాకున్న ఈ అభిరుచిని దృష్టిలో పెట్టుకుని, స్వాతిలో బొమ్మలు వేస్తే బాగుంటుంది అనుకుని, వినాయకచవితికి బ్లాక్ అండ్ వైట్ లో  వినాయకుడి బొమ్మ పంపించాను. 83 లో స్వాతిలో నాది ఫుల్ పేజి వినాయకుడి బొమ్మ పబ్లిష్ అయింది.
ఆ తర్వాత ఆ ఆసక్తి పోకుండా బొమ్మలు వేసుకుందామని, స్వాతి బలరాం గారిని నేరుగా కలిసి, “సర్, మీరు ఛాన్స్ ఇస్తే బొమ్మలు వేస్తాను,” అని అడిగాను. అప్పుడాయన బాపు గారు బొమ్మ వేసిన ఒక కధ నాకిచ్చి, మళ్ళీ బొమ్మ వేసుకుని రమ్మన్నారు. బాపు గారే వేసాకా, ఇంక అందులో బొమ్మ వేసేందుకు ఏముంటుంది, అని నేను అడిగేసాను. ఆయన ‘అలా కాదండి, సెంట్రల్ ఐడియా కి బొమ్మ వెయ్యటం అనేది బాపు గారికి వెన్నతో పెట్టిన విద్య, అందుకని, లోపల ఉన్న ఆ సన్నివేశం అంతా మిగిలిపోయి ఉంటుంది. వాటి ఆధారంగా బొమ్మ వేసుకురండి,’ అన్నారు. అసలు బాపు గారిలో నన్నాకర్షించిన అంశమే సెంట్రల్ ఐడియా కు బొమ్మ వెయ్యటం. అప్పుడు
నేను ఇంటికి వెళ్లి, బాగా ఆలోచించి, ఆ సెంట్రల్ ఐడియా ఆధారంగానే మరోవిధంగా బొమ్మ వేసుకుని తీసుకువెళ్ళాను. ఆయనకి అది నచ్చింది. అప్పటి నుంచి స్వాతిలో ‘గంధం’ పేరుతో బొమ్మలు వేస్తున్నానండి. కొన్ని కవర్ డిజైన్ లు కూడా ఆయన నాతో వేయించారు. స్వాతిలో అన్నమయ్య బొమ్మలు, దేవుడి బొమ్మలు కూడా వేసాను.
మీ అభిమాన చిత్రకారులు ఎవరండి ?
(నవ్వేసి)ఇంత చెప్పాకా, ఖచ్చితంగా బాపు గారే అని మీకూ తెలిసే ఉండాలి. అయితే, ‘అందని ద్రాక్షా పుల్లన’ అన్నట్లు నాకు అందని చిత్రకారులు ఎవరంటే వడ్డాది పాపయ్య గారు. ఆయన శైలికి, బాపు గారి శైలికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏమిటంటే వడ్డాది వారు అందమైన రాణుల, రాజుల, దేవుళ్ళ బొమ్మల వంటివి వేసారు, వాటిలోని సన్నివేశాల్లో అందం ఉంది కనుక వారు ఆ అందాన్ని ఇనుమడింపచేసే విధంగా వేసేవారు. అదే బాపు గారైతే, అత్యంత క్లిష్టమైన సీన్ ను కూడా అత్యంత రమ్యంగా గియ్యగలరు. వడ్డాది పాపయ్య గారి బొమ్మలన్నీ అందమైన లోకంలో విహరిస్తూ ఉంటాయి, కుండ పట్టుకుని
వెళ్తున్న ఒక పల్లెటూరి అమ్మాయి, సత్యభామ ఇటువంటి బొమ్మలు అన్నమాట.
అదే బాపు గారు ఏ రకమైన సన్నివేశం అయినా సరే, లైన్ డ్రాయింగ్ లో అద్భుతంగా పండించగలరు. అందువల్ల, వీరివి  ఒక 5 వేల బొమ్మలు అచ్చయ్యి ఉంటే, వారివి ఓ లక్ష బొమ్మలు ఉంటాయి. ఇంకొక్క చిన్న తేడా ఏంటంటే, ఎవరైనా నన్ను పోర్ట్రైట్ గీసి పెట్టమంటే అది ఆయిల్ పెయింట్లు వాడినా, వాటర్ కలర్స్, ఇంకేది వాడినా, ఒక వారం రోజులు పైనే పడుతుంది. ఇక్కడ లైన్ డ్రాయింగ్ అనే ప్రక్రియను బాపుగారు బాగా పండించారు. అది ఏమౌతుంది అంటే కలర్ లో పెయింటింగ్ వేసినంత ఎఫెక్ట్ ను ఒక్క గంటలో తేగలదు. అందుకని బాపు గారి గీత చాలా పాపులర్ అయింది. ఆయన వల్ల లైన్ డ్రాయింగ్ అంత ఉచ్చస్థితిలోకి వెళ్ళింది. అంటే ఆయన ఫాలో అయిన ఆర్టిస్ట్ లు, ఫాలో అయిన ఫారన్ ఆర్టిస్ట్ ల బొమ్మల రిఫరెన్స్ లనే గురువుగా తీసుకుని, బోలెడంత మంది ఫారన్ ఆర్టిస్ట్ లను ఫాలో అయి, ఆయన ఒక అద్భుతమైన లైన్ ని సృష్టించారు.
మీరు ఎప్పుడన్నా బాపు గారిని కలవడం సంభవించిందా ?
ఓ కొన్ని వందల సార్లు కలిసి ఉంటానండి. వారు మా ఇంటికి వచ్చారు, నేను వారి ఇంటికి వెళ్లాను, వారితో షూటింగ్ లకు వెళ్లాను, వారితో దగ్గరుండి, నేను గీసిన బొమ్మలు దిద్దించుకున్నాను, అడిగి నాక్కావలసిన బొమ్మలు
గీయించుకున్నాను, ఇలా ఉండేది మా అనుబంధం.  ‘భ్రమరగీతికలు’ అని పురాణం సుబ్రహ్మణ్యం గారు ఉండగా ఆంధ్రజ్యోతి లో బొమ్మలు గీసానండి, అవి తీసుకుని వెళ్లి, బాపు గారితో దిద్దించుకుంటూ ఉంటే, ‘కాన్సెప్ట్ చాలా బాగుంది ప్రసాదూ, చక్కగా గీసావు,’ అని మెచ్చుకుని, కొన్నిటిని ఆయన దిద్ది, మళ్ళీ ఆయన స్ట్రోక్ లో నాకు ఎంతో ఉపయోగపడే మెటీరియల్స్ ఇచ్చారండి. ‘దీన్ని ఎలా దిద్దచ్చు, ఇంకా ఎలా వెయ్యచ్చు,’ అని. ఆయనతో చాలా చనువుగా, సన్నిహితంగా ఉండేవాడిని.
బాపు గారి పెర్మనెంట్ ఆర్ట్ గేలరీ పెట్టడానికి ఎన్.టి.ఆర్ గారు సి.ఎం గా ఉండగా ఒక ప్రపోసల్ పెట్టారు. దానికో కమిటీ వేసారు, ఆ కమిటీలో నేను మెంబెర్ ని. అందులోని అధ్యక్ష సభ్యులకి, బాపు గారు నన్ను, ‘మా పెద్ద కొడుకు’ లాంటి వారు అని నన్ను పరిచయం చెయ్యడం ఎప్పటికీ మర్చిపోలేను.
బాపు గారి బొమ్మల సంకలనం ‘హరివిల్లు’ గురించి చెప్పండి.
1965 నుంచి బాపు గారు వేసిన ఎన్నో బొమ్మల సేకరణ, అనుకరణ చేసేవాడిని. ఇవన్నీ ఒక చక్కటి సంకలంగా కూర్చి, మన తెలుగువారికి అందిస్తే బాగుంటుంది కదా, అనిపించింది. ఆ సంకల్పంతోనే నేను ‘హరివిల్లు’ అన్న ఒక పుస్తకం కంపోస్ చేసాను. ఆయన బ్లాక్ అండ్ వైట్ లైన్స్ లో వేసిన బొమ్మలూ, అవన్నీ తీసుకుని, చక్కటి ‘ఇంటీరియర్ డెకరేషన్ ‘ కు ఉపయోగించుకునేలా 16 X20, 20 x 30 అంగుళాలు ఉండేటట్లుగా వాటిని A3 సైజులో బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేసుకుని, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సవరించి, దాన్ని తీసుకుని వెళ్లి డ్రం స్కానింగ్ చేయించి, అక్కడినుంచి వాటిని సిస్టం లో రంగులు వేసి, కలర్ చేసిన వాటిని బాపు గారికి తీసుకుని వెళ్లి చూపెట్టి, కరెక్షన్ లు చేసి, ఈ పుస్తకం కంపోస్ చేసాను. చేసాకా, 2007 లో అది ప్రచురించాను. దగ్గర దగ్గర 3 వేల కాపీలు ఏడాదిన్నరలో అయిపోయాయి.

‘హరివిల్లు’ సంకలనాన్ని చూసి, బాపు గారి స్పందన ఏమిటండి ?
బాపు గారు నాతో ఏమన్నారు అంటే, ‘మళ్ళీ హరివిల్లు తేవడం వల్ల, మళ్ళీ నా అభిమానులు అందరికీ నా బొమ్మలు చాలా అందుబాటులోకి’ వచ్చేసాయి అని. అయితే, ఈ పుస్తకంలో మర్చిపోయిన బొమ్మలు, జనరల్ సబ్జెక్టు ల బొమ్మలను, హరివిల్లులో మర్చిపోలేని బొమ్మలను కూడా చేర్చి, మళ్ళీ కొత్త ‘హరివిల్లు 2 ‘ తయారుచేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. అది నాకూ నచ్చింది. ఆ రెండు పుస్తకాల్ని కలిపేందుకు నాకు 2010 నుంచి 2014 ఫిబ్రవరి దాకా పట్టింది. అంటే పాత హరివిల్లులో 435 బొమ్మలు ఉంటాయండి, కొత్త హరివిల్లు లో 824 బొమ్మలు ఉంటాయి. దాదాపు రెట్టింపు అన్నమాట. హరివిల్లులో ఉన్న ఒక్క బొమ్మ కూడా రెండో వాల్యూం లో ఉండదు. అంటే హరివిల్లు ఇంటీరియర్ డిసైనింగ్ కోసమని చెప్పుకున్నాం కదా. ఇది మామూలు వాల్యూం, ఒక ఆర్టిస్ట్ కి ఇది
అద్భుతమైన గైడ్ లాగా ఉంటుంది. అందులో కధల బొమ్మలు, కార్టూన్లు, ఎమెస్కో నవలల డిజైన్ లు, లైఫ్ స్కెచ్ లు, సినిమాలకు వేసిన పోస్టర్లు, ఆయన ఆడ్ ఏజెన్సీ లో పనిచేసినప్పుడు వేసిన ఆడ్స్, అదికాకుండా రామాయణం అని, భారతం అని ప్రత్యేకమైన సబ్జెక్టులు, అన్నీ కలిపి ఒక జనరల్ వాల్యూం తయారు చేసాను. ఇవేకాక, స్టొరీ ఇల్లుస్త్రేషన్ లు కూడా ఇందులో ఉన్నాయి, వీటిలో 1970 -80  వరకు అని, 90 వరకు అని ఆయనకున్న స్టాండర్డ్ ను చూపెడుతూ సెపరేట్ చేసాను. అలా రెండో పుస్తకం తయారు చేసాను, ఒక పెద్ద పుస్తకం ప్రింట్ చేసి, 2014 ఫిబ్రవరి లో ఒక పెద్ద వాల్యూం ఆయనకు పంపించాను, ఆ తర్వాత నేను స్వయంగా వెళ్లాను. ఆయన కొన్ని మార్పులు చెప్పారు, దాదాపుగా ప్రతి వారం ఆయన దగ్గరకు వెళ్ళే వాడిని. ఆయన చెప్పిన మార్పులు అన్నీ చెయ్యటం, తీసుకుని వెళ్లి, చూపెట్టడం, అలా చేసాను. ఏది ఏమైనా ఇది మే కల్లా ప్రింట్ కావాలి ప్రసాదూ, ఇది నా డ్రీం ప్రాజెక్ట్ అన్నట్లు ఆయన మాట్లాడారు. తీరా మే నెలలో ఆయనకు మతి స్థిమితం లేకుండా పోయింది, ఆయన ఫేం పడిపోయింది, వాళ్ళ పిల్లలు వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఆ రెండు పుస్తకాలు అలాగే ఉండిపోయాయి.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
నేను కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటులో పనిచేస్తూనే మెల్లగా బొమ్మలు ఇంప్రూవ్ చేస్తున్నాను. నాకు ఇంకా మూడు సంవత్సరాల సర్వీస్ ఉంది. ప్రభుత్వం 2 సం. ఉద్యోగ కాలపరిమితిని ఎక్స్టెండ్ చేసింది. నేను రిటైర్ అయిన తర్వాత పర్మనెంట్ గా ఒక ఆర్ట్ మగజైన్ నడపాలని ఒక కోరిక.  లైన్ డ్రాయింగ్ లో ఉన్న అత్యంత సులభ పద్ధతులు, ఉదాహరణలు, వర్క్స్ చూపుతూ ఒక మాసపత్రికను నడపాలన్న ఒక కోరిక ఉంది, దానికి గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాను. అందుకని నేను 2019 లో రిటైర్ అయ్యాకా గాని, ఇది తేవడానికి ఉండదు.
బొమ్మలు వెయ్యాలని అనుకునే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి ?
ఏ ఆర్ట్ అయినా సరే, చిన్నతనంలో అబ్బాలి. ఏ కళ అయినా సరే ఒక పది సంవత్సరాల లోపు పడ్డ బీజం ఉంటే పెద్దయ్యాకా ఉన్నత స్థితికి వస్తారు. అదే డిగ్రీ అయ్యాకా నేర్చుకుందాం అనుకుంటే ఆ స్థితి అలాగే ఉంటుంది. చిన్న వయసులోనే నేను బొమ్మల పట్ల ఆసక్తి తో ‘ఏ పద్ధతిలో బొమ్మలు వేస్తే, చాలా చక్కటి ఆర్టిస్ట్ అవుతారు ‘ అన్న సంకల్పంతో వేసేవాడిని. మనం చూసిందల్లా గియ్యటం, పత్రికలో స్పోర్ట్స్ కాలమ్, ఇతర చోట్ల పడ్డ బొమ్మలు గియ్యడం, సినిమా పత్రికల్లోని రకరకాల పోస్ లు పెన్సిల్ తో త్రికోణాలు గీసుకుంటూ వేసుకుంటూ పొతే బొమ్మలు వెయ్యతంలో మంచి  నైపుణ్యం వస్తుందండీ. ఒక వెయ్యి బొమ్మలు గియ్యగలిగితే, వెయ్యినొక్క బొమ్మ, వాళ్ళు అనుకున్న ఆంగిల్ కళ్ళ ముందు కనబడుతుంది. అంతే తప్ప ఎవరో ఒక బాపు గారినో, ఎవరినో అనుకరిస్తూ ఉంటే సరిపోదు. అనుకరణ వల్ల ఆర్ట్ వస్తుంది కాని, సృజన రాదు.
ప్రస్తుతం మీరు వేటికి బొమ్మలు వేస్తున్నారు?
ఉద్యోగ బాధ్యతల వల్ల ఎక్కువ బొమ్మలు వెయ్యలేక నేను స్వాతి బలరాం గారిని రిక్వెస్ట్ చేసాను. వీక్లీ కి కూడా ఒక్కోసారి రాత్రి కధ పంపి ఉదయానికి బొమ్మ కావాలి, అర్జెంటు అంటారు. నాకు కుదరచ్చు, కుదరకపోవచ్చు. ఇదే చెప్తే ఆయన సహృదయంతో అంగీకరించారు. ఇప్పుడు మంత్లీ మగజైన్ కు మాత్రం ఛీఫ్ ఆర్టిస్ట్ గా ఉన్నాను. మొత్తం 4 కధలు పడితే, నాలుగూ నావే పడతాయి, వీక్లీ లో కామెడీ కధలకు మాత్రం వేస్తానమ్మా. ఇవి కాకుండా వెడ్డింగ్ కార్డ్స్, నోవెల్ డిజైన్ లు, ఎవరైనా అడిగితే బొమ్మలు వేసి ఇస్తూ ఉంటాను.
చాలా సంతోషమండి. నమస్కారం.
నమస్కారం.

గంధం గారు మరిన్ని గొప్ప బొమ్మలు వేసి, ఆర్టిస్ట్ గా తెలుగువారి గుండెల్లో చిరకాలం నిలిచిపోవాలని ఆశిస్తోంది – అచ్చంగా తెలుగు.

No comments:

Post a Comment

Pages