నాగ మాత "సురస"
అంబడిపూడి శ్యామసుందర రావు
నాగ మాత ప్రస్తావన సుందర కాండలో హనుమంతుడు సీతామాత అన్వేషణలో సముద్రాన్ని లంఘించి రావణ లంక వైపు ఎగిరి వెళుతున్నప్పుడు వస్తుంది మొదట మైనాక పర్వతం అడ్డగించి మైనాకుడు కాసేపు తన పర్వతం మీద సేద దీరి వెళ్ళమని హనుమంతుని అడుగగా హనుమంతుడు స్వామి కార్యానికి ఆలస్యం అవుతుందని మృదువుగా తిరస్కరించి మైనాక పర్వతాన్ని దాటి ముందుకు వెళతాడు ఆ సందర్భములో దేవతలు,గంధర్వులు సిద్దులు, సూర్యకాంతులతో తేజరిల్లె నాగమాత తో,"ఓ సురసా కాంతి మంతుడు, వాయు పుత్రుడు అయిన హనుమంతుడు ఈ సముద్రం మీద ఎగిరి పోతున్నాడు నీవు అతని గమనాన్ని ఒక ముహూర్తం సేపు విఘ్నం చేయవలెను నీవు పర్వతం అంత ఎత్తైన భయంకరమైన రాక్షసి రూపం ధరించి పెద్ద నొటితో, పెద్ద పెద్ద కోరలతో ఆకాశం అంత ముఖంతో ఎదురు నిలిచిన మేము అతని బలం పరాక్రమము తెలుసుకోవాలి అనుకుంటున్నాము. అతడు ఏదైనా ఉపాయముతో నిన్ను జయిస్తాడో లేదా ఓడిపోయి దుఃఖపడటాడో మేము చూస్తాం"` అని సురసతో అంటారు ఆ విదంగా హనుమంతుని శక్తి పాటవాలను తెలివితేటలను పరీక్షించడానికి దేవతలు నాగ మాత సురసను ఆశ్రయిస్తారు
దేవతల అభ్యర్ధనను పాటించి సురసాదేవి సముద్రములో చేతులు కాళ్లు లేకుండా వికృతమైన రాక్షస కారము దాల్చి హనుమంతుడిని అడ్డగించి ,"ఓ హనుమంత నిన్ను దేవతలు నాకు ఆహారముగా చూపించారు కాబట్టి నేను నిన్ను భక్షిస్తాను నేను నోరు తెరిచాను నీవు నా నోటి లోకి చొరబడు"అన్నది ఈ మాటలు విన్న హనుమంతుడు ,"దశరధ మహారాజు కొడుకైన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం భార్య వైదేహీ తోనూ సోదరుడు లక్ష్మణుడి తోను దండకారణ్యంలో ప్రవేశించారు శ్రీముని భార్య వైదేహిని రావణుఁడు ఎత్తుకు పోయినాడు నేను సీతామాత అన్వేషణ కోసం అంటే స్వామి కార్యం ఫై పోతున్నాను నేను ఆ కార్యాన్ని పూర్తి చేసి శ్రీరాముడిని చూచి వచ్చి నీ నోటిలో పడతాను నన్ను నమ్ము "అని చెపుతాడు
కానీ కామరూపిణి అయిన సురస," నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ప్రకారం ఎవరు ఇక్కడ నన్ను దాటి పోలేరు కాబట్టి విధిగా నీవు నా నోటిలో పడాలి" అని పెద్దగా నోరు తెరిచింది. అప్పుడు హనుమంతుడు కోపంగా ,"నన్ను మింగటానికి వీలు అయ్యేటట్లు నోరు తెరువు" అని పది యోజనాల వెడల్పుగా తన శరీరాన్ని పెంచాడు. సురస తన నోటిని ఇరవై యోజనాల వెడల్పుగా నోరు తెరిచింది ఆ విధంగా ఇద్దరు పోటీ పడ్డారు హనుమంతుడు తన దేహాన్ని తొంభై యోజనాల వెడల్పుగా పెంచాడు . సురస వంద యోజనాల వెడల్పుగా నోరు పెద్దది చేసింది తన పొడుగాటి నాలుకను చాచింది. అది చూచిన హనుమంతుడు అంగుష్ఠ మాత్రుడు అయి సురస నోటిలోకి పోయి సురస నోరు మూసేలోపల మెరుపు వేగంతో బయటికి వచ్చి ఎగిరి ఆకాశములోకి పోయి సురసను చూస్తూ,,"నీవు కోరినట్లు నీ నోటిలోకి ప్రవేశించి బయటకు వచ్చాను నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం సఫలము అయింది ,"అని నమస్కరించాడు అప్పుడు సురస తన నిజ రూపములోకి వచ్చి, " ఓ హనుమా నీ కార్యం సాధించడానికి సుఖముగా పోయి వైదేహి జాడ కనుగొని రాముని చెంతకు చేర్చు" అని అంది
హనుమంతుని చర్యకు సర్వభూతాలు మెచ్చుకున్నాయి. దాటనలవి కానీ సముద్రాన్ని దాటడానికి హనుమంతుడు గరుక్మంతుడి వలె ఆకాశ మార్గాన్ని పట్టాడు.ఆవిధంగా దేవతలు నాగ మాత సురస ద్వారా హనుమంతుని ప్రజ్ఞా పాటవాలను, బుద్ది కుశలతను పరీక్షించడానికి పెట్టిన పరీక్షలో హనుమంతుడు విజయం సాధించి ప్రయాణాన్ని కొనసాగించాడు.




No comments:
Post a Comment