కర్మ ఫలముల యందు ఆసక్తి - అచ్చంగా తెలుగు

కర్మ ఫలముల యందు ఆసక్తి

Share This

కర్మ ఫలముల యందు ఆసక్తి

సి.హెచ్.ప్రతాప్




భగవద్గీత 4 వ అధ్యాయం లో 20 వ శ్లోకం :

త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః ।
కర్మణ్యభిప్రవృత్తోఽపి నైవ కించిత్ కరోతి సః

ఓ అర్జునా ! కర్మఫలా పట్ల ఆసక్తిని విడిచి, నిత్యం నిత్య తృప్తుడు, నిరాశ్రయుడు అయిన భక్తుడు అన్న రకముల కర్మల యందు నియుక్తుడై వున్నా కూడా కామ్య కర్మలు చేయనివాడే అవుతాడని పై శ్లోకం భావం.

ఎవరైతే కర్మఫలముల మీద ఆసక్తిని వదిలిపెడతారో, ఎవరైతే దొరికిన దానితో తృప్తిపడుతూ ఎవరిమీదా, దేని మీదా ఆధారపడరో, అటువంటి వారు కర్మలు చేసినప్పటికినీ, ఏ కర్మాచేయనట్టే అవుతుంది.పైశ్లోకంలో స్వార్థం వదిలిపెట్టి, సమాజ శ్రేయస్సుకొరకు కర్మలు చేస్తారో, ఆ కర్మఫలాలు వారిని బంధించవు, అటువంటి వారిని పండితులు అని బుద్ధిమంతులు గుర్తిస్తారు అని స్పష్టంగా వివరింపబడింది.
కర్మఫలముల యందు ఆసక్తి లేకుండా, ఉన్నదానితో తృప్తిపడుతూ, ఎవరి మీదా ఆధారపడకుండా జీవించేవాడు, ఏ కర్మ చేసినా ఆ కర్మచేయనట్టే అవుతుంది. అటువంటి వారు దేవుడిమీద తప్ప ఎవరిమీదా ఆధారపడరు. ఎవరినీ దేని కొరకు ఆశయించని వాడు. ఇతడే పండితుడు అని శాస్త్రం చెబుతోంది. ఈ శ్లోకంలో పండితుడికి చెప్పబడిన లక్షణాలు మరొకసారి చూస్తే కర్మఫలముల యందు ఆసక్తి లేని వాడు,ఎల్లప్పుడూ ఉన్నదానితో తృప్తిగా ఉండేవాడు, ప్రాపంచిక విషయములను ఆశ్రయించని వాడు.

ఈ లక్షణములు ఉన్న మానవులు ఎన్ని కర్మలు చేసినా వారికి ఆ కర్మఫలములు అంటవు. అతడు ఆ కర్మలను చేయనట్టే అవుతుంది. ఈ స్థితిని జీవన్ముక్త స్థితి అని అంటారు. ఈ స్థితికి చేరుకున్న మానవునికి ఏ కర్మ చేయనవసరం లేదు. శరీరపోషణార్థము చేసినా దాని ఫలితము దాని వాసనలు అతనికి అంటవు.

కర్మలపట్ల మనస్సులో వున్న భావం మనం చేసే కర్మలను ఎలా ప్రభావితం చేస్తుందో పై శ్లోకం వివరిస్తుంది. శాస్త్రం ప్రకారం బాహ్యంగా కనిపించే దానిబట్టి కర్మలు ఎలాంటివో నిర్ణయించలేము. మనస్సు యొక్క స్థితి, ఆ పని కర్మనా లేదా ఆకర్మనా అని నిర్ణయిస్తుంది. జ్ఞానోదయమైన వారి మనస్సు ఎప్పుడూ భగవత్ ధ్యాస లోనే నిమగ్నమై ఉంటుంది. భక్తితో భగవత్ సంయోగంలో సంపూర్ణ తృప్తితో ఉండి, భగవంతుడినే వారు ఆశ్రయించి ఉంటారు మరియు బాహ్య మైన వాటిపై ఆధారపడరు. ఈ మానసిక స్థితిలో వారి అన్ని పనులు అకర్మగా పరిగణించబడుతాయి.అందువలన వారు కర్మ ఫలములకు ఆధారభూతులవరు. మానవుడు ప్రతి దినం భగవంతుని కోసమే కర్మలను చేస్తున్నప్పుడు ఆ భావన లోనే కర్మ బంధం నుండి విడిపడతాడు.భక్తుడు తన పరిపూర్ణ భక్తితో ఆ భగవంతుని పట్ల పవిత్రమైన ప్రేమతో వర్తిస్తాడు కాబట్టి కర్మ ఫలములచేత బంధింపబడడు.తన సర్వ భారాలను భగవంతునికే వదిలివేయడం వలన స్వీయపోషణ కోసం చింతించడు.లేని దానిని పోందాలని కాని తన వద్ద ఉన్నదానిని రక్షించుకోవాలన్న అంశంపై చింతించడు.అటువంటి అసంగుడైన భక్తుడు ఏమి చేయని వాని విధంగా కర్మల యొక్క శుభాశుభఫలముల నుండి సర్వదా ముక్తుడై వుంటాడు. కాబట్టి భగవంతుని పట్ల భక్తి భావన లేని పూజాది క్రతువులైనా కూడా సక్రమమైన ఫలాలను అందించవని పై శ్లోకం చెబుతోంది.   

***

No comments:

Post a Comment

Pages