సత్పురుషుల సమాగమం - అచ్చంగా తెలుగు

సత్పురుషుల సమాగమం

Share This

సత్పురుషుల సమాగమం

సి.హెచ్.ప్రతాప్  



సత్పురుషులు అంటే సత్యం, ధర్మం, ప్రేమ, సేవ అనే విలువలను ఆచరించే వ్యక్తులు. వారు తమ జీవితాన్ని పరుల హితం కోసమే అంకితం చేస్తారు.ఎవరూ అడగకుండానే సహాయం చేయడం వారి సహజ లక్షణం. సత్పురుషులు స్వార్థాన్ని దూరంగా ఉంచి, నిస్వార్థంగా జీవిస్తారు. వారి మాటలు, చేష్టలు ఇతరులకు మార్గదర్శనంగా మారుతాయి.
సత్పురుషుల సన్నిధి మనసును శాంతితో నింపుతుంది.వారు జీవన తత్వాన్ని కేవలం బోధించరు, తన జీవితంతో చూపిస్తారు.వారి సాంగత్యం వల్ల అజ్ఞానం తొలగి జ్ఞానానికి దారి వెలుగుతుంది. సత్పురుషుల ఉపదేశం వింటే మనస్సు నిశ్చలమవుతుంది. అందుకే శాస్త్రాలు సత్పురుషుల సమాగమం ముక్తికి మార్గమని పేర్కొంటాయి.సత్పురుషుడు ఉన్న ప్రదేశం ఎలాంటిదైనా — వనరులు లేకపోయినా, ఇతరత్రా ఆభరణాలు లేకపోయినా — అది స్వర్గం కంటే గొప్పదిగా మారుతుంది. అలాంటి స్థలం జ్ఞానసాధకులకు అనుకూలంగా ఉంటుంది.

భర్తృహరి  సాధుసత్పురుషుల ప్రాశస్త్యం గురించి ఒక చక్కని శ్లోకం చెప్పాడు.

 పద్మాకరం దినకరో వికచం కరోతి
 చంద్రో వికాసయతి కైరవచక్రవాలం
 నాభ్యర్థితో జలధరోऽపి జలం దదాతి
 సంతః స్వయం పరహితే విహితాభియోగాః

తామరలు కోరకున్నా సూర్యుడు వాటిని వికసింపజేస్తాడు. కలువలు అడగకుండానే చంద్రుడు వాటిని విరబూయిస్తాడు.మేఘం తాము కోరినా కోరకున్నా వర్షాన్ని కురిపించి జీవాన్ని కాపాడుతుంది. ఈ విధంగానే సత్పురుషులు కూడా ఎవరు పట్టించుకోకున్నా, అడగకుండానే పరులకు మేలు చేసే స్వభావం కలవారు అని భర్తృహరి చెప్పాడు.

ఆత్మోద్ధరణకు ఏవీ సరిపోవు — సత్పురుషులు తప్ప! ఆత్మరక్షణకు ధనం, బంధువు, శాస్త్రజ్ఞానం, స్నేహితులు ఎంతగానైనా సహాయపడలేవు. ఈ విషయంలో నిజంగా తోడుండగలవారు సత్పురుషులే. కాబట్టి సత్పురుషుల సాన్నిధ్యమే మన జీవితాన్ని సముద్రమైన సంసారతాపం నుంచి తీయేసే నౌక. అందుకే వారి సమాగమం పొందటం — అదే ఉత్తమ మార్గం, అదే నిజమైన ముక్తికి వంతెన.
“సత్పురుషుడు లేని ప్రదేశం, ఎంత సమృద్ధిగా ఉన్నా అది వృక్షాలు లేని భూమి లాంటిది... మరుభూమి లాంటిదే” అనే జ్ఞానవాసిష్ఠ బోధ మనకి దీని ప్రాముఖ్యతను చాటుతుంది.

జీవితంలో సందేహాలు, కష్టాలు ఎదుర్కొంటున్నవారు మహాత్ములైన సజ్జనులను ఆశ్రయించాలి. ఎందుకంటే, సత్పురుషులు బాధలో ఉన్నవారికి ధైర్యాన్ని కలిగిస్తారు, భగవంతుడిని ఆశ్రయించే మార్గాన్ని చూపిస్తారు. ధర్మం, తత్వం వంటి ఆత్మిక విషయాలను వివరించి వారికి అంతరంగికంగా శాంతిని ఇస్తారు.

అంతేగాక, సజ్జనులు అంటే ఎవరు? భగవంతుడిని అంతర్యామిగా తెలుసుకోవాలని తీవ్ర తపనతో ప్రయత్నించే సాధకులే సత్పురుషులు. వారు మానవధర్మాన్ని బాగా అర్థం చేసుకున్నవారు. వారికి మనసులో చంచలత ఉండదు. జీవితంలోని తాపత్రయాలు, బాధలు వారిని ప్రభావితం చేయవు. ఎన్ని కష్టాలు వచ్చినా, పర్వతంలా స్థిరంగా నిలుస్తారు.

తమ మనస్సులోని మలినతను, భగవంతుని ఆదేశించిన సాధనల ద్వారా తొలగించుకుంటూ, ఏకాగ్రతతో ప్రయాస పడే వ్యక్తి పరమేశ్వరుని అనుభవించగలడు.
ఆత్మజ్ఞానానికి చేరినవారు ప్రపంచపు ఇతర విషయాల పట్ల ఆశక్తి లేకుండా ఉంటారు. వారి ఆనందానికి మూలం భగవద్దర్శనమే. అటువంటి మహానుభావుల దర్శనం లభించటం నిజంగా పుణ్యఫలం. వారిని కలుసుకోవడం జీవితాన్ని ధన్యం చేస్తుంది.సత్పురుషుల బోధనలు వినడం వల్ల, వారి జీవనశైలి ఎలా ఉందో గమనించడం వల్ల మనం ఉన్న అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగినపుడు మనలో జ్ఞానపు వెలుగు వచ్చి, ఆ వెలుగులో భగవంతుడి స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది — ఈ సృష్టిలో ఉన్నది అన్నీ భగవంతుడే, ఈ జగత్తు నడిపించేది కూడా ఆయనే. మనం కేవలం ఒక నిమిత్తమాత్రులమని తెలుసుకొని, భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ధన్యంగా, సార్థకంగా మార్చుకోవాలనే సంకల్పం కలుగుతుంది.

భగవంతుని సమీపానికి చేరాలనుకునే భక్తుల ఆరాటాన్ని చూసి, ఎన్నో సందర్భాల్లో ఆ స్వామి వారు స్వప్నంలో దర్శనమిచ్చి — "ఫలానా గురువుని ఆశ్రయించు" అని సూచించిన ఘటనలు ఉన్నాయి. అలా గురు మార్గదర్శకత్వాన్ని పొందిన భక్తులు, వారు చూపిన దారిలో నడుచుతూ భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రయాణంలో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే — భగవంతుడిని చేరే మార్గాన్ని చూపించేది ‘గురు’, ఆ గుణాతీత గురుని చూపించేది కూడా భగవంతుడే కావడమే!

***

No comments:

Post a Comment

Pages