మంచు తెరలు -2
పద్మావతి అన్నా పంతుల
సుమిత్ర నీహారికని లోనికి తీసుకు వెళ్లి అన్నం పెట్టింది. నీహారిక ఎంత ఆకలి మీద ఉందో, సుమిత్ర పెట్టిన భోజనాన్ని ఆతృతగా తిన్నది.
కొంచం కడుపు నిండేకా "నేను భోజనం చేసి మూడు రోజులు అయింది అత్తా" అన్నాది నీహారిక. సుమిత్రకి జాలి వేసింది. అన్నం తినడం పూర్తి అయింది. సుమిత్ర, నీహారికని బట్టలు మార్చుకుని ఫ్రెష్ అయ్యి రమ్మంది. నీహారిక స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని వచ్చింది. ఇప్పుడు నీహారిక, సుమిత్ర కళ్లకి అందంగా కనిపించింది. నీహారిక తల్లి పోలికే.
భగవతం గారిని వేరే రూమ్ లో పడుకోమని తమ గదిలో నీహారికని తన మంచం మీద పడుకోబెట్టింది.
అత్త పక్కన పడుకున్న నీహారిక కి చాలా నిశ్చింతగా అనిపించింది. తను మూడు రోజుల నుండి పడిన టెన్షన్ అంతా ఒక్క చిటికెలో మాయం అయింది.
"అత్తా, అమ్మా నాన్న గారు ఇద్దరు కరోనాతో పోయేరు. ముందు నాన్నగారు పోయేరు.
అమ్మకి కూడా కరోనా వచ్చింది. నేను హాస్టల్ లో ఉన్నాను. అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది, తనకి కూడా కరోనా వచ్చిందని, నన్ను రావద్దని, తను ఎన్నాళ్ళు బతుకుతానో తెలీదు అని, తను పోయేక నన్ను విశాఖపట్నంలో వున్న మామయ్య గారి ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది. ఈ లోకంలో తమకి ఉన్న ఆత్మీయులు మీరు ఒక్కరే అన్నది. నేను హాస్టల్ లోనే ఉండి పోదాం అనుకున్నాను. హాస్టల్ కి డబ్బు కట్ట లేదు. హాస్టల్ వాళ్ళు నన్ను ఇంక హాస్టల్ లో వుండ వద్దని పంపించేసారు. నేను మరి ఇంటికి వెళ్ళలేదు. అమ్మపోయిందని ఇంటి ఓనర్ చెప్పేడు, నన్ను రావద్దని. దహన సంస్కారాలు హాస్పిటల్ వాళ్ళే చేస్తారని చెప్పేరు అతను. నేను ఒక అనాథ లాగ ఐపోయెను అత్తా! నాకు ఏడుపు కూడా రావడం లేదు. ఏమిటి చెయ్యాలో ఎలాగ బతకాలో బోధ పడలేదు. ఏమైతే అయింది అని ఇక్కడికి వచ్చాను" అంది నీహారిక.
"ఎన్ని కష్టాలు పడ్డావు నీహారిక!
రేపు అన్ని మాట్లాడుకుందాము. ఈ రాత్రికి రెస్ట్ తీసుకో" అంది సుమిత్ర.
సుమిత్ర పక్కన నిశ్చింత గా పడుకుంది నీహారిక. క్షణాలలో ఆదమరిచి నిద్రపోయింది నీహారిక.
సుమిత్రకి నిద్ర రావడం లేదు.విజ్జి గురించి, గతం లో జరిగిన విషయాలు గురించి ఆలోచించ సాగింది సుమిత్ర.
***
సుమిత్ర కి పెళ్లి అయి కాపురానికి వచ్చేసరికి విజ్జి పదహారేళ్ళ పడుచు. ఇంటర్ చదువుతున్నాది.
విజ్జి సుమిత్రతో చాల చనువుగా వుండేది. కాలేజీ కి వెళ్ళినంత సేపు దూరంగా వున్నా ఇంటికి వచ్చిన తరువాత సుమిత్రని అంటిపెట్టుకుని తిరిగేది. "వదినా, వదినా!" అంటూ క్షణం సుమిత్రని విడిచేది కాదు. విజ్జిది పెద్ద జుట్టు. సుమిత్ర విజ్జి కి తలదువ్వి స్టైల్ గా జడ వేసేది. "వదినా నువ్వు జడ లూస్ గా బాగా వేస్తావు, అమ్మ ఐతే బిగించి గట్టిగా వేస్తుంది. మా కాలేజీ లో అందరూ నువ్వు వేసిన జడ చాలా అందంగా ఉంటుంది అంటారు." అనేది. భగవతం ఎప్పుడూ కోర్టులు, కేసులు అంటూ బిజీ గా వుంటాడు. అందుకని సుమిత్ర, విజ్జి కలిసి షాపింగ్ లకి, సినిమాలకి షికార్లకు తిరుగుతూ ఉండేవారు. విజ్జి రాత్రి పూట కబుర్లు చెప్పుకోవచ్చని తన దగ్గరే పడుకునేది. విజ్జి తల్లి వేదవతి విజ్జి నీ మందలించి తన గదిలోకి తీసుకుపోయేది.
విజ్జి ఇంటర్ పాస్ అయింది. డిగ్రీ లోకి వచ్చింది.
మొదటి ఏడు బాగానే గడిచింది కానీ రెండవ ఏడు వచ్చేసరికి విజ్జి లో కొంత మార్పు కనిపెట్టింది సుమిత్ర. ఇంతకు ముందులా సుమిత్రతో చనువు గా వుండడం లేదు. కాలేజీ నుండి కూడా లేట్ గా వస్తున్నది. సుమిత్ర అడిగితే స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి అనేది. సుమిత్ర మొదట్లో నిజం అని నమ్మింది.కానీ విజ్జి ఇంటికి వచ్చిన దగ్గర నుండి కార్డు లెస్ ఫోన్ పట్టుకుని తన గదిలో కూర్చుని ఎవరి తోనో గంటలు గంటలు మాట్లాడేది. రంగా రావు గారు కూడా లాయర్. తండ్రీకొడుకులు ఇద్దరు లాయర్స్ అవడం వలన ఇద్దరు కోర్టు కి కలిసి వెళ్లి కలిసి వొచ్చేవారు. వాళ్ళు వచ్చేసరికి రాత్రి అయేది. అందువలన విజ్జి ఎంతసేపు ఫోన్ లో మాట్లాడిన ఎవరికి తెలిసేదికాదు. ఒకసారి భగవతం సుమిత్రకి సాయంత్రం ఫోన్ చేసేరు. ఎన్నిమార్లు చేసినా ఎంగేజ్ వచ్చింది. భగవతం గారికి ఆరోజు కోర్టు లో పని తొందరగా ఐపోయింది. సినిమాకి వెళదాము అని సుమిత్రకి ఫోన్ చేసేరు. ఫోన్ ఎంగేజ్ సౌండ్ వచ్చింది భగవతం గారికి కోపం వచ్చింది. ఫోన్ సరిగా హుక్ చేసి వుండరు అనుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత సుమిత్ర మీద చికాకు పడ్డాడు. సుమిత్ర , విజ్జి ఎవరితోనో మాట్లాడుతున్నాది అని చెప్పి, "మీరు ఎందుకైనా మంచిది ఒక ఎక్స్టెన్షన్ మేడ మీద పెట్టించండి. నేను మేడ మీద ఉంటే కిందన ఫోన్ రింగ్ అయినా తెలీదు అంది. మర్నాడే భగవతం ఎక్స్టెన్షన్ ఫోన్ పెట్టించేడు.
విజ్జి యథా ప్రకారం కాలేజీ నించి వచ్చిన తరువాత ఫోన్లో మాట్లాడడం మొదలు పెట్టింది.సుమిత్ర విజ్జి మాట్లాడింది అంతా విన్నా ది. విజ్జి రాజ్ కుమార్ అనే అతనితో మాట్లాడుతున్నాది. తను అతనిని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాది అన్న విషయం చెప్పి ఇంట్లో ఒప్పుకోకపోయినా అతనినే పెళ్ళి చేసుకొంటానని అన్నాది. అన్ని విన్న సుమిత్ర విజ్జి నీ నిలదీసింది. ముందు బుకాయించినా తరవాత ఒప్పుకుంది.
రాజ్కుమార్ ఒక అనాథ. అనాథ ఆశ్రమంలో పెరిగాడు. చాలా తెలివైన వాడు, మంచి అందగాడు. విజ్జి అతనితో ప్రేమలో పడింది. సుమిత్రని ఎలాగ ఐనా పెద్దలని ఒప్పించమని,పెళ్లి జరిగేటట్లు చెయ్యమని ప్రాధేయపడింది. సుమిత్ర మామగారు ఇలాటి వాటికి ఒప్పుకోడు. సుమిత్ర ఇదంతా ఆలోచించి ముందుగా భగవంతానికి ఈ విషయం చెప్పింది.
No comments:
Post a Comment