పాపము బుణ్యము పరగ నొకట నదె
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా. తాడేపల్లి పతంజలి
రేకు: 0337-05 సం: 04-218
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgX9DcpjLKPjfF8PEMSunEkgBMdvwQApBwLIMvUuUK_UijEp2n8KFAIKSnGVDlMYIAdhtWCf1IZqro5XeEEYyUI99eszqIDtgpbYGyuEWbQHaId3ghKsNjbQ7uvVEJMvo4ASrp8DSHNdCbLzx4_5ATgOvjjAgXg4KhTDe9P012TDTWI9dfJl59l4LiNhA/w640-h384/baalaji.jpg)
పల్లవి:
పాపము బుణ్యము పరగ నొకట నదె
వోపినవారలు వొడిగట్టెడిది
చ.1:
నాలుకతుదనే నానారుచులును
నాలుకదే హరినామమును
పోలింప నొక్కటి భోగమూలము
మూల నొకటది మోక్షమూలము
చ.2:
మనసున నదివో మగువలమోహము
అనుగుమనసుననె హరిచింత
పనివడి యొక్కటె ప్రపంచమార్గము
కొననొకటే వైకుంఠమార్గము
చ.3:
వెలుగుజీకటియు వెస నొకనాడే
కలిగెనట్ల నివి కలిగినవి
యిలలో శ్రీవేంకటేశు మాయొకటి
తలప నొక టతనిదాసులసుగతి
భావం
పల్లవి:
పాపము పుణ్యము ఒకటే.
ఓర్చుకొనే వారు అంగీకరించటానికి సిద్ధపడేది ఈ పాప పుణ్య సిద్ధాంతం.
చ.1:
నా నాలుక చివర నానారుచులు ఉన్నాయి.
నా నాలుక మొత్తం హరినామముతో నిండి ఉన్నది.
పోల్చగా మొదటిది(నానారుచులు) భోగమూలము.
రెండవది (హరినామము)మోక్షమూలము.
చ.2:
అదిగో ! నా మనసున మగువలపై వ్యామోహమున్నది.
ఆ మనసులోనే శ్రీ హరి గురించి ధ్యానము ప్రియముగా ఉన్నది.
అందులో మొదటిది(మగువలపై వ్యామోహము) ప్రపంచమార్గము వైపు నడిపిస్తుంది.
చివరిది (శ్రీ హరి గురించి ధ్యానము ) వైకుంఠమార్గము వైపు నడిపిస్తుంది.
చ.3:
వెలుగు చీకటి-ఈరెండూ - వెంట వెంట కలిగినట్లే ,( వచ్చినట్లు) ఈ ప్రపంచంలో శ్రీవేంకటేశుని కి సంబంధించిన మాయ, అతని దాసుల సుగతి (మోక్షం) రెండూ వెంట వెంట కలుగుతాయి.(వస్తాయి)
(భక్తులు గమనించుకోవాలని శరణాగతికోరి మాయా విముక్తులు కావాలని భావం)
***
No comments:
Post a Comment