విడువుము మనసా వీరిడిచేతలు
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా.తాడేపల్లి పతంజలి 
రేకు: 0337-03  సం: 04-216
పల్లవి: విడువుము మనసా వీరిడిచేతలు
తడయక శ్రీహరి దలచవొ యికను
చ.1: నానాడే యెనబది నాలుగులక్షలు
యోనుల వెడలితి నొక్కడనే
ఆనిన భోగములందలివే పో
కానము యికనేమి గడియించేము
చ.2: నలుగడ నటు పదునాల్గు లోకములు
వెలయజొచ్చితిని వెడలితిని
కలిగినదేదో కలుగనిదేదో
తెలియ దేమిటికిదిరిగేమో
చ.3: భువిలోజేసితి పుణ్యముబాపము
కవిసి యాఫలము గైకొంటిని
యివల శ్రీవేంకటేశుడిరతలో
తవిలి యేలగా ధన్యుడనైతి
 భావం
పల్లవి:
ఓ మనసా !  వెర్రివాని చేతలు విడువుము.
ఇకనైనా ఆలస్యము చేయక శ్రీహరిని తలుచుకో.
చ.1:
 ప్రతి దినము(దినమనగా ఇక్కడ జన్మ అని లక్ష్యార్థం) ఎనుబది నాలుగులక్షల యోనులందు ఒక్కడినే పుట్టాను.
నేను పొందిన భోగములు ఆ యోనులందే ఉన్నాయి కదా !
ఏమిచూసుకోలేదు. ఈ జన్మ చక్రంలో ఇక ఏమి సంపాదించాము?
చ.2:
 నాలుగు దిక్కులలోను,  అటు పదునాల్గు లోకములలోను (భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము  అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము ) ప్రవేశించాను. బయటకు వచ్చాను.కలిగినదేదో కలుగనిదేదో తెలియదు. ఎందుకు తిరిగేమో తెలియదు.
చ.3:
 ఈ భూమిలో పుణ్యముచేసాను.పాపము చేసాను.
వ్యాపించి ఆ ఫలమును స్వీకరించాను.  శ్రీవేంకటేశుడు ప్రేమతో  పరిపాలించగా ధన్యుడనయ్యాను.
***
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment