బహుముఖ ప్రజ్ఞావంతుడు,'కథన'కుతూహలుడు'-శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు - అచ్చంగా తెలుగు

బహుముఖ ప్రజ్ఞావంతుడు,'కథన'కుతూహలుడు'-శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు

Share This
బహుముఖ ప్రజ్ఞావంతుడు, 'కథన'కుతూహలుడు'- శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు
శారదాప్రసాద్


పోరాడి, పోరాడి ఆఖరికి కథన కుతూలుడు ఈ రోజున తన కుతూహలాన్ని విరమించి, తన సమకాలీకుల చెంతకు చేరారు! ఆ సందర్భంగా, ఆయన స్మృత్యర్దంగా నా ఈ చిన్న వ్యాసం! శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి చాలా కృషి చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయిత గాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు వ్రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నాడు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

గొల్లపూడి మారుతీ రావు గారు  1939 ఏప్రిల్ 14న,విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.పూర్తిపేరు వెంకట సూర్య మారుతీ లక్ష్మీనారాయణ. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ,సుబ్బారావు గార్లు. వారు జీవితాంతం విశాఖపట్టణంలోనే నివాసమున్నారు. సి.బి.ఎమ్ హైస్కూలు, ఎ.వి.ఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయములో మారుతీరావు గారి విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ లో బీయస్సీ(ఆనర్స్)చేశారు.మారుతీరావు గారు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు. తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికై, హైదరాబాదుకు మారారు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశారు.కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొంది సంబల్‌పూర్ వెళ్ళారు.ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందారు. మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. తరువాత ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య సినిమాతో నటుడిగా సినిమారంగ ప్రవేశంచేశారు.మారుతీరావుగారు రాసిన తొలి కథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడు లో 1954 డిసెంబరు 9న వెలువడింది. చిన్నవయసులోనే రాఘవ కళానికేతన్ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపేవాడు. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండలరావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు (గోగోల్ రాసిన An Inspector Calls ఆధారంగా సోమంచి యజ్ఞన్న శాస్త్రి చేసిన రచన) నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతోపాటు, ప్రధానపాత్రధారిగా నటించారు.విద్యార్థి దశలో ఉండగానే శ్రీవాత్సవ రచించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామిగారి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించారు. మనస్తత్వాలు నాటకాన్ని ఐదవ అంతర విశ్వవిద్యాలయ యవజనోత్సవాలలో భాగంగా కొత్తఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు.ఆయన రచన అనంతం ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది. 

అప్పటి సమాచార, ప్రసార శాఖామాత్యుడు డాక్టర్ బి.వి.కేశ్‌కర్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకొన్నారు. మనస్తత్వాలు నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్, కొత్తఢిల్లీ వారికోసం ప్రదర్శించారు. ఆ అసోసియేషనుకు శ్రీ వి.వి.గిరి గారు అధ్యక్షుడు. చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం రచించి, చిత్తూరు, మదనపల్లె, నగరిలలో ప్రదర్శించగా వచ్చిన సుమారు యాభై వేల రూపాయల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చారు.చైనా విప్లవంపై తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటకం వందేమాతరం ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి పి.వి. నరసింహారావు గారు  దానికి ఉపోద్ఘాతం వ్రాశారు. 1959 డిసెంబర్ 16న రాగరాగిణి అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గారి  ఎదుట ప్రదర్శించబడింది. పథర్ కే అన్సూ అనే పేరుతో హిందీలోకి కూడా అనువదించబడింది. ఆయన రచనలు భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాల పరంపర ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి ఎంఫిల్, మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో శ్రీ మారుతీరావు గారు కీనోట్ స్పీకర్ గా వ్యవహరించారు. తెలుగు సాహిత్యం మీద ఆయన రాసిన రెండు పరిశోధనా పత్రాలు ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి.మారుతీరావు గారి  వివాహం 1961 నవంబరు 11న, విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హనుమకొండలో జరిగింది. సి.నారాయణ రెడ్డి ,కాళోజి నారాయణ రావు గార్ల వంటి ప్రముఖులకు ఆమె తండ్రి ఉపాధ్యాయులు. 
ప్రముఖ రచయిత, విమర్శకుడు డా. శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి, మనోధర్మ సంగీతం బాణీ ప్రముఖుడు పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి ఆమెకు సమీప బంధువులు. మారుతీరావుగారికి ముగ్గురు మగసంతానం --  సుబ్బారావు, రామకృష్ణ మరియు శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన కుటుంబంతో మద్రాసులో నివసిస్తున్నారు.

('నిప్పులాంటి మనిషి'NTR తో)
1992 ఆగస్ట్ 12న మారుతీరావుగారి చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ 
 తన తొలి ప్రయత్నంగా ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో జల ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించాడు. మారుతీరావు గారు  కుమారుని జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి, ప్రతి టా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1.5 లక్షలు నగదుబహుమతి, ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రదానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఏదేని అంశంపై విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవసూచకంగా రూ.15,000 గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ లెక్చర్ పేరిట బహూకరిస్తారు. సునీల్ దత్, నసీరుద్దీన్ షా, మృణాల్ సేన్, శ్యాం బెనగల్, జావెద్ అక్తర్, అనుపమ్ ఖేర్ మొదలైన వారు ఇందులో ప్రసంగించిన వారిలో ప్రముఖులు. మిగిలిన ఇద్దరు కుమారులు సుబ్బారావు, రామకృష్ణలు మారుతీ ఎయిర్‌ లింక్స్ అనే ట్రావెల్ ఏజన్సీని నడుపుతున్నారు.1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే వ్రాశారు.

మారుతీరావుగారికి అది మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచనకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. మారుతీరావు గారు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఘనవిజయం సాధించిన తరువాత వెనుదిరిగి చూడవలసిన అవసరం కలుగలేదు. 250 చిత్రాలకు పైనే అనేక చిత్రాలలో సహాయక నటుడిగా,హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించారు. సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369 ఆయనకు పేరు తెచ్చిపెట్టిన కొన్ని సినిమాలు.మారుతీరావుగారిని ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.

(శ్రీ ఆత్రేయ గారితో కలసి నాటక ప్రదర్శనలో)   

శ్రీ మారుతీ రావు గారి మనోగతాన్ని క్లుప్తంగా ఈ క్రింద తెలియజేస్తున్నాను.
ఆయనకు నచ్చినవి--

రచయిత--శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 
కథ--అరికాళ్ళ కింద మంటలు.
సినీ నటులు--అక్కినేని,రామారావు గార్లు
సినీ నటీమణి--భానుమతి గారు 
గాయకుడు--శ్రీ ఘంటసాల గారు 
గాయని--శ్రీ మతి రావు బాలసరస్వతీదేవి గారు  
సినిమాలు--సీతారామయ్యగారిమనవరాలు,మల్లీశ్వరి
వ్యక్తి--అమ్మ
వంట--వంకాయకూర
పాట--నీవు రావు నిదుర రాదు(పూలరంగడు--దాశరధి)

సాహిత్యం వాదాలకు అతీతం--సాహిత్యంలో"You did not take sides"మీ హృదయం దేనిని స్పందింప చేస్తుందో దానిని గురించే వ్రాయాలి.నీ కులం,మతాన్ని మరచిపోయి వ్రాయాలి.

మాతృభాష పరిరక్షణకు చర్యలు--చక్కగా తెలుగు చదవటం,చదివించటంతో పాటు ప్రతి రోజూ మీ పిల్లలకు  ఒక తెలుగు పద్యాన్ని నేర్పండి.జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ తో పాటు 'శ్రీ రాముని దయ చేతను ...లాంటి పద్యాన్నికనీసం రోజుకొకటి నేర్పండి.

పూర్వ జన్మ సుకృతం--"జీవితమంతా తృప్తినిచ్చే పని నా వృత్తి కావటం.నా వృత్తి అందరికీ తృప్తి నివ్వటం"నా 68 వ సంవత్సరంలో నేను గిరీశంగా ,నా అన్నగారి పాత్ర అయిన లుభ్ధావధాన్లు పాత్రలో ప్రఖ్యార రంగస్థల నటుడు శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారితో కలసి నటించటం.అప్పటికి ఆయన వయసు 86 సంవత్సరాలు. శ్రీ రావి కొండలరావు గారి దర్శకత్వంలో నటించటం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను. 

ప్రస్తుత సాహిత్యం గురించి-- చాలా తక్కువగా చదువుతున్నాను. కారణం

తక్కువగా చదవాలనిపిస్తుంది.గొప్ప రచనలను,మంచి సాహిత్యాన్ని వెతికి పట్టుకోవలసి వస్తుంది.తెలుగు భాషకు మళ్ళీ గతవైభవం మహర్దశ తిరిగి రావాలని నా ఆశ!
వయసు పెరుగుతున్నా తన రచనలలో వాడి, వేడి, వ్యంగ్యం, వైవిధ్యం ..ఏమాత్రం తగ్గనివ్వకుండా అక్షర సేద్యం చేసిన ఈ రచయితకు, బహుముఖ ప్రజ్ఞాశాలికి, అక్షర కుసుమాంజలి.
****

No comments:

Post a Comment

Pages