శివం -47 - అచ్చంగా తెలుగు
శివమ్మ కధ -20
శివం -47
రాజ కార్తీక్ 


(అమ్మ స్పృహ తప్పటం వల్ల అందరిలో భయం ..నేను ఏమో ఏడుపు ,ఇంతలో వినిపించింది 'అమ్మా, లే' అనే పిలుపు .. )
వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు మహావిష్ణువు ...
నంది, భృంగి, నాగరాజు, చంద్రుడి మోము లో ఆరాధన.
శివమ్మ స్పృహలోకి వచ్చి నన్ను ఎత్తుకొని "ఏమి లేదు అయ్యా పెద్ద దాన్ని కదా ..ఊరికే అలా కొంచెం సోమ్మసిల్లిపోయాను, కన్నా శివయ్య "అని అనగానే, నేను నవ్వి నా చేతిని అటువైపుగా చూడు అన్నట్లు చూపాను.
శివమ్మ చూడగా .. విష్ణు మూర్తి. ఆమె కళ్ళలో నన్ను మొదటిసారి చూసినప్పటి మెరుపు.
విష్ణు దేవుడు "వద్దమ్మా, నాకు దణ్ణం పెట్టకు. నన్ను నీ బిడ్డ లా చూడు ,భక్తీ తో భగవంతుని  తన బిడ్డలా మార్చుకున్న నీకు....వద్దు అమ్మా ఏమి చెప్పినా తక్కువే  " అన్నాడు.
శివమ్మ "అయ్యా నాకు ఏమి తెలీదు ..నేను ఎప్పుడూ ఈ నా చిట్టి కన్నయ్యని నా బిడ్డలా పూజించి ఆనందపడ్డాను..హరికేశవులు ఇద్దరూ ఈ దీనురాలిమీద దయ చూపారు. "అంది ఆనందంగా.
నేను మాత్రం అలా అనవద్దు అని సైగ చేశాను ..
విష్ణు దేవుడు "తల్లి..నేడు ఏమి జరగబోతుందో మహాదేవుడు మాకు తెలియకుండా చేసారు. అందువల్లే మేము అడుగు అడుగునా నీ భక్తీని, మహా దేవుడి చిలిపి పనులను చూసి ఎంతో ఆనందపడ్డాము. నేనే కాదు, త్రిమతాలు కూడా నీ వాత్సల్యానికి కట్టుబడిపోయారు " అన్నాడు.
శివమ్మ "నాది ఏమి లేదయ్యా మీరు ఉన్నారు అని గుడ్డినమ్మకం స్వామి "
విష్ణు దేవుడు "అమ్మా నీవు నాకు ఒక మాట ఇవ్వాలి ..ఇచ్చి తీరాలి, అంతే ..మాట కాదు అమ్మా వరం ..నీవు నాకు వరం ఇవ్వాలి "అని అడిగాడు.
త్రిమతాలు ,బ్రహ్మదేవుడు,నారదులు ,అందరూ అదేమిటాఅని ఆసక్తిగా చూస్తూ,
"ఏమిటి ఈ హరిహరులు ఆ తల్లి తో తమ పారవశ్యం తీర్చుకుంటున్నారు " అనుకున్నారు.

శివమ్మ "నేను ఏమి ఇవ్వగలను స్వామి ..అంతా మీరే నిండి ఉన్నారు కదా.." అంది.
చంద్రుడు "శివమ్మ తల్లి, అలా ఊరుకోరు మా బావగారు ..వరం ఇచ్చినా అంతే, వరం అడిగినా అంతే ..మా అక్క గారు చెప్తూ ఉంటారు ఇవ్వండి అమ్మ " అన్నాడు.
నంది, భృంగి, నాగరాజు "ఇవ్వండి అమ్మా, మీరు తీర్చ లేనిది నారాయణ స్వామి ఏమి అడుగుతారు? " అన్నారు.
శివమ్మ "చెప్పు స్వామి తమరు వేరు, మా కన్నయ్య వేరు కాదుగా" అంది.
విష్ణుదేవుడు "అదీ, ఇప్పుడు మా అమ్మ అనిపించారు " అన్నాడు ఆనందంగా.
లక్ష్మి మాత "ఏమిటో ఈయనగారి అంత కోరిక ..ఏముందిలే,బహుశా " అని ఆలోచించసాగింది.
విష్ణుదేవుడు "పాయసం అమ్మ ,నీవు కైలసం వచ్చిన తర్వాత ..అప్పుడప్పుడు వైకుంఠం కూడా రావాలి, మాకు కూడా తగినంత అడిగినంత పాయసం చేసి పెట్టాలి " అన్నాడు.
బ్రహ్మ దేవుడు , నారదుడు "పాల సముద్రాన్ని పాయస సముద్రం గా మార్చమని అడుగుతున్నారు స్వామి " అన్నారు హాస్యంగా.
త్రిమాతలు "మేము చేస్తే నచ్చదు గాని, ఇలా అడుగుతున్నారు "అన్నారు చిరు కోపంగా. 
నంది "ఓం నమో నారాయణ స్వామి, పాయసాన్ని మీరు ఎప్పుడు రుచి చూసారు " అని అడిగాడు.
విష్ణు దేవుడు "అదీ, ఒక పెద్ద కథలే, కైలాసం లో తెల్సుకుందువుగాని  " అన్నాడు.
విష్ణు దేవుడు "మరి దానికి నాంది గా  ఇప్పుడు నాకు పాయసం తీసుకురామ్మ " అని కోరాడు.
శివమ్మ "మన నారాయణస్వామి కి పాయసం ఇద్దామా " అని నన్నడిగింది.
నేను "హ్మ్మ్మం హ్మ్మ్మం  అమ్మ "అన్నాను. 
విష్ణుదేవుడు "నీకు కావాల్సినవి అన్ని అక్కడ ఉన్నాయ్ " అన్నాడు.
శివమ్మ మాములు స్తితిలోకి వచ్చింది. 
"ఆహా, ఏమి నా అదృష్టం ...ఇలాంటి అదృష్టం వస్తుంది అని తెలిస్తే ఎవరూ నాలాంటి జన్మని కోరుకోకుండా ఉంటారు? బిడ్డలు లేరు అని బాధపడ్డ నాకు, మహాదేవుడు, దేవదేవుడే కాక ఇంకా  వారి పరివారం కూడానన్ను తల్లి లా భావిస్తున్నారు .. "ఇక హాయిగా శివయ్య తో కైలసం లో ఉండవచ్చు ..గుడికికుడా వెళ్ళలేని నేను శివయ్య గుండెల్లో ఉండిపోయాను. ఈ సంఘటన తో హరిహరుల మధ్య భేదం లేదు అని తెల్సుకున్నాను ..ఇదిమాత్రం కల కాదు ...నిజం "అంటూ తన భుజాల పైన ఉన్న నన్ను చూస్తూ కన్నీటి పర్యంతం అయ్యి ముద్దులు కురిపించింది.  
విష్ణుదేవుడు ఇలా అంటుండగా, నంది, భృంగి, నాగరాజు, చంద్రుడు మొదలైనవారు నమస్కరిస్తూ వింటున్నారు. 
"ఈ తల్లి కోరిన కోరిక లో మహాదేవుడు పొందిన ఆనందాన్ని ఎన్ని అవతారాలు  నేను ఎత్తి ఎంతమంది తల్లుల దగ్గర  ఇంత వాత్సల్యం అనుభవించాలి? ఎంత నేను మహాదేవుల వారు ఒకటి అయినా ..ఈ అనుభూతి వేరు ..ప్రపంచ భక్త చరిత్ర లో శివమ్మ తల్లి ప్రత్యేకం ..ఇక మనం కైలసం వెళ్ళే సమయం ఆసన్న మయ్యింది, పదండి" అన్నాడు.
పాయసం తయారుచేసిన శివమ్మ ఒకసారి వంటగది నుండి బయటకు రాగా, ఆశ్చర్యపోయింది .
విష్ణు దేవుడు "అమ్మా, చెప్పటం మరిచాను "అన్నాడు.
శివమ్మ చేతిలో ఉన్న పాయసం పోసిన గిన్న చెయి జారి పడిపోయింది. పాయసమంత ఒలికిపోయింది ..
"అయ్యో అయ్యో "అన్నారు అందరు కానీ శివమ్మ కనులలో ఆనందం...
***

No comments:

Post a Comment

Pages