పోతన గారి గజేంద్ర మోక్షం(వచనం ) - అచ్చంగా తెలుగు

పోతన గారి గజేంద్ర మోక్షం(వచనం )

Share This

  పోతన గారి గజేంద్ర మోక్షం(వచనం )

 - సుజాత తిమ్మన

శుక్లాం బరధరంవిష్ణుం

శశివర్ణం ఛతుర్భుజం |

ఫ్రసన్నవదనం ధ్యాయెత్

సర్వవిఘ్నోప శాంతయె ||

  పోతన గారి గజేంద్ర మోక్షం...ఎన్ని సార్లు చదివినా...అలా కళ్ళ ముందు..ఆ సంఘటనలు కదులుతున్నట్టే..ఆ శ్రీ మహా విష్ణువు అలా నడిచి పరుగు పరుగున వస్తున్నట్టే కనిపిస్తుంది....నీవే దిక్కు ..నీవు తప్ప నాకెవ్వరు లేరు తండ్రీ....అని మొర పెట్టుకున్న భక్తుని తప్పక ఆదుకుంటాడని...ఈ కథ మనకు చెపుతుంది.... నా మనసుకు మళ్ళి ఇలా వ్రాయాలి అనిపించి...పోతన పద్యాలను అనుసరిస్తూ....వ్రాసాను...వేల వేల నివాళులు ..ఆ శ్రీహరి ఆశీర్వచనాలు కోరుతూ..   .....గజేంద్ర మొక్షం...   వేసవి కాలం....దాహంతో నోరు ఎండిపోతున్నది....భానుడు తన ప్రతాపాన్ని ఈ అడవి ప్రాంతంలోనే..... చూపిస్తున్నాడనిపిస్తుంది...నీటి చుక్కకై ఎంతెంత దూరం అయినా వెళ్ళాలను కుంటూ...పరిగెడుతూ...పరిగెడుతూ...ఉన్నాయి ఏనుగులు..గుంపులు గుంపులుగా...అదిగో...కనిపించింది...గుబురు చెట్ల మద్య విశాలంగా వ్యాపించిన సరస్సు సూర్య రశ్మిధాటికి మిలమిల మెరుపులతో..గాలి వాటుకు కదిలే చిరు అలలతో........చూడబోతే..చాలా లోతు గానే ఉందనిపిస్తుంది... ఆనందంగా నీటిలోనికి దిగి కడుపారా నీటిని త్రాగినా కూడా...సరిపోక....తొండము నిండా నీటిని తీసుకొని ఒకదాని పై ఒకటి పోసుకొంటూ...చిందులు వేస్తూ...జలకాలాటలు ఆడుకుంటున్నాయి ఏనుగులన్ని . ...కొలను లోని రకరకాల చేపలు...ఎండ్రకాయలు..మొసళ్ళు బెదిరి పోతూ తత్తరపడుతున్నాయి ఈ సందడి ఏంటా అని ...అంతలో ఒక మొసలి...మరీ భీతి చెందినదై విసురుగా నీటి పైకి వచ్చి తోకతో నీటిని కొడుతూ....భయముతో వెరపు నొందుతూ..ఉపిరి బిగపట్టి ..  గజేంద్రుని కాలును రాహువు సూర్యుని పట్టి నట్టు గట్టిగా పట్టుకుంది.. కాలికి నొప్పి అనిపించి ఏనుగు కాలును పైకి లాగినా గాని...అది రాకుండెను...మొసలి లోనికి...ఏనుగు పైకి లాగుకుంటూ...ఒకరి పై ఒకరు  శత్రుత్వము పెంచుకున్నారు.....నీటిలోని మొసళ్ళు అన్నీ తమ మొసలే బలమైనదిగా తలస్తే...ఏనుగులన్నీ కూడా....తమ నేస్తం అయిన గజెంద్రుడే బలవంతుడని భావిస్తున్నాయి...నొప్పితో విలవిల లాడుతూ...గజేంద్రుడు..... మొసలి తన రెండు పాదములను నేలలో అదిమి... పంచేంద్రియాలను బిగియ బట్టి మరీ ఏనుగు యొక్క పాదమును పట్టుకొనెను..... అవివేకముతో..బుద్ది నిలకడ లేక సంసారవిషయములను గూర్చి దిగులు పడుతున్న చందాన తన గతి ఇట్లైనదని ,తన కాలిని విడిపించుకొనజాలక దుఃఖభరితమై విలపిస్తున్నాడు  ......గజేంద్రుడు.. “ఏ విధంగా నేను దీనిని జయించాలి...ఏ దేవుని శరణు వేడాలి ...ఎవరు నాకు తోడు వచ్చి ఈ ఆపద నుంచి కాపాడుతారు...ఏ పుణ్యాత్ములు పరోపకారం చేయటానికి ముందుకు వచ్చి నన్ను రక్షిస్తారు...”అనుకుంటూ దీనాతిదీనంగా విలపించ  సాగాడు గజేంద్రుడు...... ఓ భగవంతుడా..! అరణ్యములో నా తోటి వాళ్లతో ఆనందంగా గడుపు సమయాన నాకు ఈ పాడు దాహము ఏలవేసినది..కోరి..కోరి..ఈ కొలనుకు వచ్చి ఈ మొసలికి చిక్కినానే..హా! ఈశ్వరా...పరమేశ్వరా...! ఎవని వల్ల ఈ జగతి జనించిందో..ఎవరి వల్ల లోకాలు పుట్టి..నశిస్తాయో...ఎవరు చరాచరమంతటికి ప్రభువో... ఆది ..అంతం లేని మూలం ఎవరో...సర్వాత్మకుడు ఎవరో...అట్టి భగవంతుని కాపాడమని శరణు వేడుకుంటున్నా... అన్ని లోకాలను ఒకసారి ఒక్కతాటి పై నడిపి...మరల తన ఇష్టం వచ్చనప్పుడు వాటిని తనలో అంతర్లీనం చేసుకొని ..ఈ లోక సృష్టి- సంహారాలు రెంటిని కళంకము లేని విదంగా చూసుకొంటూ..అన్నిటికి తనే సాక్షి అయిన ఆత్మభవుని...ఆ సర్వేశ్వరుని మనసులో ధ్యానించుకుంటున్నాను.. లోకాలన్నియు....దిక్పాలకులును...లోకవాసులందరును  నశించిన పిదప అలుముకొన్న గాడాంధకారం నలుదిశలా వ్యాప్తి అయి ఉన్నప్పుడు ..ఆ చిక్కటి చీకటిలో....ఏకాకారంతో దివ్య జ్యోతిగా వెలుగుచున్న ఆ దైవాన్ని నేను సేవించెదను.. దీనులు..యోగులు....ఎందరెందరో..సర్వదిక్కుల యందును భవంతుడు కలడందురు..మరి అట్టి భగవంతుడు ఎన్ని విధముల ప్రార్దించినను రాకుండెను...అసలు ఉన్నాడో..లేడో..అనే సందేహము కలుగుతోంది ... పుట్టుక ..చావు లేని ఆ భగవంతుడు నా పాలనున్నాడో..లేడో..సందేహముతో సతమవుతూ ఉన్నా...రాకయున్నాడు కదా! దుష్టుల వలన బాధపడు సత్పురుషుల కాపాడు ఆ భగవంతుడు...ఈ మొసలి బారిన పడిన నన్ను గాచుటకు అడ్డం రాకున్నాడే...!ఇంద్రియములను గెల్చి...జ్ఞానదృష్టి తో తనను చూసేవారిని  తనకడకు చేర్చుకునేవాడు నా అవస్థలను కన్నులారాజూడకున్నాడే...!మాయావేషదారులై కపట భక్తి చూపించు వారికి ప్రత్యక్షము కాని  ఆ  భగవంతుడు.. నా దీనాలాపనలు ఆలకించకున్నాడే...! ప్రపంచమంతా తన రూపముగా కలిగి ఉండువాడును..సృష్టి ..స్థితి ..లయంబులు లేక సర్వ కాల సర్వ అవస్థలయందును వెలుగు వాడును ..తనను కొలుచు భక్తులు  విచారముతో తనను ధ్యానించినపుడు వారి ఆపదల బాపుచుండెడివాడును అయిన ఆ పరమేశ్వరుడు నా మొర ఆలకించి నన్ను రక్షించుటకు రాడేమి...నా అవస్థలచూడడేమి....వేగమే రాడేమి...! విశ్వమునకు సృష్టి కర్త అయినను....తాను ప్రపంచమునకు వెలుపల ఉండువాడు....ప్రపంచముచే నెరుగతగినవాడును..మాయాసంబందముచే ప్రపంచస్వరూపుడై ఉండి..ప్రపంచం బాసినప్పుడు..ప్రపంచమునకు తనకు ఏమి సంబంధము లేదు అనే రీతిలో.... తామరాకు మీద నీటి బిందువు వలెనుండువాడును ..నిత్యుడు...సృష్టి కర్తయగు బ్రహ్మను మించిన వాడు...పురుషులలో ఉత్తమ పురుషుడగు ఈశ్వరునే నేను  సేవించెదను... ఈశ్వరా...! నా చేతనయినంత వరకు ఈ మొసలితో పోరాడితిని..నాకున్న బలము పూర్తిగా పోయినది..నేను ఈ మకరమును జయించగలను అని తలచితిని..కాని ఆ దైర్యము బాసినది..ప్రాణములు పై పైనే పోవుచున్నవి..మైకం వస్తున్నది...అలసట తో దేహం వడలుచున్నది...ఇక నేను దీనితో పోట్లాడలేను..ఓ ఈశ్వరా! నీవుతప్ప నాకు ఎవ్వరును తెలియదు...నేనిదివరకు ఏదైనా అపరాధములు చేసి ఉంటే ..నన్ను మన్నించి ..ఓ భవంతుడా ! నా కడకు ఏతెంచి..నా ఈ భాధను  తొలగించి నన్ను కాపాడుము.. కమలాలే కన్నులుగా..కనిపించేటటువంటి వాడును...శత్రువుల పట్ల దయలేకుండా ఉంటూ..భక్తుల కోర్కెలు తీర్చువాడును...మునులు..పండితులచేత ధ్యానింప బడేవాడును..చక్కటి గుణంబు చేత శరణు అన్నవారాలకు కల్పవృక్షము వలె కాచు వాడును అయి ...యోగీంద్రుల మనసు హరించే శక్తి కలిగిన మహాప్రభావముతో ప్రకాశించు ఓ భగవంతుడా ! నిన్ను నే శరణు అంటూ వేడుకుంటిని..వేగమే రావయ్యా..నన్ను కాపాడు మయ్యా...స్వామి...!!   అల వైకుంఠపురంబులో..నగరిలో...ప్రధాన సౌధమందు ..కల్పవృక్షములు కలిగిన వనము నందలి అమృత సరోవర తీరమున చంద్రకాంతమణులు ..కలువలు పరచిన పాన్పు నందు శ్రీలక్ష్మిదేవితో వినోదభరితమగు హాస్య చతురులతో వ్యవహరించుచున్న  శ్రీమణ్ణారాయణమూర్తి తన భక్తుడగు గజరాజు దీనాలాపనలను వినినవాడై..దేవా ! కావుము..కావుము ..అనే ప్రార్ధనలను మన్నింప తత్తరపడుతూ..లేచినవాడాయేను ....   ఆవిధంగా శ్రీమన్నారాయణుడు తాను భక్త పరాధీనుడు కావున భక్తుడైన గజేంద్రుని ఆపద తొలగించుటకు అతని కాపాడ కోరి..బయలు దేరినాడు...లక్ష్మిదేవి తోనూ చెప్పక..శంఖు చక్రములను ధరించక ..భటులను తీసుకొనిబోక..జారినజుట్టును ముడివేయక....గరుడుని మీదనెక్కక ....లక్ష్మిదేవితో సరసముతో వాదులాడునప్పుడు పట్టుకొనిన పైటచెంగును కూడా విడువక అటులనే...పట్టుకొని ఆ శ్రీదేవి పైట చెంగును  ఈడ్చుకొనుచు బయలు దేరెను.. ముల్లోకాలను ఏలేటి వాడైనా... భక్త రక్షకుడగు శ్రీ మహా విష్ణువు తత్తరపాటుతో ఉరికురికి పోవుతున్నాడెందుకో అని కారణం తెలుసుకొన ...అతని సతిఅయిన శ్రీ లక్ష్మి అతనిని వెంబడించెను..ఆచ్చెరువుతో అంతఃపురము నందలి చెలులందరు..లక్ష్మిదెవి వెనుకబడిరి ..విస్మయము తో గరుత్మంతుడు...అతని వెనుక శంఖము ..చక్రము ..గద మొదలయిన ఆయుధములన్నియు వరుస పెట్టి వెనుకబడసాగినవి...నారాయణ...నారాయణ..అంటూ నారదులవారు...ఆవె నుక విష్వక్సేనుడు వస్తూనే ఉన్నారు...వారి వెంబడి వైకుంఠములో ఉన్న ఆబాలగోపాలము  ఒక్కరు కూడా తప్పక ...అందరు కదిలి వచ్చిరి... ఎక్కడికి వెళుతున్నాడో....ఏమి ఈ తొందరో...నా స్వామి అయిన శ్రీమహావిష్ణువు చెప్పడు..అనాధ స్త్రీలు రక్షించుమని కోరుకుంటున్నారో...!రాక్షసులు వేదాలను దొంగాలించారో...!అసురులు తిరిగి ఆ స్వర్గము పై దండయాత్ర చేసారో...!దుర్జనులు భక్తులను .”.ఏడి..మీ విష్ణువు” అని నిలదీసారో..! ఏ విషయము తెలియదు..ఆ విష్ణువు ఇంత వేగముగా వెళుతున్నాడు ..ఎందుకో...!! ఆ లక్ష్మిదేవి ..తన భర్త అయిన విష్ణు మూర్తి ..అలా అంత తొందరపాటుతో ఎచటికి ఏగుతున్నాడో.. తెలుసుకొన గోరి ముందుకు ఒక అడుగు పెట్టి..మళ్ళి సందేహముతో..తన ప్రశ్నకి అతడు బదులు చెప్పునో..లేదో అనుకుంటూ....అడిగిడనిది అయింది...అయినా తత్తరపాటుతో సంశయము తీర్చుకొనగోరి మరల ఒక అడుగు ముందుకు వేసి ..తీస్తున్నది..తిరిగి అటులే నిలిచిపోవుచు... దుష్ట శిక్షణ చేస్తూ రాక్షసులను సంహరించు వాడు..దయాసాగరుడు..యోగీంద్రుల హృదయములలో నిలిచి ఉండే వాడు..భక్తులకు తన మహిమల విభూతులను చూపెడివాడును ...ఆశ్రితులను ఎల్లపుడు కాపాడు వాడును...సర్వకాలములలో..నిత్య నూతన పెళ్లి కుతురువలె శోభిల్లు లక్ష్మిదేవికి  విభుడయిన ఆ శ్రీ మహావిష్ణువు ఆకాశమార్గాన పోవుచుండగా దేవతలు చూసారు.. అలా చూసిన దేవతలు...అదిగో..విష్ణువు...ఆవెనుక వచ్చేది...శ్రీ లక్ష్మిదెవి..ఆ వెనుక వచ్చేది గరుత్మంతుడు...అదిగో..ఆ వినిపించేదే...పాంచజన్యధ్వనియే..అని గ్రహించి...గజేంద్రమోక్షం గావించుటకు కదలినాడని తలచి ...ఆ శ్రీ మన్నారాయణుని స్తుతిస్తూ...”నమో నారాయణాయ “ అంటూ మ్రొక్కారు ... బాధతో విల విల లాడుతున్న ఆ గజేంద్రుని...రక్షించుటకు ..దయాళువగు విష్ణువు ..ఆ మకరమును ఖండిప ... వేగముగా పోయేదేకాక..భుమండలమంతా కదిలించేది..సూర్యని కంటే ఎక్కువ వెలుతురులతో మిణుగురులను రాల్చేది..పదునాలుగులోకములలో ..బ్రహ్మాండమునంతటా అడ్డంకులు లేక వ్యాపించేది..వేల్పులందరినీ తన శత్రువులనుండి కాపాడేది అయిన చక్రాయుధమును...ఆ మకరముపైకి పంపించాడు.. మేఱుపర్వతమువలె దేహముతో..అడవిలోని ఏనుగులనన్నిటిని భయపెట్టునదియు..ఎక్కువ కామ క్రోధములు కలదియు ...ఏనుగు యొక్క రక్తప్రవాహములో మునిగినదియయినా...ఇంకను పోరాడవలెనను దప్పికతో ఉండినదియు..ఎట్లైనా జయలక్ష్మిని వరించి ఏనుగును ఓడించ వలెనను పట్టుదలతో  ఉన్న ఆ మొసలియొక్క శిరసును ..ఆ సుదర్శన చక్రము ఖండించి ...ఆ మకరమును సంహరించెను.. రాహువుచే మ్రింగబడి మరల విడువబడిన చంద్రునివోలె.... బాధలు పడి ..విసిగి..వేసారి ..సంసారమును విడిచిన విరాగిని వలెను...ఆ గజేంద్రుడు..ఆ మొసలి బారిన పడిన పట్టునుంచి తప్పించుకొని..కాళ్ళు విదిలించి.. ఇతర గజేంద్ర రాణులు తమ తొండములతో జల్లిన నీటితో అలసట తీర్చుకొన్నదై...మిల మిల మెరుస్తూ..మిక్కిలి సౌందర్యంతో  వెలుగుచుండెను... అంతటనే...ఆ శ్రీమహావిష్ణువు..పాలసంద్రములో పుట్టినటువంటిదియు ...తన ధ్వనితో పంచభూతాలను కదిలించునదియు ..తెల్లని తెలుపుతో మెరియుచు నింద్రాదులగు దేవతలను కూడా భయపెట్టునదియు ..భక్తుల ఆపదలను తీర్చునదియు..శత్రువుల సేనలను దిక్కు దిక్కుదిక్కులకు తరుమికొట్టునదియు అయిన పాంచజన్యమును ఊదెను.. ఆ శ్రీమహావిష్ణువు  శంఖం పూరించునపుడు..దేవతల నగారాలు మ్రోగినవి....తామరపూల వాసనలతో మందమారుతము మంద్రముగా వీచినది... ముసురు పట్టినట్టు కురిసే పుష్పవర్షంలో...అప్సరసలు నాట్యం చేసారు.. జయ జయ ధ్వనులు అన్ని వైపులా  మ్రోగుతున్నాయి...పురుషుడగు సముద్రుడు..తన అలలచేతులతో..ఆకాశ వనిత యొక్క ముఖ కమలమును ముద్దాడ గోరెనో...అన్నట్టు..ఆ సముద్రపుటలలు...మిన్నంటి కెగసి..ఉప్పొంగుతున్నాయి... భయము తీరిన ఆ గజరాజు...విష్ణువుకు నమస్సులర్పించి..బడలిక విడిచి..ఇతర ఏనుగులతో కూడి..మిక్కిలి..మక్కువతో..ఆనందముగా ...వినువారి చెవులకు ఇంపు కలిగేలా ఘీంకారము చేసినాడు .. ఆ దేవదేవుడు...శ్రీమహావిష్ణువు దయకు పాత్రుడయిన గజరాజు బ్రతికి తిరిగి తమలో కలువగా..ఆడ ఏనుగులు అన్నియు..అనురాగము గలవై..తమ తొండములతో..తొండములను పెనవేసుకొని..ముచ్చటలాడు కున్నాయి.. “శ్రీ కృష్ణ మహిమ చాటే..ఈ ఘజేంద్ర మొక్షం కథ విన్నవారికి...చెడ్డ కలలు రావు..కీర్తి వృద్ది చెందుతుంది..మరియు...పాపముల పోగొడుతుంది..పరిశుద్దమయిన మనసుతో...ప్రతి రోజు ఉదయముననే లేచి ఈ కథను చదువు కుంటే...సకల ఐశ్వర్యాలు సమకూరటమే కాక సకల రోగాలు బాసి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు.. అట్టి వారికి అతి సులభముగా మొక్షం సంప్రాప్తిస్తుంది..”  అని విష్ణుమూర్తి ఆనందముతో తెలియజేసినాడు.. గజేంద్ర మొక్షం శ్రద్దతో..భక్తితో.. చదివే వారికీ ఆ గజేంద్ర మొక్షం గావించిన విష్ణు భగవానుడు...గుఱ్ఱములను..రధములను..(వాహనాలు)...(మేడలు ) మొదలగు ఇహపరములములగు సుఖములను అందించును...మోక్షము ప్రసాదించును..   “పాల సంద్రపు నురగల తేలుతూ...శేష శయనుడవై ..చిద్విలసముగా మందహాసము చేయుచు...శ్రీలక్ష్మి సిరుల సింగారాలను కొస చూపుల తడుముచు...సుతి మెత్తని ఆమె కరములతో....అతి సున్నితముగా మీ పాదాల నొత్తించు కుంటూ...ముల్లోకాలను..ఏక త్రాటిపై ఏలేటి అన్నిటికీ మూలాధారము అయిన శ్రీ మహావిష్ణుమూర్తి...శతకోటి వందనాలు...అనంత కోటి నీరాజనాలు...నమో..నమః...హరి..హరి...నమో..నమః....”   **********సమాప్తం*********    

No comments:

Post a Comment

Pages