పుణ్యవతి (నవల) - 1
రచన : గొర్తి వెంకట సోమనాథ శాస్త్రి(సోమసుధ)
@@@@@@@@@
భారతీయ పురాణాలు ఒకప్పుడు శక్తిగా పూజించిన స్త్రీ-పుణ్యవతి. పవిత్ర హిందూ కుటుంబవ్యవస్థలో ఒకనాడు కీలకపాత్ర వహించిందామె. రోజులు మారాయి! జిల్లాను శాసించే కలెక్టరైనా.. బేవార్సుగా తిని తొంగునే సోమరిపోతు భర్తకు కాళ్ళు వత్తాల్సిందేనన్నట్లు మార్చిపారేసిందీ సంఘం. కన్న తల్లిదండ్రులే తమ ఆడపిల్లను కెమెరా కళ్ళ ముందు అర్థనగ్నంగా నిలబెట్టి కుప్పిగంతులేయిస్తూ మురిసిపోతున్న కాలమిది.
ఇలా స్త్రీని వ్యాపారవస్తువుగా మార్చిన సమాజంలో, పొట్టకూటి కోసం రోడ్డు పక్కన బస్స్టాపులో నిలబడి ఉందా పుణ్యవతి. కుర్రచూపులు లొట్టలేసినా, వాహనాలు దుమ్ముకొట్టినా, అలా నిరీక్షించటం, తారసపడిన అభాగినులకు చేయూతనివ్వటం తన నలభై అయిదు సంవత్సరాల జీవనయానంలో ఆమె నేర్చుకున్న అలవాట్లు. సీత నిప్పుల్లో దూకినా, రాముడు భార్య కోరికపై పిచ్చివాడిలా బంగారుజింక కోసం పరిగెత్తినా, అది భార్యాభర్తల అవ్యాజానురాగానికి నిదర్శనం అని విశ్వసించే ఆమె ముందు, కంపెనీ బస్సు వచ్చి ఆగింది. పుణ్యవతి బస్సెక్కగానే, బస్సుతో పాటు ఆమె కథ కూడా ముందుకు కదిలింది.
@@@@@@@@@@
"ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇడస్ట్రియల్ డెవెలప్మెంట్" కార్యాలయంలోని మీటింగ్ హాలు సందడిగా ఉంది. ఉద్యోగులంతా ఆ హాలుని చేరుకొని, ఉల్లాసంగా జోకులేసుకొంటున్నారు. ఛైర్మన్ గారి రాకతో హలు సద్దు మణిగింది. ఛైర్మన్ గొంతు సవరించి సభను ప్రారంభించారు.
"సోదరులారా! ఈరోజు మనందరికీ పండగ!"
"మరి ఆఫీసుకి సెలవియ్యలేదేం?" వెనుకనుంచి ఎవరో అరిచారు.
ఆ కేకకు ఛైర్మన్ నవ్వుతూ, "తమ్ముడూ! ఇది ఇంటి దగ్గర చేసుకొనే పండుగ కాదు. మనందరం ఒకచోట కలిసి జరుపుకొనే పండగ!" అనాడు.
"ఏమిటో అది?" మళ్ళీ అదే కంఠం.
"పదిహేనేళ్ళ క్రితం ఈ ఆఫీసులో దిగువస్థాయిలో చేరిన శ్రావణిగారు మీకు తెలుసు. వారు స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ, ఇదే ఆఫీసులో ఫైనాన్షియల్ మేనేజరై, 'కృషితో నాస్తి దుర్భిక్షం' అన్న నానుడిని నిజం చేసారు. ఈ సందర్భంలో ఆమె నభినందిస్తూ, కృషికి రోల్ మోడల్గా నిలచిన వారికి ఉద్యోగినుల సంఘం తరఫున ఫ్లాట్ స్క్రీన్ కలర్ టి.వి.ని బహూకరిస్తున్నా!" అంటూ సభికుల హర్షధ్వానాల మధ్య శ్రావణికి టి.వి.తాలూకా కాగితాలను అందజేసారు. తరువాత కొంతసేపు అంచెలంచెలుగా ఎదిగిన ఆమె కృషిని వివరించి ఛైర్మన్ కూర్చున్నాడు. తరువాత ఆ ఆఫీసులో సీనియర్ మోస్ట్ సూపరింటెండెంట్ అయిన గురునాధం నిలబడ్డాడు. అతను తన ముందున్న బల్లపై గ్లాసులోని నీళ్ళు తాగి గొంతు సవరించాడు.
"ఛైర్మన్ గారికి, సభాసదులకు నమస్కారములు. ఈరోజు ఫైనాన్షియల్ మేనేజరైన శ్రావణి నా చిన్ననాటి స్నేహితుడు, యిదే ఆఫీసులో గుమాస్తాగా పనిచేసిన చలపతి భార్య. అతని భార్యగా ఆమె చాలా కష్టపడటం నా కళ్ళారా చూసాను. చలపతి చాలా మంచివాడు. కానీ మద్యపానం ఒక్కటే అతనికి ఉన్న దుర్గుణం. ఆ దుర్గుణమే అతన్ని మింగేసింది. కానీ చలపతి పోయాక శ్రావణి బాగుపడింది. ఒకనాడు ఈ ఆఫీసులో ప్యూన్గా చేరిన ఆమె, ఈరోజు ఫైనాన్షియల్ మేనేజరైనందుకు చాలా సంతోషిస్తున్నాను. అంతా మన మంచికేనంటారు. చలపతి బ్రతికుంటే, ఈమె ఈ స్థాయిలో గాక ఒక గృహిణిగా చాలా యిబ్బందులు పడుతూ బ్రతికేది. నీరందితేనే కద మొక్క పెరిగేది! ఏదేమైనా, ఈ స్థాయికి ఎదిగిన శ్రావణిని అభినందిస్తూ, దీనిపై తన స్పందనను తెలియజేయవలసినదిగా ఆమెను కోరుతున్నాను" అని కూర్చున్నాడు. సభలో గురునాధం వ్యాఖ్యలపై గుసగుసలు మొదలయ్యాయి. శ్రావణి నిలబడగనే సభ సద్దుమణిగింది.
"ఛైర్మన్గారు నా కృషిని పొగుడుతూ మాట్లాడారు. వారికి నా ధన్యవాదాలు. వారు కోరినట్లుగా ఈ ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి నా వంతు సాయం అందిస్తానని మాటిస్తున్నాను. ఇక గురునాధంగారు. మా ఊరి వారే! చిన్నప్పటినుంచి నా భర్త మంచిచెడ్డల్లో సమాన భాగస్తులు. అవసరకాలంలో నాకు సాయపడాలని చాలా తాపత్రయపడ్డారు. కానీ ఒక స్త్రీగా నాకున్న పరిమితుల వల్ల వారి సాయాన్ని పొందలేకపోయాను. క్షమించాలి."
"హియర్! హియర్!" అని ఎవరో అరిచారు. వేదికపై కూర్చున్న గురునాధం ఇబ్బందిగా కదిలాడు. శ్రావణి తన ప్రసంగాన్ని కొనసాగించింది.
"నా భార్తకు మద్యపానమనే దుర్గుణముందని వారు సెలవిచ్చారు. ఈకాలంలో అదసలు దుర్గుణమే కాదు. తాగిన వ్యక్తి మత్తులో కాసేపు చిందేసి నిద్రపోతాడు. ఆ రాత్రి భార్య కించిత్తు బాధపడినా, హాయిగా నిద్రపోతుంది. కానీ 'ద కింద య వత్తు లేని ' భర్తతో మాత్రం, అతని భార్యకి జీవితమంతా నరకమే! కంటి మీద కునుకుండదు."
"మదపానం చాలా పవర్ఫుల్ కదా!" వెనుకనుంచి ఎవరో అరవగానే సభలో జనం భళ్ళున నవ్వారు. గురునాధం సిగ్గుతో తలొంచుకున్నాడు. కొద్ది క్షణాల తరువాత శ్రావణి తన ప్రసంగాన్ని కొనసాగించింది.
"నా భర్త చనిపోయినందువల్ల నేను బాగుపడ్డానని వారు అభిప్రాయపడ్డారు. నా భర్త మనిషిగా నాతో లేకపోవచ్చు. కానీ నిత్యం నా మనసులో కొలువు ఉండి, నన్ను ప్రోత్సహించేవారని పాపం గురునాధం గారికి తెలియదు. పెద్దవారైన గురునాధంగారు నా కష్టాన్ని కొండంతలా ఊహించుకొని బాధపడుతున్నారని యింతగా చెప్పాను. ఇకనైనా నా కష్టాన్ని ఊహించుకొని అనవసరంగా తన ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని సభాముఖంగా వారిని కోరుతున్నాను. ఈ సందర్భంలో ఛైర్మన్గారి అనుమతితో నేనొక వ్యక్తిని సత్కరించదలిచాను" శ్రావణి మాటలకు గురునాధం హుషారుగా కాళ్ళూపసాగాడు.
"పర్మిషన్ గ్రాంటెడ్!" సభలో ఎవరో అరిచారు.
శ్రావణి చిరునవ్వుతో, "ధన్యవాదాలు!" అంది. ""మేడం పుణ్యవతిగారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను" శ్రావణి మాటలకు గురునాధం నీరుకారిపోయాడు.
శ్రావణి వేదిక దిగి, ప్రేక్షకులలో ముందువరుసలో కూర్చున్న పుణ్యవతి దగ్గరకెళ్ళి, ఆమె చేతిని పట్టుకోగానే, పుణ్యవతి ఉద్వేగంతో శ్రావణి చేతుల్లో ముఖం దాచి ఏడ్చేసింది. అనుకోని పరిణామానికి సభలోని వారంతా కంగారుగా నిలబడ్డారు. శ్రావణి వారందరినీ కూర్చోమని సైగజేసి, పుణ్యవతిని వేదికపైకి తీసుకొచ్చింది.
"మిత్రులారా! తాము చేసింది గోరంతైనా పాలకులు సైతం కొండంత చేసినట్లు గొప్పలు చెప్పుకొనే ఈ రోజుల్లో, తనకంటూ ఏ ఫలాన్ని ఆశించక నిస్వార్థంగా సంఘనిర్మాణంలో పాలుపంచుకొనే సంస్కర్త పుణ్యవతిగారు. వీరికి పేరుప్రతిష్టల కన్నా సంఘంలో మార్పే ముఖ్యం."
"నిప్పు కాదంటెండే!" ఎవరో మరల అరిచారు.
"ఔమల్ల! నిప్పు వంటకు పనికొస్తది. అలాగని నిర్లక్ష్యంగా తాకామా, కాలస్తది" మరెవరో వ్యాఖ్యానించగానే సభంతా నవ్వులతో నిండిపోయింది.
"నిజం!" శ్రావణి నవ్వుతూ అంది. "కష్టకాలంలో దేవుణ్ణయినా ప్రార్థిస్తే గానీ సాయమందదు. కానీ ఈమెలాంటి వారు అడగకుండానే సాయపడతారు. అలా కష్టకాలంలో నాకు స్ఫూర్తినిచ్చి, ఈనాటి నా ఎదుగుదలకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వీరు సాయం చేసారు. వారి సాయానికి ఉడతాభక్తిగా ఈ బంగారపు ఉంగరాన్ని బహూకరిస్తున్నాను. మేడం!" అంటూ బలవంతంగా పుణ్యవతి వేలికి ఉంగరాన్ని తొడిగిందామె. వేదిక దిగి వెళ్ళబోతున్న పుణ్యవతిని ఆపి, ఆమె సాయాన్ని శ్రావణి క్లుప్తంగా వివరించింది. పుణ్య కొద్దిక్షణాలు కన్నీటి పర్యంతమైంది. తరువాత మెల్లిగా సంబాళించుకొని, శ్రావణి చేతిలో మైకుని తీసుకొందామె.
"సభాసదులారా! నేను పెద్ద వక్తను కాదు. అందుకే క్లుప్తంగా ముగిస్తాను. శ్రావణి నా గురించి చాలా ఎక్కువ చెప్పింది. నేను ఆమెకు కేవలం మాటసాయం చేసానంతే! ఒక లక్ష్యంతో ముందుకెళ్తే జీవితంలో పైకి రాగలవని చెప్పాను. ఆమె నా మాటను మన్నించి పట్టుదలతో పైకొచ్చింది. మన సమాజం కానీండి, కుటుంబం కానీండి, శ్రమ విభజన సిద్ధాంతంపై నడుస్తాయి. అంటే ఒకళ్ళపై ఒకళ్ళు పెత్తనం చేయమని కాదు. అందరూ శ్రమను పంచుకొని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించమని. కానీ కొందరిలో రేగిన అధికార లాలస సంఘంలో పెత్తందారీ విధానానికి బాట వేసింది. నేను సమాజం గురించి మాట్లాడేటంత పెద్దదాన్ని కాదు. అందుకే ఆ విషయాన్ని వదిలేస్తున్నాను.. మన కుటుంబ వ్యవస్థలో వేళ్ళూనిన ఆ పెత్తందారీ విధానమే స్త్రీని అణగదొక్కేసింది. ఈ సందర్భంలో తెలుగువారు సగర్వంగా చెప్పుకోవలసిన విషయం ఒకటుంది. భారతదేశంలోనే తొలిసారిగా ఒక స్త్రీకి పట్టంగట్టి బ్రహ్మరథం పట్టిన జాతి తెలుగు జాతి. ఆ తెలుగుప్రజ తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేయక, శత్రువర్గాలకు సింహస్వప్నమై రాజ్యపాలన చేసిన వీరనారి రాణీ రుద్రమదేవి. ఈనాడు ఆడపిల్లను పిండరూపంలోనే అబార్షన్ చేసి తొలగించే ప్రబుద్ధులు ఉన్నారు. అలాంటిది పుత్రుడు లేకపోతే పున్నామ నరకానికి పోతామనే అంధవిశ్వాసం ప్రబలంగా ఉండే మధ్య యుగాల్లో, ఆడపిల్ల రుద్రమదేవికి మెరుగుపెట్టి, ఒక మహాశక్తిగా తీర్చిదిద్దాడు ఆమె కన్నతండ్రి గణపతిదేవుడు. ఒక స్త్రీకి సరైన చేయూత లభిస్తే, ఉన్నత శిఖరాలను అందుకోగలదని నిరూపించింది రుద్రమదేవి. అందుకే యిక్కడ ఉన్న వారందరికీ ఒకటే విజ్ఞప్తి. ఆడపిల్లను చులకనగా చూడకండి. స్త్రీలోని సృజనాతకతను వెలికిదీసేందుకే మన పూర్వీకులు ఉదయాన్నే స్త్రీలు గుమ్మంలో ముగ్గులేసే సంప్రదాయాన్ని పెట్టారు. మనం ఆడపిల్లను అణగద్రొక్కాలని చూడక, మన పెద్దల పంథాలోనే ఆ సృజనాత్మకతకు చేయూతనిద్దాం. అప్పుడామె ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తుంది. అలాగని ఆడపిల్లని పసితనం నుంచే తుచ్ఛమైన కళల పాల్జేసి, స్వల్ప సంపాదనలకు అలవాటు జేస్తే, జీవితంలో తమకు తగిలే ఎదురుదెబ్బలను తట్టుకోలేక , ఆ పిల్లలు తల్లిదండ్రులకు కన్నీళ్ళే మిగులుస్తారు. ఈనాడు ఏ ఛానల్ చూసినా, నృత్యాల పేరుతో లోకం తెలియని పసిపిల్లతో పిచ్చి సినిమా పాటలకు కుప్పిగంతులేయించి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. మేకప్పు, శిక్షణ వంకతో, దుష్టతలంపు గల మగవారు ఊహ తెలియని ఆడపిల్లలను తమ శరీరంపై ఎక్కడెక్కడో తాకుతుంటే, వారిలో కలిగే సంచలనాలను ఈ కన్నవారు ఆలోచించటంలేదు. ఆ పిల్లలు కూడా తెలియని భయంతో ఈ విషయాలను పెద్దలకు చెప్పలేకపోతున్నారు. భావిలో ఆ అమ్మాయి తీవ్రంగా నష్టపోతే, దానికి కారణం ఈ ప్రోత్సహించిన తల్లిదండ్రులు కాదా? అందుకే పసితనం నుంచి చక్కని దిశానిర్దేశం చేయవలసిన బాధ్యత తలిదండ్రులదేనని నొక్కి చెబుతున్నా. తరువాత గురునాధంగారు శ్రావణి ఏ స్థాయి నుంచి వచ్చిందో ఎంతో అభిమానంతో చాలా విపులంగా చెప్పారు. ఆయన చెప్పినట్లు, పదిహేనేళ్ళ క్రితం గురునాధంగారు హెడ్ గుమాస్తాగా ఉన్నప్పుడు, శ్రావణి అంతకన్నా చిన్నస్థాయిలో ఉండి ఉండవచ్చు. ఈ పదిహేనేళ్ళల్లో ఆయన సూపరింటెండెంట్ అయితే, శ్రావణి అంతకన్నా పైస్థాయికి ఎదిగింది. నీరందితేనే మొక్క పెరుగుతుందన్నారు. నీరందకపోయినా కలుపుమొక్క పెరుగుతుందన్న విషయం బహుశా ఆయన మరిచిపోయి ఉండవచ్చు. సీనియారిటీ వల్ల గురునాధం గారి హోదా పెరిగితే, స్వయంకృషితో శ్రావణి పైకెదిగింది. వీరిద్దరి పెరుగుదలలో నీరెంతవరకూ సహకరించిందో, ఎవరికి సహకరించిందో సభాసదులే నిర్ణయించాలి."
"మెత్తటి బాటా దెబ్బ ఈ కాటా దెబ్బ!" అని ఎవరో అనగానే వెనుక వరుసలోంచి చప్పట్లు మారుమోగాయి.
గురునాధం సిగ్గుతో తలవంచుకున్నాడు. సభ ముగియగానే ఉద్యోగులంతా వారి విభాగాలకు వెళ్ళిపోయారు.
@@@@@@@@@@@@
ఎంత పిలిచినా చలనం లేని పుణ్యవతి కళ్ళు మూసిందామె. మూసిన చేతులను కంగారుగా తప్పించి చూసింది పుణ్యవతి.
"ఎంతసేపైందే వచ్చి?" నవ్వుతూ అడిగిందామె.
"ఇప్పుడేనమ్మా! ఎదురుగా వచ్చి వికట్టాటహాసం చేసినా, అమ్మాయిగారి కనురెప్పలు మూతబడటం లేదు. వాటికి ఏమైందాని తడిమి చూస్తున్నా! ఏమిటో అంత పరధ్యానం?" సృజన ప్రశ్నకు చెమ్మగిల్లిన చెంపల్ని పుణ్యవతి తుడుచుకొంది.
"పరధ్యానం కాదే! పరవశం! పదిహేనేళ్ళ క్రితం ప్రయివేటుగా చదవటానికి నీ దగ్గరకొక అమ్మాయిని తీసుకొచ్చాను. గుర్తుందా?"
"ఆ! శ్రావణి కదూ! భర్త చనిపోయాడన్నావ్!"
"అవును! ఆమెనే! ఆమె చదువులో అంచెలంచెలుగా ఎదిగి ఎం.బి.ఎ. చేసింది. మా కంపెనీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణురాలై, ప్రస్తుతం ఫైనాన్షియల్ మేనేజరుగా పోస్టింగు తీసుకొంది. ఆ అభినందన సభలో, ఆమె నా వేలికి ఈ ఉంగరం తొడిగి పైకెత్తేస్తుంటే, తట్టుకోలేక ఏడ్చేసాను. మా స్టాఫంతా ఏమైందోనని కంగారుపడ్డారు."
"వాళ్ళే కాదు. ఉలుకూ, పలుకూ లేకుండా నువ్వు కూర్చుంటే, మేమూ కంగారుపడ్డాం. మీరు మాట్లాడరేమండీ?" సృజన ప్రక్కనున్న భర్తను అడిగింది.
రవి కొద్దిక్షణాలు కళ్ళు మూసుకొన్నాడు.
"పక్షం రోజులే ఉన్నా వెన్నెల - నింపిపోవు ఆశలెన్నో కన్నుల
ఉన్ననాడు చీకట్లో దీపిక! అమాసలో మదినుండే జ్ఞాపిక!"
"చూసావా? అప్పుడే ఈ పెద్దమనిషి కొటేషన్ కూడా కొట్టేసారు" సృజన మాటలకు ముగ్గురు నవ్వుకొన్నారు.
"అన్నయ్యా! ఆ సందర్భంలో నన్ను మాట్లాడమన్నారు. అంతకు ముందే, గుర్నాధమని మాకో విలనున్నాడ్లే! ఆయన శ్రావణి మొదట ప్యూనుగా ఆ ఆఫీసులో చేరిందని కించపరుస్తూ, ఏదేదో మాట్లాడారు. అంతేకాదు. 'నీళ్ళందితేనే మొక్క ఎదుగుతుందని ' కొటేషన్ కొట్టారు. నాకు ఒళ్ళు మండిపోయింది. 'సీనియారిటి వల్ల ఆయన అధికారి అయితే, శ్రావణి స్వశక్తితో ఎదిగి అధికారి అయిందని, నీరందకపోయినా కలుపు మొక్క పెరుగుతుందని, ఈ యిద్దరిలో కలుపుమొక్క ఎవరో తేల్చుకోవాలని ' నేను అనగానే జనం చప్పట్లు కొట్టారు. గుర్నాధం సిగ్గుతో కుచించుకుపోయారు."
పుణ్యవతి మాటలకు సృజన చీరకొంగుతో కళ్ళొత్తుకుంది.
"పుణ్యా! లోకంలో అందరూ తాము బాగుపడాలని దుర్మార్గాలు చేస్తారు. కానీ ప్రతిఫలం ఆశించకుండా పరాయివాళ్ళ ఆనందం కోసం నువ్వు కష్టపడతావు. లోకంలో మా ఆలోచనలు వేరు. నీవి వేరు. శ్రావణి కాదే, నిన్ను మొత్తం ఆడజాతే సత్కరించాలి."
"చూడన్నయ్యా! వదిన ఆనందకరమైన వాతావరణాన్ని విషాదం చేసేస్తోంది" బుంగమూతి పెట్టి రవికి ఫిర్యాదుచేసింది పుణ్య.
"అత్తయ్య కాదమ్మా! మన బ్రతుకుల్ని ఈ పెద్దమనిషి ఎప్పుడో విషాదం చేసేసాడు" అప్పుడే లోనికొచ్చిన సుధాకర్ కఠినంగా అన్నాడు. అతని గొంతు విని ముగ్గురూ అటువైపు తిరిగారు.
"ఏమిట్రా నువ్వనేది?" పుణ్యవతి కోపంగా అడిగింది.
"నిజం! నీకూ, నాకూ సంబంధించిన నిజం!"
సుధాకర్ అలా మాట్లాడటానికి కారణమేమిటో ముగ్గురికీ బోధపడలేదు. ఏదో జరిగింది! అదేమిటో మెల్లిగా తెలుసుకోవాలి.
"స్నేహితుడి పెళ్ళికెళ్ళావట! పెళ్ళి బాగా జరిగిందా?" సృజన విషయాన్ని మార్చాలని అడిగింది.
"ఆ! అక్కడే నా బాల్యం ఎంత బాగా జరిగిందో తెలిసింది" సుధ గొంతులో కాఠిన్యం తగ్గలేదు. రవి తెచ్చిపెట్టుకొన్న నవ్వుతో అతని భుజంపై ఆప్యాయంగా తట్టాడు.
"ప్రయాణంలో బాగా అలిసిపోయినట్లున్నావు! లోపలకెళ్ళి రిఫ్రెషై రా! తరువాత మాట్లాడుదాం."
"ఏం? ఈలోపు నాకు చెప్పటానికి మరో కథను అల్లుతారా?" సుధాకర్ ప్రశ్నకు పుణ్యవతి తట్టుకోలేకపోయింది.
"ఏంట్రా పేలావు?" అంటూ కొడుకు కాలరుని పట్టుకొని రెండు చెంపలు వాయించింది. "పెద్దంతరం, చిన్నంతరం లే. ."
సుధాకర్ ఆమె చేతిని విసిరికొట్టడంతో, పుణ్యవతి దూరంగా ఉన్న సోఫాలోకి తూలిపడింది. రవి, సృజన పరుగున అటు వెళ్ళి, ఆమెను లేపి సోఫాలో కూర్చోపెట్టారు.
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment