దూరపు కొండలు - అచ్చంగా తెలుగు

దూరపు కొండలు

డాక్టర్. బీ.యన్.వీ.పార్ధసారథి




సంధ్య , సుబ్బారావులు భార్యా భర్తలు. ఇద్దరూ డెబ్భైయో పడిలో ప్రవేశిస్తున్నారు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కొడుకు అమెరికా లో, కూతురు ఆస్ట్రేలియా లో స్థిరపడ్డారు. మనవళ్ళ పురుళ్ళకి, ఆతరవాత దాదాపు ఒక అయిదేళ్ళు వాళ్ళు కాస్త పెరిగి పెద్ద అయ్యేవరకు, ప్రతీ ఏడాది ఒక నాలుగైదు నెలలు సంధ్య, సుబ్బారావులు అమెరికాకి, ఆస్ట్రేలియా కి తరచూ వెళ్లి వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు కాస్త పెద్దవాళ్ళు అవటంతో ఏడాదికి ఒక రెండు నెలలు వుండి ఇండియాకి తిరిగి వస్తున్నారు. పిల్లలకి, మనవళ్ళకి తమ అవసరం అంతగా లేదని గ్రహించి, సంధ్య, సుబ్బారావులు ఇండియాలో తీర్ధయాత్రలు మొదలు పెట్టారు. మండు వేసవి తగ్గు ముఖం పట్టి ఇంకా కొన్నిరోజుల్లో వర్షాలు కురుస్తాయి అనగా, ఒకరోజు ఉదయం ఇంట్లో డాబా మీద వున్న పూల మొక్కలు, కాయగూరల చెట్లని సర్ది, డాబా మీద రాలిన ఎండుటాకులని, చెత్తని ఏరి పారేసే కార్యక్రమం మొదలుపెట్టారు సంధ్య, సుబ్బారావులు.

ఇటీవల సంధ్య కి బాగా సుస్తీ చేసింది. రెండు వారాలు హాస్పిటల్ లో వుండి వచ్చింది. కొడుకు, కూతురు రోజూ వీడియో కాల్ చేసి అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి పలకిరించేవారు. హాస్పిటల్ నుంచి సంధ్య ఇంటికి వచ్చాక  ఆ పలకరింపు ఇప్పుడు వారానికి ఒకసారికి పరిమితమయ్యింది. అప్పుడప్పుడు సంధ్య ఒంటరితనం అనిపించి కాస్త దిగులుగా వున్నట్టు కనిపిస్తే, సుబ్బారావు ఏ గుడికో తీసుకువెళ్ళి ఆమె మళ్ళీ మామూలు గా అవటానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు.

సంధ్య, సుబ్బారావులు డాబా మీద మొక్కలు సర్ది అంతా శుభ్రం చేస్తూ వుంటే వాళ్ళ పక్కిన్ట్లోంచి టీవీ లో డాక్టర్ చక్రవర్తి సినిమా లో వస్తున్న ఘంటసాల పాట , “మనసున మనసై , బ్రతుకున బ్రతుకై వినిపిస్తోంది. చరణం లో , “నిన్ను నిన్నుగా ప్రేమించుటకు , నీకోసమే కన్నీరు నించుటకు , నేనున్నాని నిండుగా పలికే తోడొక రుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము” అన్న పదాలు విన్నంతనే సంధ్య కళ్ళు చెమ్మగిల్లాయి. అది గమనించిన సుబ్బారావు ఆమె పొదివి పట్టుకుని, ఆప్యాయంగా తల నిమిరాడు. 

వీళ్ళ ఇంటి వెనకాల లేడీస్ హాస్టల్ నుంచి ఆ దృశ్యం గమనించిన ఒక అమ్మాయి , ‘ఈ వయసు లో కూడా  ఒకరిమీద ఒకరు ఎంతో ప్రేమతో ఉంటూన్నారంటే వీళ్ళు ఎంతో అదృష్టవంతులు! నా అమ్మానాన్నలు కూడా ఇలా వుంటే ఎంత బాగుండును!’ అని తలపోసింది.  ఆ అమ్మాయి పేరు అర్చన. అర్చన తల్లిదండ్రులు ఎప్పుడూ పోట్లాడుకుంటూనే వుంటారు. పెళ్ళయి పాతికేళ్ళ పైన అయినప్పటికీ ఇప్పటికీ తరచూ అలిగి తన పుట్టింటికి వెడుతూ వుంటుంది అర్చన తల్లి. అర్చన హైదరాబాద్లో లేడీస్ హాస్టల్ లో వుండి ఒక సాఫ్ట్వేర్ కంపనీ లో పని చేస్తోంది. అర్చన తల్లి దండ్రులు , తమ్ముడు తమన్ ఏలూరు లో వుంటున్నారు. తమ్ముడు తమన్ చిన్నవాడు ఇంటర్ చదువుతున్నాడు. తన తల్లిదండ్రులు కొట్లాడుకోకుండా, సఖ్యంగా వుండాలని అర్చన రోజూ హాస్టల్ దగ్గర వున్న శివాలయానికి వెడుతూ ఉంటుంది.

స్నానం చేసి ఆఫీస్ కి వెళ్లేముందు శివాలయానికి వెళ్లి తిరిగి వచ్చి టిఫిన్ చేసి హాస్టల్ లో లంచ్ ప్యాక్ చేయించుకుని వెడుతుంది అర్చన. శివాలయం లో రోజూ అర్చన కి హాస్టల్ పక్కిన ఇంట్లో ఉంటున్న నడివయస్కురాలు ఎదురవుతుంది. ఆమె పేరు నందిని. రోజూ గుడిలో ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఒకరినొకరు చిరునవ్వుతో పలకిరించుకుంటారు. అర్చన ని చూసినప్పుడల్లా నందిని, ‘ఈ పిల్ల ఎంతో అదృష్టవంతురాలు అని తలపోస్తుంది. నందినికి ఇరవై రెండేళ్లకే వివాహమయ్యింది. ఆమెకి ఇప్పుడు నలభై ఏళ్ళు. నందిని కి పదహేనేళ్ళ  కొడుకు వున్నాడు. తనకి చిన్నప్పుడే పెళ్లి అవటం వల్ల పెళ్లి కాని పాతికేళ్ళ ఆడ పిల్లలని చూసినప్పుడల్లా నందిని తాను ఆ వయసులోని సరదాలని కోల్పోయినట్టు భావిస్తుంది. ఇవాళ కూడా అర్చనకి గుడిలో నందిని కనిపించి చిరునవ్వు నవ్వింది.

నందిని గుడి నుంచి ఇంటికి తిరిగివస్తుండగా , నందిని వాళ్ళ పక్కింట్లో ఉంటున్న పద్మ అర్చన ని చూసి, ‘ ఈ నందిని ఎంతో అదృష్టవంతురాలు. ఆమెకి నలభై ఏళ్లకే పదహేనేళ్ళ కొడుకు వున్నాడు.‘ అని తలపోసింది. పద్మకి  వివాహమై పదేళ్ళయినా పిల్లలు లేరు. ఆమె మొక్కని రాయి లేదు, వెళ్ళని క్షేత్రం లేదు.    

ఉదయం డాబా మీద మొక్కలు సర్ది అంతా శుభ్రం చేస్తూవుండగా డాక్టర్ చక్రవర్తి సినిమా లో ని పాట, “మనసున మనసై...” విన్నప్పటినుంచి సంధ్య ఆ రోజంతా ఉదాసీనంగానే వుంది. మధ్యాన్నం టీ తాగుతుండగా , “మన వెనక వీధిలో వున్న పద్మ నిజంగా అదృష్టవంతురాలు. తనకి పిల్లలు లేరు. మనం పిల్లలు వుండీ లేని వాళ్ళ మయ్యాము. చివరికి మనం చస్తే తలకొరివి పెట్టడానికైనా మన పిల్లలు వస్తారో రారో !” అంది భర్త సుబ్బారావు తో.

“ప్రతీ మనిషికీ జీవితం లో సుఖ దుఖాలు, వెలుగు నీడలు రెండూ జంటగానే వుంటాయి. కానీ చిత్రం ఏమిటంటే ప్రతీ మనిషి కూడా తానొక్కడే కష్టాలు పడుతున్నట్టు, ఇతరులు సుఖంగా వున్నట్టు భావిస్తాడు. సంఘంలో ఒకరిగా మసలాలి కాబట్టి ప్రతీ వ్యక్తీ నవ్వుతూ కనిపిస్తాడు. లోలోన ప్రతీ వ్యక్తికీ ఏదో ఒక అపశ్రుతి అతని జీవితం లో వుంటుంది. పైకి కనిపించేవి అందమైన దూరపు కొండలు. దగ్గరగా వెళ్లిచూస్తే ఎత్తు పల్లాలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళ చెట్లు కనిపిస్తాయి. ఒక విధంగా మనం అదృష్టవంతులం. అన్ని బాధ్యతలు తీరిపోయాయి. ఎవరిమీదా ఏవిధంగాను ఆధార పడకుండా మనమంతట మనం జీవిస్తున్నాం. మన జీవిత చరమాంకం లో వైరాగ్యం అలవరచు కుంటే సుఖదుఃఖాలకి అతీతంగా ఉండగలం. అదే శాశ్వతమైన ఆనందం. అన్నాడు సుబ్బారావు.    

 

 ***

    

No comments:

Post a Comment

Pages