అత్యంత పవిత్రం గురూచ్చిష్టం - అచ్చంగా తెలుగు

అత్యంత పవిత్రం గురూచ్చిష్టం

Share This

అత్యంత పవిత్రం గురూచ్చిష్టం

 సి హెచ్ ప్రతాప్


శ్రీ సాయినాధుని అవతారం మహోత్కృష్ట మైనది, ఆయన మార్గ దర్శకత్వం విభిన్నమైనది. భక్త సులభుడు, భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం ,కామధేనువు అయిన శ్రీ సాయి వంటి అవతారం ఇంతవరకు రాలేదు, నభూతో : నభవిష్యతి అన్నట్లుగా ఇక మీదట రావడం అత్యంత దుర్లభం. అందరూ కలియుగ గురువుల వలె యోగ సాధనలు చేయించడం, మంత్రోపదేశం చేయడం, గ్రంథ రచనలు గావించడం, జీవాత్మ, పరమాత్మ గురించి, ఆత్మ సాక్షాత్కారం గూర్చి ప్రవచనాలు చేయడం ఏనాడూ చేయలేదు. సకల వేద సారాన్ని, ఉపనిషత్తుల సారాంశాన్ని చిన్న చిన్న లీలల ద్వారా కధల ద్వారా భక్త జనావళికి సుళువుగా అర్థమయ్యేటట్లు బోధించిన అసామాన్య సద్గురు మూర్తి శ్రీ సాయినాధుడు.


కుశాభావు అనే టీచర్ ఒక సాధువును ఆశ్రయించి శశ్రూషలు చేసాడు. అందుకు సంతోషించిన ఆ సాధువు కుశాభావుకు ఒక మంత్రం నేర్పాడు. ఆ మంత్ర ప్రభావం వలన పండ్లు, మిఠాయిలు వంటి పదార్ధాలను అతను సృష్టించగలిగేవాడు. ఆ సంగతి తెలుసుకున్న ప్రజలు కుశాభావు చుట్టూ చేరి విసిగించసాగారు. అంతే కాక అతనొక మంత్రగాడని విమర్శిస్తూ, తమ సమాజం నుండి వెలివేసారు.


ఇందుకు ఖిన్నుడైన కుశాభావు తిరిగి ఆ సాధువును ఆశ్రయిస్తే “ నీకు సంప్రాప్తించిన విద్యను తిరిగి వెనక్కి తీసుకునే శక్తి నాకు లేదు. నువ్వు తక్షణం శిరిడీ వెళ్ళి సాయిబాబాను శరణు పొందు, నీకు మేలు కలుగుతుంది” అని సలహా ఇచ్చాడు. ఆ ప్రకారమే 1909 వ సంవత్సరం లో కుశాభావు శిరిడీ చేరాడు కాని శ్రీ సాయి అతనిని మశీదు లోనికి రానివ్వలేదు. “ ఆత్మ జ్ఞానం ద్వారా సంక్రమించిన శక్తులు లోకహితం చేస్తాయి.మంంత్ర తంత్రాల ద్వారా వచ్చిన శక్తులు మనకేకాక ఇతరులకు కూడా హాని చేస్తాయి. కనుక ఇటువంటి శక్తులను పొందడం మంచిది కాదు. ఇటువంటి వారు వేశ్యలతో సమానం. వారికిక్కడ ప్రవేశం లేదు. గోదావరీ నదిలో స్నానం చెసి , ఆ శక్తులను అక్కడే విడిచి రా !” అని శ్రీ సాయి ఖచ్చితం గా చెప్పేసారు. 


కుశాభావు ఆ ప్రకారమే చేసాక, శ్రీ సాయి అతని చేత దాస బోధ అనే అధ్యాత్మిక గ్రంధాన్ని చదివించారు. ఆ తర్వాత శ్రీ గురు చరిత్ర అనే గ్రంధాన్ని 108 సార్లు పారాయణ చేయించారు. ఒక రోజు ఏకాదశీ పర్వదినాన కుశాభావు ఉపవాసం చేస్తున్నాడు. ప్రసంగ వశాత్తూ బాబాతో పూర్వం ఋషులు కందమూలాలు తిని బ్రతికేవారని అన్నాడు.వెంటనే శ్రీ సాయి తన వద్ద వున్న కొన్ని ఉల్లిగడ్డలను ఇచ్చి తినమన్నారు. కుశాభావు కు ఏం చెయ్యాలో తోచలేదు. చివరకు శ్రీ సాయి తింటే తానూ తింటానన్నాడు.వెంటనే శ్రీ సాయి కొన్ని ఉల్లిగడ్దలను తిని , చుట్టూ వున్న భక్తులతో « ఈ బ్రాహ్మణుడిని చూడండి ! ఏకాదశి పూట ఉల్లిపాయలను తింటున్నాడు » అని గేలి చేశారు. 


కుశాభావు వారితో శ్రీ సాయి ఆదేశిస్తేనే నేను తిన్నాను అంతే తప్ప నేను ఆచారం తప్పలేదు “ అని అన్నాడు. శ్రీ సాయి అందుకు అంగీకరించక తాను తిన్నది కక్కి చూపారు. ఆశ్చర్యం ! అందులో కందమూలాల ముక్కలు వున్నాయి గాని ఉల్లిగడ్దలు మచ్చుకైనా లేవు. కుశాభావు వెంటనే శ్రీ సాయి కక్కిన దానిని మహా ప్రసాదం గా భావించి గబ గబా తినేసాడు. 


శ్రీ సాయి అతనిని తిట్టి,తన సటకాతో కొట్టి వారించారు కానీ కుశాభావు వినలేదు.గురూచ్చిష్టం (గురువు ఎంగిలి) అత్యంత పవిత్రమైనదని సకల వేదాలు ఘోషిస్తున్నాయి.ఇటువంటి అవకాశం మరిక రాదని కుశాభావు కు తెలుసు. ఆతని భక్తి శ్రద్ధలకు బాబాకు ఆనంద బాష్పాలు కారాయి. వెంటనే అతనిని కౌగలించుకొని ఆశీర్వదించారు. అంతే కాక " ఎప్పుడూ నువ్వు నన్ను స్మరించినా ఈ ద్వారకామయి లోని ఊదీ నీ చేతి లోనికి వస్తుంది. కష్టాల కడలిలో వున్న వారికి, రోగ గ్రస్తులకు, ఈ ఊదీని ప్రసాదం గా ఇచ్చి వారికి ఉపశమనం కలుగజేయుము"» అన్న ఒక గొప్ప వరం ఇచ్చారు. నాటి నుండి కుశాభావు జీవితం లో ఒక నూతన అధ్యాయం మొదలయ్యింది.


.గురువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణం గా పొందగలిగిన అతను శ్రీ సాయి భక్తులలో  శ్రేష్టుడయ్యాడు. అధ్యాత్మికం గా ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగాడు. దేశమంతటా పర్యటిస్తూ, శ్రీ సాయి దివ్య లీలా వైభవం పై ఉపన్యాసాలను ఇస్తూ , దీన జనులకు , అభాగ్యులకు శ్రీ సాయి ఉదీని ఇస్తూ వారి వారి పాపాలను కష్టాలను దూరం చేస్తూ చివరలో శ్రీ సాయిలో ఐక్యం అయ్యాడు. 


ఒక సామాన్య టీచర్ కొన్ని క్షుద్ర విద్యలు అభ్యసించి, చెడు మార్గం పట్టినప్పుడు, వానిని పిచ్చుక కాలికి దారం కట్టి లాగిన విధం గా తన వద్దకు రప్పించుకొని, సద్గ్రంధ పఠనం తో, దివ్య నామ జపం తో పవిత్ర మొనరించి, అతనికి ఎవ్వరికీ దక్కని విధం గా తన గురూచ్చిష్టాన్ని ప్రసాదించి అధ్యాత్మికోన్నతి ప్రసాదించి, సంస్కరించిన వైనం అద్భుతం, అపూర్వం, అద్వితీయం. అందుకే గురువులలో కెల్లా కోహినూర్ వజ్రం వంటి వారు మన సాయినాధులు అంటే అతిశయోక్తి కాదు. ఈ లీల ద్వారా శ్రీ సాయి శ్రీ గురుచరిత్ర గ్రంధం యొక్క విశిష్టతను కూడా అత్యద్భుతమైన రీతిలో భక్తలోకానికి తెలియజేసారు. ఆ గ్రంధాన్ని 108 సార్లు పారాయణ చేయంచాకనే శ్రీ సాయి కుశాభావుని అనుగ్రహించారు. అట్లే అనేక సందర్భాలలో  ఈగ్రంధం యొక్క వైశిష్ట్యాన్ని చెబుతూ దానిని నిత్య పారాయణ చేయమని భక్తులకు సలహా ఇస్తుండేవారు. అనేకమంది సాధకులకు ఉన్నత అధ్యాత్మిక అనుభూతులు కూడా ఈ గ్రంధం వలన లభించాయని  ఎన్నో ప్రమాణాలు వున్నాయి. కాబట్టి గురు భక్తులకు శ్రీ సాయి సచ్చరిత్రతో పాటు శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా చేయడం మంచిది.


సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణ మస్తు!


***

No comments:

Post a Comment

Pages