కనకదాసులు - అచ్చంగా తెలుగు

  కనకదాసులు

ఆదూరి హైమవతి   

   

ఒకానొక సమయంలో వైకుంఠం లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి తీరిగ్గా హాస్య సంభాషణ చేసుకుంటున్న సందర్భంలో అక్కడికి వారి దర్శనార్ధం  నారద  మహర్షి వస్తాడు. "  నారాయణాయ! నారాయణ! " అని నమస్కరిస్తాడు. 

" ఏం నారదా! ఊరక రారు మహాత్ములని నీ దర్శనానికి ఏదో ఉద్దేశ్యం ఉండే ఉంటుంది.చెప్పు మరి " అంటాడు విష్ణుమూర్తి.

 "స్వామీ ! అదేంలేదు, తమ దర్శనం కోసం మాత్రమే వచ్చాను, తమర్ని దర్శించి చాలాకాల మైంది కదా " అని చెప్తాడు. 

"ఔను నీకెప్పుడూ ఆయన స్మరణే కదా!సరే ఎటూవచ్చావు గనుక మహర్షీ! ఈ కలియుగంలో మా ఇద్దరిలో 'ఎవరు గొప్ప' అని భూలోక వాసులు అనుకుంటున్నారో చెప్పు. " అని అడుగుతుంది లక్ష్మీదేవి. 

" తల్లీ! మన్నించండి, విడవమంటే పాముకు కోపం, మింగమంటే కప్పకు కోపమని, మీ ఇద్దరి లో ఎవరు గొప్పో చెప్పడం నా వల్లే మవుతుంది తల్లీ !" అంటాడు. 

"కాదు నారదా! ఈ విషయం స్పష్టంగా తేలాలి. ఎప్పుడు చూసినా 'నారాయణ! నారాయణ!' అంటూ నిరంతరం ఈయన స్మరణ చేస్తుంటావ్ తప్ప,ఏనాడైనా 'నమో లక్ష్మీ మాతా ! ' అన్నావా! "  అంటుంది కోపంగా. 

దానికి నారదుడు గడగడా వణుకుతూ  "తల్లి! మన్నించండి ! ఏదో అలా అలవాటైంది. తమ అను గ్రహం లేందే లోకంలో ఆకైనా కదలదు కదమ్మా! తమ దయతోనే కదా మానవులకంతా తిండి,బట్ట, నీరు లభిస్తూ జీవిస్తున్నారు. మీరు క్రీయాశక్తి కదా  తల్లీ!" అని ప్రార్ధిస్తాడు.

"ఏమైనా నారదా ! ఈ రోజు మాఇద్దరిలో ఎవరు గొప్పో తేలిపోవాల్సిందే! " అంది మాత పట్టుదలగా. "సరే ! నారదా! ఈమె మాట ఎందుకు కాదనాలి? నా నామ స్మరణ వలన స్వర్గలోక ప్రాప్తి తప్పక లభి స్తుందని భూలోకంలో నేనే స్వయంగా వెళ్ళి ప్రచారం చేసి నిరూపిస్తాను. దీనికి నీవే సాక్షి."అంటాడు. 

 " నారాయణ నారాయణా ! స్వామీ! అర్భకుడ్ని నన్ను మీ మధ్య ఇరికించ కండి పసివాడ్ని."అంటాడు నారదుడు భయంతో. 

"నారదా! దీన్లో నీవు చేసేదేం లేదు. కేవలం ఒక సాక్షిగా మాత్రమే ఉంటావు. ముందుగా నేను భూలోకంలో కర్ణాటక రాజ్యంలోకి వెళ్ళి  అక్కడి పల్లె ప్రాంతా ల్లో తూర్పు వైపునుంచీ సంచరిస్తాను. దేవి లక్ష్మి నే వెళ్ళాక కొంతకాలం ఆగి పడమర పల్లెలనుంచీ  సంచరిస్తుంది. నీవు ఇరువైపులా తిరుగుతూ మా ఇద్ద రి గురించీ ఎవరెలా చెప్పుకుంటున్నారో చెప్తేచాలు. "అంటూ లేచి వేషం మార్చుకుని ఒక సాధారణ హరికధలు చెప్పే పండితునిలా బయల్దేరి వెళ తాడు. నారదుడూ అనుసరిస్తాడు.  కొద్ది సమయం తర్వాత లక్ష్మీ మాత కూడా లేచి ఒక వృధ్ధ ముత్తైదువులా తయారై వెళుతుంది. 

నారప్ప అనే పేరుతో విష్ణు మూర్తి పల్లెల్లో సత్సం గాలు చేస్తూ , ఉపన్యాసాలు చెప్తూ, భక్తిగీతాలు పాడుతూ ఒక్కో గ్రామంలో ఒక్కోరోజు ఉంటూ తిరుగు తుంటాడు.గ్రామ ప్రజలంతా ఆయన నామామృతాన్ని వింటూ ఆనందంతో సంపూర్ణ భక్తి భావంతో ఆయన పాదాక్రాంతులై పోయి ఆయనకు కమ్మని భోజ న, వసతి సదుపాయాలు చేస్తూ , ఆయన మాటలను అనుసరించి పేదలకు అన్నదానాలుచేస్తూ భక్తి భావనలో మునిగి పోయారు. 

       ఇహ లక్ష్మీమాత 'మంగళ దేవి' అనేపేరుతో ఒక గ్రామంలోని ఒక ఇంటి ముందు నిల్చి లోపలి వారిని పిలుస్తుంది .ఆ ఇంటి గృహిణి బయటికి రాగానే  మాత ఆమెతో " ఈరోజు నాకు బిక్ష ఏర్పాటు చేస్తారా? " అని అడుగుతుంది.ఆ ఇంటిం ఇల్లాలు లక్ష్మీ కళ తో మెరిసిపోతున్న ఆమెను లోనికి ఆహ్వానిస్తుంది.  మాత " అమ్మా! నాకో నియమం ఉంది నేను ఇతరులు భుజించిన పాత్రల్లో భుజించను. అందువల్ల నా భోజనపాత్ర , దాహం కోసం గ్లాసు నేనే తెచ్చుకు న్నాను. వీటిలోనే నేను భుజిస్తాను. దీనికి అభ్యంతరం లేక పోతేనే మీ ఇంట భుజిస్తాను " అంటుంది. దానికా గృహిణి " తల్లీ! మీ ఇష్టం. మేము పేదలం , మా ఇంట కొత్త పాత్ర లేవీ లేవు. రండి తల్లీ!" అంటూ లోనికి తీసుకెళ్ళి పీట వేసి కూర్చో బెడుతుంది. మాత తన భుజాని కున్న సంచీలోంచీ ఒక బంగారు భోజన పళ్ళెరము, ఒక బంగారు మర చెంబు, గ్లాసు తీసుకుని వాటిల్లోనే భోజనం చేసి , వాటినక్కడే వదలి వెళ్ళి పోతుంది.  

   అలా మాత ఒక్కోరోజు ఒక్కో ఊర్లో  సంచరిస్తూ భుజిస్తూ  వెళు తుంటుంది . ఈ విషయం అలా అలా రాజ్య మంతా వ్యాపించి అంతా ఆతల్లి రాక కోసం ఎదురుచూస్తూ ,ఆమె ఎక్కడుందో  విచారించి తెల్సుకుని ఆమె ఉన్న పల్లెకు వచ్చి ఆమెను ఆహ్వానించి తీసుకెళ్ళసాగారు.తమగ్రామానికి రమ్మని అమ్మను ఆహ్వానించిన వారికి ఆమె " అయ్యలారా!మీ గ్రామాల్లో ఒక పండుతుల వారు తిరుగుతున్నారని వినికిడి, ఆయన్ను మీగ్రామం లోంచీ పంపేస్తేనే  నేను మీ గ్రామానికి వస్తాను. ఇది నా నియమం. "అంటుంది.   

దాంతో క్రమేపీ నారప్ప సంచరిస్తున్న గ్రామాల్లో వారంతా నారాప్ప వచ్చినా చూడనట్లు పలకరించకుండా ఉంటూ, వారంతా మాత కు ఇచ్చిన మాట కోసం  నారప్పను తమ గ్రామాల వైపైనా రానివ్వక  తరిమేస్తూ , మాత ను ఆహ్వా నించ సాగారు. అలా ఆ పల్లెల్లో సంచరించి ,కొద్దికాల మయ్యాక మాత వైకుంఠం చేరుతుంది. అప్పటికే విష్ణుమూర్తి అక్కడ శేష శయనుడై చిద్విలా సంగా విశ్రాంతి పొందుతుంటాడు. 

మాత నవ్వి " ఏం స్వామీ ! ఎవరు గొప్పో తెలిసిందికదా! " అంటుంది.                                          నారదుడు వచ్చి " తల్లీ ! తమరే గొప్ప . స్త్రీ శక్తి అమోఘం తల్లీ ! స్త్రీ శక్తి ముందు ఏశక్తీ  సరి కాదమ్మా ! ప్రజలంతా కేవలం ధనదాసులయ్యారు. స్వామి వారు చెప్పేమంచిమాటలు వినేవారేలేరు తల్లీ నేడు భూలోకంలో .ఇదికలి యుగం తల్లీ కనకయుగం.అంతా కనకంవేపే చూపుత్రిప్పుతారుకానీ ,నీతి బోధ లు తల కెక్క వమ్మా! అంతాకనకదాసులే !క్రీయాశక్తి స్వరూపిణివైననీవే గొప్ప తల్లీ ! .చూసింది చెప్పాను నారాయణా నాపై కోపించకు ప్రభూ! " అంటాడు. 

లోకంలో అంతా ధనాన్ని అభిమానించినట్లు పుణ్య సంపాదన వైపు మనస్సు పెట్టరుకదా!    

                                                  **********                                      

No comments:

Post a Comment

Pages