పశ్చిమ గోదావరి జిల్లాలో సినీరంగ ప్రముఖులు - అచ్చంగా తెలుగు

పశ్చిమ గోదావరి జిల్లాలో సినీరంగ ప్రముఖులు

Share This

పశ్చిమ గోదావరి జిల్లాలో సినీరంగ ప్రముఖులు

పోడూరి శ్రీనివాసరావు


గతంలో మనం తూర్పుగోదావరి జిల్లాలోని సినీరంగ ప్రముఖులు కొందరి గురించి తెలుసుకున్నాము. ఇపుడు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని సినీరంగ ప్రముఖులు కొందరి గురించి తెలుసుకుందాము.
పశ్చిమ గోదావరి జిల్లా అనగానే నటుల్లో – కృష్ణంరాజు, అల్లురామలింగయ్య, మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు,రామచరణ్,అల్లుఅర్జున్,ప్రభాస్,అల్లుఅరవింద్,అల్లు శిరీష్,పవన్ స్టార్ పవన్ కళ్యాన్,సునీల్, సుబ్బరాజు,నరసింహరాజు, MS నారాయణ, శివకృష్ణ,శివాజీరాజా,రాజారవీంద్ర మొదలైనవాళ్లు; దర్శకుల్లో-దాసరినారాయణ రావు, కోడిరామకృష్ణ,EVV సత్యనారాయన్,కృష్ణవంశీ, వి.వి.వినాయక్,శ్రీకాంత్ అడ్డాల,త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి; నిర్మాతల్లో- చేగొండి హరిరామజోగయ్య,D.V.S.రాజు, అర్జునరాజు; రచయితల్లో-రసరాజు, గేయరచయిత అనంత్ శ్రీరాం, శివదత్త, విజయేంద్రప్రసాద్;గుణ్ణం గంగరాజు (ఈయన రచయితే గాక, నిర్మాత, దర్శకుడు కూడా);సంగీత దర్శకుల్లో-కీరవాణి, కళ్యాన్ మాలిక్, శ్రీలేఖ.... ఇంకా కాంచి మొదలైన అనేక మంది ప్రముఖులున్నారు.
          వీరు గురించి, ఒక్కొక్కరుగా, వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
          మొదటగా-సినిమాకు-కెప్టెన్ లాంటి వాడైన కొందరు ప్రముఖ దర్శకుల గురించి తెలుసుకుందాము.
1.దాసరి నారాయణరావు:
దర్శకరత్న దాసరినారాయణరావు 04.05.1944వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని వాణిజ్యకేంద్రమైన ‘పాలకొల్లు’లో జన్మించారు. నటుడిగా, నిర్మాతగా,దర్శకుడిగా,మాటల రచయితగా, పాటలరచయితగా బహుముఖప్రజ్ఞాశాలి శ్రీ దాసరి నారాయణరావు. ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రాలలో ఎక్కువభాగం సాంఘిక అన్యాయాలపై జరిపిన పోరాటం అవినీతిపై జరిపిన పోరాటం, స్త్రీ పురుష వివక్షతలపై జరిపిన పోరాటం-ఇలా దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలపైనే ఎక్కువగా దృష్టి సారించి సినిమాలు తీసారు. శ్రీ దాసరి సుమారు 150  సినిమాలకు దర్శకత్వం వహించారు. సుమారు 50కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 250 కి పైగా సినిమాలకు రచయితగా, సంభాషణల కర్తగా, స్క్రీన్ ప్లే రచయితగా పనిచేశారు. విద్యార్ధిదశలో కూడా, బి.ఎ. చదువుతున్న కాలంలో కూడా అనేక నాటకాలలో పాల్గొన్నారు.
2 జాతీయ పురస్కారాలను, 9 రాష్ట్ర బహుమతులను, 6 ఫిల్మ్ ఫేర్ (సౌత్) అవార్డులను గెలుచుకున్నారు. అనేక తెలుగు తమిళ, కన్నడ చిత్రాలలో నటుడిగా పాత్రలు పోషించారు. శ్రీ దాసరి మోహన్ బాబు, ఆర్.నారాయణమూర్తి వంటి నటులను,రవిరాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య వంటి దర్శకులను చిత్రరంగానికి పరిచయం చేశారు. తరువాత వాళ్ళెంత గొప్పనటులుగా, దర్శకులుగా ఎదిగారో తెలియంది కాదు.
రామోజీరావు స్థాపించిన ‘ఈనాడు’ దినపత్రికకు పోటీగా ‘ఉదయం’ పేరుతొ దినపత్రికను ప్రారంభించి కొన్నాళ్లపాటు దిగ్విజయంగా నడిపినప్పటికీ తదనంతరం ఆ ‘ఉదయం’దినపత్రిక మూతపడింది.
శ్రీ దాసరినారాయణరావు దర్శకత్వం వహించి కొన్ని చిత్రాలు:
తాతామనవడు;సంసారం-సాగరం;బంట్రోతు భార్య; రాధమ్మ పెళ్లి; తిరుపతి;స్వర్గం-నరకం;బలిపీఠం ;దేవుదేదిగివస్తే;మనుషులంతా ఒక్కటే; ఓ మనిషీ తిరిగిచూడు;తూర్పు-పడమర;బంగారక్క;చిల్లరకొట్టు చిట్టెమ్మ;ఇదెక్కడి న్యాయం;దేవదాసు మళ్లీ పుట్టాడు;కటకటాల రుద్రయ్య;శివరంజని;అభిమన్యుడు;జస్టీస్ చక్రవర్తి;ఏడడుగుల బంధం;లంచవతారం;ఆదిదంపతులు;తాండ్రపాపారాయుడు;బ్రహ్మనాయుడు;మజ్ను;హిట్లర్;విశ్వనాథనాయకుడు;సూరిగాడు;మామగారు;కుంతీపుత్రుడు;సీతారాములు;సర్దార్ పాపారాయుడు;ఏడంతస్తుల మేడ;బుచ్చిబాబు;సర్కస్ రాముడు;మేఘసందేశం;ప్రేమాభిషేకం;కంటే కూతుర్నికను;పరమవీరచక్ర;పాడవులు పాడవులు తుమ్మెద; గోరింటాకు; లంకేశ్వరుడు;ఎర్రబస్...మొదలైనవి.
శ్రీ దాసరి నారాయణరావుగారు ఆంద్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవడాక్టరేట్ “కళాప్రపూర్ణ” సత్కారం పొందారు.
వీరు సంపాదించిన అవార్డులు-జాతీయస్థాయి అవార్డులైతే నేమి, నంది అవార్డులైతేనేమి,ఇతర సంస్థల అవార్డులైతేనేమి కోకొల్లలు.
అందులో కొన్ని:
  1. ఎక్కువ సిమాలకు దర్శకత్వం వహించినందుకు “లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్”
  2. మేఘసందేశం, కంటే కూతుర్ని కను-చిత్రాలకు జాతీయస్థాయి పురస్కారం
  • ఫిల్మ్ ఫేర్ అవార్డులు:
  1. ఉత్తమ దర్శకుడు –గోరింటాకు-1979
  2. ఉత్తమ దర్శకుడు-ప్రేమాభిషేకం-1982
  3. ఉత్తమచిత్రం-మేఘసందేశం-1982
  4. ఉత్తమ దర్శకుడు-ఒసేయ్ రాములమ్మ-1997
  5. జీవిత సాఫల్య పురస్కారం (సౌత్)-2001
నంది అవార్డులు:
  1. ఉత్తమ నటుడు-మేస్త్రీ ;మామగారు
  2. ఉత్తమ కథా చిత్రం- కంటే కూతుర్ని కను (1998)
-బంగారు కుటుంబం (1994)
-మేఘ సందేశం (1982)
-స్వర్గం-నరకం (1975)
-సంసారం-సాగరం (1973)
-తాతా మనవడు (1972)
  1. భారత సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా – NTR జాతీయ అవార్డు
  2. జీవిత సాఫల్య పురస్కారం – సినీ’మా’ అవార్డు- 2003
ఇతర పురస్కారాలు:
  1. వంశీ బర్కిలీ అవార్డు
  2. కళాసాగర్ అవార్డు
  3. శిరోమణి అవార్డు
  4. మద్రాస్ ఫిల్మ్ ఫేర్ ఫ్యాన్స్ అవార్డు
  5. సినీ హెరాల్డ్ అవార్డు
  6. జ్యోతిచిత్ర సూపర్ డైరెక్టర్ అవార్డు – 6 సార్లు
  7. ఎన్సిఎంట్ ఆంద్రపత్రిక ఉత్తమ దర్శకుడి అవార్డు – 6 సార్లు
  8. శోభన్ బాబు మొదటి మెమోరియల్ అవార్డ్ – 2009
1986వ సంవత్సరంలో తాండ్ర పాపారాయుడు; 1992వ సంవత్సరంలో సూరిగాడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడ్డాయి. కంటే కూతుర్ని కను చిత్రం 2000సంవత్సరానికిగాను-జాతీయస్థాయి పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ప్రత్యేక ప్రశంసలను అందుకుంది.
1983వ సంవత్సరంలో ‘మేఘసందేశం’ సినిమా చికాగోలో ఇండియన్ పనారమా వారి ప్రశంసలనందుకుంది. అంతేకాక 1983కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోను, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల లోనూ ప్రదర్శంచబడినది. తెలుగు విభాగంలో ఉత్తమ కథా చిత్రంగా జాతీయ పురస్కారం పొందింది.
రాజకీయ చరిత్ర: శ్రీ దాసరి నారాయణరావుగారు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోబడ్డారు. కేంద్రప్రభుత్వంలో, మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో బొగ్గు శాఖామంత్రిగా పని చేసారు. శ్రీమతి సోనియాగాంధి అంతరంగికులలో ఒకరిగా పేరు పొందారు. 11-06-2013వ తేదీన  CBI, బొగ్గు శాఖామంత్రిగా నవీన్ జిందాల్ నుంచి రూపాయలు 2.25 కోట్లు లంచం తీసుకున్నారన్న ఆరోపణతో అభియోగం మోపి శ్రీ దాసరినారాయణరావు పైన, నవీన్ జిందాల్ పైన కేసు పెట్టి FIR ఫైలు చేసారు. కేసు ఇంకా విచారణలో ఉంది.
2.కోడిరామకృష్ణ:
వీరి స్వగ్రామం-పశ్చిమ గోదావరి జిల్లాలోని ‘పాలకొల్లు’ దర్శకునిగా,నటునిగావీరు ప్రసిద్ధులు. తెలుగు, తమిళ, మళయాళ,హిందీ భాషలలో సుమారు వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. సుమారు ముప్పై సంవత్సరాలకు పైగా చలనచిత్రరంగంలో ఉన్న శ్రీ కోడిరామకృష్ణ –కల్పనారంగంలో (fantacy) ; సాంఘిక సమస్యల అంశాలను ప్రధానంగా తీసుకుని పరిష్కారమార్గ దిశలో చిత్రాలు సమర్పించారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని –విజువల్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్స్ లకు పెద్దపీట వేస్తూ ఆ దిశగా, ఆ నేపథ్యంలో సినిమాలు తీశారు.
వీరు కూడా నాటకరంగనేపథ్యం నుంచి వచ్చారు. అందుకే వీరి సినిమాల్లో మెలోడ్రామా ‘ప్రధానపాత్ర’ పోషిస్తూ ఉంటుంది.
వీరు దర్శకత్వం వహించి సినిమాల్లో ముఖ్యమైనవి:
ఇంట్లోరామయ్య-వీధిలో కృష్ణయ్య; మా పల్లెలో గోపాలుడు; మనిషికో చరిత్ర; ముద్దుల కృష్ణయ్యా; భారతంలో బాలచంద్రుడు; మన్నెంలో మొనగాడు; వింతదొంగాలు; భారత్ బంద్; ముద్దుల మామయ్య; గుండా రాజ్యం; మువ్వగోపాలుడు; 20 వ శతాబ్దం; రిక్షావోడు; దొంగాట;బాలగోపాలుడు; మంగమ్మ గారి మనవడు; తలంబ్రాలు; ఆహుతి; శత్రువు;అంకురం; అమ్మోరు; దేవి;  పెళ్లి; అంజి; అరుంధతి; అవతారం; దేవీపుత్రుడు; దేవుళ్లు; త్రినేత్రం; శ్రీనివాస కల్యాణం.....మొదలైనవి.
ఇందులో విజువల ఎఫెక్స్ కి పెద్దపీట వేసిన సినిమాలు:
అమ్మోరు; దేవి;  పెళ్లి; అంజి; అరుంధతి; అవతారం; దేవీపుత్రుడు;మొదలైనవి.
రచయితగా 12 సినిమాలు, నటునిగా 3 సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి.
‘అమ్మోరు’ ఎంత అఖండ విజయం సాధించిందో, అందులో కుమారి సౌందర్య ఎంత పేరు తెచ్చుకుందో తెలియంది కాదు. అలాగే ‘అరుంధతి’ సినిమాతో అనుష్క ఎంత ఎత్తుకు ఎదిగిందో, ఆ పాత్రలో ఎంతగా ఒదిగి పోయిందో ప్రేక్షకులకు తెలియంది కాదు. ప్రేక్షకులు అనుష్కకు –అరుంధతిగా-బ్రహ్మరథం పట్టారు. హీరోయిన్ ఒరియేంట్ సినిమాలకు మళ్ళీ నాంది ప్రస్థావన జరిగింది. “బొమ్మాళీ! నిన్నొదల!! అన్న డైలాగ్ థియేటర్లో మారు మ్రోగిపోయింది.
శ్రీ కోడిరామకృష్ణ కొన్ని ఫిల్మ్ ఫేర్ అవార్డులు (సౌత్) గెలుచుకున్నారు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమదర్శకునిగా, తెలుగువిభాగంలో ‘శత్రువు’ సినిమాకు అర్హుడయ్యాడు.
వీరి నుంచి మరెన్నో మంచి చిత్రాలు, విజువల్ ఎఫెట్స్ ప్రధానమైన చిత్రాలు ఆశించవచ్చు. ‘అంకుశం’సినిమా పోలీసు వ్యవస్థను తెలియజేస్తూ నిజాయితీగల పోలీసు ఆఫీసర్ జీవితాన్ని ప్రేక్షకులకు తెలియచెప్పింది. డా.రాజశేఖర్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. దానికి తోడు సాయికుమార్ డైలాగ్ లు ఈ సినిమాకు పెద్ద అసెట్.
3.ఈదర వీర వెంకట సత్యనారాయణ (ఇ.వి.వి.సత్యనారాయణ):
నిడదవోలు సమీపంలోని దొమ్మేరు లో ఇ.వి.వి.సత్యనారాయణ 10-06-1956వ తేదీన జన్మిచారు. కొందరు కోరుమామిడిలో జన్మించారు అంటారు.
శ్రీ జంధ్యాల తర్వాత హాస్య ప్రధాన చిత్ర దర్శకులెవరంటే ఇ.వి.వి.సత్యనారాయణనే చెబుతారు. నిర్మాతగా, దర్శకునిగా, స్క్రీన్ ప్లే రచయితగా సుమారు 51 సినిమాలకు శ్రీ ఇ.వి.వి పనిచేసారు. అందులో ఎక్కువభాగం హాస్య ప్రధానమయినవే.
శ్రీ వేంకటరావు, శ్రీమతి వేంకటరత్నం దంపతులకు శ్రీ ఈదర వీరవెంకటసత్యనారాయణ 10-06-1956వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు సమీపంలోని ‘దొమ్మేరు’ గ్రామంలో జన్మించారు. ఆ తరువాత ఆ కుటుంబము కోరుమామిడి గ్రామానికి తరలి వెళ్లింది. శ్రీ ఇ.వి.వి. కి ఇ.వి.వి.గిరి,ఇ.శ్రీనివాస్ అని ఇద్దరు తమ్ముళ్లు. వీరిద్దరూ కూడా సినీపరిశ్రమలో స్టిల్ ఫోటో గ్రాఫర్లుగా పనిషేస్తున్నారు.
దర్శకునిగా సినీపరిశ్రమకు రావడానికి ముందు, సహాయదర్శకునిగా, శ్రీ కనకాల దేవదాసుగారి వద్ద ‘ఓ ఇంటి భాగవతం’ సినిమాకు పనిచేశారు. శ్రీ జంధ్యాల వద్ద సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు 22 సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు. అందులో కొన్ని హిట్టయిన సినిమాలు నాల్లుగు స్తంభాలాట; రెండుజెళ్ళ సీత; నెలవంక; రెండురెళ్లు ఆరు; ఆహ నా పెళ్లంట; హాయ్ హాయ్ నాయకా...మొదలైనవి. కమల్ హాసన్ నటించిన ఇంద్రుడు-చంద్రుడు సినిమాకు కో-డైరెక్టరుగా వ్యవహరించారు.
దర్శకునిగా మొదటిచిత్రం- చెవిలో పువ్వు అది పరాజయం చెందడంతో వికల మనస్కుడై తిరిగి స్వగ్రామం వెళ్లి పోదామనుకున్న తరుణంలో సినీ మొఘల్ డా.రామానాయుడు గారు, తన బ్యానర్ లో నిర్మితమైన ‘ప్రేమఖైదీ’ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. కమర్షియల్ గా ప్రేమఖైదీ గొప్ప హిట్టయింది.
ప్రేక్షకుల నాడి తెలుసుకున్న ఇ.వి.వి.సత్యనారాయణ తన గురువైన జంధ్యాల పంథా ఎన్నుకున్నారు. హాస్యరస ప్రధాన చిత్రాలకు, కుటుంబ కథా చిత్రాలకు పెద్ద పీట వేశారు. హాస్యరస ప్రధానమైన అప్పుల అప్పారావు; ఆ ఒక్కటీ అడక్కు; జంబలకడిపంబ మొదలైన చిత్రాలను; కుటుంబ కతా చిత్రాలైన; ఆమె; అల్లుడా మజాకా; హలో బ్రదర్; ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు; గొప్పింటి అల్లుడు, వారసుడు.హిందీలో- సూర్యవంశం మొదలైనవి. శ్రీ ఇ.వి.వి. దర్శకత్వం వహించిన- ఆమె, తాళి, కన్యాదానం, మా నాన్నకు పెళ్లి, అమ్మో ఒకటో తారీఖు మొదలైనవి- విమర్శకుల ప్రశంసలనందుకున్నాయి.
నిర్మాతగా ఇ.వి.వి. సినిమా బ్యానర్లో తీసిన ‘చాలా బాగుంది’ సినిమా గొప్ప హిట్టయింది.
పెద్దకుమారుడైన రాజేష్ హీరోగా- హాయ్, సొంతం,లీలామహల్,అనుమానాస్పదం,ఎవడిగోలవాడిది మొదలైన సినిమాల్లో నటించినప్పటికీ హీరోగా నిలద్రొక్కుకోలేకపోయాడు.
చిన్నకుమారుడైన అల్లరి నరేష్ హాస్యప్రధాన పాత్రలకు పెట్టింది పేరుగా- హాస్య హీరోగా పలుచిత్రాల్లో నటించాడు, నటిస్తూ ఉన్నాడు, అల్లరి నరేష్ సినిమాలంటే మినిమమ్ గ్యారంటీ అని, నిర్మాతల నమ్మకం.
దర్శకునిగా ఇ.వి.వి. సినిమాలు:చెవిలో పువ్వు; ప్రేమఖైదీ; అప్పుల అప్పారావు; ఆ ఒక్కటీ అడక్కు;వారసుడు; జంబలకడిపంబ; సీతారత్నంగారిఅబ్బాయి; ఏమండీ ఆవిడొచ్చింది; హాలో బ్రదర్; ఆలీ బాబా అరడజను దొంగలు; ఆమె;ఆయనకిద్దరు; అల్లుడా మజాకా!; వీడెవడండీ బాబూ; అదిరింది అల్లుడు; తాళి; ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు; మా నాన్నకి పెళ్లి; మావిడాకులు; ఆవిడేమాఆవిడ;కన్యాదానం; నేటిగాంధి; చాలాబాగుంది;గొప్పింటల్ల్లుడు, ఆమ్మో ఒకటో తారీఖు; మా అల్లుడు వెరీగుడ్; కితకితలు; బురిడీ; కత్తికాంతారావు;బెండు అప్పారావు RMP మొదలైనవి.
రచయితగా ఇ.వి.వి.సినిమాలు: సూర్యవంశం; మావిడాకులు;మా నాన్నకి పెళ్లి;; హాలో బ్రదర్; ఆలీ బాబా అరడజను దొంగలు; ఆమె;; అప్పుల అప్పారావు; ఆ ఒక్కటీ అడక్కు; జంబలకడిపంబమొదలైనవి.
అసోసియేట్ దర్శకునిగా ఇ.వి.వి.సినిమాలు:హైహైనాయకా; ఇంద్రుడు-చంద్రుడు; నాల్లుగు స్తంభాలాట; ఆహ నా పెళ్లంట;
అసిస్టెంట్ డైరెక్టరుగా ఇ.వి.వి.సినిమాలు: రెండు రెళ్ళ ఆరు ,రెండు జెళ్ళ సీత;
నటునిగా ఇ.వి.వి.సినిమాలు: ఇంద్రుడు-చంద్రుడు;
నిర్మాతగా ఇ.వి.వి.సినిమాలు:చాలాబాగుంది; మా ఆవిడ మీద ఒట్టు-మీ ఆవిడ చాలా మంచిది; తొట్టిగ్యాంగ్;నువ్వంటే ఇష్టం; ఆరుగురు ప్రతీవ్రతలు;కితకితలు;అత్తిలి సత్తిబాబుUKG;ఫిట్టింగ్ మాష్టర్.
అవార్డులు:’ఆమె’ చిత్రానికి నంది అవార్డు.
ప్రేక్షకులను నవ్వించే సిన్మాలు తెస్సిన ఇ.వి.వి ,కుటుంబ కథా చిత్రాల ఇ.వి.వి. గొంతుకేన్సర్ , కార్ద్దియాక్ అరెస్ట్ తో 21-01-2011 వ తేదీన హైదరాబాద్ లో కన్నుమూశారు.
ఆయన వారసత్వాన్ని నిలుపుతూ, ఇ.వి.వి. మరణించినప్పటికీ, ఆయన తనయుడు అల్లరి నరేష్ తన హాస్యపాత్రల ద్వారా మనల్ని నవ్విస్తూనే ఉన్నాడు.

No comments:

Post a Comment

Pages