రుద్రదండం(జానపద నవల) - ఫణి రాజ కార్తిక్ - అచ్చంగా తెలుగు

రుద్రదండం(జానపద నవల) - ఫణి రాజ కార్తిక్

Share This

చీకట్లు కమ్ముకున్న ఒక లోయ. వందల డేగల ఘీంకారాలు, నక్కల ఊళలు దూరం నుంచి ఒక జ్వాల కనపడుతుంది. జ్వాల మాటిమాటికి  తగ్గి పెరిగిపోతుంది. సరిగ్గా అప్పుడు జ్వాల ఎదుట మాంత్రిక సామ్రాట్ ప్రత్యక్షమయ్యాడు. ఆగ్రహావేశాలతో ఏవో మంత్రాలు ఉచ్చరించాడు. అంతట ఆ జ్వాల ఒక ద్వారం లాగా తెరుచుకుంది. ఆ ద్వారంలో అడుగు పెట్టాడు మాంత్రికుడు. అంతా, ఒక్క నిమిషంలో జరిగిపోయింది. మాంత్రికుడి రాకతో ఆ ద్వారంలో నుండి తన స్థావరం అయిన గుహ బైట పడింది. ఆ స్థావరం గగుర్పాటుగా ఉంది. ఎదురుగా 100 అడుగుల శుద్రదేవి విగ్రహం ఉంది. ఆ మాంత్రికుడు శుద్రదేవికి నమస్కరించి  “మాతా, మరొక రోజు వ్యర్ధమైనది, ఎలా ఎలా?“ అని అన్నాడు. మాంత్రికుడు నడుస్తూ ఆ విగ్రహం వైపు కదులుతూ ఉండగా అటు ఇటు బందీలై  ఉన్న పిశాచాలు, దెయ్యాలు, భూతాలు  ఆ మాంత్రికుడికి జయధ్వని ఇలా చేయసాగాయి. “మహామంత్ర ద్రష్ట, శుద్రసామ్రాట్, కపాలద్రష్ట, కాబోవు అజరామర దైవం మార్తాండ కపాలుడు జయహో”.  మందహాసం చేసి ఆ మాంత్రికుడు “అలా అయిన వెంటనే మీకు శాప విమోచనం, దేవతల స్థానం ఖాయం అన్నాడు. మాంత్రికుడి సేవకుడైన మరుగుజ్జు ‘డి౦భకుడు’, ’వచ్చే వచ్చే’ అని మాంత్రికుడి దగ్గరకి ఫలరసం తెచ్చాడు. అది తాగిన మాంత్రికుడు “’డింభకా, ఆశలు లేవురా, ఏమియు తోచటలే, చిరంజీవినై సృష్టి పరిపాలించదలచిన ఈ మార్తాండ కపాలికి దారులు ఏమి గోచరించుట లేదు అని నిరాశ పడ్డాడు. డింభకుడు – “ప్రభూ! ఏమిటి అది నేను ఎప్పటి నుంచో అడగటానికి ప్రయత్నిస్తున్న” అని అన్నాడు. ”డింభకా నా నేస్తానివి నువ్వు, నీకు చెప్పుట సమంజసమే“, అని శుద్ర దేవికి మ్రొక్కి, ప్రళయహాసం చేసి, మాతా “ఈ సృష్టిని పాలించుటకు పుట్టిన వాడిని నేను, అందుకే నా విద్యలతో గత 1000 సం||లుగా బ్రతికి ఉన్నాను. ఒకానొక యక్షిణి ని నేను బంధించగా, తను నాకు ఈ విషయం చెప్పింది. మా గురువుగారు కూడా అది సాధించామని చెప్పారు. అవి ఎలా సాధించాలి, సాక్షాత్తూ పరమేశ్వరుడు శక్తి ఆపాదించిన ఆ మంత్రదండాలు ఎన్ని, అవి ఎక్కడ ఉన్నాయి? నా ఊహాశక్తికి, నా తపోశక్తికి  అందుట లేదు, ఎలా, అవి ఎక్కడ, వాటి జాడ తెలుపు“ అని 100 అడుగుల శుద్రదేవి విగ్రహం ఎదుట గర్జి౦చాడు” మాంత్రికుడు. అప్పుడు డింభకుడు వణకగా, ”డింభకా! నా మాయా దర్శిని తీసుకురమ్ము” అని ఆజ్ఞాపించాడు. వేగిరంగా వెళ్లి డింభకుడు దానిని తెచ్చి తెరిచాడు. ఏవో మంత్రాల చదివిన పిమ్మట “డింభకా, ఇది మాయాజాలమున సృష్టించిన దృశ్యం. జరిగినది నీకు చూపుటకు ఇది చేసితిని, చూడుము“ అని అన్నాడు. డింభకుడు ఆ దర్పణం లోకి చూస్తూ “ప్రభూ ఏమిటి ఇది?“ అన్నాడు. ”నేను సృష్టికి ప్రభువుని కాగల సామర్ధ్యం ఎదో  అవి ఏంటో చూడు” అని అన్నాడు. ఆ విచిత్ర దర్పణంలో దృశ్యం మొదలైయి౦ది.

“అది ఒక మహా స్మశాన౦ భూత ప్రేత గణాలు ఘీంకారం చేస్తున్నాయి. ఆ స్మశాన౦లో ఎన్నో వింతలకి తావు ఉంది. సరిగ్గా స్మశాన౦ మధ్యలో  ఏవో పిలుపులు, ఉచ్చరణలు. అటుగా పోతున్న ప్రేతాలు  ఆరాధనా భావంతో ఒక స్త్రీ వైపు ఒక పురుషుడి వైపు చూస్తున్నాయి. ఏవేవో తంత్రాలు వినిపిస్తున్నాయి. ఎవరా అని ఆరా తీస్తే త్రిశూల ఛాయలో త్రిశూలంతో ఒంటినిండా భస్మం పూసుకున్న శివుడు ఎదురుగా దీర్ఘాలోచనతో సతీమాత. శివుడు ఏవేవో ఉచ్చరించి స్మశాన౦లో ఉన్న అస్తిపంజరాలకు సతీమాతకు చూపటానికి కొన్ని శక్తులు ఆపాదించాడు. సతీమాత మనసు మాత్రం ఎక్కడో ఉంది .”సతీ! నీవు అడిగితేనే  కదా నేను నీకు తంత్ర విద్యని నేర్పటానికి అంగీకరించి సిద్ధం చేసింది. కాని నీవు మాత్రం చంచల వలే ప్రవర్తిస్తునన్నావు. దృష్టి పెట్టి నా కనుల వైపు చూస్తూ తీక్షణతను గ్రహించు, విద్యను నేర్చుకో. నీ తపస్సు పూర్తి అయ్యి నీవు ఆదిశక్తి రూపాన్ని సంతరించుకున్న పిమ్మట నీకు అంతా బోధపడుతుంది“ అని అన్నాడు రుద్రశివుడు. తల ఊపింది సతీమాత. మళ్ళీ మొదలుపెట్టాడు తంత్రాన్ని శివుడు. కాని సతీమాత శ్రద్ధ కనపరుచుటలేదు. దాంతో పరమేశ్వరుడు “సతీ! ఒకింత శ్రద్ద సైతం ఏంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. శ్రద్ధ ఉన్న విద్య వెంటనే వస్తుంది”. అలా చెప్పినా సతీమాతలో పరధ్యానం అలానే ఉంది. ఇలా చాలా సార్లు చేసింది. వెంటనే ఆ మహాస్మశాన౦లో తన తీక్షణతో పెద్ద వెలుగుని సృష్టించాడు శివుడు. విద్యుత్ ప్రవాహం వలే వచ్చిన ఆ కాంతితో సతీమాత నివ్వెర పోయింది. ఏమిటి ఈ ఆలోచన సతి అని శివుడు పలికెను. సతీమాత “ప్రభూ! నా తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు కదా! దానికి వెళదామా” అని అంది. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు సతి అది ఎవరైనా, ఇప్పుడు అది నీ పుట్టినిల్లు కాదు, నీవు కైలాస రాణివి, ఇక్కడే ఉండు, పిలుపు వస్తే పోదాములే“ అని శివుడు మంత్ర తంత్ర విద్యని నేర్పసాగాడు.”ప్రభూ! నా తండ్రి మిమ్ము అవమాని౦చింది నిజమే! అయినా క్షమించరా ప్రభు అని వేడుకుంది”. శివుడు “ దక్షుడు నన్ను ఏమి అన్నా నేను పట్టించుకోను. అయినా నన్ను అవమాని౦చు వారు ఎవరు లేరు. వారు అన్నంత మాత్రాన నాకు ఏమియు కాదు, అయినా దక్షుడి అహంకారం పోవాలంటే అతని తల మారాలి “అని మళ్ళి విద్య నేర్పటం ఆరంభించాడు శివుడు, ఎట్లాగైనా శివుడుని ఒప్పించాలని, యజ్ఞానికి వెళ్ళాలని సతీమాత శివుడితో వాగ్వివాదానికి దిగింది. అన్నీ తెలిసిన శివుడు – “అక్కడికి వెళ్తే నీకు కీడు జరుగుతుంది” అని చెప్పినా సతీమాతా తన పట్టు కోల్పోకుండా వాదించసాగింది. అవన్నీ తర్వాత విద్యను అభ్యసించు అని సహనభావంతో శివుడు చెప్పసాగాడు. సతి యొక్క అక్కరలేని భావాలతో “శివుడు కోపించి నన్ను అవమాని౦చినా, దూషించినా ఒప్పుకుంటాను కాని విద్యలను నిర్లక్ష్యపరిచే వారిని క్షమించటం భావ్యంకాదు “ అని గర్జించాడు. సతీమాత తను ఎట్లాగైనా యజ్ఞం ముగించిన తర్వాతే విద్యను నేర్చుకుంటాను అని తను వెళ్ళకుండా ఆపితే తన మీద ఒట్టే అని గర్జించింది. దాంతో శివుడు కోపోద్రిక్తుడై త్రిశూలాన్నికదిలించి, నేలమీద గట్టిగా కొట్టాడు దాంతో, పరమేశ్వరుడు అస్తిపంజరానికి ఆపాదించిన శక్తులు ఉపసంహరిచుకోకపోగా, సతీమాత ఉద్వేగం వైపుచూసి నిలిచిన శివుడు ”పిలువని పేరంటానికి వెళ్ళిన నీ కథను జనులు ఉదహరించుకుంటారు. “నా మాట విను సతి“ అని ప్రేమగా చెప్పాడు. ”నా పుట్టిల్లు నన్ను ఏమి చేస్తుంది ప్రభూ” అని గద్దించి౦ది సతి. ఉద్వేగానికి లోనైన శివుడు, త్రిశూలం తిప్పి మూడు కోనలు భూమికి తాకించాడు. చిన్న భూకంపం వచ్చి, శక్తులతో కూడిన అస్తిపంజరం చిన్నాభిన్నమై జంబూద్వీపంలో భరత ఖండంలో దాదాపు ముక్కలు ముక్కలై పడింది.

ఇది చూసిన డింభకుడు ఆశ్చర్యంతో మాంత్రికుడు వైపు చూసాడు “ఆ మంత్ర దండాలు కావలెరా, వాటిని అన్ని సేకరిస్తే దానితో ఒక మహా మంత్రదండాన్ని చేయవచ్చురా, ఆ మంత్రదండమే “రుద్ర దండం” అది ఉన్నవాడు 14 లోకాలను పాలిస్తూ సాక్షాత్తు దేవుడు అవుతాడు. “అది సాధించాలిరా డి౦భకా“ అని తన గుండెల మీద చేతులతో సింహనాదం చేసాడు. ”సాక్షాత్తు శివుడే ఆ అస్తిపంజరానికి శక్తులు ఆపాదించి తీసుకొనుట మరిచాడు. అది నా కోసమే... హా హా హా“ అని మార్తాండ కపాలుడు అన్నాడు .

ప్రభూ మీ గూర్చి నా కసలు తెలియదు. మీరు వెయ్యేళ్ళు ఎలా బ్రతికారు, మీ గురించి దండం గురించి చెప్పండి. డింభకుడు “రుద్రదండం” గురించి మరింత అడగసాగాడు. అసలు ఈ రుద్రదండం మీకెలా తెలుసు? అని అడిగాడు మార్తాండుడిని. దానికి చెప్పసాగాడు మాంత్రికుడు “డింభకా! నేను పుట్టి వెయ్యేళ్ళు గడిచాయి. నేను ఒక బీదవాడిని, కాని ఐశ్వర్యం ఎలా తెచ్చుకోవాలి అని కలలుకనే వాడిని. ఒకానొకనాడు మా రాజ్యంలో యువరాణికి అంతుపట్టని జబ్బు చేసింది. అది ఎంత మందికీ అర్ధం కాలేదు. రాచరికం అన్నా రాజవైభోగం అన్నా నాకు ఎంతో ప్రీతి. రాజ్యం వారు ఒకవైపు చాటింపు వేశారు. ”ఎవరైతే రాణి పద్మిని దేవికి పట్టిన జబ్బుని నయం చేస్తారో వారికి అర్ధరాజ్యం ఇచ్చి యువరాణిని ఇచ్చి పెళ్లిచేస్తామని“ అయినను, నేను ఏమిచేయగలను అని భావించి ఎప్పటిలాగా అరణ్యం లోకి ఫలములను తెచ్చుటకు, మూలికలను సేకరించుటకు వెళ్ళాను. అలా సేకరిస్తుండగా, నాకు ఒక ఆర్తనాదం వినపడినది.

No comments:

Post a Comment

Pages