మహిళామణుల ప్రతిభ - అచ్చంగా తెలుగు
మహిళామణుల ప్రతిభ 
-సుజాత.పి.వి. ఎల్





నేడు స్త్రీలు అడుగిడని రంగమే లేదనడంలో అతిశయోక్తి లేదు. డాక్టర్లుగా, యాక్టర్లుగా, పొలిటీషియన్లుగా ఆడవాళ్లు సంఖ్యలో పెరుగుతున్నారు. ఆధునిక మహిళలు పురుషులతో అన్నింటా సమానమేనని సవాలు చేసి నిరూపిస్తున్నారు. యుద్ధ రంగాల్లో కూడా ముదితలు ఝాన్సీలక్ష్మీ లాగా, రుద్రమ్మదేవి లాగా రాణించ గల ధీశాలులు. పుక్కిటి పురాణాలు ఇంతుల్ని ఇంటికే పరిమిత చేసినా...ఇతిహాసాలు తిరగేసి చూస్తే... స్త్రీని ఇల్లూ పిల్లల్ని చూసుకోమని, భర్తని బయట ప్రపంచాన్ని ఏలమని ,భార్యని కూడా ఏలుకోమని మహా గొప్ప స్వేచ్ఛనిచ్చాయని తెలుస్తోంది. పారిశ్రామిక విప్లవ కాలంలో పశ్చిమ దేశాలలో తప్పనిసరిగా స్త్రీకి పురుషుడితో పాటు కొంత స్వతంత్ర ప్రతిపత్తి వచ్చింది.దాని ప్రభావం ఇటువైపు దేశాలన్నిటి మీద పడినట్టే మన ఇండియా మీద కూడా పడింది. దాని ప్రభావమే అబలలు సబలలుగా నిరూపించబడ్డారు. 
అసమానత, అణిచివేతల ఆటంకాలను అవతలకి నెట్టి తమ కోసం, తమ తోటి వారి కోసం ముందుకు వచ్చి, ముందు తరాల వారికి మార్గ దర్శకులైన మహిళలెందరో వున్నారు. అవకాశమంటూ లభిస్తే సత్తా చూపించే సామర్థ్యం గల వనితలు మన కళ్ళ ముందే ఈనాడు ఉన్నారు.మహిళా హక్కుల సాధన కోసం కృషి చేసిన మల్లాది సుబ్బమ్మ గారు వీరిలో ప్రముఖులు. ఆమె రచించిన' ఆంద్రప్రదేశ్ మహిళోద్యమం..
1860 --1983 ' పుస్తకానికి తెలుగు విశ్వ విద్యాలయం సత్కారం లభించింది . ' పాతి వ్రత్యం నుండి ఫెమినిజం దాకా ' అన్న పేరుతో ఆత్మా కథను ప్రచురించారు .1996 లో ( స్త్రీ స్వేచ్ఛ అనే పత్రికను నిర్వహిస్తూ మహిళల హక్కుల కోసం పాటు బడిన సుబ్బమ్మగారికి ) ఎం .ఏ .థామస్ జాతీయ మానవ హక్కుల అవార్డునందుకున్నారు . ఇంకా ఎందరో మహిళా మణులు లతా మంగేష్కర్ , మేథా పాట్కర్ , మోహినీ గిరి ,మహా శ్వేతా దేవి, రేణుకా మిశ్రా ,కరణం మల్లీశ్వరి. ...మొదలైన ప్రముఖ మహిళా మణులు తమ తమ స్వీయ ప్రతిభతో ఉన్నత పదవుల్లో వుండి, ఉద్యమాలల్లో కళారంగాల్లో తమదైన ప్రత్యేకతను చాటుకుని పలు రంగాలలో ప్రముఖ మహిళలుగా పేరు తెచ్చుకున్నారు .'ముదితల్ నేర్వగ విద్య లేద'ని నిరూపించుకున్నారు . వీరంతా భారతీయ మహిళలు కావడం మరో గర్వ కారణం .
**********

No comments:

Post a Comment

Pages