నాట్యావధానానికి షష్టిపూర్తి - అచ్చంగా తెలుగు

నాట్యావధానానికి షష్టిపూర్తి

Share This

 నాట్యావధానానికి షష్టిపూర్తి

                                  - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

ఎన్నో కళలకు మన భారతదేశం పుట్టినిల్లు. ప్రత్యేకంగా అవధానం అనే ప్రక్రియ తెలుగు మినహా మరే భాషలలో లేదన్నది తిరుగులేని నిజం .. అలాంటి తెలుగు గడ్డ నుంచి 60 ఏళ్ళ క్రితం ఉద్భవించింది నాట్యావధానం. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన డాక్టర్. ధారా రామనాధశాస్త్రి ఈ ప్రక్రియకు ప్రాణం పోశారు. అనుకోకుండా మొదలైన ఈ నాట్యావధాన ప్రక్రియ అప్రతిహతంగా ప్రపంచ దేశాల మన్ననలు పొంది ఎందరో మహామహుల ప్రశంసలందుకుంది.  60 ఏళ్ళ నాట్యావధానం గురించి  అచ్చంగా తెలుగు పాఠకులకోసం ఈ మాసం  ప్రత్యేకం. నాట్య శాస్త్రం ప్రకటించిన భరత ముని నాట్యం అంటే నటన అనే ప్రామాణికాన్నిచ్చారు. ఆ ఒక్క మాటతో ఈ కొత్త ప్రక్రియకు నాంది అయ్యింది.. నాటక కళలో  అవధాన ప్రక్రియ ను సృష్టించిన వారు ప్రముఖ నటులు విద్యావేత్త ధారా రామనాధశాస్త్రి. 
రామనాధ శాస్త్రి స్వస్థలం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగరం.. 1952లో  క్రితం మద్రాసులో  రామనాధశాస్త్రి కాలేజీ
లో చదువుకునే రోజుల్లో మదిలో వచ్చిన ఆలోచనకు సజీవ రూపమే ఈ నాట్యావధాన ప్రక్రియ. సాహిత్య, నాట్య, సంగీత, ప్రసూన కదంబమే ఈ నాట్యావధాన ప్రక్రియ. అవధానాలలో మాదిరే ఇక్కడా కూడా ఉండే పృచ్ఛకులు అడిగే సమస్యలను అప్పటికప్పుడు రంగస్థలం పై వేషధారణతో రక్తి కట్టించి మెప్పించడమే ఈ నాట్యావధాన ప్రక్రియ. అంతటి  ఈ నాట్యావధానం కళ సృష్టించబడి ఈ ఏడాదికి అరవై ఏళ్ళు. షష్టిపూర్తి చేసుకోబోతున్న ఈ కళకు ఎంతో కృషి చేసిన ధారా రామనాధశాస్త్రి ప్రపంచ వ్యాపితం చేయడంలో విజయం సాధించారు. ఎందరో మహామహుల ప్రసంశలతో పాటు, విమర్శకుల ప్రసంశలు అందుకున్నది ఈ నాట్యావధాన ప్రక్రియ.  సృష్టింపబడిన నాటి నుండి.. ఆనోట, ఈ నోట ప్రచారం పొందుతూ దేశం లోని అన్ని ప్రాంతాలలో వీరిచే ప్రదర్శింపబడింది ఈ నాట్యావధానం. ప్రముఖ సాహితీ వేత్తలు విశ్వనాధ సత్యనారాయణ, సినారే, దాశరధి,  దిగ్గజ నటులు ఎ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్, భానుమతి.
సంగీత కళాకోవిదులు  శ్రీ పండిట్ రవిశంకర్, శ్రీబాలమురళీకృష్ణ వంటి సంగీత విద్వాంసులు రామనాధశాస్త్రి
కల్పితమైన ఈ అవధాన ప్రక్రియలో పృచ్ఛకులుగా వ్యవహరించి, తమ ఆశ్చర్యన్ని, ఆమోదాన్ని ప్రకటించారు. అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో రామనాధ శాస్త్రి సృష్టించిన ఈ కళారూపం ఆయనచే అవధానం కావించబడింది. నటనలో కొత్తదనం నింపిన కళాప్రక్రియ నాట్యావధానం ని మాత్రం ప్రభుత్వాలు మాత్రం గుర్తిస్తున్న దాఖలాలు లేవు. సృష్టించిన రామనాధశాస్త్రిని గౌరవించిన దాఖలా లేదు.   నటనలో వైవిధ్య ప్రక్రియ తనతో అంతమవ్వకూడదన్న తలంపుతో రామనాధ శాస్త్రి శిష్యులను తయారు చేస్తున్నారు.  తన కుటుంబంలోనే ఆయనను అనేకులు అనుసరిస్తుండగా.. మరింతమంది ఈ కళ పట్ల ఆకర్షించ బడాలన్న కోరికతో ఒంగోలులో కళాపీఠం ప్రారంభించారు. అరవై ఏళ్ళు గా అప్రతిహతంగా వేలాది ప్రదర్శనలు చేసిన ధారా రామనాధ శాస్త్రి కి గౌరవంగా హైద్రాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాలు చేసేందుకు ఆయన శిష్యులు కృషి చేస్తున్నారు. కళలో కొత్త రూపాన్ని సృష్టించి, అరవై ఏళ్ళు గా ప్రదర్శనలిచ్చి, దేశదేశాలలో భారతీయ కళావైభవాన్ని ప్రకటించిన ధారారామనాధ శాస్త్రి  పద్మశ్రీ వంటి జాతీ య పురస్కారం కి నోచుకోకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన శిష్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాట్యావధానం పుట్టి అరవై ఏళ్ళైన సందర్భంలో నాట్యావధాన సృష్టికర్త ధారా రామనాధ శాస్త్రిని  జాతీయ పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగు గడ్డ పై పుట్టి తెలుగుకోసం ఎంతో కొంత చేయాలన్న ఆలోచనలతో కూర్చో కుండా విశిష్టమైన ప్రక్రియకు ప్రాణం పోసిన శ్రీ ధారా రామనాధ శాస్త్రి గారిని  అచ్చంగాతెలుగు మనసారా అభినందిస్తోంది.   ఏనభై పైబడ్డ వయసులో కూడా కళామతల్లికి తాను ఇంకా చేయాలన్న ఆకాంక్ష నింపుకున్న ధారా రామనాధ శాస్త్రి మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ‘అచ్చంగా తెలుగు’  కోరుకుంటోంది.

No comments:

Post a Comment

Pages