కౌరవ, పాండవుల మహాపితామహురాలు -సత్యవతి - అచ్చంగా తెలుగు

కౌరవ, పాండవుల మహాపితామహురాలు -సత్యవతి

Share This

కౌరవ, పాండవుల మహాపితామహురాలు -సత్యవతి

అంబడిపూడి శ్యామసుందర రావు 




సత్యవతి  కౌరవ, పాండవులకు మహా పితామహురాలు. కౌరవ వంశ మాత అయిన  ఆమె ఒకప్పుడు ఒక సామాన్య పల్లె పడతి. దాశరాజు అనే పల్లె పెద్దకు  కుమార్తె. ఆమె శరీరం నుండి  చేపల వాసన వస్తూండడంతో ఆమెకు మత్స్యగంధి అన్న పేరుండేది.సత్యవతి పూర్వ జన్మ వృత్తాంతం తెలుసుకుందాం వసుచరిత్రలో * గిరిక *ప్రస్తావన వస్తుంది.ఆది పర్వం  లోని కథ ఆధారంగా . గిరిక సత్యవతికి తల్లి వరస ఔతుంది. ఛేది  దేశపు రాజైన వసురాజు ఆ రోజుల్లో దేవేంద్రుడి వరాలు పొంది ఒక విమానం బహుమానంగా పొందుతాడు . ఆ విమానంలో అన్ని లోకాలూ తిరిగేవాడు. అందుచేత* ఉపరిచర వసువు* అని పేరొందాడు.


ఈయన దేశంలో శుక్తిమతి నది కోలాహల పర్వతం వచ్చి పడుతుంది. ఈ రాజు పర్వతాన్ని తన పరాక్రమం తో ఎగమీటుతాడు.ఈ నదీ పర్వతాల సమాగమంలో వసుప్రదుడు , గిరిక జన్మిస్తారు. ఈ కోలాహలుడి కొడుకును తన సేనాపతిగానూ , గిరికను పత్నిగానూ గ్రహిస్తాడు వసురాజు. గిరికకు ఋతుకాలం. రాజు ఎక్కడో విమానంలో విహరిస్తూ ఉంటాడు. గిరికను సమీపించే బాధ్యతను భావిస్తూ ఉన్న రాజుకు వీర్య స్ఖలనం ఔతుంది. దాన్ని భద్రంగా ఒక దొప్పలో ఉంచి ఒక డేగ ద్వారా గిరికకు పంపుతాడు.మార్గమధ్యంలో ఈ డేగను మరో డేగ తరుముకోవడంలో ఆ ఆకు నదిలో పడిపోతుంది. చేప దాన్ని మింగేస్తుంది. అద్రిక అనే అప్సరస శాపవశాన ఈ చేప రూపంలో ఉంటుంది. ఈ అద్రిక ఈ సందర్భంలో గర్భం దాల్చి సత్యవతికి జన్మ ఇస్తుంది దాశరాజుకు ఆ చేప ద్వారా లభించిన శిశువే సత్యవతి.ఈమె మత్స్య గర్భంలో మీనువాసనతో జన్మిస్తుంది. పరాశరుడు ఆమెకు ఆ వాసన పోగొట్టి, సువాసన కలిగించి వ్యాసుడిని అనుగ్రహిస్తాడు వ్యాసుడు అవసరమైనప్పుడు ఆమె వద్దకు వస్తానని తన తల్లికి వాగ్దానం చేసి వెళ్లిపోయాడు. ఆమె యోజన గంధి ఔతుంది 


శంతనుడు గంగను వివాహమాడడం అష్ట వసువులు కుమారులుగా జన్మించటం గంగ వరుసగా ఏడుగురిని  గంగ పాలు చేయడం ఎనిమదవ వాడుగా భీష్ముడు పుట్టడం తెలిసిందే. గంగ తనను విడిచి వెళ్ళిపోగా శంతనుడు సత్యవతిని పరి గ్రహిస్తాడు. ఆమెకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మిస్తారు.చిత్రాంగదుడు పెండ్లి కాకుండానే కాలం చేస్తాడు. విచిత్రవీర్యుడికి భీష్ముడు కాశీరాజు కూతుళ్ళను ముగ్గురిని అంబ ,అంబిక, అంబాలికలను స్వయంవరంలో జయించి తెచ్చి వివాహం చేయ తలపడతాడు . అంబ వెళ్లి పోగా మిగిలిన ఇద్దరినీ అతనికిచ్చి వివాహం చేస్తాడు. సంతు లేకుండా ఈ విచిత్ర వీర్యుడు మరణిస్తాడు. సత్యవతి కోరిక మీద వేదవ్యాస మహర్షి ఈ ఇద్దరికీ ధృతరాష్ట్ర పాండురాజులను అనుగ్రహిస్తాడు.దుర్యోధనాదులు పుట్టిన కొద్ది రోజులకే సత్యవతి తపోవనాలకు వెళ్లి పోతుంది. తర్వాత ఈమె ప్రస్తావన తర్వాత  భారతంలో కనబడదు..





No comments:

Post a Comment

Pages