నైషధీయం - అచ్చంగా తెలుగు

 నైషధీయం

నాగమంజరి గుమ్మా



“అరెరే, రాజహంస… నిన్ను బాణంతో కొట్టాలని ఎవరికి అనిపించింది… అయ్యో… రెక్కలో దిగింది. కాస్త ఓర్చుకో… బాణం తీసేస్తాను. ఇదిగో.. ఈ ఆకుల పసరు పూస్తే నీ గాయం ఇట్టే తగ్గిపోతుంది” బాణం దెబ్బతగిలి , తన కళ్ళముందే ఎగిరే గుంపును విడివడిన హంసకు  పరిచర్యలు చేసాడు నిషధ దేశాధిపతి నలుడు.

కాస్త పరిచర్యతో కోలుకుంది హంస. రెక్కలల్లాడించింది. మెడను సాచింది. చిత్రంగా మానవ భాషలో ఇలా మాట్లాడింది. “నిషధరాజా.. మేము మానస సరోవరంలో ఆటలాడుకునే రాయంచలం. సరదాగా వ్యాహ్యాళి కి వెళ్లిన మా సమూహం నుంచి అనూహ్యంగా బాణం దెబ్బకు విడివడ్డాను. మీ పరిచర్యల వలన సేదతీరాను. ఉపకారికి ప్రత్యుపకారం చేసి తీరాలి. విదర్భ దేశాధీశుడు భీమ మహారాజు పుత్రిక దమయంతి అతిలోక సౌందర్యవతి. మీకు తగినజోడి. ఆమెను కలిసి మీపై ప్రేమ కలిగేలా మా వాక్కులతో అనునయిస్తాము. ఇక నాకు సెలవిప్పించండి.” 


హంస మానవభాషలో మాట్లాడటంతో ఆశ్చర్యపోయాడు నలుడు. దమయంతి అతిలోకసౌందర్యవతి అని విని ఉన్నాడు. నలుడు ఇలా ఆలోచనలో పడగానే హంస వినువీధికి ఎగిరిపోయింది. 


విదర్భ దేశంలో, ఉద్యానవనంలో , చంద్రకాంత శిలపై ఆశీనురాలై , చంద్రోదయ వేళ వెన్నెల వెలుగులకు ఒక్కొక్క రేకుగా విరుస్తున్న కలువబాలలను చూస్తోంది దమయంతి. అరవిరిసిన కలువలతో, ముకుళించిన కుముదాలతో నిండిన ఆ సరస్సు లోకి దిగాయి రెండు హంసలు. మెల్లగా ఈదుతూ దమయంతికి చేరువగా వచ్చాయవి. శ్వేతవర్ణంలో అలరారుతున్న ఆ హంసలను చూడగానే ముచ్చట పడింది దమయంతి. చేయిజాచింది. పెంపుడు హంసలా చేతిలో వాలింది వాటిలో ఒకటి. 


“విదర్భ రాకుమారికి కళ్యాణమస్తు.” మానవ భాషలో మాట్లాడిన హంసను చూసి ఒకింత ఆశ్చర్యానికి గురైంది దమయంతి. “రాకుమారీ.. నిషధ దేశాధిపతి నలుడు నీకు సరైన జోడి. అందంతో, రూపంలో, గుణంలో అతనికి సాటి రాగలవారు లేరు” అని పలికింది రాయంచ.  ఆ మాట వినగానే సిగ్గుల మొగ్గ అయ్యింది దమయంతి. మరి కాసేపు నలుని అందచందాలను, గుణగణాలను ప్రశంసించాయి హంసలు. పనిలో పనిగా తాము నిషధ దేశానికి వెళ్తున్నట్లుగా తెలియజేశాయి. నలునికి ఏమైనా సందేశం ఇవ్వాలా అని కూడా అడిగాయి.


“అప్పుడే వెళ్లిపోతారా… మరి కాసేపు ఉండవచ్చుగా” అని బతిమాలింది దమయంతి. మళ్ళీ వస్తామని, నలుడు ఎదురుచూస్తూ ఉంటాడని చెప్పాయి హంసలు. అంతే కాకుండా దమయంతి చిత్రపటాన్ని ఒకటి అడిగి తీసుకుని ముక్కున కరచి పట్టుకుని వెంటనే నిషధ దేశానికి పయనమయ్యాయి. అవి కనుమరుగయ్యేంత వరకు అలాగే చూస్తూ కూర్చుంది దమయంతి. 


నలుని అందచందాలనే ఊహిస్తూ, హంసల మాటలను పదే పదే తలపోస్తూ , హంసల రాక గురించి చింతిస్తూ అన్న పానీయాలు, నిద్ర, అలంకరణలు, మైపూతలు అన్నీ మరచిపోయింది దమయంతి.


మరునాడు చంద్రోదయ వేళ మళ్ళీ అదే చంద్రశిలా వేదికపై కూర్చొని హంసల కోసం ఎదురుచూడసాగింది.  

హంసలు రానే వచ్చాయి. “ఏమన్నారే నల మహారాజు?”ఆత్రంగా అడిగింది దమయంతి.


“ఆగవమ్మా రాకుమారీ… అంత దూరం ప్రయాణం చేసి వచ్చాము… కాసింత సేద తీరనీ..” అన్నాయి హంసలు.


“అయ్యో నా మతి మండా.. నా ఆత్రం బాగుంది, మీకు అతిధి మర్యాదలు చేయకుండానే అడిగేస్తున్నాను” అని హంసల వళ్ళంతా చందనపు నీటితో తుడిచింది. పరిమళ ద్రవ్యాలు కలిసిన పన్నీరు చల్లింది. నెమలికన్నుల వీవనతో విసిరింది. స్వర్ణపాత్రలో గోక్షీరాన్ని అందించింది. లేలేత తామర తూడులను పసిడి పళ్ళెరంలో పెట్టి అందించింది. హంసలు దమయంతి అతిథి మర్యాదలకు సంతోషించాయి. కాస్త సేదతీరాయి. 


“నల మహారాజుకు నీ చిత్తరువును చూసేసరికి చిత్త విభ్రమ కలిగింది దమయంతి… మా మాట వింటేనా… నీ చిత్తరువు తోనే మాటలు… పలుకులు… అలకలు … అన్నీ… చూపులు తిప్పుకోవడం లేదంటే నమ్ము. మీ ఇద్దరు అందంలో ఒకరికొకరు సరిజోడీ… నన్ను నమ్ము” అంది హంసి.


“అంతేనా! నాకోసం సందేశం ఏమి పంపలేదా ?” ఒళ్ళంతా చెవులు చేసుకుని మరీ నలుని విషయాలు విన్న దమయంతి కాస్త చిన్నబుచ్చుకుంటూ అడిగింది.


“ఆయన పంపిన సందేశమా?” హంసలు రెండూ ముఖాలు చూసుకుని నవ్వుకున్నాయి. హంస తన రెక్కల చాటునుండి పట్టు వస్త్రంపై పంచరంగులలో  లిఖించిన నల మహారాజు చిత్రాన్ని బయటకు తీసింది. దమయంతి ఆత్రంగా చేయి జాచింది.


“ఆఁ ఆఁ… కాస్త ఆగవమ్మా రాకుమారీ… మేము వెళ్లిన పిదప తీరికగా చూసుకుందువులే…” అని చెప్పి, ఆ చిత్తరువును అందించి, శుభమస్తు, కళ్యాణమస్తు అని దీవించి , రివ్వున ఆకాశంలోకి ఎగిరి, మానస సరోవరం దిక్కుగా సాగిపోయాయి. 


అడుగులు తడబడగా… గుండెలు అదురుచుండగా… తన ఏకాంత మందిరంలో అడుగుపెట్టింది దమయంతి. అటూ ఇటూ చూసి, తనను ఎవరూ గమనించ లేదని నిశ్చయించుకుని, నలుని చిత్రపటాన్ని తెరచింది. రాయంచలు వర్ణించిన దానిలో ఇసుమంతైనా అసత్యం లేదు. అందంతో మన్మధుడు,  రూపంలో చందురుడు, జయంతుడు మొదలైన దేవతలు కూడా సరి రారనిపించింది. కొద్ది క్షణాల సేపు మైమరచి పోయింది. తలుపు దబదబ బాదిన శబ్దంతో ఈ లోకంలోకి వచ్చింది. 

“అమ్మా.. రాకుమారీ… దమయంతి దేవి.. ఏకాంత మందిరంలోకి చేరి నాలుగు ఘడియలకు పైగా గడిచింది. తలుపు తియ్యండమ్మా” ప్రధాన చెలికత్తె అవంతి ఆందోళనతో కేకలు వేస్తోంది.


“అయ్యబాబోయ్, నాలుగు ఘడియలే”.. గబగబా, చిత్రాన్ని చుట్టి చీర చాటున దాచి, అప్పుడే నిద్రలేచినట్లు ఆవులిస్తూ తలుపు తీసింది. “ఏమిటమ్మా నిద్రపోయారా? భోజనానికి నాలుగు సార్లు వచ్చి పిలిచారు పరిచారికలు. అసలు ఉద్యానవనంలోకి పోయిన మీరు, చెలికత్తెలను తప్పించుకుని ఎలా వచ్చారు? ఏకాంత మందిరంలోకి ఎప్పుడు వచ్చారు?” నిద్రలేచినా , ఇంకా ఏవో కలల్లోనే ఉన్నట్లున్న దమయంతి కనులను చూస్తూ ప్రశ్నించింది అవంతి.


ఒక్క ప్రశ్న అయినా చెవుల పడితే కదా… కనుల ముందు నలుని రూపమే కదలాడుతుండగా స్వప్నంలో ఉన్నట్లుగా అడుగులు వేస్తూ మందిరంలో నుండి బయటకు వచ్చింది. 


“అమ్మా… అమ్మా… జాగ్రత్త… తూలిపోతున్నారేమిటి? అయ్యో.. ఈ చిరు చెమటలేమిటి? పెదవులు ఎందుకు అదురుతున్నాయి? అయ్యో రాకుమారీ మీకు ఏమయ్యింది?” ఆందోళనగా దమయంతి చేయి పట్టుకుని, హంసతూలికా తల్పం వద్దకు తీసుకుపోయింది. తల్పం యొక్క మెత్తదనం మేనికి సోకగానే మళ్ళీ ఉద్యానవనంలోని హంసలు, అవి వర్ణిస్తున్న నలుని గుణగణాలు గుర్తుకు వచ్చాయి. కనులు అరమోడ్పులయ్యాయి దమయంతికి.


దమయంతి అవస్థ చూసి అవంతికి ముచ్చెమటలు పోశాయి. “మాలతి, సుదంతి, మరుదంతి, రండి…  వీవన వీయండి, పన్నీరు చల్లండి, గో క్షీరము, ఫలములు తీసుకురండి” హడావిడిగా కేకేసింది అవంతి. చెలికత్తెలు చేసే ఉపచారాలు ఏవీ తనకు పట్టనట్లే ఉండిపోయింది దమయంతి. పాలు పళ్ళు పుచ్చుకోనే లేదు. నిద్రా, మెలకువ కాని స్థితిలో ఉండిపోయింది. ఉలకని, పలకని, తినని, తాగని రాకుమారిని చూసి అవాక్కైపోయారు చెలికత్తెలు. 


చెలికత్తెలు పట్టి పట్టి పిలిస్తే ఎప్పుడో కాసేపు మెలకువ తెచ్చుకోవడం, స్నానాదులు కానివ్వడం, ఎవరినో అలంకరిస్తున్నట్లు మౌనంగా ఉండిపోవడం, బతిమాలితే కాస్త ఎంగిలి పడటం, అంతలోనే ఏకాంత మందిరంలోకి పోయి ఘడియలు ఘడియలు గడపడం… చెలులకు ఏమి అర్ధం కాలేదు. భీమ మహారాజులకు, మహారాణికి విషయం తెలియజేసారు.  వారు వైద్యునితో సహా వచ్చి పరీక్షింప జేశారు. రాచ వైద్యులు పరీక్షించి, ఆరోగ్యలోపం లేదని, ప్రమాద మేమి కాదని తెలియజేసారు. లక్షణాలు విన్న మంత్రివర్యులు రాకుమారికి స్వయంవరం ప్రకటించమని సూచనలు చేశారు.


అన్ని దేశాలకు దమయంతి చిత్రపటంతో సహా స్వయంవర వర్తమానం పంపబడింది. నల మహారాజును కూడా చేరింది. అనేక రకాలైన నగలను, మెత్తని పట్టువస్త్రాలను, ఎన్నో బహుమతులను తీసుకుని విదర్భకు,దమయంతి స్వయంవరానికి ప్రయాణమయ్యాడు నలుడు. 


వచ్చిన రాకుమారులను, రాజులను సపరివారంగా ఆహ్వానించాడు భీముడు. అందరికి తగిన విడిది గృహాలు కేటాయించారు. తెల్లవారితే స్వయంవరం. రాకుమారి చెలికత్తెలు అతిథులకు తగిన సౌకర్యాలు అమరినవో లేదో పరిశీలించే నెపం మీద విడిది గృహాలన్ని తిరిగి వచ్చారు. దమయంతి దగ్గర చేరి, “అమ్మా నల మహారాజు మీకు తగిన జోడి. అతనిని పోలిన సుందరాంగుడు ఈ ప్రపంచంలో లేడు” అని పొగిడారు. మధురోహలతో నిదురలోకి జారిపోయింది దమయంతి. 


తెల్లవారితే స్వయంవరం. ఆతురతతో, ఉత్కంఠతో నిద్రపట్టలేదు నలునకు. ఇంతలో దేదీప్యమైన వెలుగు ఆ భవంతిని ఆక్రమించుకున్నది. నాలుగు దేవతా స్వరూపములు క్రమంగా గోచరమయ్యాయి నలుని చర్మ చక్షువులకు. “నల మహారాజు కు శుభమస్తు. మేము ఇంద్ర, వరుణ, వాయు, అగ్నులము.”అన్నారు వారిలో ఒకరు  పరిచయ వాక్యాలుగా… 


దేవతలకు తనతో ఏం పని అని ఆశ్చర్యపోతూ, వారిని స్వాగతించి, అతిధి సత్కారాలు చేసి, వచ్చిన కార్యం సెలవీయమన్నాడు. “దమయంతి అందచందాలు స్వర్గలోకం వరకు చేరాయి. మేము నలుగురము దమయంతిని మోహించాము. రేపు జరగబోయే స్వయంవరం లో ఆమె మా నలుగురిలో ఏ ఒక్కరినైనా వరించాలి. మీ ఇద్దరూ ఒకరినొకరు ప్రత్యక్షంగా చూసుకోక పోయినా, ప్రేమించుకున్న సంగతి మాకు తెలుసు. కనుక మా విషయాన్ని ఆమెకు తెలియపరచి రేపటి స్వయంవరం లో మాలో ఒకరిని వరించేలా ఒప్పించే బాధ్యత నీదే. అందుకే వచ్చాము” అని చల్లగా విషయం బయట పెట్టారు.


హతాశుడయ్యాడు నలుడు. వచ్చినవారు దేవతలు. వారిని ఎదిరించలేడు. తన బహిఃప్రాణమైన  దమయంతిని వదులుకోలేడు. ఏమి చేయడానికి పాలుపోలేదు. “నల మహారాజా… ఇప్పుడే దమయంతి మందిరానికి బయలుదేరు. నేను ఇచ్చిన ఉంగరాన్ని ధరిస్తే ఎవరికి కనిపించకుండా ఆమె మందిరానికి వెళ్లి, క్షేమంగా తిరిగి రావచ్చు” అని ఇంద్రుడు తొందరపెట్టాడు. భారమైన మనసుతో ఆ ఉంగరాన్ని ధరించి కనులు మూసుకున్నాడు. దమయంతి మందిరంలో కనులు తెరిచాడు. 


అప్సరసలను తలదన్నే అందంతో హంసతూలికా తల్పం పై నిద్రపోతున్న వయ్యారిని చూసాడు. చిత్తరువుకే శిలా ప్రతిమ అయిన తాను ప్రత్యక్షంగా దమయంతిని చూస్తూనే నోటమాట రాక క్షణం నిరుత్తురుడయ్యాడు. అంతలో కార్యం గుర్తుకు వచ్చింది. తెప్పరిల్లాడు. పక్కనే ఉన్న నెమలి ఈకతో స్పృశించి, “రాకుమారీ” అని పిలిచాడు. స్వప్నంలో నలునే దర్శిస్తున్న దమయంతి, పిలుపును విని వెంటనే కనులు తెరిచింది. ఎదురుగా ఉన్న నలుని చూసి ఇంకా స్వప్నంలోనే ఉన్నాననుకుంది. నలుడు పన్నీరు చల్లి మేలుకొలిపాడు. నలుని అందచందాలకు మై మరచిపోయింది ఆ జవ్వని. 

“రాకుమారీ.. తెప్పరిల్లండి. నేను దేవతల తరపున రాయబారిగా వచ్చాను” అని చెప్పాడు నలుడు. ఆశ్చర్యపోయింది దమయంతి. దేవతల కోరికను తెలియజేశాడు నలుడు. దమయంతి ఒప్పుకోలేదు. స్వయంవరం లో నలుడినే వరిస్తానని చెప్పింది. శత విధాలా బోధపరిచాడు. దేవతలను కాదంటే రాబోయే దుష్పరిణామాలు వివరించాడు. దేవతలు కోరుకోవడం అదృష్టమని, వారిలో ఒకరిని వరించక తప్పదని, తెలియజేశాడు. మళ్ళీ ఉంగరం ప్రభావంతో తన మందిరానికి చేరుకున్నాడు నలుడు.


తెల్లవారింది. స్వయంవర మండపం సర్వాంగ సుందరంగా అలంకరించబడింది. స్వయంవరానికి విచ్చేసిన రాజులు, రాకుమారులు ఉచితాసనాలు అలంకరించారు. అనన్యమైన అందచందాలన్నీ ఒకచోటనే రూపొందించినట్లున్న దమయంతి పరిచారికలతో సభాస్థలికి వచ్చింది. అందరినీ ఆకర్షించగలంత సిద్ధమంత్రశక్తి ఆమె అందానికుంది. స్వచ్ఛమైన నీళ్ళలో బంగారం ప్రతిఫలిస్తున్న రంగున ఉంది ఆమె శరీరం. ఆమె కళ్ళచూపులు మన్మథ సందేశాలను తోపింపజేస్తున్నాయి. ప్రతి అంగము కూడా తీర్చిదిద్దబడిన సౌందర్యరాశిలా మెరిసిపోతుంది దమయంతి.


నవరత్నాలు రకరకాలుగా పొదగబడిన నానావిధ భూషణాలూ, ఆమె ధరించడం వల్ల బంగారానికి సువాసన అబ్బినంత అదృష్టాన్ని పొందాయి.

ఆమె కళ్ళ అంచులలో కర్పూర, కస్తూరి రేఖలున్నాయి. కొంచెం పలువరుస కనిపించేటట్లుగా ఎడమైన నదురు పెదవులు సరస్వతీదేవి క్కూడా ముద్దు వచ్చాయి. ఆమె రాజహంసలకు నడకలు నేర్పే చందంగా లావణ్యంతో నడచి వస్తుంటే ప్రతి అంగమూ కదిలి, ఆమె ధరించిన నగలు సన్నగా సంగీతం పాడుతున్నాయి.


అప్సరసల వంటి గాయనీమణులు రెండువైపులా నిలబడి శుభగీతాలు పాడుతూ వెంటరాగా దమయంతి వేదిక మధ్యకు నడచి వస్తున్నది. అందరూ రెప్పవేయడం మరచిపోయి చూస్తున్నారు. చెలికత్తెలు ప్రతి ఒక్కరి వివరాలు వెల్లడిస్తుండగా, పరిమళభరిత వరమాల చేనంది మందయానమున కదులుతోంది దమయంతి. నలుని వద్దకు వచ్చేసరికి అడుగులు తడబడ్డాయి. తల ఎత్తి చూసింది. ఆమె కళ్ళకు ఐదుగురు నలమహారాజులు కనిపించారు. దేవతల కోరిక గ్రహించింది. వారి పన్నాగం అర్ధమయ్యింది. ఇప్పుడు తన నలుడెవరో ఎలా తెలుసుకోవడం? మౌనంగా సరస్వతి దేవిని ప్రార్ధించింది. ఆమె మొరవిన్న సరస్వతీ దేవి ఒక సూచన చేసింది. దాని ప్రకారం అయిదుగురు నలుల పాదాల వంక చూసింది. నలుగురి పాదాలు నేలను తాకడం లేదు. మిగిలిన ఒక్క నలుని మేనికి తడబాటు వలన చిరుచెమటలు పడుతున్నాయి. అతడే నిషధ దేశాధీశుడైన నలుడని గ్రహించింది. మిగిలిన నలుగురి వైపు చూసి, చేతులు జోడించి “ దేవతలారా.. మా జంటను దీవించండి” అని ప్రార్ధించింది.


నలమహారాజు మెడలో వరమాల వేసింది. నలుగురు నిజరూపాలు ధరించి, దమయంతి చాతుర్యానికి మెచ్చుకుని ఆ జంటను దీవించారు. 

దమయంతి నలుని వరించడం తెలుసుకున్నాడు స్వయంవరానికి కాస్త ఆలస్యంగా వచ్చిన కలిపురుషుడు. ఆగ్రహంతో తర్వాతి కాలంలో ఆ దంపతులకు ఎడబాటు తప్పదని, కష్టాలు వస్తాయని శపించాడు. ఆ తర్వాతి కథ ప్రస్తుతం అనవసరం. ఏదేమైనా నలదమయంతుల ప్రణయం ఒక దరి చేరింది. అచ్చమైన ప్రేమకు అవరోధాలు ఉండవని నిరూపించింది. అనంతర కాలంలో వీరి ఆనందమయ జీవనానికి ప్రతీకలుగా ఇంద్రసేనుడు అనే కుమారుడు, ఇంద్రసేన అనే కుమార్తె కలిగారు. ఇది శృంగార నైషధం . నలమహారాజు కథను పూర్తిగా చదివిన వారికి కలి దోషం ఉండదని చెప్తారు.


స్వస్తి. 


No comments:

Post a Comment

Pages