పాడుతా.. తీయగా.. : పెయ్యేటి శ్రీదేవి - అచ్చంగా తెలుగు

పాడుతా.. తీయగా.. : పెయ్యేటి శ్రీదేవి

Share This
పాడుతా.. తీయగా.. 
 పెయ్యేటి శ్రీదేవి

' నీ.....దయ రాదా.......రామ నీ............దయ రా........దా.............రామ నీ......ద...........యా.........రా........ఆ...........ఆ.....దా...........ఆ................రామ నీ దయ రాదా,,,,,,,,ఆ,,,,,,,,,,ఆ,,,,,,,,,,,,,,,రామా...........ఆ.............ఆ................ఆ...................
కాదనె వారెవరూ............ఊ..........ఊ..........ఊ.............ఊ.........కా.........దనె వారెవరూ...........ఊ............కల్యాణ రామా.............ఆ......నీ...........దయ రాదా............రామా..............ఆ........ఆ................ఆ...............' ' లక్ష్మీభవానీ!  చాలా ఎక్సలెంట్ గా పాడావు.  మరి జడ్జెస్ ఏమంటారో చూద్దామా?' ' కోటిగారు?" ' అమ్మా, లక్ష్మీభవానీ!  చాలా చాలా చాలా బాగా పాడావు.  సూపర్!  ఆ రాముడి దయ నీకు బాగా వుందమ్మా.  పూర్వజన్మ సుకృతం!  మీ తలిదండ్రుల పుణ్యం!  చాలా కష్టమైన పాట ఎన్నుకున్నావు.  సుశీలమ్మగారిలాగే ప్రతిమాట సుస్పష్టంగా పలికావు.  సంగతులు కూడా బాగా వేసావు.  రెడీగా వుండు.  నెక్స్ట్ నేను చేసే సినిమాలో నీకు ఛాంసుంటుంది.  ఇలాగే ఇంకా ప్రాక్ట్సిస్ చెయ్యి.' ' థాంక్యూ సర్!' ' భువనచంద్ర గారు?' ' నిజంగా చాలా బాగా పాడావు తల్లీ!  ఎక్సలెంట్!' ' థాంక్యూ సర్!' ' కౌసల్యగారు?' ' ఏమని చెప్పగలను భవానీ?  చాలా ముద్దుగా బొద్దుగా అందంగా వున్నావు.  నీ డ్రస్సు అదిరిపోయింది.  పాట అదిరిపోయింది.  సూపర్!  నీకు ఏడేళ్ళు అనుకుంటా కదా?  ఇంత చిన్నవయసులోనే చాలా అనుభవం వున్న పెద్ద సింగర్ లా పాడావు భవానీ!  నీదగ్గర నేనింకా నేర్చుకోవాల్సింది చాలా వుందనే భావన కలిగింది.  ఇంతవరకు ఈ పాటని ఎవరూ పాడలేదు.  చాలా కష్టమైన పాట ఎక్సలెంట్ గా పాడావు.' ' థంక్స్ మే'మ్ !' అలా భవానీ అతి చిన్నవయసులోనే మంచి సింగర్ గా ఎదిగింది.  పాడుతా తీయగా, ఒక్కరే, పాడాలని వుంది, లిటిల్ ఛాంప్, గీతాంజలి, సూపర్ సింగర్, సునాదవినోదిని..........ఇలా టి.వి.ఛానెల్స్ లో వచ్చే అన్ని పాటల కార్యక్రమాలలోను పాల్గొని, ఎలిమినేషం రౌండ్సులో చిక్కుకుని, కన్నీళ్ళు కార్చే దుర్భర విపత్తునించి దాటుకుని, నంబర్ వం స్థాయిలో నిలబడింది.  పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల చేత, పెద్ద పెద్ద సింగర్స్ చేత ఎన్నో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకుంది. ఆమె లేందే కచేరి లేదు.  ఆమె పాట లేని సినిమా లేదు.  మిగతా భాషా చిత్రాలలో కూడా ఆమె పాటనే కోరుకుంటున్నారు.  ఆ చిట్టి భవానీకి బాలుగారితో, సునీతగారితో కూడా పాడే అవకాశం కలిగింది.  ఆమె ఆనందానికి అవధులు లేవు.  ఇంకా ఇతరదేశాలలో పెద్దపెద్ద వాళ్ళందరూ ఆమెతో కచేరీలు చేసారు.  ఆమె కచేరీలు సాగుతున్నాయి.  అందరిచేతా ఎన్నో అవార్డులు, బిరుదులు, సత్కారాలు, సన్మానాలు, మహాగాయనీమణులు సుశీలమ్మ, జానకమ్మ, ఆర్.బాలసరస్వతి గార్ల సమక్షంలో కూడా పాడి వారి ప్రశంసలు అందుకునే భాగ్యం కలిగింది.  పాటల కార్యక్రమాలలో ఆమెనే జడ్జిగా పిలిచే స్థాయికి ఎదిగింది. ఒకసారి గానగంధర్వులు, పద్మశ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి పక్కనే జడ్జిగా కూచునే మహదవకాశం కలిగింది.  సాక్షాత్తు బాలుగారే  తనని జడ్జిగా పిలిచారంటే మాటలలో చె్ప్పలేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరై పోతూ, ఒక పక్క ఆ పెద్దాయన దగ్గర కూచున్న భయం, బెరుకు, కంగారు, ఆనందం - అన్నీ కలగలిపిన తన్మయత్వంలో వుండగా, ఎవరో పధ్నాలుగేళ్ళ అమ్మాయి పాడుతోంది. అది తనకిష్టమైన పాట!
అనురాగము విరిసేనా...........ఓ రేరాజా.......ఆ........ అనుతాపము తీరేనా......... వినువీధినేలే రాజువే....... నిరుపేద చెలిపై మనసౌనా.......'
          జడ్జి స్థానంలో వున్న భవానీ తన్మయత్వంతో ఆ పాట వింటూ.........ఢామ్మని కుర్చీలోంచి కింద పడింది!  తల బొప్పి కట్టింది!వెంటనే చేయి అందించి, ' లే భవానీ!' అన్నారు. భవానీ కుర్చీలోంచి పడిపోయినందుకు బాధ పడి, ' సారీ అంకుల్!  కుర్చీ నట్టు లూజైనట్టుంది.........' అంటోంది. ' నువ్వు  కుర్చీలోంచి పడలేదు భవానీ!  ఆ సునాదవినోదిని కార్యక్రమం చూస్తూ, చూస్తూ, నిద్రలోకి జారుకుని మంచం మీంచి జారి పడ్డావు!' ' లేదండీ, నన్ను బాలుగారు జడ్జిగా ఆహ్వానించారు.  ఆయన పక్కనే జడ్జిగా కూచున్నాను.' ' లేదు భవానీ!  అక్కడ చూడు.  బాలుగారి పక్కన సుశీలమ్మగారు కూచున్నారు జడ్జిగా.  ఆ కార్యక్రమం చూస్తూ, నిన్ను నువ్వు జడ్జిగా ఊహించుకుని, నిద్రలోకి జారుకున్నావు.  అందుకే ఇల్లా పడ్డావు.  జడ్జిగా కాదు కదా, నువ్వు ఆ పాటల కార్యక్రమాలలో గాయనిగా కూడా పాల్గొనే అవకాశం ఏమాత్రం లేదు భవానీ!  ఆ మధ్య మధ్యవయస్కులకి పాడే అవకాశం ఇచ్చారు గానీ, నీకు మాత్రం ఆ అవకాశం కూడా లేదు.  ఎందుకంటే నీ వయసు ఇప్పుడు స్వీట్ సిక్స్టీ!! నువ్వు బాగా పాడతావు.  అందులో ఏమాత్రం సందేహం లేదు.  పక్కింట్లో మంగతాయారు, ఎదురింట్లో వెంకటలక్ష్మి, మనింటికి వచ్చే రాజేశ్వరి -  వాళ్ళకన్నా చాలా బాగా పాడతావు.  వాళ్ళ దగ్గరే పాడు.  నీకెంత పాడాలని వున్నా, ఊహల్లో తేలిపోకు.  పడిపోతావు!  ఈ వయసులో పడిపోతే చేసే దిక్కు లేదు.  నాకు నువ్వు, నీకు నేను!  వచ్చే జన్మలోనన్నా పాటల కార్యక్రమాలలో పాడి, నీ కల నిజం చేసుకుందూ గాని.  అప్పుడు ఈ పిల్లలే నీకు జడ్జీలుగా వస్తారు.'
' చందన చర్చిత నీళకళేబర పీతవసన వనమాలీ!'
          అని ఇంకో అమ్మాయి పాడుతోంది.  ఆ పాటంటే తనకి చాలా ఇష్టం.  ఆ పాడే అమ్మాయికన్న తను ఆ పాట చాలా బాగా పాడుతుంది.లక్ష్మీభవానీ మనసు మూగగా రోదించింది.  తన చిన్నతనంలో ఇన్ని అవకాశాలు లేవు.  లేకుంటే తను కూడా గొప్ప సింగరై మంచి పేరు తెచ్చుకునేది.  ఇప్పుడు అవకాశాలే అవకాశాలు!  కాని తనకి వయసు ఐపోయింది!మర్నాడు కృష్ణాష్టమి పూజకి రమ్మని పిలుస్తే తాయారమ్మ ఇంటికి వెళ్ళింది.  కృష్ణుడికి హారతిస్తూ,  భవానీని పాట పాడమంటే ' చందన చర్చిత' అంటూ పాడింది.  రాత్రి టి.వి.లో వచ్చిన పాట కన్న చాలా బాగా పాడావన్నారు అందరు. తాయారమ్మ అంది, ' టి.వి.ఛానెళ్ళలో ఎన్నో పాటల ప్రోగ్రాములు వస్తున్నాయి.  వాళ్ళ కన్నా నువ్వు బాగా పాడుతున్నావు.  నువ్వూ ఆ ప్రోగ్రాములకి వెళ్ళి పాడచ్చుగా?' ఇంటికి వచ్చి టి.వి.ఆం చేయగా కనపడింది.  పాడుతా తీయగా పన్నెండు ఏళ్ళనించి, ముఫ్ఫై ఏళ్ళవరకు వయసున్న కొత్త గొంతుకలకు స్వాగతం పలుకుతోంది. భవాని బాగా రాత్రి, పగలు పట్టుదలగా కూచుని బాగా ప్రాక్టీసు చేసింది.  అందుకే పాడుతా తీయగాలో సెలక్టయింది.  ఆమె పాట విని అందరు అద్భుతంగా పాడావని పొగిడేవారే1  అన్ని రౌండ్లూ పూర్తి చేసుకుని ఫైనల్సుకి చేరుకుంది.
' జయ జయ జయ శారదా జయ కళావిశారదా నవవీణాధారిణివై అవతరించినావుగా........'
          అద్భుతంగా పాడి అందరి మనసుల్నీ దోచుకుంది.  ఆమె పాటకి కరతాళ ధ్వనులతో హాలంతా మారుమోగిపోయింది.జడ్జిగా వచ్చిన ' సుశీలమ్మా చేతులమీదుగా లక్షరూపాయల పారితోషికం అందుకుంది భవాని.  భవాని సుశీలమ్మకి పాదాభివందనం చేసింది.ఆడియెన్స్ లో కూచుని చూస్తున్న అమ్మమ్మకి ఆనందంతో కళ్ళు చెమర్చాయి.  తను పడ్డ కష్టం ఫలించింది.  తన కోరిక నెరవేరింది.  తన మనవరాలు చేత తను ఎంతో బాగా పాడే పాటలన్నీ రాత్రి, పగలు బాగా సాధన చేయించింది.  అందుకే తన మనవరాలు భవాని మొదటి స్థానంలో నిలిచింది.  తన పేరు నిలబెట్టింది. ' ఇదిగో అమ్మమ్మా1  ఈ లక్ష రూపాయల ప్రైజు నీది.  ఈ గెలుపు నీది.  ఈ కష్టమంతా నీది.  నాకు ప్రైజు రాదు, నేను పాడుతా తీయగా కి వెళ్ళను అని ఎంత చెప్పినా, నాకు ధైర్యం చెప్పి, కృషితోనాస్తి దుర్భిక్షం అంటూ పట్టు పట్టి ఎన్నో పాటలు నేర్పావు.  నన్నింత దాన్ని చేసావు.  నీ ఋణం తీర్చుకోలేను అమ్మమ్మా!' అంటూ అమ్మమ్మ పాదాలకి నమస్కరించింది పన్నెండేళ్ళ భవాని. భవానమ్మ తృప్తిగా మనవరాల్ని అక్కున జేర్చుకుని ఆశీర్వదింఛింది. తను ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటుగా వచ్చినా, ఆ బాధని మర్చిపోయి, లేటు వయసులో లేటెస్టుగా తన మనవరాలు భవాని గొప్ప గాయకురాలైనందుకు ఎంతో సంతోషించింది.

No comments:

Post a Comment

Pages