తరలిరాద తనే వసంతం - అచ్చంగా తెలుగు
 తరలిరాద తనే వసంతం 
కుందుర్తి స్వరాజ్య పద్మజ 

సమయం ..పొద్దునే ఆరుగంటలు. పగలు సూర్యుడుప్రతాపాన్ని  చూపిస్తున్నా ...తెల్లవారు ఝామున కొంచెం చిరుచలిపలకరిస్తూ ...మదిని పులరింప జేస్తూనే ఉంది. ఇంక నేనువచ్చేస్తున్నా నోచ్ అంటూ సూర్యుడు తూరుపు ఆకాశాన్నిఅరుణరాగ రంజితం చేస్తున్నాడు . అప్పుడే పనిమనిషి వాకిలికడిగి ముగ్గులు పెట్టిందేమో ..తడిమీద  ఆకాశపుటెరుపు మెరుస్తూతమాషాగా వుంది వాకిలి. పందిరిమీద విచ్చిన మల్లెల సోయగం,రాత్రి తారలు నింగిని వదిలి ఇక్కడ దాగున్నాయెమో....అనిపిస్తోంది. విరిసిన మందారాలు ఎర్రగా కంటికి విందుగాఉన్నాయ్. నడిచే తోవ నిండుగా రాలిన పూల పొత్తిళ్ళతోపారిజాతపు చెట్టు వాసక సజ్జికలా  ఎదురుచూస్తున్నది .రోడ్డుమీదవాకిలికి ఇరువైపులా వేసిన గులాబిరంగు ,తెలుపూ ,ఎరుపూగన్నేరు పూలు పుష్ప గుచ్చాలు పట్టుకుని నిలబడ్డ అందమైనఅమ్మాయిల్లా హొయలు పోతున్నాయి. దక్షిణపు సందులో వేసినమామిడి చెట్టు ఎర్రని కిసలయాలతో గుత్తులుగా పూసిన పూలతోఅందగిస్తోంది. వాటిమీద వాలిన చిలుకలు సందడిచేస్తూ కొమ్మలఊయలలూగుతున్నాయి. పూల తేనియ కోసం తేనెటీగలు,తుమ్మెదలూ ఆ పూల గుత్తుల మీద తిరుగుతున్నాయి. రకాలపూల పరిమళాలన్నీ పొద్దునవీచే ఆ మలయమారుతాన్ని మరింత సుగంధభరితం చేస్తున్నాయి ఆప్పుడే నిద్రలేచితలుపుతీసి వసారాలో నిలబడి ఈ అందాన్నంతా తిలకించటంఅలవాటున్న  పార్వతి మనసు ఎంతో  ఆహ్లాదంగా ఉంది.ముఖ్యంగా ఆ పూలరధం లాంటి మామిడి చెట్టును చూస్తుంటే..మనసు రాగరంజితమవుతోంది. నిజం గానే మన్మధునిపూలతేరులా ఆ మామిడిచెట్టూ ..ఆతేరుని లాగుతూ ఉన్నట్టు గాఆరాచిలుకలూ  ...సందడిగా వాయిద్యాలతో అనుసరిస్తున్నపరివారగణం లా ఆ తుమ్మెద ఝుంకారాలూ ...ఆస్వాదించేమనసుండాలేగానీ ...ఈ ప్రకృతి అణువణువులోనూ అందమే....ఇలా ఆనందతన్మయంలో ప్రకృతిని చూస్తూ పరవశించిపోతున్నపార్వతి చెవికి కుహూ .....కుహూ మన్న కోయిల కూతవినిపించింది !నిజమేనా అని ఆశ్చర్యపోతూ నిలబడిపోయినపార్వతి చెవులకు నిజమే సుమా అన్నట్లుగా మరోసారివినిపించిందా కలకూజితం. "ఎన్నాళకెన్నాళ్ళకు  ...ఎప్పుడోపెళ్ళికాకముందు వాళ్ళ ఊరిలో విన్న  కోకిలమ్మ పంచమ స్వరం !మళ్ళీ ఇన్నాళ్ళకు వీనుల విందుగా ...పార్వతి మనసుతనకిష్టమైన లలితగీతం పాడుతోంది ..అదిపెదవులమీదప్రతిఫలిస్తోంది ..ఓహో ..ఓహో వసంతమా ....నవజీవన మోహనవికాసమా ...భావుక పులకిత హృదంతమా ...సుమబాల పరీమళవిలాసమా ...అంటూ. 

పార్వతీ వాళ్ళు ఈ ఇంట్లోకి వచ్చి ఆరు నెలలు. రిటైరుమెంటుతో వచ్చిన డబ్బుతో కొనుక్కున్న ఇల్లు. అయన స్నేహితునికి తెలిసిన వాళ్ళెవరో ఇల్లు అమ్మేసి అమెరికా వెళ్ళిపోతున్నారంటూహడావుడి పెట్టేసి ,దూరంగా ఉన్న ఈ ఇల్లు కొన్నారు శేఖరం గారు.పిల్లలు రావాలన్నా, పోవాలన్నా దాదాపు మూడు గంటలప్రయాణం. "అయ్యో పిల్లలకింత దూరం గానా?వద్దు" అంటేవినిపించుకోలేదు .పైగా "పిల్లలు పెద్దవాళ్ళయ్యారోయ్ ....వాళ్ళ పిల్లలు కూడా స్కూళ్ళకు వెళుతున్నారు.వాళ్ళ సంసారబాధ్యతలేవో వాళ్ళు చూసుకుంటారు .ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం.కొన్నాళ్ళ పాటు వానప్రస్థ ఆశ్రమానికి  వెళ్ళుతున్నామనుకో..వాళ్ళకూ కొంచెం స్వతంత్రం కావాలికద" ...అంటూ గృహప్రవేశంచెయించేశారు .మొదట్లో ఒంటరిగా అనిపించేది .పెద్దాడు కారేజీతీసుకెళ్ళాడో లేదో ...అమ్మాయి ఈ వారం ఇంటికి వచ్చిందో లేదో...పాపాయ్ ఆరోగ్యం ఎలా వుందో ...ఒకటే జలుబు దానికి,రాత్రిళ్ళు నిద్ర పొతోందో లేదో ...ఇలాంటి అలోచనలతో కంటిమీదకునుకు ఉండేది కాదు. రోజుకు నాలుగు సార్లైనా ఫోన్లు చెస్తుండేదిపిల్లలకు .శేఖరం గారు "నువ్వుఇక్కడ ఉన్నా నీ మనసు పిల్లలదగ్గరే పెట్టి వచ్చేసావు. పొద్దుగూకులూ ఫోన్లు చేసి వాళ్ళనివిసిగించకు. "అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసేవారు. కాలంనెమ్మదిగా గడిచే కొద్దీ పార్వతమ్మగారు కూడా బెంగ పెట్టుకోవడంతగ్గింది. పిల్లలు కూడా వారానికోసారి వచ్చే వాళ్ళు ,ఇప్పుడునెలకో సారి వచ్చి చూసి వెళుతున్నారు. నెమ్మదిగా పెరటిమొక్కలవైపు దృష్టి మరల్చు కున్నారావిడ. గార్డెన్లోపూలమొక్కలూ ...ఆకుకూరలూ  రకరకాల చెట్లూ అప్పటికే అంతకుముందు ఇల్లుకట్టుకున్నవాళ్ళు పెంచటంవలన వాటిలోతిరుగుతూ ,ఇంకా కొత్తమొక్కలు పెంచుతూ ,ఉత్సాహంగావాటిలో మమేకమై పోయింది పార్వతి. నగరంలో లేని ప్రశాంతమైన వాతావరణం ,ఉరుకులూ పరుగులూ లేని జీవితం హాయిగాఅనిపించసాగింది. పొద్దునే మొక్కలను పలకరించి ,దేవునిపూజకు పూలు కోసుకోవటం ఆవిడకు ఇష్టమైన వ్యాపకం గామారింది. పొద్దుటే పూల బాలలని పలకరించకపొతే తోచదు.అదనంగా ఆరోజు వినిపించిన కోకిల కూత ఆవిడకు  ఎంతోఉత్సాహాన్నిచ్చింది. తన పుట్టింట్లోని పెరటి బావీ ,జామ చెట్టూగుర్తొచ్చాయి. 
                 ఆరోజు తనకింకా గుర్తు ......ఉగాది పండగ రోజుసాయంత్రం నాలుగు గంటలవేళ అత్తగారూ ,మామ గారూ,అప్పటికే పెళ్ళయిన ఈయన అక్కగారూ ,బావగారూ వాళ్ళఏడెనిమిదేళ్ళ బాబూ ,ఈయనా కలిసి వచ్చారు పెళ్ళిచూపులకు.తన బాబాయ్ కూతురు కాళ్ళు కడుక్కునే టప్పుడే చూసి..."అక్కోయ్ బావగారు నీలాకాదు ..మంచి నిఖార్సైన రంగు...పేరు చంద్రశేఖరమైనా ..శ్రీకృష్ణ పరమాత్మ రంగు సుమా ...."అనిఆటపట్టించింది .హాల్లోంచి వాళ్ళ నవ్వులూ మాటలూవినబడుతున్నాయి. అతను ఎలాఉన్నాడో చూద్దామనికుతూహలం ,కిటికీలోనుంచి చుద్దామంటే బెరుకు .ఇంతలోఅమ్మవచ్చి అమ్మాయ్ ...రా అంటూ లాక్కెళ్ళింది. కట్టుకున్నసన్నని జరీ అంచున్న ఆకుపచ్చని  రంగు పట్టుచీర కాళ్ళకు అడ్డంపడుతుండగా ఎలాగో వెళ్ళి కుర్చీలో కూర్చుంది. కాబోయేఅత్తగారు ఏవో ప్రశ్నలడుగుతుంటే తలవంచుకుని సమాధానంచెప్పింది. "అమ్మయినేమైనా అడగతల్చుకుంటే మీరూ అడగండి .మొహమాట పడకండి " అని నాన్నగారు చెప్పటమే ఆలస్యం,"నేను కాసేపు తనతో ఒంటరిగా మాట్లాడుతాను "అనటంతో కాస్త అవాక్కయినా .."అలాగే బాబూ "అంటూ నాన్నగారుఅనుమతిచ్చేరు. పెరటిలో బావి గట్టుపక్కన జామచెట్టుక్రిందరెండు కుర్చీలు ,చిన్న స్టూలు వేసి దానిమీద స్వీటూ ,హాటూ,మంచినీళ్ళూ పెట్టి ,చెవిలో రహస్యంగా "జాగ్రత్త అతిగా వాగకు"అని హెచ్చరించి వెళ్ళిపోయింది అమ్మ. తను కుర్చీలోకూర్చుంటూ ,"కూర్చోండి "అన్న అతని మాటవిని ,తలొంచుకునిచేతి గోళ్ళవైపు చుసుకుంటూ కూర్చుంది. అతనే సంభాషణమొదలు పెట్టేడు. "చాలా బాగుందండీ మీఇల్లు,చుట్టూపూలమొక్కలూ ,అందమైన పెరడూ ,ఇలాంటి ప్రశాంతమైనవాతావరణం మాకు దొరకదు. హైదరాబాదులో ఎప్పుడూఉరుకులూ పరుగుల జీవితమే మాది ఇంతపచ్చని ప్రశాంతమైనవాతావరణం లో పెరిగిన మీరు ,అక్కడ ఎలాఫీలవుతారా అనిఅలోచిస్తున్నా" అన్నాడు. తను తలెత్తి ఒక చిరునవ్వునవ్వి మళ్ళీతలవంచుకుంది. "పుస్తకాలేమైనా చదువుతారా ?"మళ్ళీ తనేఅడిగాదు బుద్ధిగా తలఊపింది తను "నాకూ  చాలా ఇంట్రెస్ట్అండీ ఎలాంటి పుస్తకాలు చదువుతారుమీరు "అడిగాడు అతను.తను సమాధానం చెప్పేలోగా ఎక్కడో చెట్టు కొమ్మల్లోని కోయిలకుహూ ....మంటూ కూసింది. అతను ఎంతో సంతోష పడిపోతూ..".."అబ్బ ..!!పుట్టిన ఇన్ని సంవత్సరాలకు కోయిల కుహూ స్వరంవిన్నానండీ ఇది నిజంగా నా పుట్టినరోజు కానుక "అన్నాడు. "ఈరోజు అంటే ఉగాది రోజు మీ పుట్టిన రోజా ?"అన్నది తను. అతనునవ్వేస్తూ కాదండీ నా పుట్టిన రోజే ఉగాది వచ్చింది. అంటేనాపుట్టిన తేదీ ఈరోజన్నమాట "అన్నాడు. తను నవ్విమాట్లాబోయేంతలో మళ్ళీ కోయిల కూసింది. "హూ ...ఈకోయిలనేమన్నా పెంచుకుంటున్నారా ఏమిటి ?మిమ్మల్ని అడిగినప్రతి ప్రశ్నకూ తను సమాధానం చెబుతోంది "అన్నాడు నవ్వేస్తూ.కొత్తదనం పోయి ఇద్దరూ నవ్వుకుంటూ కబుర్లలో పడితే కాలమేతెలియలేదు .వాళ్ళ అక్కయ్య పెరట్లోకి వచ్చి "ఇంక రారా బాబూ..ట్రైనుకి టైమవుతోందీ ..."అనేదాకా. వెళ్ళి వారం లోపే పిల్లనచ్చిందని ఫోను చేయటం ,చకచకా పెళ్ళిజరిగిపోయి 35సంవత్సరాలు అవుతోంది. ఈ కాలమంతా ఉద్యోగమూ,సంసారతాపత్రయంలో గడిపేసినా తనభర్త తనకోసం మళ్ళీ ఇంతప్రశాంతమైన జీవితం ప్లాన్ చెయ్యటం చాలా సంతోషం గాఅనిపించింది ఆవిడకు. 


          మళ్ళీ కుహూ ....మంటూ వినిపించిన కోయిలపంచమస్వరం అవిడను ఆలోచనలలోనుంచి బయటపడేసింది.రేపు ఉగాది !ఏప్రిల్ 9 వతేదీ అంటే రేపు అప్పట్లాగానే ఈయనపుట్టిన రోజూ ఉగాదీ కలిసివచ్చాయి !సర్ట్ఫికెట్స్ లో కూడాదాదాపు పద్ధెనిమిది నెలలు ఎక్కువ వేసారని చెపుతుండేవారుఅంటే రేపటితో ఈయనకు 60 సంవత్సరాలు నిండుతాయి. అరే !ఎంత మతిమరుపు వచ్చింది తనకు ...పిల్లలతో ఉంటే ఎంతదర్జాగా జరుపుకోవలసిన పుట్టినరోజు ...ఈ విషయం పిల్లలకుఅర్జెంట్ గా చెప్పాలి అనుకుంటూ ,ముందుగా కొడుక్కి ఫోన్చేసింది. అప్పుడే నిద్రలేచినట్లున్నాడు. ఒరే య్ ...అంటూ తనేదోచెప్పబోతుంటే ....."అమ్మా !ఏంటి పొద్దుటే ఫోను ..మీ ఆరోగ్యంఎలాఉంది "అని అడిగాడు  కంగారుగా ...తను "బాగానే ఉన్నాంనాన్నా అసలూ ..."అని మాట్లాడే లోపు కట్ చేస్తూ ,"ఇవాళత్వరగా ఆఫీసుకెళ్ళే పని ఉందమ్మా మళ్ళీ మాట్లాడతా ..."అనిఠక్కున ఫోను పెట్టేసాడు. కూతురేమో ఫోన్ తీస్తూనే "మాఅడపడుచు వచ్చిందమ్మా ...టిఫిన్ ఏర్పాట్లలో ఉన్నా మళ్ళీమాట్లాడతా "అని కంగారుగా పెట్టేసింది ఫోను. ఎక్కడలేనినిస్పృహ ఆవహించింది ఆమెకు. "ఏమిటీ పిల్లలు ?ఎప్పుడూవాళ్ళ సంసారాలూ ,ఆఫీసులేనా ?కనిపెంచినఅమ్మానాన్నల గోడు పట్టదా ?కాసేపు సావధానం గా పెద్దవాళ్ళమాటలు వినిపించుకునే ఓర్పు లేదా ?ఎంత గారాబంగా పెంచాం....ఎంత కష్టపడి తమ అవసరాలు తగ్గించుకుని వాళ్ళనుఈస్థాయికి తెచ్చాం .కనీసం మనసులో మాట చెపితే వినే తిరికలేదా ?తన అత్తగారినీ మామగారినీ తనెలా చూసుకుంది...పిల్లలనుకూడా తాతయ్యా ,బామ్మలతో కబుర్లు చెప్పమంటూఎంత ప్రోత్సహించేది. దూరం గా వచ్చి తప్పు చేసామా ?ఉన్నబాంధవ్యాలు దిగజారటం లేదుకద ఇలా పరిపరి విధాలఆలోచిస్తున్నది ఆవిడ. స్టౌ మీది పాలు బుసబుసా పొంగికిందపోతుంటే ,చటుక్కున వచ్చి స్టౌ ఆపేసిన చంద్ర శేఖరం గారు"ఏమిటి పార్వతీ చుసుకో వద్దూ అంటూ పిలిచారు.ఆలోచనల్లోనించి బయటపడి అన్యమనస్కంగానే కాఫీ కలిపిఇచ్చింది ఆయనకు. పరధ్యానం గానే పూజా వంటా కానిచ్చి,ఎలాగో తిన్నాననిపించి పడుకుండి పోయింది. సాయంత్రం శేఖరంగారు తనే కాఫీకలిపి భార్య చేతికిస్తూ అడిగారు అనునయం గా...."ఏమిటిపారూ ఇవ్వాళ ఎలాగో ఉన్నావ్ .చాలా నీరసంగాకనిపిస్తున్నావ్. ఆరోగ్యం బాగాలేదా ?పిల్లలకు కబురు చెయ్యనా ?అని. 

పార్వతి ఇంతెత్తున లేచింది. విసుగ్గా మొహం పెడుతూ"అక్ఖర్లేదులెండి ,అమ్మ ఫోన్ చేస్తే కూడా మాట్లాడటానికి తీరిక లేనిపిల్లలు. వాళ్ళను ఇబ్బంది పెట్టడమెందుకు ..."అంటూ విసురుగాలేచింది. విరజాజి మొగ్గలు కోయడానికి. తీరిగ్గా రోజూ పూలుకోసిభర్తతో కబుర్లు చెబుతూ ,వాటిలో మరువం ,కనకాంబరాలూ కలిపిఅందమైన కదంబమాల అల్లి శ్రీకృష్ణుని విగ్రహానికి వేసి ఒక చిన్నబెత్తెడు మాల కొప్పులో తురుము కోవటం అలవాటు ఆమెకు.ఆరోజు ఎలాగో పూలు కోసిందేగానీ మాల అల్లలేక పోయింది.స్నానం చేసి కృష్ణుని పాదాల దగ్గర విరజాజులని పోస్తున్న ఆమెనుచూస్తూ ...ఇవ్వాళ పార్వతి ఏదో మనసు కష్టపెట్టుకుంది.ఎప్పుడూ ఇలాలేదు ఎందుకో తెలుసుకోవాలి అనుకున్నారాయన.కానీ ఆవిడ గంభీరంగానూ మౌనం గానూ ఉండటంతో ఏమీమాట్లాడలేక పోయారు. రాత్రిపూట తేలిగ్గా రోటీలూ ,కొద్దిగామజ్జిగన్నం మాత్రమే తినే ఆ దంపతులు పెందలాడే భోంచేసిపడుకున్నారు. మంచం మ్మీద అసహనం గా దొర్లుతున్న భార్యనుచూచి ఇంక లాభం లేదనిశేఖరం  గారు ...."ఏమిటి  పారూ...ఏమైందినీకు ఈరోజు నువ్వేదో బాధ పడుతున్నావనిఅర్ధమవుతోంది ,కానీ అదేమిటో చెబితేనే కదా నాకు తెలిసేది.ఏమిటో అది చెప్పు పార్వతీ ...అలా నువ్వు విచారంగా వుంటేనేను చూడలేను "అని రెండుచేతులూ పట్టుకుని అడుగుతుంటే....ఇంక నిగ్రహించుకోవటం ఆవిడ వల్ల కాలేదు. వెక్కి వెక్కిఏడవటం ప్రారంభించింది. కాసేపు ఏడవనిచ్చి "ఇప్పుడు  చెప్పుపార్వతీ  ఎందుకింత బాధ కలిగింది నీకు ..నేనేమైనా పొరపాటుమాట మాట్లాడానా ?నీకు బాధ కలిగేలా ప్రవర్తించానా ?అలాంటిదేమైనా జరిగుంటే సారీనోయ్ "అన్నారు. ఆయన నోటికిచేయి అడ్డం పెడుతూ ,"ఛ ..ఛ అలాంటి దేమీ లేదండీ ...రేపు మీపుట్టిన రోజుకదా .."అవునూ అయితే ఏమిటీ ?"అన్నారాయన."అంటే రేపటితో మీకు 60. సంవత్సరాలు నిండుతాయి కద"ఎంతో ఘనం గా జరుపుకో వలసిన పుట్టిన రోజు ఇలామనిద్దరమే ...పిల్లలకు ఫోన్ చెసాను పొద్దుటే ....ఇద్దరూ నేచెప్పేదివినే తీరికలో లేరు. అయ్యో !అమ్మెందుకు ఫోన్ చేసిందో అనికూడా ఆలోచన లేదు వాళ్ళకు ....సాయంత్రం వరకూ ఎదురుచూసానండీ ....అన్నా చెళ్ళెళ్ళు ఇద్దరూ తిరిగి ఫోన్ చేయలేదు.ఎంత ప్రేమగా పెంచాం ...ఎన్ని కోర్కెలు తీర్చాం ..ఎన్ని పుట్టినరోజులు జరిపించాం .ఇప్పుడు ఆమ్మా నాన్నలు గుర్తులేరు వాళ్ళకు"అందీ దుఃఖం తో గొంతు పూడుకు పోతుండగా  ఆవిడ. 

ఆవిడలా మాట్లాడటంతో ...తేలిగ్గా నవ్వేస్తూ ,"ఇందుకా ఇంతచిన్న విషయానికా ...ఇంతబాధ పడుతున్నావు. పిల్లలుపెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ వయసులో మనం కూడా క్షణం తీరికలేకుండా గడిపాం. మర్చిపోయావా ?ఈ వయసులో చిన్నపిల్లాడిలా నేను పుట్టిన రోజులు జరుపుకోవటం అవసరమా ?పిల్లల మీద మనకున్న ప్రేమ భగవద్దత్తమైనది ఏ తల్లిదండ్రులూప్రతిఫలం  ఆశించి పిల్లల మీద ప్రేమ చూపరు. పిల్లలనుకన్నందుకు పెంచటం మనబాధ్యత. తల్లిదండ్రులది షరతులు లేనిప్రేమ పార్వతీ ....అయినా వాళ్ళు మనచేతుల్లో పెరిగారు?వాళ్ళప్రేమను అనుమానిస్తే మనల్ని మనం అనుమానించు కున్నట్లే....60 సంవత్సరాలు వస్తే గొప్పేమిటి ?ప్రకృతి నువ్వుముసలివాడివైపోయావురా బాబూ !అని చెబుతోంది అంతే.రేపటినుంచీ నన్ను ఓ ..ముసలాయనా ..అని పిలువవుకదా...."అంటూ నవ్వించే ప్రయత్నం చేసారు. "చాల్లెండి ఎంతసేపూపిల్లలను వెనుకేసుకు రావటమే ...నా బాధ ఎప్పుడు అర్ధంచేసుకున్నారు గనుక .మీరూ మీ పిల్లలూ ఒకటే .."అంటూ ఇంకేదోమాట్లాడబొతున్న ఆవిడ కాలింగ్ బెల్ మోగటం తో ఈవేళప్పుడువవచ్చేది  ఎవరా అని తలుపు తీయడానికి సందేహిస్తుంటే..ఇంతలో కూతురి ఫోన్ కాల్ ..."ఇప్పుడు తీరిందే నీకూ ..."అనిఇంకేదో అనబోతుంటే "తలుపు తియ్యమ్మా ముందూ "అనినవ్వుతూ ఫోన్ పెట్టేసింది కూతురు. తలుపు తియ్యగానే బిల బిలమంటూ ఇంట్లోకి వచ్చిన కూతుర్నీ ,కొడుకునీ అల్లుడినీ ,కోడలినీమనుమ సంతానాన్నీ ,శేఖరం గారి ప్రాణ స్నేహితులనూ వారికుటుంబాలనూ చూస్తున్న వాళ్ళిద్దరికీ ఆశ్చర్యానికి అంతులేదు.శేఖరం గారి చేత అందరూ కేక్ కట్ చేయించి జన్మదినశుభాకాంక్షలు చెబుతుంటే ...ఖంగారు పడిపోతూ ...పిల్లలను"ముందుచెప్పొద్దుటే ...ఇప్పుడు తినడానికేమన్నా .....ఎలాఅంటున్న పార్వతమ్మగారిని ...అన్ని ఏర్పాట్ల తోనే వచ్చామమ్మా...అమ్మా ముందు చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంటుంది చెప్పూ ..అనికొంటెగా కన్నుగీటుతున్న కూతురిని ప్రేమగా  ఓ మొట్టికాయ వేసిఅక్కున చేర్చుకున్నారావిడ. 


     ఎప్పట్లా తెల్లారింది .ఆ ఉగాది ఉషోదయం ఇంకా అందంగాకనిపించసాగింది పార్వతమ్మగారికి. వదినా మరదళ్ళిద్దరూకబుర్లు చెప్పుకుంటూ మల్లెపూలు కోస్తున్న దృశ్యం కనుల పండుగగాఉంది ఆమెకు. పిల్లలు పారిజాతాలు ఏరుతుంటే నిన్నటిదిగులు భారమంతా జలజలా రాలిపోయినట్లు గా వుంది. హాల్లోకూచుని తండ్రీ ,కొడుకూ ,అల్లుడూ వచ్చే నెల్లో తాముచేసుకోబోతున్న మూడురోజుల షష్టి పూర్తి మహోత్సవానికిఏర్పాట్లూ ,పిలవాల్సిన బంధువర్గం లిస్టూ తయారు చెస్తున్నారు.ఆయన స్నేహితులు ఇల్లంతా తిరుగుతూ "ఎంత బాగుందో శేఖరంమీ ఇల్లు .మంచిపని చేసావోయ్ .హాయిగా ఇద్దరూ ప్రశాంతంగాఎంజాయ్ చేస్తున్నారు అని మెచ్చుకుంటుంటే సంతోషం గాఉందితనకు. గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కడుతూ "అయితేఅన్నయ్య గారికీ వదిన గారికీ మళ్ళీ పెళ్ళన్న మాట ...అనిస్నేహితుల భార్యలు హాస్య మాడుతుంటే సిగ్గుపడసాగింది ఆమె.బయటి ప్రకృతి లోని వసంత శోభను చూస్తూ ఆవిడఆనందిస్తుంటే ...ఆమె మనసులో విరబూస్తూ ,మొహం లోప్రతిఫలిస్తున్న ఆ నవవసంత శోభను చూస్తూ చంద్రశేఖరంగారుమరింత ఆనందిస్తున్నారు. వాళ్ళిద్దరి ఆనందాన్నిగమనించానన్నట్లుగా ...ఎల మావికొమ్మల కోయిల మళ్ళీ మళ్ళీకుహూ .....కుహూ ...మని కూస్తోంది. 
***

No comments:

Post a Comment

Pages