ఆశాజ్యోతి - అచ్చంగా తెలుగు

ఆశాజ్యోతి
అక్కిరాజు ప్రసాద్ 


సికింద్రాబాదు స్టేషనులో గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతున్న ఆమనికి భర్త శరత్‌ను చూసి దిగులేసింది. కళ్లలో నీళ్లు నిండగా "ఏవండీ! నెలరోజులు మీరు లేకుండా ఎలాగా? మధ్యలో ఓ రెండు సార్లు వచ్చి వెళ్లండి..." అని మాట్లాడబోయింది. "అబ్బా! ఏమీ కాదు ఆమని. హాయిగా మీ అమ్మ నాన్న దగ్గర రెస్టు తీసుకో! ఎక్కువ ఆలోచించకు" అని చెప్పి బయలుదేరబోయాడు. "ఏవండీ! ఫ్రిజ్‌లో పచ్చళ్లు చేసి పెట్టాను, టేబుల్ మీద పొళ్ళున్నాయి, డబ్బాలో జంతికలున్నాయి. వంట చేసుకునే ఓపిక లేకపోతే వాటితో తినండి. బయట తినకండి..." తన మనసులో ఉన్న లిస్టంతా చదివేస్తోంది ఆమని. లోపల ఆతృత, బయటకు దుఃఖము, దిగులు. పెళ్లైన పదేళ్లలో ఇదే మొదటి సారి భర్తను వదిలి ఇన్ని రోజులు పుట్టింటికి వెళ్లటం. ఆమని-శరత్ దంపతులకు పిల్లలు లేరు. ఎన్నో ప్రయత్నాలు చేసినా పిల్లలు పుట్టలేదు. అత్యవసర పరిస్థితులలో గర్భాశయం తొలగించవలసి వచ్చింది. ఆమని తల్లిదండ్రులు వచ్చి ఆమె ఆపరేషన్ అయ్యిన 3 వారాల వరకు ఉన్నారు. ఇక ఆమెను తమ స్వస్థలమైన విశాఖపట్నం తీసుకు వెళుతున్నారు. 

రైలు బయలుదేరే సమయం కూత కూసింది. ఆమని సీటు వద్దకి వెళుతోంది, అప్పటి వరకు ముందుకు నెమ్మదిగా అడుగులు వేస్తున్న శరత్ భార్య కోసం వెనక్కి తిరిగి చూశాడు. ఆమె మాటల్లో ఆత్రంగా పలికిన భావనలలో దాదాపుగా అన్నీ అతని కళ్లలో మెదిలాయి, ఆమెను చూడాలన్న తహతహతో వంగి వంగి వెదికాడు. చిరునవ్వుతో ఆమని కనిపించింది. నవ్వి ఇక వెనక్కి బయలుదేరాడు. శరత్. ఆమని ఇద్దరూ బ్యాంక్ ఆఫీసర్లే. ఇంటికి వెళుతూ దిగాలుగా ఆలోచనల్లో మునిగిపోయాడు శరత్. ఇద్దరినీ తొలిచేస్తున్న బాధ, ఒకరితో ఒకరు చర్చించాలంటే ఎలా స్పందిస్తారో, నొచ్చుకుంటారో అన్న సందేహం - ఇక సంతానం కలిగే అవకాశం లేదు. ఇన్నేళ్ల ఆశల సౌధాలు కూలిపోయినట్లే. శరత్ ఇంటికి వచ్చి ఈ విధంగా జీవితాంతం ముందు తరం లేకుండా బ్రతకాలి కదా అనుకున్నాడు. భార్య బిడ్డలను ఎంతగా కోరుకుందో తాను కూడా అంతే కోరుకున్నాడు, ఆమె మాటల్లో వ్యక్తపరచేది, తాను చేసేవాడు కాదు. ఆమని ఈ ఆపరేషన్ నుండి తిరిగి వచ్చేలోపు తమ భవిష్యత్తు గురించి ఏదో ఒకటి చేయాలన్న నిశ్చయానికి వచ్చాడు శరత్. ఆమని రోజూ ఫోన్ చేస్తునే ఉంది. ఒకవారతం తరువాత "ఏవండీ! ఇక  మనకు పిల్లలు కలిగే అవకాశం లేదు. ఇది తలచుకుంటేనే ఏదోలా ఉంది"....అంది. "ఆమనీ! హైదరాబాదు వచ్చాక మాట్లాడదాం. ముందు నువ్వు పూర్తిగా కోలుకునేలా రెస్టు తీసుకో" అన్నాడు. 

"నాన్నా శరత్! అమ్మాయికి ఇంక పిల్లలు పుట్టే అవకాశం లేదు, దత్తత తీసుకునే ఆలోచన చేస్తే మంచిది. ఎన్నాళ్లని ఒంటరిగా ఉండగలరు? ఎప్పుడోకప్పుడు మేము దాటిపోయే వాళ్లమే..అమ్మాయి తిరిగి వచ్చాక ఈ విషయం గురించి చర్చించుకోండి" అని శరత్‌కు తల్లిదండ్రుల నుండి సలహా. అటువంటి సలహానే ఆమనికి కూడా తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చింది. ఆమని-శరత్‌లకు ఏమి చేయాలో అర్థం కాలేదు. బిడ్డను పెంచుకోవటం అంటే మార్కెట్లో కూరగాయలు తెచ్చుకున్నట్లు కాదు కదా, మనకు పుట్టని బిడ్డలకు తల్లిదండ్రులుగా న్యాయం చేయాలంటే ఎంతో విశాలమైన హృదయం, ఓర్పు, మంచి సంస్కారాలు కావాలి. మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము అన్న ఆలోచన ఒకవైపు, అలా పెంచుకున్న తల్లిదండ్రులెందరో ఆనందంగా ఉన్నారు, మనమూ ఓ అనాథ బిడ్డను పెంచుకుంటే ఉభయతారకం అన్న ఆలోచన మరోవైపు....నెల తరువాత ఆమని హైదరాబాద్ వచ్చేసింది. ఇద్దరూ ఆఫీసులకు వెళ్లటం, రావటం..వారాలు వారాలు గడిచిపోతున్నాయి. 

ఓ రోజు సాయంత్రం ఆమని సిటీ బస్సు దిగి రోడ్డు దాటబోతోంటే వెనకనుండి కొంగు పట్టుకొని "అమ్మా! ఓ పది రూపాయలు ఇవ్వమ్మా, ఆకలి వేస్తోంది" అని ఓ ఆరేళ్ల పాప దీనంగా అడిగింది. వెనక్కి తిరిగి చూసి కొంగు వదిలించుకోబోయి, మళ్లీ ఆలోచనలోపడి "మీ అమ్మ, నాన్న లేరా" అని ప్రశ్నించింది. "నాన్న తెలీదు, అమ్మ కూరగాయలు అమ్ముకుంటుంది, వానపడి కూరలన్నీ కుళ్లిపోయాయి, జ్వరం వచ్చి ఇంట్లో పడుకుంది" అని సమాధానం చెప్పింది. మనసు కరిగి "నీ పేరేంటి" అని అడిగింది. "జ్యోతి" అని సమాధానం చెప్పింది పాప. పాప చేతిలో పది రూపాయలు పెట్టి ఇంటికి చేరుకుంది ఆమని. 

"అమ్మాయ్ ఆమనీ, నాన్నా శరత్! మేము చెప్పిన మాట, అదే ఒక బిడ్డను దత్తతకు తీసుకోవటం గురించి ఏమనుకున్నారు? కామాక్షత్తయ్య మన వాళ్లే ఎవరో అమ్మాయి ఉంది అని చెప్పింది, మీకు ఆసక్తి ఉంటే మాట్లాడదాం" అంది శరత్ తల్లి గిరిజ కోడలిని కొడుకును ప్రశ్నించింది. "అత్తయ్య గారు, ఇంకా నిర్ణయం తీసుకోలేదండీ. కానీ, పెంచుకుంటే ఎవరైనా అనాథను పెంచుకుందామని నా అభిప్రాయం" అంది. శరత్ భార్య చెప్పినదానికి ఔనన్నట్లే సమాధానం చెప్పాడు తల్లితో. 

"ఏవండీ! పిల్లలు ఇక పుట్టరు అన్నది జీర్ణించుకోవటం చాలా కష్టంగానే ఉంది. కృత్రిమ గర్భ ధారణ కూడా మనకు అవకాశం లేదు. అత్తయ్య గారు చెప్పినట్లు మనం మరీ వయసు మీరకముందే ఒక నిర్ణయం తీసుకుంటే, ఒక వేళ దత్తత తీసుకుంటే ఆ బిడ్డ పెరిగే వరకు మన శరీరాలు సహకరించే అవకాశం ఉంటుంది. నా మనసులో ఉన్న మాట ఇది. ఎవ్వరినీ పెంచుకోవద్దు. ఒకరిద్దరు అనాథ శరణాలయం పిల్లలకు చదువులు పూర్తయ్యే వరకు ఆర్థిక సాయం చేస్తే ఎలా ఉంటుంది?..." ఆమని ఆలోచనలు అర్థమై శరత్ " ఆమనీ! పిల్లలను పెంచుకోవటానికి అనేక కోణాలున్నాయి - ఒకటి మన బిడ్డ అనుకొని ప్రేమానురాగాలు పంచుతూ, క్రమశిక్షణ నేర్పి బాధ్యతలు నిర్వర్తించటం, రెండు మనకంటూ ఒకరున్నారు అన్న భావనలను పరస్పరంగా కలుగజేసి మన భవిష్యత్తుకు బాటలు వేసుకోవటం...ఈనాడు ఉన్న సామాజిక పరిస్థితులలో రెండవది కన్నబిడ్డల వద్దే లభించటం లేదు. మొదటిది చాలా పెద్ద బాధ్యత. నీ ఆలోచనలు నాకు అర్థమైనాయి...నా ఆలోచనలు వేరే దిశగా వెళుతున్నాయి..." అన్నాడు. "అవునా! మీరేమనుకుంటున్నారు?" కుతూహలంగా అడిగింది ఆమని. 

"మనకు ఇంకా సగానికి పైగా జీవితముంది, నేను మన వృద్ధాప్యం గురించి ఆలోచించటం లేదు. మనకు ముసలి వయసులో ఎలా అన్నది ముఖ్యమైన ప్రశ్నే, కానీ, ఈరోజుల్లో కన్నబిడ్డలు కూడా తల్లిదండ్రులను ఆదరించని ఉదాహరణలే ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకొక 25-30 ఏళ్ల తరువాత జరుగబోయే దాని గురించి జీవితంలో దత్తత అన్న నిర్ణయం నేను తీసుకోకూడదు అనుకుంటున్నాను. బిడ్డలను పెంచటం, ఆ ప్రేమానురాగాలను ఆస్వాదించటం కన్నా మనకు ఓ భగవంతుడు ఓ అపూర్వమైన అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. మన సమయాన్ని, కొంత ఆర్థిక వనరులను ఈ దేశంలో మౌలిక వసతులు లేని విద్యార్థులపై వినియోగిస్తే సమాజ శ్రేయస్సుకు తోడ్పడినట్లవుతుంది. మనకు ఈరోజు తీరిక సమయం ఉండి కాబట్టి బిడ్డల గురించి ఆలోచిస్తున్నాము, అదే సమయాన్ని నలుగురి కోసం వెచ్చిస్తే?...."

"మీరు చెప్పింది బానే ఉందండీ, కానీ, ఎంత సమాజసేవ చేసినా, తల్లిగా నా మనసు కోరుకునే మధురానుభూతులు, తండ్రిగా మీరు చేయవలసినవి నెరవేరవు కదా? ఆ కొరత సమాజసేవలో తీరుతుందా? ఈ నిర్ణయం మన ఒక్కరిదే కూడా కాదు కదా? మనకు ముందు తరం ఉండాలని మన అమ్మ నాన్నలు కోరుకుంటున్నారు కదా?" అని ప్రశ్నించింది ఆమని. "నిజమే ఆమనీ! కానీ ఇక్కడే మనం వేరుగా ఆలోచిస్తే మానవ జన్మ ఎత్తినందుకు భగవంతుడు ఇచ్చిన ఓ మంచి అవకాశాన్ని మరింత సద్వినియోగం చేసినట్లవుతుంది కదా? 10 ఏళ్లు దాటిన తరువాత బిడ్డలు ప్రేమానురాగాలకన్నా బాధ్యతలెక్కువ. ఒక్క బిడ్డపై మనింట్లో వెచ్చించే సమయాన్ని పదుగురిపై వెచ్చిస్తే? ఆలోచించు.." అన్నాడు. "సరేనండీ! ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయం కాదు" అని మరింత ఆలోచించాలని సంకల్పించింది ఆమని. 

మరునాడు ఆఫీసు నుండి ఇంటికి వస్తుంటే "అమ్మా!" - అన్న పిలుపు విని పక్కకు తిరిగి చూసింది ఆమని. ఎదురుగా చిరునవ్వుతో జ్యోతి. దగ్గరకు పిలిచి "నేను బాగున్నా, మీ అమ్మకు ఎలా ఉంది?" అని కుశల ప్రశ్నలు వేసింది. మాటల మధ్యలో జ్యోతిని "నువ్వు స్కూలుకు వెళ్లవా?" అని అడిగింది. "లేదమ్మా! మా నాయనున్నప్పుడు పంపించేవాడు. ఇప్పుడు అమ్మ నా వల్ల కాదు, డబ్బులు చాలట్లేదు, చదివించలేను అది. అందుకని ఇంటి దగ్గరే ఉంటున్నా" అని సమాధానం చెప్పింది జ్యోతి. "చదువుకుంటావా?" అని అడిగింది ఆమని. "మా అమ్మని అడగాలి అమ్మా. నాకు ఇష్టమే" అని చెప్పింది. "మీ అమ్మ దగ్గరకు తీసుకు వెళ్లు" అని జ్యోతిని అడిగింది ఆమని. కూరగాయల మార్కెట్టులో బండి వెనుక నిలబడి కూరలు అమ్ముతోంది జ్యోతి తల్లి రాణి. ఆమనితో పలకరింపుల తరువాత "రోజంత కష్టంజేస్తే రెండొందలు మిగుల్తయమ్మా" అంది రాణి. "ఇట్ల వానకాలంల ఎంతమంది కొంటరో తెల్వదు, తెచ్చిన కూరలు కుళ్లిపోతయ్...ఈ వారం మస్తు నష్టమొచ్చింది..." అని ఏడ్చింది రాణి. భర్త లేడు, రోజువారీ బతుకులు, పదేళ్ల కూతురుని చదివించే స్థోమత లేదు, చంకలో ఏడాదిన్నర వయసున్న మరో కూతురు...సగటు భారతీయ పేదవాని సమస్యలన్నీ రాణికున్నాయి. చదువు, ఆర్థిక వసతులు లేకపోతే ఎంత దుర్భరమో ఆమనికి పూర్తిగా అర్థమైంది. ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంది. జ్యోతి, రాణి కుటుంబ పరిస్థితి ఎప్పటికప్పుడు భర్తకు చెబుతూనే ఉంది. 

ఓ పదిహేను రోజులు విశాఖపట్టణంలో క్యాంప్ పని రావటంతో ఆమని అక్కడికి వెళ్లి వచ్చింది. "అమ్మా..." అని జ్యోతి తన చెల్లెలిని చంకన ఎత్తుకుని ఏడుస్తూ రోడ్డు పక్కన అడుక్కుంటూ కనబడింది. పరుగెత్తుకుంటూ జ్యోతి దగ్గరకు వెళ్లి దగ్గరకు తీసుకుని "ఏమైంది" అని అడిగింది. "అమ్మ కరెంటు షాకు కొట్టి చచ్చిపోయింది" అని ఏడ్చింది. వాళ్లు ఉండే ప్రాంతానికి వెళ్లి వివరాలు కనుక్కుంటే ఆరోజు విపరీతమైన వానలో కూరగాయలను సర్దబోతు ప్రమాద వశాత్తూ కరెంటు తీగను తాకగా షాకుతో రాణి అక్కడిక్కడే మరణించిందిట. రాణి అమ్మ, నాన్న వచ్చి పిల్లలతో ఉన్నారు, వాళ్లదీ ఏరోజుకారోజు బ్రతుకే. "అమ్మా, ఈ బిడ్డల్ని ఎట్ల సాకుతమో ఏమో, మా బత్కులు గిట్లనే. జర దర్మం చేస్కొని ఈ బిడ్డలను యాడన్న సేర్చు తల్లీ" అని రాణి తల్లి ఆమనిని కన్నీళ్లతో బ్రతిమిలాడింది. "భగవంతుడా, అభం శుభం తెలియని పసిపిల్లలు ఏమిటీ పరీక్ష? ఏడాది క్రితమే తండ్రిని పోగొట్టుకుని ఇంతలో తల్లి కూడా పోతే అనాథల్లా ఈ బిడ్డల బ్రతుకులు ఎలా?" అని ఆలోచిస్తున్న ఆమనికి ముందు ఏదో ఒకటి చేయాలి అన్న నిశ్చయం కలిగింది. "అమ్మా, ఓ రెండు నెలలు మీరు ఇక్కడే ఉండండి, ఈ లోపల నేను ఏం చేయాలో నలుగురితో మాట్లాడి చెబుతాను, పిల్లలకు ఖర్చులకు ఇది ఉంచు" అని ఓ  రెండు వేలు రాణి తల్లి చేతిలో పెట్టి ఇంటి వైపు నడిచింది. 

"ఏవండీ! రాణి పిల్లల సంగతి ఏం చేయాలో కాస్త మీరు కూడా ఆలోచించండి. ఇద్దరు ఆడపిల్లల జీవితాలకు రక్షణ ఎలా? వాళ్ల చదువులు,  పెళ్లిళ్లు...". "ఆమనీ! ఈ పరిస్థితుల్లో పిల్లలను ఏదైనా స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తే మంచిది. వాళ్లను దత్తత తీసుకుందామన్న ఆలోచన నీలో వస్తూ ఉండవచ్చు, కానీ, దానికి ఇది సరైన సమయం కాదు, మనం కొన్నాళ్లుగా అనుకుంటున్న ఆలోచనలకు ఒక రూపు వచ్చినప్పుడు ఆ బిడ్డల భవిష్యత్తుపై మనం సరిన అడుగులు వేద్దాం" అన్నాడు. ఆమనికి ఆ బిడ్డల భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళంగా ఉంది. భర్త చెప్పిన మాటలు రుచించలేదు. ఆ ఆడపిల్లలకు వెంటనే ఒక మార్గం చూపించకపోతే మర్నాడు ఉదయం భర్తతో "ఏవండీ! నేనొక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నా సంకల్పం. ఈరోజే ఆశాజ్యోతి ట్రస్ట్ పేరుతో ట్రస్ట్ ఏర్పాట్లు మొదలు కావాలి. నేను నా ఉద్యోగానికి ఒక మూడు నెలలు సెలవు పెట్టి ఈ పనులు చూసుకుంటాను. అప్పటి వరకు జ్యోతి, చెల్లెలు ఆశ మన సంరక్షణలో ఉంటారు, ట్రస్ట్ ఏర్పడిన తరువాత వారి పెంపకం ఆశాజ్యోతి పర్యవేక్షణలో ఉండే విధంగా అనుమతులకు ప్రయత్నం చేస్తాను" అంది. భార్య మనసులోని సంకల్పం అర్థం చేసుకుని సరే అన్నాడు శరత్. 

ట్రస్ట్ ఏర్పాటుకు, సభ్యుల నియామకానికి రెండు నెలల సమయం పట్టింది. ఈలోపు ఆమని జ్యోతిని, ఆశను తన వద్దకు తెచ్చుకొని పెంచటం ప్రారంభించింది. జ్యోతికి స్కూలు, ఆశకు కొత్త జీవనంతో ఆమని-శరత్‌ల జీవితాలు మారిపోయాయి. ట్రస్ట్ ఏర్పడింది. ఆమని తన ఉద్యోగం నుండి స్వచ్ఛంద విరమణ తీసుకుంది. ఆశాజ్యోతి ట్రస్ట్ సంరక్షణలో ఆ పిల్లల బాధ్యత ఆమని-శరత్ దంపతులు స్వీకరించారు. రెండేళ్లలో ఆశాజ్యోతి ట్రస్ట్ దాదాపుగా పది మంది అనాథ బాలబాలికల సంరక్షణకు, పెంపకానికి, చదువులకు కావలసిన నిధులు సమకూర్చుకుంది. ఆశాజ్యోతి ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థగా మారింది. విదేశాలలో నివసించేవారితో పాటు, శరత్-ఆమనిల పరిచయస్థులు ఆశాజ్యోతి సంస్థ నిర్వహణకు తోడ్పడ్డారు. ఐదేళ్ల తరువాత శరత్ కూడా తన ఉద్యోగం నుండి స్వచ్ఛంద విరమణ తీసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ పూర్తి సమయాన్ని ఆశాజ్యోతి సంస్థకే వినియోగించారు. 

"నాన్నా! భారతదేశంలో పేదలకు విద్య అన్న వ్యాసం జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి పొందింది..." అని వీడియో చాట్‌లో తండ్రి శరత్‌తో ఆనందంగా చెప్పింది జ్యోతి. 21 ఏళ్ల జ్యోతి ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కాలేజీలో బీఏ సోషల్ వర్క్ చదువుతోంది. సాంఘిక సంస్కరణలు - పేదరిక నిర్మూలన అనే అంశాలపై పరిశోధన చేయాలని జ్యోతి సంకల్పం. "నాన్నా జ్యోతీ! ఆశాజ్యోతిని ముందుకు నడిపించవలసిన బాధ్యాత నీదే. నీ చదువు మన సంస్థకు ఎంతో ఉపయోగం..." అన్నాడు శరత్. ఆమని కూడా కూతురితో "అవును జ్యోతీ! మన సంస్థ తరఫున ఉన్న 100 కు పైగా పిల్లల భవిష్యత్తు మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు నీ చదువు ఉపయోగ పడుతుందని నా ఆశ!" అంది. "నాన్నా, అమ్మా! నేను బీఏ సోషల్ వర్క్‌లో చేరిందే మన ఆశాజ్యోతి భవిత కొరకు. భారతదేశంలో ఉన్న ఆర్థిక అసంతులన తొలగాలంటే ప్రభుత్వేతర సంస్థలు నడుం కట్టాలి. మన సంస్థ ఆశయాలు ప్రత్యేకమైనవి, పేదరికంలో మగ్గుతున్న అనాథ పిల్లలకు గొప్ప ఆసరాలు..." అని తల్లిదండ్రులతో తన లక్ష్యాలు చెప్పింది. ఆమని-శరత్‌లు ఎంతో సంతోషపడ్డారు. తల్లిదండ్రుల మాటలు, అక్క మాటలు విన్న ఆశ మనసులో కొత్త ఆలోచనలు. 15 ఏళ్ల ఆశ ఆశాజ్యోతి సంస్థలో చిన్నపిల్లలకు ఆంగ్లం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం నేరపటంలో తల్లికి సాయపడుతోంది. అన్ని తరగతుల పాఠ్యాంశాలకు డిజిటల్ స్టడీ మెటీరియల్ సిద్ధం చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఆశ మనసుకు చిగురించిన ఆలోచన. వీటిని పేద విద్యార్థులకు సాయంత్రం పూట లేదా ఆదివారాల్లో ఉపయోగించి పేదలకు చిన్నప్పటి నుండే విషయాల పట్ల అవగాహన పెంచాలని ఆమని ప్రణాలిక. తల్లి ఆలోచనలకు కార్యరూపమిచ్చింది ఆశ. 

"భారతదేశంలో పేదవిద్యార్థులకు అందుబాటులో విద్య అనే అంశంపై ప్రముఖ సోషల్ వర్కర్ జ్యోతి శరత్ గారు చేసిన పరిశోధనల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాజ్యోతి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అనేక అంతర్జాతీయ సంస్థల నిధులు అందజేస్తున్నాయి. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో నడిచే ఈ పథకం ద్వారా గత సంవత్సరం 15,000 మంది పేద విద్యార్థులు ప్రయోజనం పొందారు. వీరిలో 70 శాతం బాలికలే. ఇంతటి అద్భుతమైన పథకానికి రూపకల్పన చేసిన ఆశాజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి శరత్ గారికి తెలంగాణా ప్రభుత్వం విద్యారత్న అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించింది" అని విద్యాశాఖ మంత్రి హైదరాబాదులో ప్రకటించారు. ఆమని, శరత్‌ల ఆనందానికి అవధుల్లేవు. 

అవార్డు అందుకునే రోజు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులతో క్రిక్కిరిసిన సభ. అవార్డు అందుకున్న తరువాత జ్యోతి మాట్లాడుతూ "ఈరోజు ఈ అవార్డు రావటం నాకు మరింత చేయాలన్న సంకల్పాన్ని కలిగిస్తోంది. రోడ్డున పడ్డ ఓ పేద తల్లి బిడ్డలం నేను నా చెల్లెలు ఆశ. అమ్మ నాన్నలిద్దరూ వారి వారి ఉద్యోగాలకు స్వస్తి చెప్పి సమాజసేవ కోసం, మా ఇద్దరికి ఒక మంచి వాతావరణం ఇవ్వటం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. సమాజసేవలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతూ విద్యావ్యవస్థలో మార్పులకు తోడ్పడటం అనేది ముళ్లబాటే. ఎన్నో అవరోధాలను అధిగమించి, మా సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. వారి ప్రోత్సాహమే నా విద్య, నా అస్తిత్వం. అందుకే ఈ అవార్డు వారికి అంకితం చేస్తున్నాను" అంది. సభలోని వారందరూ నిలబడి చప్పట్లు కొడుతూ ఆమని శరత్‌ల వైపు చూశారు. ప్రపంచమంతా వారికి తలవంచి నమస్కరిస్తున్నట్లు అనిపించింది. 

"ఆమనీ! ఆరోజు నీ నిర్ణయం సరైనది కాదేమో అని తొలుత సందేహించాను. కానీ, ఏదైనా మార్పు రావాలంటే ఆ తెగింపు, ధైర్యం, పట్టుదల అవసరం అని ఈరోజు గ్రహించాను. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 1000 మంది పేద విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దింది ఆశాజ్యోతి సంస్థ. జ్యోతి సాధించిన విజయానికి నువ్వే సారథివి" అని ఆమనిని అభినందించాడు శరత్. "నా నిర్ణయాన్ని గౌరవించి నాకు తోడుగా నిలిచారు, పిల్లలు కూడా సంస్థ అభివృద్ధికి, లక్ష్య సాధనకు ఎంతో కృషి చేశారు, మన కలలను సాకారం చేశారు. ఈరోజు నాకు నిజమైన దీపావళి" అని ఆనందంగా భర్తను, కూతుళ్లను దగ్గరకు తీసుకుంటూ బయటకు నడచింది. ఒక కుటుంబం కాదు, ఓ అద్భుతమైన శక్తి సమూహం ముందుండి సమాజాన్ని పచ్చని బాటలపైకి నడిపిస్తున్నట్లుందా దృశ్యం. 

(ఈ కథ జీవితంలో ఒడిదుడుకులను తట్టుకొని, వాటినుండి బయటపడి తమ జీవితాన్ని సమాజసేవ కోసం ధారపోస్తున్న ఎందరో సోదరసోదరీమణులకు అంకితం)

No comments:

Post a Comment

Pages