శ్రీథర మాధురి - 133
(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
హిందూ సిద్ధాంతం యొక్క నమ్మకం ఏమిటంటే, దైవం అనేక రూపాల్లో ఉంటారు.
- అంతర్యామి స్వరూపం - ఆయన ప్రతి జీవి లోపలా ఉన్నారు. 'అహం బ్రహ్మస్మి' యజుర్వేదం.
- ఆయన అక్షరాలు (విశ్వశక్తి స్థానాల) రూపంలో ఉన్నారు. వాటి విశ్వశక్తి స్థానాలు కొన్ని సంకేతాలను బీజాక్షరాల రూపంలో కలిగి ఉంటాయి. వీటిని ధ్యానం ద్వారా, ఆ బీజానికి చెందిన మౌఖికమైన, లయబద్ధమైన శబ్దాల ద్వారా ఆవాహన చేయవచ్చు.
- ఆయన యక్షులు కిన్నెరలు, గంధర్వులు రాక్షసులు వంటి వారి రూపంలో ఉన్నారు. వీరిని గురించి కూడా ధ్యానించవచ్చు లేక మౌఖికంగా ఆవాహన చేయవచ్చు.
- ఆయన అవతార పురుషుల రూపంలో ఉన్నారు (మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరుశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి). ఆయన సమయానుకూలంగా పశువులు, పక్షులు, మనుషులు, దివ్య జీవులుగా అవతరిస్తారు.
-ఆయన అర్చావతార మూర్తుల రూపంలో ఉన్నారు. ఒక దేవత విగ్రహాన్ని చేసి, ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు, ఆయన ఆ రూపాన్ని ధరించి, ఆ వేడుకలు పూర్తయ్యే వరకు ఆ విగ్రహంలో ఉంటారు. ఆ విగ్రహంలోకి ఆయనని ఎన్నిసార్లైనా ఆవాహన చేయవచ్చు.
- ఆయన గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, కనిపించేవి, కనిపించనివి, ఇంకా కనిపించాల్సినవి వీటన్నిటి రూపంలో ఉన్నారు.
- ఆయన అన్ని లోహాల రూపంలో ఉన్నారు. మన పీరియాడిక్ టేబుల్ (విస్తృత ఆవర్తన పట్టిక) లో తెలిసినవి, తెలియనివి, దానిని అధిగమించిన వాటిలో ఉన్నారు.
- ఆయన పంచభూతాల రూపంలో ఉన్నారు. నీరు, గాలి, అగ్ని, ఆకాశం, భూమి. అన్ని జీవస్వరూపాలు ఈ పంచభూతాల నుంచే జనిస్తాయి.
ఈ రూపాలన్నింటినీ మంత్రాలలో వ్యక్తపరిచి, ప్రార్థిస్తారు. కాబట్టి దైవం ఉన్న ప్రతి ఒక్క స్వరూపంలో ఆయనని పూజించేలా ఏర్పాటు చేశారు. మంత్రశాస్త్రం ప్రతి ఒక్క మాధ్యమంలో, దైవాన్ని ఆవాహన చేసి, పూజించే విధానాలను వివరంగా తెలుపుతుంది.
శక్తి అనేది కేవలం దైవం యొక్క 50% వ్యక్తీకరణ. మంత్రాలు 'శివం' అని పిలవబడే మిగతా సగభాగానికి చెంది ఉంటాయి. శక్తి అనేది దైవం యొక్క చర(చలనాత్మక) అంశం శివమనేది దైవం యొక్క స్థిర అంశం. శివ మామూలు త్రికోణం, శక్తి అనేది తిరగబడ్డ త్రికోణం. ఈ రెండు సజాతీయంగా మిళితమై, వాటి చుట్టూ జీవిత చక్రాన్ని ఏర్పాటు చేస్తాయి.
ఇదే 'సుదర్శన చక్రం'. జీవనచక్రం కదులుతూ ఉన్న కొద్ది శక్తి, శివం ఒక స్థితిలో పరస్పరస్థానాలను మార్చుకుంటాయి. శివుడు శక్తిగా, శక్తి శివుడుగా మారతారు. స్థిర, చర శక్తులు రెండూ వాటి పాత్రలను మార్చుకుంటాయి. గోళాకారంలో త్రిమితీయంగా పైకి లేస్తాయి. వ్యక్తిగత చైతన్యం (జీవుడు) మెరుగైన జ్ఞానస్థాయిల ద్వారా పరమాత్మ (విశ్వ చైతన్యాన్ని)ను చేరుకునేదాకా, ఎంతో శక్తి ఉత్పన్నమై, శోషించబడుతుంది. కాబట్టి ఈ మధన ప్రక్రియలో జనన మరణాలు అనేవి జీవితంలో రెండు కనీస అంశాలు. తిరిగి పునర్జన్మ, మరణం కొనసాగుతాయి. ఈ చక్రం అది ఎంత కాలం కొనసాగాలో అంతకాలం కొనసాగుతుంది.
***
No comments:
Post a Comment