అందరినీ అక్కున చేర్చుకునే అమృత మూర్తి - గొల్లమూడి సంధ్య - అచ్చంగా తెలుగు

అందరినీ అక్కున చేర్చుకునే అమృత మూర్తి - గొల్లమూడి సంధ్య

Share This
అందరినీ అక్కున చేర్చుకునే అమృత మూర్తి - గొల్లమూడి సంధ్య 
భావరాజు పద్మిని.

‘మానవసేవే మాధవసేవ’ అంటారు. మనందరం గుడికి వెళ్లి, దైవానికి సేవ చేసే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తుంటే, ఆ దైవం అందరికీ సేవ చేసే వారి వెనుక, తనకు వారి సేవ చేసే చిన్న అవకాశం దక్కుతుందేమో అన్న ఆశతో తిరుగుతూనే ఉంటారట. సేవలో అంతటి గొప్పతనం ఉంది. అలా దైవాన్నే తన చుట్టూ తిప్పుకునేలా, ఆయన మనసునే కరిగించేసేలా, ఎదుటి మనిషిలో దైవాన్నే చూస్తూ సేవచేసే మానవీయ అమృత మూర్తి – గొల్లమూడి సంధ్య గారి ముఖాముఖి ఈ నెల ప్రత్యేకించి మీకోసం.

నమస్కారమండి. సేవాభావానికి బీజాలు బాల్యంలో పడతాయంటారు. మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి చెప్పండి.
నమస్కారమమ్మా. నా పూర్తి  పేరు  సంధ్య శకుంతల. పెళ్ళికి  ముందు నా ఇంటి పేరు యఱ్ఱమిల్లి. ఇప్పుడు గొళ్ళమూడి. జాతియొద్యమంలో పాల్గొని  జైలుకేళ్ళి వచ్చిన తాతలకు మనుమరాలినీ. దేశమంటే మనుషులని,నమ్మిన పెద్దలకు వారసురాలిని.
మాత మహులు ఏకా ఆంజనేయులు గారు గుంటూరువారు. దేశసేవ , కవిపోషకులుకూడా. స్త్రీ విద్యను ప్రోత్సహించినవారు .వీరు  చాలా, బీద కుటుంబంలో పుట్టారు. పలనాటి వారు. విద్యకూడాలేదు. అటువంటివారు స్వయంకృషితో  చాల గొప్పవారయ్యారు, ఆర్ధికంగా, సామాజికంగా కూడా ఎదిగారు.
ఇంక పితామహులు ఆగర్భ శ్రీ మంతులు. రావుబహుదూరులు. వారి తాత ముత్తాతలే డాక్టర్లు , న్యాయవాదులు. ఇంక సంఘ సేవ,కూడా వారి నరనరాన జీర్ణించుకున్నది. నరసాపురం లోపలి విడోహోమ్, నారాయణమూర్తి కాలేజి వ్యవస్ధాపకులు.
ఇంక అమ్మమ్మ ఆదిలక్ష్మి  ఆచారవ్యవహారలకు ప్రాముఖ్యత  ఇచ్చేవారుకాదు. మానవతే వారి థ్యేయం.
బామ్మ శకుంతలమ్మ గారు దాసు వారి ఆడపడచు. సాహిత్య, సంగీత ఘనులట. అటా’ అనడానికి కారణం వారు నాతండ్రికి 3 సం. వయసులోనే చనిపోయారు. మేము బామ్మగారుగా గౌరవించేదీ, వారిలోని ధైర్య , సాంఘిక , సేవ లక్షణాలను నేర్చుకున్నదీ,' మా బామ్మగారు' అని గర్వంగా చెప్పుకునే మా నాన్నగారి మారుటితల్లి  యఱ్ఱమిల్లి సూర్య కాంతమ్మగారు. ఇదీ మా కుటుంబ నేపధ్యం.

విద్యార్థినిగా మీరున్నప్పుడు జరిగిన మర్చిపోలేని సంఘటన ఏదైనా చెబుతారా?
నావిద్యార్ధి దశ హహహ. ఆటలకు,కళలకు ప్రాధాన్యతనిచ్చేదాన్ని. చదువులో వెనుకే . బాస్కెట్  బాల్, జావలిన్, డిస్క్..... ఇలా చాలా ఆడేదాన్ని. ఈ దశలో మరచి పోలేని సంఘటన ఒకటి మీకు చెప్తాను.
ఆనాటి ఆంధ్ర ఉద్యమాల సమయంలో మా కాలేజిలో  సభ జరుగుతోంది. తిరుపతి నుండి విద్యార్ధి లీడరుగా చంద్రబాబు నాయుడుగారు వచ్చారు. విశాఖ నుండి నాటి పెద్దలు ( తెన్నేటి వారు మొదలైనవారు) వచ్చి సభ మొదలు పెట్టారు.
ఇంకా బాబుగారు,రాలేదు. వచ్చినవారు సరిగా మాటాడటంలేదు. పైగా డబ్బువసూలుకివచ్చినట్టుగా  మాటలు మొదలెట్టారు,
వెంటనే నేమాటాడుతానని చెప్పి చీటీ పంపాను.  వెంఠనే వారి ప్రసంగాలు ఆపి నన్ను పిలిచారు.
"స్టేజిమీద, వున్న తెనేటివారికి మాత్రమే నా నమస్కారములు......." అంటూ సభలో నా ఉపన్యాసం మొదలుపెట్టాను. క్షణాలలో మాట లేకుండా సభ ముగించి వెళ్ళారు ఆనాయకులు.
అన్యాయం, అక్రమాన్ని పలికితే నాటినుంచి నేటివరకు నాకు పడదు. ఆ సంఘటన తరువాత ఆరాత్రి  పెద్దగొడవ అవుతుందనుకున్నారు. కానీ కాలేదు.ఎవరికీ నిద్రలేదు.
కాలేజికి వెళ్ళుతుంటేకొందరు,నన్ను ఆరాధనగా, కొందరు.దీని చంపేద్దాము అనట్లు చూసేరు కొందరూ.
తలచుకుంటే నవ్వు వస్తుంది.అంత మంది పెద్దలను చిన్న చీమనైన నేనెలా అనగలిగానూ అని ఆశ్చర్యంగా  కూడావుంటుంది.


సాధారణంగా వివాహమైన తర్వాత బాధ్యతలు, కొత్తబంధాలతో సేవకు సమయం ఉండదు. ఈ సమయం మీకు ఎలా గడిచింది?
అందరూ వయసుతో, వివాహంతో మారి పోతారు, కానీ నాలో మార్పురాలేదు. రాకూడదనే అనుకుంటున్నాను. బాధ్యతలు, బరువులు!! ప్రతి వ్యక్తికీ వుంటాయి. తెముల్చుకోడం, సమయ ప్రణాళిక వేసుకోవడం  మన చేతులలో వుంటుంది.
మామూలుగా "ఆడది"అనగానే వంట,తంట అనే వారు ఎక్కవ శాతం వుంటారు. మగవారు ఆడవారితో ఇకయికలు, పకపకలు చేసినా పట్టించుకోరు. తమ సమయమంతా ఆఫీసుకే అన్నా ,సర్దుకుపోతారు మహిళలు. అదే ఆడదంటే !! మాది అందులోనూ  సంధికాలం.
కానీ ఎన్నడూ,నాపై ఒక అపవాదుకూడా రాలేదు. కారణం, పిల్లలూ పెద్దలూ కూడా ఇంటిలో ఎంత ప్రేమగా వుంటామో, ఒకరి ఆలోచనలకు, పనులకు, ఆదర్శలకు గౌరవం ఇచ్చే విషయంలో కూడా అలాగే ఉంటాము. అందువల్ల  నాపనులకు, సేవా కార్యకృమాలకూ ఎప్పుడూ ఆటంకం రాలేదు.
అంతేకాదూ. నేను ఎప్పుడూ ఆర్ధికంగా ఎవరిమీద ఆధారపడలేదు. సేవకు డబ్బు చాలా అవసరం అనప్పుడు ఓకాగితంమీద దరఖాస్తు  రాసి దగ్గరలో ఉన్న బడిలో ఇచ్చేదాన్ని. ఠక్కున ఉపయోగించేది. నెల్లురులో అయితే ట్యూషన్లు కూడా చెప్పాను,
అందరికీ ఆశ్చర్యంగా  ఉండేది. 1980 లలోనే   ట్యూషన్ల ద్వారా  చాల చాల సంపాదించాను. అసలు రోజు 3 గంటలు కష్టపడితే, నేచేసే సేవకు డబ్బు వచ్చేస్తుంది కదా, ఇక ఇంటిలో వారిని అడగాల్సిన పని ఏమిటీ?
హైద్రాబాదు వచ్చక కూడా1992 లో మంచిపనులకోసం, నిరుద్యోగులకోసంకూడా రియలెస్టేటు చేసి డబ్బు అందరికి అందేటట్లు చేసాను. నాకుగుర్తుండి, దీనివల్ల 25 కుటుంబాలు చాల చక్కగా స్థిరపడటమేకాకుండా, " ఆ బాపనమ్మని జూసి నేర్చుకోండని" చెప్పేవారు. అలా పెద్దల ప్రోత్సాహంతో 200 మంది మంచిగా కష్టపడి బాగుపడ్డారు.
నేను ఏనాడూ  నా బాధ్యతలు ( నాకు చాల బాధ్యతలే వుండేవి) నా సేవా కార్యక్రమాలకు  అడ్డు అనుకోలేదు. అందరికీ నే చెప్పేది ఒకటే . సోషల్ మీడియాలో అంత స్వేచ్చగా మీరు ఉంటున్నారూ అంటేనే ఇంటిలో మీకు ఆంక్షలు లేవని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాలయాపనం  హాబి అనికూడ చెప్పవచ్చు. అదేమీడియా,ద్వారా చాలా మంచి పనులు చేయవచ్చు, చెయ్యాలి కూడా. ఈ దిశగా ప్రయత్నించండి.


మీకు ఎల్లప్పుడూ ప్రేరణ కలిగించే సేవామూర్తి ఎవరు?
మా అమ్మకు ముగ్గురు అక్కలు, ఓ చెల్లి. పెద్దఆమ్మ, చినఆమ్మ, బుజ్జామ్మ
అనిపిలిచేవారం. పెద్దఆవిడ రెండో తరగతే చదివారు. కానీ!! ఆవిడ ఛందోబధంగా 15 శతకాలులలితా సహశ్ర నామాలకు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క  సీస , తేటగీతి, కంద పద్యాలను వ్రాసారు. ఇంక చిన్నామ్మ  ఈమె బాల్య వితంతువు. 13 వ ఏట పెండ్లి  అయిన 3 నెలలకే ఆమె భర్త మరణించాడు. టీబీ పేషంటుని కట్టబెట్టి మోసంచేసి చేశారు. ఆమె ఆపై  మారుమనువు చేస్తానన్నా చేసుకోలేదు. సేవకు మారు పేరు ఆవిడ. కుడి ఎడమా తేడాలేకుండా చేసేదీ.
ఓసంగతి చెప్పనా. వీరంతా మహాభక్తులు. ధర్మాన్ని నమ్మేవారు,  కానీ ఆధునిక  భావాలకు  పుట్టినిల్లు వంటివారు. వీరు తమ మరణానంతరం కళ్ళు, శరీరం వైద్యశాలలకు ఇమ్మనమనడమేకాకుండాఖర్మకాండ చేయవద్దని చెప్పినవారు!!
నాకే చాల ఆశ్చర్యంగా  వుంటుంది ఒక్కొ సారి. ఆ చిన్నఆమ్మే నాకు ఆదర్శం.

ప్యూర్ నెలకొల్పడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి?
PURE! పీపుల్సు ఫర్ అర్బన్  ఎండ్ రూరల్ ఎడ్యుకేషన్.
వెనుకబడిన తరగతులకోసం - అంటే ఆర్థికంగానా! సామాజికంగానా అని నన్ను అడగకండీ. ఎందుకంటే మనదేశంలో సంగతి మీకు తెలిసిందే. మాకు కులమతాలతో సంబంథం లేదు. చదువులో వెనుకబాటూ, ఆర్ధికంగా వెనుకబాటు, దేశంలో వెనుకబాటు - ఇవే నాకళ్ళ ముందుకనపడతాయి. దేశం కోసమే సామాజికంగా వెనకబడ్డాము  అంటున్న వారిలోనే స్వార్ధచింతన ఎక్కువగా వుందితమ తోటివారికి అందాల్సినవి కూడా, వీరే స్వాహా  చేసేస్తారు.
ఇంక ఆడపిల్ల. ఆడ ఏదో తెలియనది, మనింట్లో పుట్టిందన్న చిన్నచూపు ఇంకా చదువుకున్నవారిలో, వెనుకబడిన తరగతులలో కూడా 80% ఉంది. అందుకే ఆడపిల్లలని, ఆర్ధిక ఇబ్బంది ఉన్న వారూ( కులమతములతో సంబంధంలేదు) వారెంత తెలివైన పిల్లలైనా కూడా, వసతులు సక్రమంగాలేని ప్రభుత్వ  పాఠశాలలో చేరుస్తుంటారు. ఈ రోజుల్లో డబ్బువుంటేనే చదువుకాదూ! తెలివివుంటేనే చదువు వస్తుందనీ, 'ఆడపిల్లే రేపటీ దేశపు వెలుగని' చూపించాలన్నతపన నాది.
కానీ అది, ఈ వయసులో నేను ఓ సంస్ధను స్ధాపించి చెయ్యగలనావుహూ అయ్యేపనికాదు. అర్ధాంతరంగా నాఊపిరి ఆగితే!! ఆశపెట్టి పిల్లల విద్యా వికాసాన్ని ఆదిలోనే తుంచేసినదాన్ని అవుతాను కదా. నాబాధ, వేదన   అర్ధంచేసుకోడమే కాకుండా ,నాలానే ఆలోచించే 1980 నాటి నా సహ విద్యార్థులు  నాతో చేతులు కలిపారు. ఖమ్మంజిల్లా బాసిత్నగరతండా బడిపిల్లల, పరిస్ధితిని నాద్వారా తెలుసుకొని ఇంక ఆలస్యం వద్దు, మనం మనదేశానికి ఇంతో కొంతో ఉపయోగపడాలీ అని తమ నిర్ణయం తెలిపారు. విద్యద్వారానే ఆర్ధిక అసమానతలను తొలగించగలమన్న భావనతో, నా కుమార్తె అయిన 'శైల తాళ్ళూరి' తన మిత్రబృందాన్ని ఒక తాటిపైకి తెచ్చి హైదరాబాదులో pure సంస్ధను రిజిష్టరు, చేయించడమూ జరిగింది.

ప్రస్తుతం ఈ సంస్థ ఏ ఏ దేశాల్లో, ఏ ఏ సేవలను అందిస్తోంది? ఈ సంస్థ ముఖ్య సభ్యులు ఎవరు?
అది ఒక టృష్టు. నేను  మేనేజింగ్డైరక్టరునువిజయరామిరెడ్డి గారు ఛైర్మన్ ,ఇక్కడ 2016 మార్చిలో రిజిష్టరు అయింది. వెంటనే USA లోకూడ రిజిష్టరు అయింది. 
భారతదేశంలో, అమెరికాలో  కూడ ప్రభూత్వాలు   pure సేవలను గుర్తించడమే కాకుండా, 80g ని కూడా ఇచ్చారు. అమెరికాలో 80g అనరు. కానీ విషయం వొకటే. దాతలకు పన్ను భారంవుండదూ. ఇక సేవలకు సహాయం అమెరికా, కెనడ, ఆస్ట్రేలియా లోని తెలుగువారి ద్వారా వస్తుంటాయి.
అమెరికాలొ మా సభ్యులు నలుగురు.
శైల తాళ్ళూరి -- సంస్థ వ్యవస్ధాపక మార్గదర్శి, డైరెక్టర్  నూటికి 80% ఫండ్సు,వారిద్వారానే వసూలు చేయపడతాయి, వారిద్వారానే అన్ని వస్తువులు యువ పారిశ్రామిక వేత్తల ద్వారా ప్యుర్ ఆఫీసుకువస్తాయి.
దీప కమలాకర్ - డైరక్టర్. బడులలోని అధ్యాపకులను phone ద్వారా సంప్రదించి, వారి అవసరాలను కనుక్కుని  వసతులు సమకూర్చి, నాకు తెలియచేస్తారు.
అర్చన చక్రవర్తి(పూరిణి)- మొత్తం  స్పాన్సరర్సు విషయమూ తనే నిర్వర్తిస్తుందీ.
భాను వల్లభనేని - ట్రెజరర్,మంచి సమర్ధుడు.
ఇది అమెరికా  బృందం.

తొలి దశలో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు?
మొదట్లో నామితృలకు ఆర్డరుచేసి వారిసహాయం తీసుకోవాల్సి వచ్చేది. ఒక నాలుగుసార్లు ఇలా జరిగింది. ఎప్పుడూ నేను కానీ, సంస్ధకానీ ఇబ్బంది పడలేదు. మన పరిధిలోనే చేసేవారం.అత్యవసరం అనుకుంటే సంఘ సభ్యులు వెనుకాడకుండా తమే డబ్బు సమకూర్చేవారు. అంతా కలిసి మా చేతిలో దాత ఇచ్చినది పెడితే,  రేండుచేతులతో కళ్ళకద్దుకొని మరీ తీసుకుని, కొన్ని గంటలలో అవసరమైన వారికి అందించేవాళ్ళం. ఆనమ్మకమే ప్యూర్  ని పూర్తిగా రెండు సంవత్సరాలైనా కాకుండానే పెద్దసంస్ధలతో చేయికలిపి పని చేసే స్ధాయికీ భారత, ప్రభుత్వగుర్తింపుకూ  తేగలిగింది,
బడిలో చేసేపనులకు ఆ టీచర్లుప్రధాన, వుపాధ్యాయిలు బాధ్యత వహిస్తారు. చాలా బాధ్యతగా చేస్తారు. మొదట్లో రెండు ఊళ్ళకుమాత్రం నేనూ, నా సోదరుడు ఉండి పనులు చేశాము. అనుభవం మీద అర్ధమయింది - మనం అక్కడవున్నవారికి అప్పచెపితే మనకు శ్రమా తప్పుతుంది, వారికి వారి బడిమీద ప్రేమా కలుగుతాయని.
ఇంకోసంగతి. ప్రమాదవశాత్తు కాళ్ళు లేనివారకూ , చేతులు పోయినవారికీ కూడ అవయవాలు పెట్టిస్తాము. ప్రభుత్వ విద్యార్థులకు  మాత్రమే! జైపూర్ లెగ్గులవంటివి కావు. కాని, పిల్లలు ఎదుగుతుంటే వాటిని కూడా ఎడ్జస్టు చేయవచ్చు, మనం ఎలా పాదం, మోకాలు, తొడల,దగ్గర కదలికలు చేయగలమొ అలానే సహజంగా వుంటాయి.
ఇంక ఆటలలో అందెవేసినవారికి కావలసిన వసతులు కల్పించడం, దూరంనుంచి వచ్చే పిల్లలకు సైకిళ్ళు అందించడం. యిలా అన్ని వసతులు మనపిల్లలకి అందిచడం మన pure ధ్యేయం.
లైబ్రరి వసతిని కూడా మేము కల్పిస్తాము. చక్కని పుస్తకాలు  అందించి పఠనావ్యసంగములో వారికి ఆసక్తి కలిగిస్తాము. మన pure బడులలో దరిదాపు 500 పైచిలుకు పుస్తకాలను అందించాము.


మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? మీ ప్రణాళికలను ఎప్పుడు సిద్ధం చేసుకుంటారు?
మన రెండు తెలుగు రాష్ట్రల ప్రభుత్వ పాఠశాలలకూ, ఆర్ధికంగా, వెనుకబడిన అనాధ బాలబాలికలకూ, తండ్రిలేని పిల్లలకూ స్కూల్ ఫీజు , కాలేజీ ఫీజు కూడా ఈ సంస్ధ కడుతుంది . అట్లా మెడిసన్ చదువుకున్న వారు  కూడా ఉన్నారు.
మధ్యాహ్న ఆహారపధంకంతో ఉదయం కడుపునిండుతుంది. మరి రాత్రి ?
అలాంటి పిల్లలకు కూడా, నెలనెల ఆర్ధిక సహాయం అందుతుంది. వీరందరి సంఖ్య కూడా ఎక్కువే. 8 నెలల క్రితంనుంచి నెలవారి శుభ్రత  కార్యక్రమంకూడా జరుగుతోంది.
ప్రభుత్వపాఠశాలలలో శానిటరీ నాప్కిన్ వెండింగుమిషన్లు, వాడిన వాటిని కాల్చేసే మిషనరీ కూడ అందచేస్తోంది ప్యుర్. వీటికి కారణం నెలనెల వచ్చే అవసరానికి బట్టకూడా కరువై బడికి రాని పిల్లలెందరో. దానివల్ల చదువులోహాజరులో వెనకపడటం. పిల్లలు, దిగులుపడటం జరుగుతుంది. ఇలా ఎంతో మానసిక వేదనకూడ పిల్లలు అనుభవిస్తారు.
ఒక్క మాటలో చెప్పాలీ అంటే చదువుకునే పిల్లలకి మనయిళ్ళలో ఎలాంటి సదుపాయలను మనం అందిస్తున్నామో, అవన్ని మన pure పిల్లలకి అందించాలనే సంకల్పాన్ని సాకారంచేయడానికి అహర్నిసలు కృషి చేస్తోంది ప్యూర్. ఈ సంస్ధ వ్యవస్ధాపకురాలు శైల. ఆమె ప్రణాళికలను నేను 100% అమలు  చేస్తున్నాను. రోజూ ఇరువురము  18 గం పని చేస్తాము. కాని మా జీవితంలోని సరదాలు, షికార్లు మానమండోయ్.  డిశంబరు నెలలో పాత ప్రాజక్టులు పూర్తి చేస్తాము. కొత్తవి జనవరినుండి మొదలు పెడతాము. మేలో మళ్ళి,బ్రేక్. అంటే తిరుగుడు వుండదు. బడులుతెరిచే నాటికి  చేయవలసిన పనులన్నీ ఆలోచించుకుని, సిద్ధం చేసుకుంటాము.

మీ ప్రయాణం లో మీ మనసును బాగా కదిలించి కన్నీరు పెట్టుకునేలా చేసిన సంఘటన ఏదైనా ఉందా?
నిజంచెప్పాలీ అంటే నేను దేశానికి ఉపయోగపడాలి, అనుకున్నప్పుడు అడవులలోకైనా వెళ్ళగల  థృడ సంకల్పినిగా మారాను.
నాకు మరచిపోలేని , నా మనసును కదలించిన గాధలెన్నో!!
1.ముట్టుబట్టలేక ఇసుక, మట్టీ గడ్డిలో చుట్టి దానివారా గుధముపుండయితే ‘ఎవరితో తిరిగిందో పిటపిట లాడుతోంది, నాకు ఛాన్సురాలేదన్న’ మొగవారిమాటలను విన్నప్పుడు.
2. తండ్రి కాల్చిచంపితే ఆతల్లి సమాధి దగ్గరకుతీసుకెళ్ళీ " అమ్మమ్మా! అందరూ, నాకు అమ్మలేదంటున్నారు. అదిగొ అమ్మఅక్కడ బబ్బుంది " అన్నఒకటోతరగతి బాలుడిమాటలను విన్నప్పుడు.
3. తింటానికి లేక ఎండిన స్ధనాన్ని పిల్లవానికి ఇస్తు, డబ్బుకోసం ఆ రోజు తిండికోసం తరలి, వెళ్ళుతున్న అమ్మని చూచి. ‘ఆరోజకి ఆపగలిగాను, రోజుఆపలేను. తిండి పెట్టలేను, కదా’ అని బాధ కలిగినప్పుడు.
4. చదువుకుందామంటే  బట్టలులేక బడికి రాలేని పసి పిల్లలని చూసినప్పుడు.
ఇలా ఎన్నో. ఒకటారెండా.  
చనిపోయీన వారిని తెలేదుకానీ pure తాను చూచిన ప్రతివారి బతుకులను ఓదారికి తెచ్చిందని ఖచ్చితంగా చెప్పగలను.



సరైన రోడ్డు, రవాణా, వసతి సౌకర్యాలు లేని పల్లెలకు కూడా సేవకోసం మీరు వెళ్ళి పోతుంటారు. మీకు భయమెయ్యదా? ఆ సమయంలో మీ మనఃస్ధితి ఎలా ఉంటుంది?
భయం!! 
అది ఎలావుంటుందో తెలియదు. నిజం, నాకు దేవుడంటే భయంలేదు. భక్తిమాత్రమే. దెయ్యమంటే భయంలేదు- అదినీనీడేగా! 
జంతుభయంలేదు- మనసమాజంలోని జంతువులకంటే అవి ఏమి క్రూరమైనవి కాదు కనుక. అపనింద భయంలేదు- నాకు ఓ జోకు దొరికిందని నవ్వు. దారిద్ర భయంలేదు- వునప్పుడు ఆనందించిన, నీవు అదీ ఆనందంగా తీసుకో. పసుపుకుంకుమల సెంటి మెంటు భంయంలేదు- 25 కేళ్ళకే వాటితో చనిపోయిన ఆడది ఏమనుభవించిందని, దాన్ని అదృష్టం  అనాలీ. ముదుసలై లేవలేని మగడు మంచంలోవుఁటే !! నేముందు పసుపుకుంకుమలతో పోవాలనుకునే ఆడది నాదృష్టిలో ఆడదికాదు. మనిషి కూడాకాదు.
ఎదుటవ్యక్తికి నీఅవసరము వున్నప్పుడు పసుపుకుంకమకోసం ముందుపోయి నీతో కష్టం సుఖాలను పంచుకునవాణ్ణి అన్యాయం చెయ్యాలని కోరుకోకూడదు కదా. ఇంక వృధ్ధాప్య భయం- లేదు. నేకన్నానని, నాపిల్లలు చూడాలీ అనుకోను. ఎవరు చూస్తారు అన్న ఆలోచనలేదు. అంటే భవిష్యత్ పనులు,లేకుండా బతుకుతునానని కాదు. ఇంక ఎలాంటి భయాలూ-నాకులేవు. అందుకే వెళుతుంటాను.


మీరు పొందిన అవార్డులు, ప్రశంసల గురించి చెబుతారా?
ప్రసంసలూ !పురస్కారాలు! రాష్ట్ర , దేశ , విదేశాలవి చాలా వున్నాయి. వాటి ప్రసక్తి వద్దు. అవార్డులు బాధ్యత- గర్వం రెండు పెంచుతాయి. నేను బాధ్యతనే తీసుకోదలచాను, అందుకువాటిని బీరువాలలో దాచేసాను.

ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలేమిటి? మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
ప్యూర్  నిరంతరం సాగేవిద్య, సేవ, విద్యతోపాటు ఆహ్లదకరవాతావరణం, పుస్తకపఠనం ,ఆరోగ్యం , ధైర్యం, స్వయంఆలోచనా శక్తిని కలిగించడం, ఆధునిక విద్యా విధానలతోపాటు మన దేశపు విద్యలను కూడా ప్రోత్సహిస్తుంది. 
ఇంతేకాకుండా ప్రస్తుతం ఉమెన్ హైజీన్ గురించి ప్రచారం చేయడం, వారికి కావలసిన వసతులను అందించడం. డిజిటల్ క్లాసుల-ద్వార ఆగ్ల బోధన కూడ అవసరం మేరకు అందించడం చేస్తోంది.
పచ్చని చెట్ల చెలిమి  పిల్లలకు నేర్పడం, పుస్తక పఠనం ద్వార ఆలోచన పెరుగుతుందని  పాఠశాల గ్రంధాలయాలకు సహకరించడం,
వంటివి చేసామని గర్వంగా చెప్పుకోవచ్చు.ఈ వుమెన్ హైజీన్ కోసం మనం అందించే మెటీరియల్, మిషనరీ, ప్యూర్  అమ్మమ్మ ఉపన్యాసంలాగాకాకండా చెప్పే ఉపన్యాసలకు ఆంధ్ర, తెలంగాణాలో ని, చాలజిల్లాలలోని అధికారులు, విద్యాధికారులు మన-pure తో చేతులుకలిపి ముందుకు సాగడానికి సిద్ధంగావున్నారు, ఇది చాలా సంతోషించ తగిన విషయముకదా.
  

‘మానవత్వం పరిమళించే’ మంచి మనసున్న సంధ్య గారు, pure సంస్థ అఖండ విజయాలను సొంతం చేసుకోవాలని, పలువురి మనసులు గెల్చుకోవాలని, మనసారా కోరుకుంటోంది –అచ్చంగా తెలుగు.

1 comment:

  1. గ్రేట్ సంధ్యా . మీకు జోహార్ .

    ReplyDelete

Pages