శివమ్మ కధ - 6 - అచ్చంగా తెలుగు
శివం- 30 
( శివుడే చెబుతున్న కధలు)
శివమ్మ కధ – 6
రాజ కార్తీక్

 9290523901

(శివమ్మ ప్రేమకి మహాశివుడు కరిగి ఆమె ఇంటికి వస్తాడు. తనతో చిన్న పిల్లవాడి లాగా ఆడుకుంటాడు. తను ఇచ్చే పాయసం కోసం ఎదురు చూస్తాడు. నంది కూడా అక్కడే  ఉండి మహాదేవుడి ప్రవర్తన చూసి ఆనందపడతాడు. శివమ్మ మిక్కిలి ఆనందంతో  శివుడ్ని వాటేసుకొని, కులబడుతుంది. శివయ్య కూడా మాములు మనిషిలా కంగారుపడతాడు )

నా కళ్ళలో నీరు...మా అమ్మ కి ఏమైంది అని ..

నేను"అమ్మా! నీకు ఏమైంది ..ఏమైంది "అన్నాను  గద్గద స్వరంతో.

నంది "ఏమిటి ఇది శివయ్య ?ఒక చిన్న పిల్లాడి లాగా అమ్మ కోసం కంగారు  పడుతున్నాడు? తను రచించిన సృష్టిలో ఏమిజరిగినా చెక్కు చెదరకుండా ఉండే శివయ్య, ఏంటి ఇలా సాదారణ మనిషిలా ఉన్నాడు?" అని ఆశ్చర్య పోతున్నాడు. 
"లే లే అమ్మా "అని అంటున్నాడు. 
శివయ్య కంటిలో కంగారు చూసి ..అందరూ కరిగిపోతున్నారు.
విష్ణు దేవుడు "సోదరీ,  శివాని !చూసావా మహాదేవుడు భక్తుల కోసం ఏమన్నా చేస్తాడు,ఒక చిన్న పిల్లాడి లాగా తన తల్లి కోసం చూస్తున్నాడు  " అన్నాడు.
పార్వతి మాత "సోదరా, ఏ రకంగానైనా మహాదేవుడు ప్రేమ పొందితే ..అంతకన్నా  ధన్యులు ఎవరు ..శివమ్మ కన్నా అదృష్ట వంతులు ఎవరు .." అంది.
బ్రహ్మ సరస్వతులు "మొట్ట మొదటిసారి మహాదేవుడు ఒక మాములు మనిషి వలె తను మారిపోయి, శాశ్వతం కాని బంధాల కోసం ఇలా ప్రాకులాడుతున్నాడు. ఆహా భక్తి కి భగవంతుడు దాసాను దసుడని అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది "

అన్నారు.

నంది "ప్రభు అమ్మ కి ఏమైంది .." అని అడిగాడు.
నేను చిన్న పిల్లాడి లాగా బేల గా "తెలీదు" అన్నాను.
పార్వతి మాత  మహాదేవుడి కంగారు చూసి ఉపాయం ఆలోచించింది. 
అక్కడ శివమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నపూర్ణ విగ్రహం నుండి వాణి వినిపించింది .
"నంది ..శివమ్మ తల్లి మహాదేవుడికి పెట్టనిదే ఏమి తినకూడదని ,ఏమి తినలేదు. అందుకే ఆమెకు సహజమైన నీరసము వచ్చింది .."
మహాదేవుడు అది విని వెంటనే శివమ్మని ఎత్తుకొని ఒక చోటు పడుకోబెట్టి ,వంట గది కి వెళ్ళాడు.
నంది శివమ్మ ని కనిపెట్టుకొని ఉన్నాడు ..
శివమ్మ చేసిన పాయసం తీసుకువచ్చాడు.
వచ్చి శివమ్మని చిన్న పిల్లవలె తన గుండెల మీద పడుకోబెట్టుకొని తన జటలో నుండి నీరు తీసుకొని మొహం మీద చల్లాడు ..
శివమ్మ కి స్పృహ వచ్చింది.శివయ్యకి నందికి అందరికి ఎంతో ఆనందం 

కలిగింది.

నంది "పార్వతి మాత నీకు ధన్యవాదాలు" అన్నాడు.
నేను "అమ్మా, ఏంటి ఇది ఏమీ తినకుండా  ఎందుకు ఉంటావ్.."అని అడిగాను.
శివమ్మ "నీకు పెట్టి తిందామని కన్నయ్య ." అంది.
నేను "ఎప్పుడైనా నేను చెప్పానా, నాకు పెట్టి తినమని..నువ్వు తినకపోతే  నీలో ఉన్న నేను ఎంత బాధపడతాను ?  ఆలోచించావా? ఎందుకమ్మా అలా చేస్తావ్..నువ్వు బాధ పడితే నేను చూడగలనా..." అన్నాను.
శివమ్మ కి మాట రావట్లేదు.. ఆనందబాష్పాలు తప్ప.
శివయ్య తెచ్చిన పాయసం  ఆమెను తన గుండెల మీద పడుకోబెట్టుకొని తాగిస్తున్నాడు ...చిన్న పిల్లలకు తన తండ్రి సుస్తి చేస్తే మందు వేసినట్టు..
నంది "భోలా నాధ ..నువ్వు అమె బిడ్డవా? తండ్రివా...అవును ఏది అనుకుంటే అది " అంది ఆనందబాష్పాలతో.
ఈ సంఘటన ఎవరు చూసినా,  మనసు పులకించిపోతుంది.
పార్వతి మాత ఐతే ..తల్లి కొడుకులని చూసి దిష్టి తీస్తోంది.
అన్ని లోకాల వారు చూసి ఆనందపడుతున్నారు.
విష్ణు దేవుడు "సోదరి ..మహాదేవుడ్ని చూస్తే నాకు అసూయగా ఉంది .ఈ తల్లి ప్రేమ కైనా నేను తొందరగా అవతారములు ప్రారంభించాలి." అని, "సరే కానీ ఏమిటి ఈ శంకరయ్య పాయసం మొత్తం వాళ్ళ అమ్మకి తాగిస్తున్నాడు " అన్నాడు.
నేను మా అమ్మ కి  ఓపిక వచ్చేదాకా ఆ పాయసం తాగిస్తున్నాను.
ఆ పాయసం కోసం ఎదురుచూస్తున్న నంది కూడా మనసులో పాయసం అయిపోతుందా అని చూస్తున్నాడు.
శివమ్మ కళ్ళు తెరిచి "శివయ్య పాయసం నీకోసం చేస్తే  నాకు ఇస్తున్నావేంటయ్యా "అని అడిగింది.
నేను "అమ్మా, నువ్వు తాగితే ఏంటి నేను తాగుతే ఏంటి ..నువ్వు అలా పడిపోయేసరికి,  నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. అందుకే ఇప్పుడు ఇది సిద్దంగా ఉందని నీకు తెచ్చాను "అన్నాను.
శివమ్మ సేవిస్తున్న పాయసం సగం పైగా అయిపొయింది ...శివయ్య తాగిస్తున్నాడు ..కానీ శివమ్మ మాత్రం అది ఆపి నువ్వు కూడా తాగవయ్య అని అంది.
ఏమి జరగబోతోందా అని అందరు చూస్తున్నారు.
నంది మాత్రం 'ఏమైనా మహాదేవుడు చేయగలడు. కానీ ..ఆమె కోసం ఒక పసిబిడ్డలా పరితపిస్తున్నాడు ఏమిటో' అనుకున్నాడు.
శివమ్మ "శివయ్యా, నీకు లోపలి వెళ్లి    పాయసం తెస్తానుండు, నేను తాగింది నీకు ఎందుకు?  " అంది.
నేను "లోపల లేదు అమ్మా, నువ్వు ఎక్కువ పాయసం తగితే  మళ్ళి అన్నం తిననేమోన ని కొంచెం చేసావ్..." అన్నాను.
నంది "అమ్మా, పోనీ నా కోసం ఉంచిన పాయసం శివయ్యకి ఇవ్వు" అన్నాడు.
నేను "ఓయ్ ఎవరికీ పాయసం లేదు అని చెప్పాగా. నాకు మా అమ్మకే " అన్నాను.
నందేమో బుంగ మూతి పెట్టాడు..విష్ణు దేవుడు మాత్రం ఏదో యుక్తిగా పాయసం కోసం ఎత్తుగడ వేస్తున్నాడు.
నేను "అమ్మా నువ్వు  తాగిన పాయసం ఉందిగా అదివ్వు" అన్నాను.
శివమ్మ "వద్దు అది ఎంగిలి " అంది కంగారుగా.
నేను "ఊరుకో అమ్మ తల్లి బిడ్డకు మధ్య ఎంగిలి ఏంటి" అన్నాను.
నేను మిగిలిన పాయసం తీసుకొని ఆస్వాదిస్తూ తాగుతున్నా.
"అబ్బ ఏమి పాయసం ..ఏమి భక్తీ ..ఏమి భావం ..ఇలాంటి భక్తి తో పెట్టే పాయసం కన్నా గొప్పది ఏమి ఉంటుంది? ఏమి చెయ్యాలి ఈ నా తల్లి కోసం .." అనుకున్నాను.
నా  మొహం లో ఉన్న ఆనందం  అంతా ఇంతా కాదు.
హాలాహలం తాగుతున్నప్పుడు ఏమి బాధ పడలేదు ..కానీ ఈ పాయసం ...అందులో నా భక్తురాలి ,నా తల్లి ఎంగిలి చేసిన ఈ పాయసం ..ఆహా..ఇంతటి మధురానుభూతి ఏనాడూ కలగలేదు.
శివమ్మ ఆనందబాష్పాలతో చెంపలు వేసుకుంటూ "హరహర మహాదేవ.." అంది.

పాయసం తాగుతున్న నేను చెంపలు వేసుకోవద్దు అని వారించాను.

నంది మాత్రం తాను ఆరాధన గా అలిగినట్టు చూస్తున్నాడు. 
విష్ణు దేవుడు కూడా ఏదో తీవ్రమైన మైమరుపులో ఉన్నాడు .అలాగే పార్వతి మాత కూడా!
నేను పాయసం తాగటం ఒక్క నిమిషం ఆపాను .
శివమ్మ "ఏమైంది శివయ్య .." అని అడిగింది.

(సశేషం)

No comments:

Post a Comment

Pages