పంచ మాధవ క్షేత్రాలు - 3 - అచ్చంగా తెలుగు
శ్రీ వేణీమాధవ ఆలయం, ప్రయాగ
పంచ మాధవ క్షేత్రాలు - 3 
శ్రీరామభట్ల ఆదిత్య 

పవిత్రతకు నిలయం ప్రయాగ క్షేత్రం. హిందువులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే వారణాసికి దాదాపు 135 కిలోమీటర్ల దూరంలో ప్రయాగ పుణ్యక్షేత్రం వెలసియుంది. పవిత్ర త్రివేణీ సంగమంగా పేర్కొనే అలబాద్ నగరాన్నే ప్రయాగగా వ్యవహరించడం పరిపాటి. 12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళ మహోత్సవాలు ప్రయగా పుణ్యక్షేత్రానికి మరింత శోభను సంతరించిపెట్టాయి. దేశంలోని ప్రధాన నదులైన గంగ, యమునలు ఇక్కడ సంగమిస్తాయని వీటితోపాటు సరస్వతీనది కూడా ఇక్కడ అంతర్లీనంగా వచ్చి కలుస్తుందని చరిత్ర చెబుతోంది. అందుకే పవిత్ర నదులైన మూడు నదులు కలవడం ద్వారా దీన్ని త్రివేణి సంగమంగా భక్తులు వ్యవహరిస్తుంటారు. ఇంతటి మహత్యం ఉండడం వల్లే పవిత్ర త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తే సకల పాపాలు హరించడంతో పాటు మానవులకు ఇహ, పరలోక సౌఖ్యాలు అందివస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రయాగకు దగ్గరలోని దారాగంజ్ లో ఉన్నది. తీర్థరాజమైన  ప్రయాగకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనందరికీ తెలుసు... దారాగంజ్ ప్రాంతం అలహాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ప్రాంతం. ఆలయం ప్రయాగలో పవిత్ర యమునా నది తీరంలో  సరస్వతీ ఘట్ కు దగ్గరగా ఉంది..అంటే త్రివేణీ సంగమంలో యమునా నది సంగమించకముందు ఆలయమే యమునా నది ఒడ్డున ఉన్న చివరి ఆలయం అన్నమాట. ఇక్కడి  వేణీమాధవుణ్ణి "వేణీ మాధో భగవాన్" కూడా అంటారు.. ప్రయాగలోని 12 మాధో ఆలయాల్లో వేణీ మాధవ ఆలయం చాలా ప్రముఖమైనది... తులసీదాసు తన "రామచరితమానసము"లో వేణీమాధవుణ్ణి ప్రయాగకు రాజుగా అభివర్ణించాడు... ఇంకా ప్రయాగలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసిన భక్తులు వేణీమాధవుణ్ణి దర్శించకుంటే స్నాన ఫలం పొందరని కూడా తన రామచరితమానసంలో చెప్పాడు తులసీదాసు..

శ్రీ వేణీమాధవ స్వామి ఆలయం లక్ష్మీనారాయణులకు అంకితం ఇవ్వబడింది. ఆలయంలో మనకు లక్ష్మీదేవి తోపాటు నారాయణుని విగ్రహాలు కనిపిస్తాయి కాబట్టి ఆలయాన్ని లక్ష్మీనారాయణ దేవాలయం అని కూడా అంటారు. పద్మపురాణం ప్రకారం ప్రయాగ క్షేత్రానికి వేణీమాధవుడే అధిదేవత. ప్రయాగలో జరిగే కుంభమేళా మరియు అర్థకుంభమేళా సమయంలో ఆలయం కిక్కిరిసిపోయి ఉంటుంది. పవిత్ర క్షేత్రమైన ప్రయాగ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటని మనందరికీ తెలుసు. తమ వనవాసంలో సీతారామలక్ష్మణులు ఆలయాన్ని దర్శించినట్టు చెప్పబడి వుంది...శ్రీ  చైతన్య మహాప్రభువు కూడా ప్రయాగ వచ్చినప్పుడు ఇక్కడ కొంత కాలం గడిపారు.. ఆలయంలోని రాధాకృష్ణుల మూర్తుల చాలా అందంగా ఉంటాయి.. ఇవి త్రేతాయుగం నాటివని చెప్తారు..త్రివేణీ  సంగమ స్థానం నుండి ఆలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది....ప్రయాగ వెళ్ళినప్పుడు ఆలయాన్ని తప్పక దర్శించండి....
(సశేషం)

No comments:

Post a Comment

Pages