నాకు నచ్చిన కథ-అర్రు కడిగిన ఎద్దు-శ్రీ త్రిపురనేని గోపీచంద్ - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కథ-అర్రు కడిగిన ఎద్దు-శ్రీ త్రిపురనేని గోపీచంద్

Share This

నాకు నచ్చిన కథ-అర్రు కడిగిన ఎద్దు-శ్రీ త్రిపురనేని గోపీచంద్

టీవీయస్.శాస్త్రి


మనిషికీ,జంతువుకీ ఒక తేడా ఉందని అనుకునేవా​ణ్ణి . ఈ కథ చదివిన తరువాత పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది.జంతువు​ ​దాని పిల్లలకు ఒక వయసు వచ్చిన దాకా పోషించి వదిలివేస్తుంది.​ ​అప్పటినుంచి​ ​దాని ఆహారం చనిపోయేవరకూ అదే సంపాదించుకోవాలి.ముసలిదై పనికి రాకపోతే​ యజమాని దాన్ని నిర్దయగా కబేళాకు తరలిస్తాడు.ప్రస్తుతపు సమాజంలో కొంతమంది మనుషుల పరిస్థితి కూడా అంత ద​యనీయంగా ఉందేమోననిపిస్తుంది. వృద్ధాప్యం ఒక శాపం.దానికన్నా​ ​మరణం మేలు-అని తలచుకునే తల్లితండ్రులనేకమందిని చూస్తున్నాము.వయసు మళ్ళిన తల్లితండ్రులను కొనే కబేళాలు లేవు. అటువంటివి​ ​కనుక ఉంటే​,​ తల్లి తండ్రులను కూడా కబేళాలకు తరలించే తనయులున్నారని​ ​చాలా క్రితమే మందలించి చెప్పిన కధ ఇది .ఈ కథ చదవండి,మీకే బోధపడుతుంది​ ​తల్లి తండ్రులను ఎలా చూసుకోవాలో!
***​******​
ఆ ఇంటి పెద్దాయన ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినవాడే!కూలీపని నుంచి అన్నీ తానై చూసుకొని కొడుక్కి పది ఎకరాల సుక్షేత్రమైన వ్యవసాయభూమిని, పశువులను ఇచ్చాడు.వయసు ఉడికిపోయి వృద్ధాప్యం రావటం వల్ల కొడుకూ​, కోడలు అతనిని​ ​మూలన ఒక నులకమంచంలో పడేశారు.ఆయన సంగతి సరిగా పట్టించుకోరు.కనీసం​ ​మనవళ్లను కూడా అతని వద్దకు వెళ్ళనియ్యరు. ఆయన పని కూడా​ అ​యిపోయింది.అతని శక్తి అంతా కుటుంబంకోసం ధారపోశాడు.ప్రస్తుతం ఆ ముసలాయన వల్ల ఏమీ ఉపయోగం లేదు.అందుకే​ ​అతన్ని ఒక మూల పడేశారు.కొడుకు పట్టించుకోడు,కోడలు సరిగా అన్నం పెట్టదు.పిల్లలకు అసలు గౌరమే లేకుండా చేశారు తల్లితండ్రులు. ఆ ముసలాయన​కు​ బాగా యవ్వనంలో ​ఉన్నప్పుడు ఒక జత ఎద్దులు ఉండేవి​. ఒకటి చనిపోయింది.రెండవది ఆ ముసలాయన లాగానే ఏకాకి​గా మిగిలింది ​.
ఆ ముసలాయనే​ ​అప్పుడప్పుడూ వచ్చి దాన్ని ప్రేమగా గోముతాడు.ఈ రోజు అది అర్రు​ ​కడిగిన ఎద్దు,అంటే వ్యవసాయానికి పనికి రానిదన్నమాట.అది కూడా ఒకప్పుడు తన యజమానిలాగా రాజాలా బతికింది.ఆ యజమాని దాన్ని,దాని జత అయిన మరో ఎద్దును చూసి తెగ సంబరపడి పోయేవాడు.వాటి కొమ్ములనూ,ముఖాలనూ పసుపు కుంకుమలతో అలంకరించి ఎంతో ముచ్చట​ పడిపోయే వాడు.ఆ ఎద్దులు ఎన్నిపందాలు​ ​గెలిచాయో లెక్కలేదు. ఆ పరా​క్రమం ఆ ముసలి ఎద్దుకు గుర్తువచ్చింది.నేడు మురిపెంగా దాన్ని ​ఒళ్ళు తడిమి చూసేవారు లేరు.నా జత ఎద్దు అదృష్టవంతురాలు కనుకనే​ ​ముందే వెళ్లి పోయింది.ఎద్దుకు ఆకలిగా ఉంది, ఎవరైనా కాస్త పచ్చి గడ్డి వేస్తారేమోనని అది ఎదురు చూస్తుంది.దాని ఆకలి తీరదు,తీరే మార్గామూ లేదు.దూరాన ఒక కాకి వేచివుంది.ఎద్దుపుండు​ ​మీద వాలి తన ఆకలి తీర్చుకుందామని.కాకి​ ​ఎద్దు పుండును పొడుస్తూ​ ​దాని ఆకలి తీర్చుకుంటుంది.కనీసం తోకతో దాన్ని తోలుకోవటానికి కూడా ఓపిక లేకుండాఎద్దు ఆ బాధనంతా భరిస్తూనే​ ​​ఉంది.కుర్ర యజమాని దాని సంగతి పట్టించుకోడు.అతడి ధ్యాసంతా కొత్తగా కొన్న ఎడ్లను గురించే.వాటిని చూసి పొంగిపోతున్నాడు,ఈ ముసలి ఎద్దును చూసి అసహ్యపడుతున్నాడు. ​అది వచ్చిన కొత్తల్లో పది ఎకరాల ఆసామి అతను.ఒకేసారి ఇరవై ఎకరాలు సంపాదించాడు.'నా రక్తమాంసాలు కరిగిస్తేనే కదా,నీవు ఇంతడి వాడివయ్యావు' అని అనుకుంటుంది ముసలి ఎద్దు.కానీ​ ​ఏమి లాభం? అప్పుడప్పుడూ ఆ ​ఇంటి ముసలాయన ఆఎద్దు వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకుంటాడు.నీ బాధ నాకు తెలుసులే!అన్నట్లు దాన్ని ఆప్యాయంగా ఒళ్ళంతా తడుముతాడు.ఇది చూసి ఆ కోడలు ముసలాయనను కాకిలా పొడవటానికి వస్తుంది.ఎద్దు పుండును కరవటానికి కాకి వస్తుంది. ఎంత బాధగా ​ఉంది​ ​ఇద్దరికీ!
కధ ముగిసింది.మానవీయ సంబంధాలను గురించి మనసుకు హత్తుకు పోయేటట్లు చెప్పిన శ్రీ గోపీచంద్ గారికి స్మృత్యంజలి!

No comments:

Post a Comment

Pages