వాస్తవాల ప్రతిధ్వని – వాయుధ్వని ప్రొడక్షన్స్ - అచ్చంగా తెలుగు

వాస్తవాల ప్రతిధ్వని – వాయుధ్వని ప్రొడక్షన్స్

Share This

వాస్తవాల ప్రతిధ్వని – వాయుధ్వని ప్రొడక్షన్స్

భావరాజు పద్మిని 


గాలి... పవనం... వాయువు... మామూలుగా ఈ మాట వింటే అంతేగా, అనిపిస్తుంది. కాని, దీనికే మరో పేరుంది. ఊపిరి... శ్వాస అని. ఏదైతే లేకుండా ఏ జీవీ మనలేదో, అన్ని ప్రాణాలను నిలబెట్టే శక్తి దేనికైతే ఉందో, అదే వాయువు.
ఈ వాయువే మన స్వరపేటికలో రాజుకుని, స్వరంగా, శబ్దంగా వెలికివచ్చి, పదాలుగా, పాటలుగా పల్లవిస్తుంది. ఈ వాయువే, శూన్యమైన వేణువులో ప్రవేశించి, మధుర గానంగా పురుడుపోసుకుంటుంది. ఈ వాయువే అనేక వాద్యాలలో నిండి, అజరామరమైన సంగీతంగా ఆకృతి దాలుస్తుంది. ఈ వాయువే కడలి అలలతో ఆటలాడి, ప్రణవ నాదంలా ప్రతిధ్వనిస్తుంది. అంటే... మనం మనకు తెలియకుండానే మన చుట్టూ, మనం వినే ధ్వనులన్నీ, వాయుజనితాలే, వాయుధ్వనులే ! భావాలకి, స్పందనలకి, ఉద్వేగాలకి, భాషకి ఒక స్వరూపాన్ని ఇచ్చేది ఈ వాయుధ్వని! అందుకేనేమో, మానవ ఉద్వేగాలు "వాయుధ్వనికి" అవగతమైనట్లు మరెవ్వరూ అర్ధం చేసుకోలేరేమో ! రవి గాంచనిది, కవి గాంచనిది కూడా చూసే కళ్ళు... ఈ వాయుధ్వని చూసి, వ్యక్తపరుస్తుంది. లఘు చిత్రాలతో మనిషిలోని సున్నితమైన కోణాలను స్పృశించి, నవ్య జీవన నాదమై ఘోషిస్తుంది. ఒక లక్ష్యంతో, సదుద్దేశంతో కూడిన విలువలతో ప్రపంచ సినిమా వైపు సాగిపోతున్న కొత్త కెరటం... ఈ "వాయుధ్వని ప్రొడక్షన్స్". దీని అధినేతలు నటరాజ మహర్షి గారు, వాయుధ్వని గార్లు. నటరాజ్ మహర్షి గారు మన తెలుగువారు కావటం విశేషం ! వారిని గురించి మరిన్ని వివరాలు...

అలుపెరుగని యాత్రికుడు :

మనిషి చిన్నతనంలో లేచి నిలబడి నడవడం నేర్చుకునే ముందు సుమారు 3 వేల సార్లు పడి, లేచి, ప్రయత్నించి, సఫలం అవుతాడట ! అటువంటి అలుపెరుగని ప్రయత్నమే నటరాజ్ మహర్షి గారిది. మామూలుగా దక్షిణ భారతం నుంచి వచ్చే కళాకారుల్ని కాస్త దూరంగా ఉంచే ముంబై ప్రపంచం ఆయన్ను అక్కున చేర్చుకుంది అంటే, ఆయన పట్టుదలతో సాధించిన విజయం ఎంత గొప్పదో మనం ఊహించవచ్చు. జీవితంలో ఎదురైన అనుకోని పరిస్థితుల్ని తట్టుకుని, ఆయన శిఖరంలా నిలబడ్డ విధానం తెలుసుకుంటే ఎవరైనా “ఔరా !” అని ఆశ్చర్యపోక మానరు.
ఎంతటి వ్యక్తిత్వ వికాస నిపుణులైనా, అప్పటిదాకా ఉత్సాహంగా గడచిన జీవనయానంలో హఠాత్తుగా “కేవలం తల, చేతులు కదలడం తప్ప, జీవితంలో నడవలేవు,” అని డాక్టర్లు చెప్పిన స్థితికి వస్తే కృంగిపోతారు. బ్రతుకు మీద ఆశ
వదిలేస్తారు. కాని, మహర్షి గారు, అటువంటి వేదన అనుభవించి, పైకొచ్చిన వ్యక్తుల జీవిత చరిత్రలు చదివారు, ఎలాగైనా కోలుకుని, పైకిరావాలన్న ఉక్కు సంకల్పాన్ని ఏర్పరచుకున్నారు. తొమ్మిది నెలలు అలుపెరగకుండా పోరాడారు. ఆ సంకల్పం ముందు చివరికి అనారోగ్యం కూడా తలొగ్గింది.
కాని, మంచం మీద పైకప్పును  చూస్తూ బ్రతికే ఆ తొమ్మిది నెలల్నికూడా ఆయన వృధా చెయ్యదల్చుకోలేదు.  వీల్ చైర్ లోకి వచ్చాకా, కుటుంబ సభ్యుల సహకారంతో మార్కెట్ కు వెళ్లి, ఫాషన్ ఫోటోగ్రఫీ కి కావలసిన ఎక్విప్మెంట్ కొనుక్కుని, ఇంట్లోనే ఫోటోగ్రఫీ మొదలుపెట్టారు. ఫాషన్ ఫోటోగ్రఫీ పై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. అప్పటిదాకా ఆయనకు కెమెరాని ఎలా వాడాలో కూడా తెలీదు ! కాని, ఒక ఫిలిం మేకర్ గా  లైటింగ్ మీద ఉన్న కమాండ్ వల్ల, 2,3 రోజుల్లోనే అందులో పట్టు సాధించారు.   ఈనాడు టాప్ ఫాషన్ ఫోటోగ్రాఫర్ గా ఎదిగారు.
ఈ పోరాటం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.
“2014 సెప్టెంబర్లో నేను తీసిన ఆంగ్ల చిత్రం ‘డ్రాయింగ్ బ్లడ్’ ప్రమోషన్ కోసం తిరుగుతున్నప్పుడు ప్రమాదవశాత్తు
టైన్లో గాయపడ్డాను. తొమ్మిది నెలలు మంచానికే పరిమితం అయ్యాను. మొహం,చేతులూ తప్ప శరీరంలో భాగంలో కదలిక లేకుండా పోయింది. డాక్టర్లు అయితే ఇక జీవితంలో నడవలేవు అన్నారు. కానీ ఆ తొమ్మిదినెలలు జీవితాన్ని నేర్పించాయి. ఎంతో నేర్పాయి. నాలుగు గోడల మద్య పైకప్పు చూడడం. ట్యాబ్లో ఏమైనా సినిమాలు చూడడమే ఆ తొమ్మిది నెలల్లో నేను చేసింది. అప్పుడే నేను నడవాలి, మళ్లీ పెద్ద ప్రాజెక్టులు మొదలుపెట్టాలని తీవ్రంగా పోరాడాను. మంచంపై ఉన్నప్పడే తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నప్పడు ఫోటోగ్రఫీ మీద ఆలోచన పుట్టింది. ఫాషన్ ఫోటోగ్రఫి చేయాలని నిర్ణయించుకుని, కోలుకున్నాకా ముంబైలో  ఆఫీస్ తెరిచాను. 2015 ఫిబ్రవరిలో ఫాషన్ ఫోటోగ్రఫి మొదలుపెట్టాను. ఆ తర్వాత పెద్ద ఈవెంట్స్, అసైన్మెంట్స్ తో బిజీ అయిపోయాను.”

ప్రస్తానం :

‘వాయుధ్వని ప్రొడక్షన్స్’ వారు ఇప్పటి వరకు రెండు లఘు చిత్రాలను రూపొందించారు. మొదటిది ‘మేరా ఆలాప్’ అనే పేరుతో 2015  లో రూపొదించిన సినిమా. ఈ సినిమా వీక్షకులను కంటతడి పెట్టించి, మనిషిలోని సున్నితమైన
కోణాల్ని స్పృశిస్తుంది. ఈ చిత్రం ఇటీవల మహారాష్ట్రా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శించబడి, అందరి మన్ననలు అందుకుంది.
చప్పట్ల కోసం , కేవలం చప్పట్ల కోసమే పరితపిస్తాడు ఓ కళాకారుడు. మామూలుగా ఒక కళాకారుడిలో కళను మాత్రమే చూసి ప్రశంసించే లోకం, కళాకారిణిలో మాత్రం కళతో పాటు ఆమె అవయవసౌష్టవాన్ని, అందాన్ని కూడా చూస్తుంది. అలా కళాకారిణిగా స్థిరపడాలని, కన్నవారిని ఉన్న ఊరిని వదిలి, అవకాశాల కోసం ముంబై వచ్చిన ఓ గజల్ గాయని, తప్పనిసరై పలువురు ప్రముఖుల పడకింటికీ వెళ్ళాల్సి వస్తుంది. అలా తను ఆశించిన పేరుప్రతిష్టలు సంపాదించుకున్నాకా, ఆమెలో ఆత్మవిమర్శ మొదలవుతుంది. నిజంగా మనిషి సాధించాల్సింది, పొందాల్సింది ఏమిటి, అన్న ఆలోచన, చివరకు ఆమెను ఈ మిధ్యా ప్రపంచం నుంచి దైవం వైపు
అడుగులు వేసేలా చేస్తుంది. ఒక కళాకారిణిలో ఉండే తపన, ఉద్వేగాలను అద్భుతంగా తెరకెక్కించారు మహర్షి గారు. ముఖ్యంగా ఈ చిత్రంలో మహర్షి గారు రాసిన డైలాగ్ ల గురించి, పాటల గురించి చెప్పుకు తీరాలి. చిత్రంలోని ఒక్కొక్క షాట్ ఒక పెయింటింగ్ ను తలపిస్తుంది. ఒక్కో మాట, వీక్షకుల గుండెలకి సూటిగా ఎక్కుపెట్టిన తూటా ! ఒక్కో పాటా, శిలలనైనా కరిగించే సంగీతపు ఊట ! నటి అనూషా శెట్టి, ఈ పాత్రలో మమేకమైపోయి, అద్భుతమైన  నటనను ప్రదర్శించింది. ఈ చిత్రాన్ని క్రింది లింక్  లో చూడవచ్చు.

కాలం చెక్కిట కన్నీటి పొర – 1973 An untold story

చిన్నప్పుడు విన్న కధలు, చూసిన సంఘటనలు, మనిషి మనసు మీద బలీయమైన ముద్ర వేస్తాయి.
తెలంగాణాలోని ఒక  పల్లెలో మహర్షి గారి బాల్యం గడిచింది. ఆయన తండ్రి ఎప్పుడూ ఆయనకు తమ ఊరిలో అనుకోకుండా అన్యాయంగా బలైపోయిన ఒక రైతు కన్నీటి గాధను చెబుతూ ఉండేవారు. మహర్షిగారు మంచానికి పరిమితమై ఉన్న రోజుల్లోనే, ఈ రైతు కధను ఒక లఘు చిత్రంగా తియ్యాలని, సంకల్పించారు. ఆయన మాటల్లోనే ఈ లఘు చిత్ర కథ, కథనం...
“1995లో మెథడ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్లో న్యూయార్క్ ఫిలిం ఆకాడమీ అనుబంధంతో కాలికట్ లో జరిగిన వర్క్ షాప్ లో మళయాల దర్శకుడు భరతన్ గారు పరిచయమయ్యారు. అప్పుడే ఫార్ములా ఉన్న సినిమాలు, వరల్డ్ క్లాస్ సినిమాలు తీయాలని పిక్స్ అయ్యాను. నేను పుట్టింది 1973లోనే. నేను పుట్టిన సంవత్సరంలోనే జరిగిన ఒక సంఘటన నేపధ్యంలో తీసినదే 1973 సినిమా. తెలంగాణాలోని ఒక ప్రాంతంలో జరిగిన ఇమాన్దారి రైతు కధ ఇది. భూమిలో ఉన్న గ్రానైట్ కోసం భూమి లాక్కున్న రాజకీయ నాయకుడు పెట్టిన టార్చర్ మా నాన్న నాకు ఎప్పడూ చెప్పే వారు. అది నన్ను బాగా బాధపెట్టింది. మనలో ఎంతమంది అన్నం తినేటప్పుడు దేశానికి అన్నంపెట్టే రైతు
గురించి ఆలోచిస్తాము ? ఇప్పటిదాకా ఏ సైనికుడికి, ఏ రైతుకి మన దేశంలో భారత రత్న ఎందుకు లభించలేదు? ఇలాంటి ప్రశ్నలు నన్ను ఆలోచింపచేసాయి.
ఎప్పటికైనా తెరపై ఆ కధను చూపించాలనుకున్నాను. కానీ దానికి సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం ఏమీ లేదు. తెలంగాణ యువకుడిగా ఒక మంచి ప్రాజెక్ట్లను మన మూలాల గురించి, మన నేపధ్యం గురించి, తీయాలనుకున్నాను. ప్రపంచ స్థాయి ఫిలిం ఫెస్టివల్స్కు పంపాలనుకున్నాను. ఒక చిన్న సంఘటనను బాగా పరిశోధన చేసి, కొంత సృజనాత్మకతను జోడించి 1973 సినిమా తీశాను. భూమి కోల్పోయిన రైతు ఆవేదన, భూమి లాక్కున రాజకీయ నాయకుడి క్రూరత్వాన్ని ఈ సినిమాలో చూపించగలిగాను. రైతునే నా కధావస్తువగా వాడుకున్నాను.
ఇంట్లో 5 గంటలు, పొలంలో 6 గంటల్లో ఈ సినిమా పూర్తి చేసారు. కానీ స్టార్టింగ్ (గ్రౌండ్ వర్క్) మాత్రం నెల రోజుల్లో చేశాము. 50 అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ కి అప్లయ్ చేశాం, ఇప్పటివరకు ఐదింటిలో ఎంపికయ్యింది.   ఆల్ లైట్స్ , బెంగుళూరు ,రుమేనియా, ఇటలీ, మన్ హట్టన్ ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్లో ఈ సినిమా సెలక్ట్ అయింది.”
నటీనటుల నుండి హావభావాలను, నటనను వెలికి తియ్యడంలోనే దర్శకుడి అసలైన ప్రతిభ కనిపిస్తుంది. కధ లోని సన్నివేశాలను స్క్రిప్ట్ గా రాసుకుని, ‘సర్రిలిస్టిక్ సౌండ్ డిజైన్” అనే వినూత్న ప్రక్రియలో శబ్దరూప కల్పన చేసి, వీక్షకుల మనసుకు హత్తుకునేలా మహర్షి గారు ఈ చిత్రాన్ని రూపొందించిన విధానం అద్భుతం. నటుడు నితిన్ రైబి, దేశభక్తిగల రైతు పాత్రలో అద్భుతమైన నటనను పండించారు. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాలో, “భవిష్యత్తులో రైతులు ఉంటారా?” అని అడిగిన ప్రశ్న, సూటిగా మన హృదయాన్ని తాకుతుంది. మనిషి స్వార్ధం అతన్ని ఏ స్థాయికి దిగజార్చి, ఎటువంటి పనులు చేయించగలదో తెలిపే ఈ చిత్రం చూసిన వారిని కంటతడి పెట్టిస్తుంది. మొత్తానికి వాస్తవ గాధ ఆధారంగా మహర్షి గారు అద్భుతంగా రూపొందించిన ఈ చిత్రం విమర్శకుల మన్ననలు అందుకుంది.   ఈ చిత్రం ఈ నెల 24-27 మధ్య తెలంగాణా ప్రభుత్వం -రామోజీ ఫిలిం సిటీ వారి సహకారంతో రామోజీ ఫిలిం సిటీ లో జరగనున్న ఆల్ లైట్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితము కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ను క్రింది లింక్ లో దర్శించండి.
https://www.youtube.com/watch?v=FgDbmPoPwHY&app=desktop వీరి వెబ్సైటు ను ఈ  లింక్  లో  దర్శించండి http://vaayudhwaniproductions.com/

ఇప్పటికి 11 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు తేజం "నటరాజ్" గారు, 1973తో మరిన్ని విజయాల్ని సాధించాలని, మనసారా ఆకాంక్షిస్తోంది, “అచ్చంగా తెలుగు.”

No comments:

Post a Comment

Pages