సత్సంకల్పం - అచ్చంగా తెలుగు

సత్సంకల్పం 

పెమ్మరాజు అశ్విని 

       
జీవితం లో ఏమైనా సాధించాలన్న ,జీవితాన్ని ఒక దారి లో పెట్టాలన్న మూలం ఏంటనే ప్రశ్న ఎదురైతే మనలో ఒక్కొకరం ఒక్కొ సమాధానం చెప్తాం. ఒకరు అదృష్టం ఉండాలి,మరొకరు దైవానుగ్రహం ఉండాలి అంటారు,మరొకరు ప్రాప్తం  ఉండాలి అంటూ రకరకాల సమాధానం వినిపిస్తాయి.
          అయితే జీవితాన్ని ఎవరికి నచ్చినట్టు మలుచుకునే అవకాశం ,అదృష్టం ఇప్పటి నవతరానికి ,నిరాశ ని పారద్రోలడానికి సాంకేతిక పరి జ్ఞానం చేయూత నిస్తోంది అనడం అతిశయోక్తి కాదేమో. ఒక్కపాటి లాగ కాకుండా మనింట్లో కూర్చుని ప్రపంచం మొత్తాన్ని ఒక్క "క్లిక్కు" తో నడిపించేయొచ్చు ,యేలను వచ్చు .
      చాల మంది ఇంట్లో వారు వున్నా ప్రదేశం నుంచే ఆధునికే సాంకేతిక పరిజ్ఞానం వాడి వృత్తి విద్యలు నేర్చుకోవడం,సొంతంగా వృత్తి వ్యాపారదులు ఏర్పరచుకోవడమే కాక వారి నైపుణ్యాన్ని నలుగురిలో ప్రదర్శించి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం లాంటి మార్పు  గత కొన్ని సంవత్సరాలు గా పుంజుకుంది .
     అయితే ఇంతటి పెనుమార్పు కి సాంకేతిక పరిజ్ఞానం ముడిసరుకు మాత్రమే,మన మేధస్సు ఎల్లలు దాటి దేశవిదేశాల్లో కీర్తి ని ఇంటి పట్టున కూర్చుని మనం సాధిస్తున్నాం అంటే దీనికి కారణం ,మూలం మన సంకల్ప బలమే అంటే అతిశయోక్తి కాదేమో. మనం జీవితం లో ఏ పని చేయాలన్నా దానికి మొదటి అడుగు సత్సంకల్పం .మనం చేయాలనుకున్న ,సంకల్పించిన కార్యం మంచిది అని మనం మనసా వాచ నమ్మి దాని సాధించటానికి తగిన విధంగా కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తాం.
ఒక చెప్పులు కుట్టే వాడి కుమారుడు  స్థాయి నుంచి అమెరికా అధ్యక్షుడి స్థాయి కి ఎదిగారు "అబ్రాహాము లింకన్ " ,అమెరికా లో బానిసత్వానికి చరమ గీతం పాడాడు . కనీసం విద్యుత్ శక్తీ కి నోచుకోని కెన్యా లో ని ఒక ప్రాంతం నుంచి వచ్చిన 22 సంవత్సరాల అమ్మాయి  "ఫెయిత్ కిప్యోగేన " ,ఈ అమ్మాయి పుట్టి పెరిగిన ప్రదేశం ,నాగరికతకు చాల దూరంగా కనీసం విద్యుచ్ఛక్తి ,విద్య వైద్యం వంటి కనీస అవసరాలకి అందన్నంత దూరంగా వున్నా పల్లె ,అటువంటి ప్రదేశం నుండి తల్లితండ్రుల ప్రోత్సాహం తో తన 16 వ ఏట నుంచి ప్రపంచ స్థాయి లో పరుగు పందెం లో పాల్గొనడమే గాక పతకాలు కూడా సాధించింది,అంతటితో ఆగక ఈ సంవత్సరం రియో ఒలింపిక్స్ లో ఏకంగా 1500 మీటర్ల విభాగం లో స్వర్ణం సాధించడమే గాక ,తన ఊరికి విద్యుచ్ఛక్తి ని వెలుతురుని తీసుకొచ్చింది.
       కాళ్ళు చేతులు అన్ని సవ్యంగా వున్నా కూడా మా తల్లి తండ్రులు మాకు ఇది  తక్కువ చేసారు,ఇంకా ఇది కొనలేదు,అది చదివించలేదు అని ఆరోపించే వారు మనకు తరచూ తారసపడతారు, అయితే తాను పుట్టింది ఒక సామాన్య రోజు కూలి కడుపున అందులోను ఒక ప్రమాదం లో తన ఐదవ ఏట కాలు పోగొట్టుకుని ,కూడా తన తల్లి ఇచ్చిన ధైర్యం ప్రోత్సాహం తో మొక్క వోణి ధృడ సంకల్పం తో చక్కగా విద్యాభ్యాసం చేయడమే కాకుండా పాఠశాల స్థాయి నుంచి మొదలు పెట్టి ఈనాడు రియో పారా ఒలింపిక్స్ లో హై జంప్ విభాగం లో భారత దేశానికీ  స్వర్ణ పథకం  సాధించిన ధృడ సంకల్పి "మరియప్పన్ తంగవేలు" .
            ఇదేగాక తమిళనాడు లో ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన శ్రీ అబ్దుల్ కలామ్  గారు ఒక శాస్త్రవేత్త గా ప్రారంభించిన తన ప్రస్థానం భారత దేశ రాష్ట్రపతి గా  ఎంతటి మహోన్నత స్థాయి అధిరోహించారో మనకి విదితమే ,ఇటువంటి ఎందరో మహానుభావుల విజయానికి మూలం కచ్చితంగా సంకల్ప బలం.
       ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు చాల అవరోధాలు ఏర్పడతాయి అవి భౌతిక మైనవి కావచ్చు,మానసిక మైనవి కావచ్చు .అయితే మనం ఎంతటి ధృడ సంకల్పం తో ఉన్నామనే దాని పైనే ఈ అవరోధాలు దాటే శక్తి ఆధారపడి ఉంటుంది . మన లక్ష్యం అనే ఫలం సాధించాలి అంటే ధృడ సంకల్పం అనే విత్తనం నాటాలి ,ఫలితానికి సమయం పట్టినా చెక్కుచెదరని ఆత్మా విశ్వాసం తో లక్ష్యం దిశగా అడుగులు వేస్తె మన బాటలో ఎన్ని ముళ్ళు వున్నా యిట్టె అధిగమించవచ్చు కదా .
      అయితే ప్రస్తుతం మనల్ని పరిపాలిస్తున్న మన "నాయకులు" మాత్రం "ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయస సంత్రస్తులై " అన్న చందమును చక్కగా అనుసరిస్తున్నారు అనిపిస్తోంది ఎందుకంటె వారు కేవలం వారి వాగ్ధానా ధోరణే తప్ప ,వాటి ఆచరణ కి ఏ మాత్రం ప్రయత్నం చేయరు దీనికి మచుక్కైనా ఉదాహరణ ఆంధ్ర రాష్ట్ర విభజన సమయం లో చేసిన ప్రత్యేక హోదా వాగ్దానమే . ఈ వాగ్దానం చేసిన పెద్దలకి దాని ని అమలు పరిచే సంకల్ప లేమి కారణంగా అది సగటు రాజకీయ నాయకుని వాగ్దానంగా గాలికి వదిలేయ బడింది.
        మనిషి తన మనో సంకల్ప బలంతో చంద్రుడ్ని , అంగారకుడ్ని చేరుకోగలిగాడు, ఒకప్పుడు మహమ్మారి గా ఎందరో జీవితాలను కబళించిన జబ్బులకి మందుల్ని కనుగొన్నాం. కలలో కూడా సాధ్యం కాదు అనుకున్న ఎన్నో పనులను సుసాధ్యం చేస్తున్నాం.వైద్య రంగం లో అభివృద్ధి మనిషి ఆయువు ని పెంచగలుగుతున్నా,ఇవ్వన్నీ సాధ్యం అవుతున్నవి కేవలం మన సంకల్ప బలం వల్లే,అందువల్ల  స్థిర సంకల్పం అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ఉందని నమ్మి ప్రయత్నిస్తే విజయానికి అంతకు మించిన సులువైన మార్గం ఉండదేమో.
***

No comments:

Post a Comment

Pages