శ్రీధరమాధురి - 30 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 30

Share This

శ్రీధరమాధురి - 30  


(మంత్రోపదేశం గురించి పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )
మీకు ఎప్పుడైనా మంత్రోపదేశం కావాలంటే, అది చెయ్యగల, అనేక పరిసరాల్లో, పరిస్థితుల్లో ఆ మంత్రోపాసన చేసాకా వచ్చే పరిణామాలను తెలుపగల గురువు వద్దకు వెళ్ళండి. ఆయన మీకు సంయమనంతో ఉండడం కూడా నేర్పుతారు. శారీరక అనుభూతి నుంచి మీరు బయటపడ్డ సమయంలో కూడా, తిరిగి మీరు మీ దేహంలోకి జాగ్రత్తగా వచ్చేలా ఆయన దారి చూపుతారు. అటువంటి పరిస్థితులు అన్నింటిలో, మీకు మంత్రోపదేశం చేసిన గురువు మీ ఆత్మ గురించిన బాధ్యతను తీసుకుంటారు. మీరు సరైన ఉపదేశం లేకుండా కేవలం మంత్రాల్ని చదివితే, మొత్తంగా అది మిమ్మల్ని దారి తప్పించి, ఇబ్బందుల్లో పడేస్తుంది.
బీజాక్షరాలతో ఉన్న మంత్రాలకి ప్రత్యేకమైన ఉపయోగం ఉంటుంది. కేవలం ఉన్నత స్థాయికి చెందిన బహుముఖ ప్రజ్ఞ కల పండితుడికి మాత్రమే అదేమిటో తెలుస్తుంది. అంతేకాక, అన్ని బీజాక్షరాలు, అందరికీ సరిపడవు. మీకేది సరిపోతుందో సద్గురువుకి తెలుస్తుంది.
మంత్రోపదేశం చేసే వ్యక్తికి ఆ అర్హత ఉండాలి. అర్హత అంటే, నా ఉద్దేశం, విశేషించి, ఆ మంత్రంలో అతను మంత్ర సిద్ధిని పొంది ఉండాలి.
పుస్తకాల లోంచి మంత్రాలు నేర్చుకోవడం సరికాదు. కొన్నిసార్లు ప్రజలు ఎక్కడినుంచో మంత్రాన్ని విని, ఓ కాగితం ముక్కపై రాసుకుని, చదవడం మొదలుపెడతారు. అటువంటి పఠనం సరైన పధ్ధతి కాదు.
 మంత్రోపదేశానికి ముందు, సద్గురువు శిష్యుడి అర్హతను పరిశీలిస్తారు. అతన్ని/ఆమెను దానికి అర్హత పొందేలా చేసేందుకు, ఆయన వారిని కొన్ని పనులు చెయ్యమని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒకరు నన్ను అనుష్టుప నృసింహ మూల మంత్రం ఉపదేశించమని అడిగారు. నేనతన్ని నృసింహ గాయత్రి 32,00,000 సార్లు జపించడం పూర్తిచేసి మంత్రోపదేశం కోసం రమ్మన్నాను. కాబట్టి, సంపూర్ణ విశ్వాసం ఉన్న శిష్యుడు, గురువు ఆజ్ఞను పాటించి, తగిన అర్హతను సంపాదించి, వారి వద్దకు తిరిగి వెళ్ళాలి.
కేవలం మంత్రాన్ని చదవడమే సానుకూల పరిణామాల్ని కలిగిస్తుంది. కాని, ఆ మంత్రాన్ని మీ లోపలి నుంచి, మీ ఉనికి మూలాల నుంచి చదవాలి. అందులోని పదాలు, శబ్దాలు,  ధ్వనులు, లయ మీ లోపల ఉన్న “చైతన్యం” అనే ప్రాధమిక మూలం నుంచి రావాలి. అటువంటి ఉచ్చారణ అలౌకికమైన శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. యోగులు దానినే – ‘చైతన్య శబ్ద’ అంటారు.
ఒక మంత్రాన్ని అనేక విధాలుగా చదవచ్చు. ఆ పద్ధతులు అన్నీ సద్గురువుకు తెలిసి ఉంటాయి. మంత్రం ఒకటే అయినా, దేహంలోని ఏ భాగం నుంచి దాన్ని చదవాలో ఆయనకు మాత్రమే తెలుసు. లోకకళ్యాణానికి ఉన్న అవసరాన్ని బట్టి, ఆయన తగినవిధంగా చదువుతారు. మీ అందరికీ మంత్రం తెలిసి ఉంటుంది. కాని, దాన్ని చదవడం  వెనుక ఉన్న టెక్నిక్ మీకు తెలీదు.
శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రాల కంటే విభిన్నమైనవి.
శ్లోకాలు, స్తోత్రాలకు సద్గురువు ఉపదేశం అక్కర్లేదు. పద్దతిగా ఏ మంత్రోపదేశం లేకుండానే వాటిని ఎల్లప్పుడూ చదవచ్చు.
బీజాక్షరాలు ఉన్న శ్లోకాలు, స్తోత్రాలకు సద్గురువు నుంచి ఉపదేశాన్ని తీసుకోవడం అవసరం.
***
మంత్రోచ్చారణ లోని పద్ధతులు...
మానసిక – ధ్యానంలో ఉచ్చారణ
కాయంకిక – కేవలం పెదాలు కదుపుతూ ఉచ్చారణ
వాచనిక – బిగ్గరగా మంత్రాన్ని చదవడం.
***
మంత్రోచ్చారణకు మరొక పధ్ధతి ...
మానసిక, కాయంకిక, వాచానిక పద్ధతులలో ఏవి అవలంబిస్తూ ఉన్నా, చక్రాల నుంచి వాటిని చదవచ్చు.
మూలాధార
స్వాధిష్టాన
మణిపూర
అనాహిత
విశుద్ధ
ఆజ్ఞా
వీటన్నింటిలోనూ ఉత్తమమైనది సహస్రారం నుంచి ఉచ్చారణ.
***
దైవానుగ్రహం చాల అద్భుతమైనది. ఆయన దేహం, హృదయం (ఆత్మ) మధ్య చక్కగా అనుసంధానం చేసారు. ఇందులో 6 చక్రాలు ఉన్నాయి. 7 వది 'సహస్రార ' అనే బిందువు. మూలంగా ఉన్నది మూలధార చక్రం (పాయువు దగ్గర ఉంటుంది), తర్వాత స్వాధిష్టాన చక్రం(గుహ్యాంగాల వద్ద ఉంటుంది) తర్వాత మణిపుర చక్ర ( బొడ్డు దగ్గర ఉంటుంది), తర్వాతది అనాహత చక్రం (గుండె దగ్గర ఉంటుంది), తర్వాతది విశుద్ధ చక్రం (గొంతు వద్ద ఉంటుంది) తరువాతది ఆజ్ఞా చక్రం (భూమధ్యం లో ఉంటుంది), చివరిది బిందు లేక సహస్రారం (తలలోపలి భాగం లో ఉంటుంది). సర్పము కుండలిని లో చుట్టుకొని, మూలాధార, స్వాధిష్టాన, చక్రాల మధ్య ఉంటుంది. సహస్రారం లో ఉన్న వేయి రేకుల పద్మం గాఢ నిద్ర లో ఉంటుంది. దాన్ని మేల్కొల్పి జాగృతం చేయాలంటే, గురువు కుండలిని నుంచి సర్ప శక్తి ని మేల్కొలడం నేర్పు తారు. అది కుండలిని నుంచి క్రిందికి మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలకు ప్రాకి చివరకి సహస్రారం చేరుతుంది. కుండలిని ఒక దశ నుంచి మరొక దశకు కదులుతుండగా, చక్రాలు తిరగడం మొదలై, శరెరం యొక్క ఆ భాగంలో అమితమైన శక్తి విడుదలవుతుంది. ఇది ఒక రాకెట్ మూలం నుంచి పూర్తి శక్తి తో విడుదలై గమ్యం వైపు దూసుకుపోవడం వంటిది. ఒకసారి ఈ సర్పం సహరారం చేరితే 1000 రేకుల పద్మం జాగృత ఆ వ్యక్తి పూర్తి జాగృత స్థితి చేరతాడు. ఇది విశ్వ చైతన్యాన్ని గుర్తించడం వల్ల జరుగుతుంది. కుండలినీ ధ్యానం లో 9,63, 478 పద్ధతులు ఉన్నాయి. ఒకసారి మీకు వాటిలో కొన్ని తెలిస్తే మీకు జన్మజన్మల జ్ఞానం కలుగుతుంది.ఓం యోగ భైరవాయ నమః ! ఓం ప్రయోగ భైరవాయ నమః !
అంతా దైవేచ్చ, దయ, అనుగ్రహం. ఆనందంగా ఉండండి.
***
ఒక మంత్రాన్ని ఒక చక్రం నుంచి చదివినప్పుడు, ఉచ్చారణా సామర్ధ్యాన్ని బట్టి, చక్రం కదులుతుంది, ఇది కుండలిని జాగృతం కావడానికి ఉపయోగపడుతుంది.
వివిధ మంత్రాలను లెక్కలేనన్ని పద్ధతుల్లో చదవచ్చు. కొన్నిసార్లు ఒకే మంత్రాన్ని అవసరాన్ని, ప్రయోజనాన్ని బట్టి, అనేక రకాలుగా చదవచ్చు.
కేవలం ఉచ్చారణలోని ఆనందాన్ని పొందడం కోసం మంత్రాలను చదవడం ఉత్తమమైన పధ్ధతి. నిజమైన యోగి మనసులో దాని అవసరం, ఉద్దేశం, ప్రయోజనం స్ఫురణకు రాదు.
ఏ కోరికలూ లేకుండా విశ్వాసంతో మీరు మంత్రాలను లోక కల్యాణం కోసం చదువుతూ ఉన్నప్పుడు, విశ్వ శక్తులతో మీకు దివ్యమైన సంపర్కం ఏర్పడుతుంది.
మంత్రాలు సహజంగా రెండు ప్రధాన వర్గాలకు చెంది ఉంటాయి, ఈ రెండూ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. అవి శబ్ద బ్రహ్మణ ,నాద బ్రహ్మణ.
సద్గురువు ద్వారా మంత్రోపదేశాన్ని పొందడాన్ని ‘మంత్ర దీక్ష’ అంటారు. అది ఒక కటువైన క్రమశిక్షణకు కట్టుబడి ఉండడం. గురువు చెప్పిన నియమనిబంధనలు అన్నింటినీ శిష్యుడు శ్రద్ధగా విని, కఠినముగా వాటిని పాటించాలి. మంత్రం అనేది కేవలం గట్టి మనసు ఉన్నవారికే బలహీనమైన మనసు ఉన్నవారికి కాదు.
మంత్రదీక్ష యొక్క విలువల వ్యవస్థ తెలిసిన సద్గురువు తన శిష్యుడికి అంత తేలిగ్గా మంత్రం దీక్ష ఇవ్వరు. అర్హత కల శిష్యుడు మంత్రాన్ని పొందే ముందు ఎన్నో పరీక్షలకు గురి చెయ్యబడతాడు. సహనం, ఓరిమి అవసరం.
విభిన్న పద్ధతుల్లో మంత్రాల్ని చదవడం వల్ల, వివిధ రకాలైన ప్రకంపనలు కలుగుతాయి.
***
అ - కారం  సృష్టిస్తుంది
ఉ – కారం స్థితికి తోడ్పడుతుంది
మ – కారం లయం చేస్తుంది.
అందుకే ప్రణవమే “AUM (ఓం)” – “దైవం”.
***
అ - కారం బ్రహ్మ తత్త్వం – జననం
ఉ – కారం  విష్ణు తత్త్వం – స్థితి
మ – కారం రుద్ర తత్త్వం – లయ
మూడూ కలిసి ప్రణవం “ఓం” ను సూచిస్తాయి.
***
ప్రతి మంత్రం లోపల జీవం ఉంటుంది. అది స్వయంగా ఆ విశ్వ చైతన్యానికి ప్రతిరూపమే !
***
ఒకరు మంత్రసిద్ధిని పొందేందుకు,  వారికి సద్గురువు ఉపదేశించిన విధంగా మంత్రాన్ని చదవాలి. ప్రతి ఒక్కరికీ, లేక ఒక బృందంలోని కొందరికి, సద్గురువు చదివేందుకు ఒక ప్రత్యేకమైన పద్ధతిని చెబుతారు. ఇది ప్రతి ఒక్కరికీ మారుతుంది, అందరికీ ఒకేలా ఉండదు. కాబట్టి శిష్యుడు/శిష్యుల బృందం మంత్రోపదేశ సమయంలో అత్యంత జాగరూకులై ఉండాలి. ఆ మంత్రం ప్రాధాన్యత, అర్ధం సద్గురువు చెబుతారు. ఆయన చెప్పేవన్నీ జాగ్రత్తగా మనసులో నిక్షిప్తం చేసుకుని చదవడం శిష్యుడి ధర్మం. కేవలం చదవడం ఒక్కటే చాలదు. అతను జ్ఞానంతో ఆ మంత్రంలో ఉద్దేశించిన దేవతతో మానసికంగా లయం అయిపోవాలి. అప్పుడు హఠాత్తుగా ఒకరోజున అతను మంత్రసిద్ధితో దీవించబడతాడు.
***
ఒకే మంత్రాన్ని, అనేకమంది, అనేక విధాలుగా వ్యక్తీకరించవచ్చు.  ఒకే కుటుంబంలోని వారు, ఒకే గురువు శిష్యులు, వీరికి కూడా సద్గురువు విభిన్నంగా ఉపదేశం చెయ్యవచ్చు. అలా చేసేందుకు ఆయనకు ఏవో దివ్యమైన కారణాలు ఉంటాయి. కాబట్టి, ఇతర శిష్యులతో, లేక వేరే గురుకులం నుంచి వచ్చిన ఇతరులతో మంత్రం గురించి వాదించకండి. మంత్రం అనేది సద్గురువుకు, శిష్యుడికి మధ్య వ్యక్తిగతమైనది, ఇతరులతో ఇది సరైనదా కాదా అని వాదించడం సరికాదు. మంత్రోపదేశం జరిగితే, అది మీ ఒక్కరికి మాత్రమే అని గుర్తుంచుకోండి.
***
ఒక ఉపాసనగా, మంత్రాన్ని చదవాలి. దాన్ని అత్యంత శ్రద్ధతో చెయ్యండి. అదొక సాధనగానో, ఏదో పొందేందుకో చెయ్యకండి. కేవలం దాన్ని ఒక ఉపాసనగా, ఏమీ ఆశించకుండా, చదవండి. పరిణామాలు మిమ్మల్ని అమితాశ్చర్యానికి గురి చేస్తాయి.
*****

No comments:

Post a Comment

Pages