‘మహోపాధ్యాయ’ శ్రీ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ గారు - అచ్చంగా తెలుగు

‘మహోపాధ్యాయ’ శ్రీ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ గారు

Share This

‘మహోపాధ్యాయ’ శ్రీ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ గారు 

టీవీయస్.శాస్త్రి 


మహోపాధ్యాయ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ గారు (అక్టోబర్ 19, 1864-1933) తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు.‘మహోపాధ్యాయ’ శ్రీ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ గారు అక్టోబర్ 19, 1864న విశాఖపట్నంలో విద్యాధికులైన నియోగి బ్రాహ్మణ కుటుంబంలో నరసమాంబ, బాపిరాజు దంపతులకు జన్మించారు .ఈయన పార్వతీపురానికి దగ్గరలో ఉన్న‘మేరంగి’ జమీందారీ సంస్థానంలో దివాన్‌గా పనిచేశారు. సాంఖ్యాయన శర్మగారు న్యాయవాదిగా బాగా సంపాదించారు. సాహితీ పరిశోధకుడు ఆరుద్ర సాంఖ్యాయన శర్మగారు వ్రాసిన విశాఖ (1904) కధ, గురజాడ అప్పారావు దిద్దుబాటు  తెలుగు కథలలో మొదటివని పరిశీలించి నిరూపించాడు. 14వ ఏటనే మిడిల్ స్కూల్ పరీక్షలో మద్రాసు రాష్ట్రంలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. వీరు  చిత్రలేఖనంలో కూడా నిపుణులు!సాంఖ్యాయన శర్మ గారు  తెలుగులో ‘‘బొండుమల్లెలు’’ అనే తొలి ఖండకావ్యం రాశారు. ‘లలిత’ అనే కథను  రాశారు. సాంఖ్యాయన శర్మ 1903లో కల్పలత అనే పత్రికను స్థాపించాడు. తెలుగులో ఇదే మొదటి శాస్త్ర విజ్ఞాన విషయాలపై వచ్చిన పత్రిక.నట సమాజాలకు శిక్షణ ఇచ్చేవారు. పదిహేడు సంవత్సరాల వయసులోనే ‘‘సుజన ప్రమోదిని’’ అనే పత్రిక నడిపారట! ‘‘నాటక సర్వస్వం’’ అనే గ్రంథం రాశారట! కాళిదాసు నాటకాలను అనువదించారు.ఆచంట వారి‘‘లలిత’’ తొలి కథగా గిడుగు సీతాపతి, పురిపండా వంటివారు సమర్ధించారు. కానీ, బండారు అచ్చమాంబ 1898-1904 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో ప్రకటించిన 10 కథానికలు వెలువడటంతో సాంఖ్యాయన శర్మ తొలి తెలుగు కథకుడు కాదని తేలింది. కానీ సుప్రసిద్ధ విమర్శకులు కె.కె.రంగనాథాచార్యులు ఆచంట వారి కథల్ని తొలి కథలుగా నిర్ణయించారు. 1978 మార్చి ‘అభ్యుదయ’ పత్రికలో కూడా ‘లలిత’ను మొదటి కథగా పేర్కొనబడింది. ఒకటి మాత్రం నిజం--తెలుగు కథకి ఓనమాలు దిద్దిన వారిలో ప్రధములు సాంఖ్యాయన శర్మ గారు . 'కల్పలత' పత్రిక రెండున్నర సంవత్సరాలే నడిచినా, విడుదలైన 30 సంచికలు చాలా అమూల్యమైనవి. ఇందులోని విషయాలన్నీ ఆయనే స్వయంగా వ్రాసేవారు . 1890లలో ఆచంట సాంఖ్యాయన శర్మ తన రచనలలో విస్తృతంగా విజ్ఞానశాస్త్ర విషయాలకు ప్రాచుర్యం కల్పించారు. సుజన ప్రమోదిని, కల్పలత వంటి పత్రికలు నడిపిన సాంఖ్యాయనశర్మ శతావధానాలు కూడా చేశారు.1929లో తెలుగు నాటకరంగ నిర్వాహకులు, కళాకారులు, కవులు, పోషకులలోని ముఖ్యులు కలిసి నాటకరంగ పునరుద్ధరణకు పెట్టిన ఆంధ్ర నాటక కళాపరిషత్తులో వ్యవస్థాపక సభ్యులలో వీరు కూడా ఒకరు.ప్రథమ పరిషత్తు మహాసభలకు దేశోద్ధారక, విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, మహామహోపాధ్యాయ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, చట్టి చిన పూర్ణయ్యపంతులు, మల్లాది విశ్వనాథకవిరాజు, వనారస గోవిందరావు, కొత్తపల్లి లక్ష్మయ్య వ్యవస్థాపక సభ్యులుగా ధనసహాయం అందించారు. మొదటి రోజున సాంఖ్యాయన శర్మ, రెండవ రోజున కాశీనాథుని నాగేశ్వరరావు ఈ సభలకు అధ్యక్షత వహించారు.వీరి ఇత్తర రచనలు- సుధానిధి,మనోరమ,పార్ధ పరాజయము,అవదాత కలభకము,ఆంధ్ర పద్యావళి,విక్రమోర్వశీయము,ఉత్తర రామ చరిత్రము,రహస్య దర్పణము.తెలుగు సాహిత్యానికి,నాటక రంగానికి విశేష సేవలు చేసిన ఈ మహనీయుడు 1933 లో మరణించారు.

No comments:

Post a Comment

Pages