శ్రీ దత్తాత్రేయ వైభవం -2 - అచ్చంగా తెలుగు

శ్రీ దత్తాత్రేయ వైభవం -2

Share This

శ్రీ దత్తాత్రేయ వైభవం -2 

ఆదిత్య శ్రీరామభట్ల 


¤ ¤ ¤ శ్రీపాద శ్రీ వల్లభులు ¤ ¤ ¤
పిఠాపురం గ్రామంలో పుణ్యదంపతులైన శ్రీ అప్పలరాజ శర్మ మరియు శ్రీ సుమతీల సంతానంగా శ్రీపాద శ్రీవల్లభుల వారు 1320వ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు జన్మించారు. ఒకనాడు అప్పలరాజ శర్మ గారు తన ఇంట శ్రాద్ధ కర్మ నిర్వహిస్తుండగా మధ్యాహ్న వేళ ఒక సాధువు భిక్షకై విచ్చేసాడు. శ్రాద్ధ కర్మ చేసే సమయంలో భిక్ష వేయడం నిషేధం... అయినా అప్పలరాజ శర్మ వచ్చిన సాధువును నారాయణ రూపంగా భావించి, ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడం తప్పుకాదనేది వేదవాక్కు ఆయనకు భిక్ష వేసి సంతృప్తి పరిచాడు.
అంతే చాలా సంతోషించిన దత్తాత్రేయుడు సాధువు రూపాన్ని వదిలి తన నిజ రూపాన్ని ధరించాడు. అప్పలరాజ శర్మ దంపతులను దీవించిన దత్తాత్రేయుడు వారిని ఏం వరం కావాలో కోరుకోమనగా, అప్పలరాజ శర్మ దంపతులు " నీ వంటి ఙ్ఞాన పురుషుడు మాకు కొడుకుగా రావాలి" అని దత్తత్రేయుని కోరారు.
"నా అంశతో, అందరికీ గురుతుల్యుడై, తేజో ప్రకాశాలతో వెలగే కుమారుడు మీకు కలుగు గాక " అని వారీని దీవించి దత్తాత్రేయుడు అంతర్ధానమయ్యాడు. అప్పటికే అప్పలరాజ శర్మ దంపతులకు ఎంతో మంది సంతానం కలుగగా వారిలో చాలా మంది మరణించారు. అందరిలో కేవలం ఇద్దరు మాత్రమే మిగలగా వారిలో కూడా ఒకరు గుడ్డివాడు కాగా, మరొకడు కుంటివాడు. అలా సంవత్సరం తరువాత సుమతికి తేజోవంతుడైన ఒక కుమారుడు జన్మించాడు.
ఆ పిల్లవాడికి 'శ్రీ పాదుడు' అని నామకరణం చేశారు అప్పలరాజ శర్మ దంపతులు. ఎందుకంటే ఆ బాలుడు తన పాదములపైన విచిత్ర చిహ్నాలతో జన్మించాడు కాబట్టి. ఆ బాలుడు తన ఏడు సంవత్సరాల లోపే సకల విద్యలూ నేర్చుకోగా, తన ఉపనయన కార్యక్రమం తరువాత వాటిపైన ప్రవచనములు ఇవ్వసాగాడు. తన పదహారవ ఏటకు చేరుకున్నాడు శ్రీ పాదుడికి పెళ్ళి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు.
కానీ ఙ్ఞానమూర్తి అయిన శ్రీపాదుడు పెళ్ళికి ఏమాత్రం సమ్మతించలేదు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదు శ్రీపాదుడు. తరువాత తల్లిదండ్రుల అనుమతితో సన్యాసం స్వీకరించాడు శ్రీపాదుడు. కానీ సన్యాసానికి ముందు గుడ్డివాడు, కుంటివాడు అయినా తన ఇద్దరు సోదరులను తన లీలతో చూపును ప్రసాదించాడు మరియు ఇంకో సోదరుడి అవిటి తనాన్ని పోగొట్టాడు. వారిరువురికి ఙ్ఞానాన్ని ప్రసాదించి తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారిపై మోపి తాను తీర్థయాత్రలకై బద్రినాథ్ బయలుదేరాడు.
తీర్థయాత్రలు ముగించుకున్న శ్రీపాదుడు దక్షిణాన కర్ణాటకలో గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నాడు. అటు తరువాత అక్కడి నుండి కృష్ణా నది జన్మస్థానమైన మహాబలేశ్వరం చేరుకున్నాడు. అక్కడ మూడు సంవత్సరాలు గడిపిన తరువాత శ్రీశైల పర్వతం చేరుకున్నాడు శ్రీపాదుడు. తరువాత అక్కడికి దగ్గరలోని కురువాపురం గ్రామానికి చేరుకున్నాడు శ్రీపాదుడు. తన జీవితంలోని ఎక్కువ భాగం ఈ ఊరిలోనే గడపడం విశేషం.
శ్రీ పాద వల్లభుల తరువాతి అవతార వైశిష్ట్యం మరియు లీలా విశేషాలు :
ఆ ఊరిలో అంబిక అనే పేరు బ్రాహ్మణ స్త్రీ నివసిస్తూండేది. ఆమెకు ఒక పుత్రుడు ఉండేవాడు. వాడు చెడు సాంగత్యం వలన పరమ నీచమైన పనులు చేస్తూ ఆ ఊరిలోని వారి చేత ఎప్పుడూ తిట్లు తింటూ ఉండేవాడు. ఇదిలా ఉండగా అంబిక భర్త తన పుత్రుడిని మార్చడానికి ఎంతగానో ప్రయత్నంచాడు, కానీ ఫలితం లేక కొన్ని రోజులకు బాధతో మరణించాడు.
భర్త తరువాత బిడ్డను మార్చటానికి అంబిక ఎంతో ప్రయత్నించింది. కానీ తను కూడా సఫలీకృతం కాకపోవడం వల్ల, ఊర్లో వారందరి చేత మాటలు పడడం కన్నా చావడం ఉత్తమమని తలచి, ఆత్మహత్య చేసుకుందామని కృష్ణా నది ఒడ్డుకు చేరుకున్నది అంబిక. కానీ నది ఒడ్డున కూర్చొని ఇదంతా గమనిస్తున్న శ్రీపాద వల్లభుడు తన దివ్యదృష్టితో అంతా తెలుసుకొని, ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా వారించే ప్రయత్నం చేశాడు. ఆత్మహత్య మహాపాపమని అంబికను ఆపే ప్రయత్నం చేశారు శ్రీపాద వల్లభులు. అప్పుడు అంబిక తన బాధను అంతా శీపాదుల వారికి తెలియజేసింది.
అంబిక భక్తితో శ్రీపాదుల వారితో ఇలా అంది " స్వామీ! నాకు జీవితం పైన వ్యామోహం ఏమాత్రం లేదు. ఉన్న ఒక్క కొడుకు కూడా ఇలా తయారయ్యాడు. నాకు జీవించాలని లేదు. కనీసం వచ్చే జన్మలో అయినా మీలాగా పరమ తేజోవంతుడైన కుమారుడు కలిగేలా ఆశీర్వదించండి!!!" అని ప్రాధేయపడింది.
అన్నీ తెలిసిన శ్రీపాదులు అప్పడు అంబికతో " అమ్మా! నీ ఇష్ట ప్రకారమే వచ్చే జన్మలో నీ సంతానంగా ' శ్రీ నృసింహ సరస్వతి' అను నామంతో మళ్ళీ జన్మిస్తాను. కానీ ఇప్పుడు ఓర్పు వహించు తల్లీ! " అని ఆమెకు వరాన్ని ప్రసాదించాడు. తరువాత ఆమె కొడుకు తలపై చేయి ఉంచి, వాడిని మహా ఙ్ఞానిగా మార్చారు శ్రీ పాదులవారు.....
అదే గ్రామంలో శ్రీపాద వల్లభుల పరమ భక్తుడైన ఒక చాకలివాడు ఉండేవాడు. కానీ ఆ చాకలివాడు చాలా బీదవాడు. ఆయన ప్రతీ రోజు శ్రీ పాద వల్లభుల వారి బట్టలు ఉతకడం ద్వారా వారికి ఎల్లవేళలా సేవ చేస్తూండేవాడు. కానీ ఒక రోజు కృష్ణా నదిలో అక్కడి సుల్తాను తన రాజపరివారంతో కలిసి నావల్లో వెళ్ళడం చూసాడు ఈ చాకలివాడు.
ఆ సుల్తాను యొక్క రాజసం, ఐశ్వర్యం, ఠీవిని చూసి ఆశ్చర్యపడ్డాడు. కానీ అలా చూస్తూ తన బీదత్వానికి చాలా బాధపడ్డాడు. విషయం తెలిసిన శ్రీపాద వల్లభులు ఆ చాకలివాడిని ఏమైందని అడగగా ఆ చాకలివాడు " నాకు అలా రాజుగా పుట్టి సకల సుఖాలు అనుభవించాలని ఉంది స్వామి! " అని బదులిచ్చాడు. అప్పుడు శ్రీపాదుల వారు ఆ చాకలివాడికి వచ్చే జన్మలో రాజుగా పుట్టమని వరమిచ్చారు.
కానీ ఆ చాకలివాడు సంతృప్తిపడక #శ్రీపాదుల వారితో " స్వామి! కానీ వచ్చే జన్మలో మిమ్మల్ని చూడకుండా, మీ సేవాభాగ్యం నుంచి వచింతుడనై, నేను ఉండగలనా? " అని బాధపడ్డాడు. కానీ అప్పుడు శ్రీ పాదుల వారు ఆ చాకలివాడితో " వత్సా! బాధపడకు. వచ్చే జన్మలో నేను నృసింహ సరస్వతిగా జన్మంచినప్పుడు నన్ను కలుస్తావులే! " అని బదులిచ్చారు.
ఈ చాకలివాడే తరువాతి జన్మలో బీదరు సుల్తాను అల్లాఉద్దీన్ రెండు గా జన్మించారని నానుడి.
అదే ప్రాంతంలో వల్లభేషుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వ్యాపారం చేస్తూండేవాడు. తన వ్యాపారంలో బాగా లాభాలు వస్తే కురవాపురం వచ్చి వేయి మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తానని భగవంతుణ్ణి వేడుకున్నాడు. అలా అదే సంవత్సరం ఆయనే తన వ్యాపారంలో చాలా లాభాలను గడించాడు. అనుకున్నట్టుగానే చాలా ధనంతో కురవాపురం బయలుదేరాడు.
కానీ అది బందిపోట్లు బెడద అధికంగా ఉండే దారి. వల్లభేషుడు ధనంతో వెళుతున్నాడని సమాచారం తెలిసిన బందిపోట్లు ఆయనపై దాడిచేసి ఆయన తలనరికి చంపేశారు..... ( ఇంకా వుంది )

No comments:

Post a Comment

Pages