పుకారు - షికారు - అచ్చంగా తెలుగు

పుకారు - షికారు

Share This
పుకారు - షికారు
పెయ్యేటి శ్రీదేవి
          
ఆమధ్య వినాయకుడు పాలు తాగుతున్నాడని ఎక్కడో, ఎవరో, ఎందుకో చిలిపిగా పుకారు లేవదీసారు.  ఆ పుకారు కారు కన్న వేగంగా గాల్లో షికారు కొట్టి, దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపింది.  తండోప తండాలుగా మూఢభక్త జనకోటి ఇళ్లలోను, దేవాలయాలకు కూడా వెళ్ళి వినాయకుడికి పాలు పోసారు.  టి.వి.లో కూడా చూపించారు.  ఇక్కడ తర్కం వద్దు.  భక్తులు నమ్మారు.  వినాయకుడు పాలు తాగాడు. ఒకసారి దెయ్యం ఫోన్లో మాట్లాడుతోందన్నారు.  భయం భయంగా అందరూ ఫోన్లు చేసారు.  అల్లా వరసగా ఫోన్ కాల్స్ వస్తుంటే ఆ నంబరు గలవారే అటువంటి పుకారు లేవదీసారని కూడా వినికిడి. ఒకసారి షిర్దీ సాయిబాబా భక్తులు టీనీళ్ళు పోసి ఎవరో ఇచ్చిన రొట్టి అందులో మూడు రోజులు వుంచమన్నారు.  అది తరవాత మూడుగా అవుతుందన్నారు.  చాలామంది చేసారు. అంతకన్నా ముందు ఎప్పుడో పాలల్లో సత్యసాయిబాబా కనిపించాడన్నారు. ఒకసారి పేపర్లో పడిందిగా, నెయ్యిలో వినాయకుడు కనిపించాడని, జనం తండోపతండాలుగా వస్తున్నారనీ!  ఇక్కడా తర్కం వద్దు.  జనానికి కనిపించిందేమో!  ఈ ఆకారాలు మనం చూసే దృష్టిని బట్టి వుంటుంది.  ఆకాశంలో మేఘాలలోను, చెట్లపొదలలోను, మొజాయిక్ ఫ్లోరింగ్ లోను, రాళ్ళూ రప్పలలోను కూడా మనకనేక రూపాలు కనిపిస్తాయి.  దేవుని రూపాలు, మనుషుల రూపాలు, పక్షుల రూపాలు, ఇలా........... చాలా ఏళ్ళక్రితం ' ఓ స్త్రీ, రేపు రా!' అని చాలామంది తమ ఇళ్ళ వీధి తలుపుల మీద రాసారు.  అలాగే తలుపుల మీద నామాలు గీసారు.  ఇవన్నీ రొటీన్ లైఫ్ లో జీవించే జనానికి తద్భిన్నంగా కొత్త తరహాలో మోళీ చెయ్యడం లాంటిది. ఆమధ్య ఆకాశంలో ఉల్కాపాతాలు వస్తాయని, దీపావళిని మించిన కాంతితో ఆకాశం వెలుగొందుతుందని, అందరూ చూసితీరాలని శాస్త్రజ్ఞులు కనిపెట్టి చెప్పారు.  అప్పుడుకూడా జనం తండోపతండాలుగా, చలిని కూడా లెక్క చెయ్యకుండా, డాబాల మీదకి వెళ్ళి, చాపలు వేసుకుని, రాత్రంతా ఆకాశం వైపే చూస్తూ కూర్చున్నారు.  అంతలో వర్షం వచ్చినా తడుస్తూనే వుండిపోయారు.  ' ఏమండీ, మీకేమన్నా కనిపించాయా?' అని పక్క ఇళ్ళవాళ్ళు అడిగితే, ' ఆ.... చూసాం గాని ఈలోపున రెప్ప మూత పడింది.  అందువల్ల పూర్తిగా చూడలేకపోయాము.' అన్నారు.  కొంతమంది ' మేము చూడలేదు.' అన్నారు.  ఏమైతేనేం, మర్నాడు అందరూ నిద్రలు లేక కళ్ళు ఎర్రబడి, వాచిపోయి, మెడలు నెప్పితో ఆఫీసులకెళ్ళారు. సరిగ్గా ఇలాంటిదే తమాషాగా ఓ కథ చెప్పుకుందాం. ఫలానా రోజు ఆకాశంలో కృష్ణుడు కనిపిస్తాడని, గుమిగూడిన నక్షత్ర సముదాయంలో తేజోవంతంగా కనిపించే ఆ శ్రీకృష్ణులవారిని అందరూ తనివి తీరా చూడమని ఎవరో చిలిపిగా ఒక పుకారు లేవదీసారు. ఇక శ్రీకృష్ణులవారిని చూసి తరించాలని ముసలివారు, కృష్ణభగవానులు ఎలా వుంటారోనని అన్ని మతాలవారు, ప్రపంచమంతా ఆయన కనిపించే రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నగరవీధులన్నీ శుభ్రంగా వుంచారు.  మామిడాకుల తోరణాలతో, రంగు రంగుల పూలతో అలంకరించారు.  రోజూ కృష్ణుని భక్తి పాటలు వినిపించసాగారు.  అందరూ ఆ కృష్ణుని గురించిన సినిమాలు చూస్తూ కథలు వింటూ ఆయన గురించి తెలుసుకుంటున్నారు. కృష్ణసాక్షాత్కారం రోజు రానే వచ్చింది!  రాత్రి మూడు గంటలకు కృష్ణసాక్షాత్కారం కలుగుతుందన్నారు. అందరూ కృష్ణుని కిష్టమైన అటుకులు, పాలు, పెరుగు, వెన్నమీగడలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ధూప దీప నైవేద్యాలతో డాబాలు, అపార్ట్ మెంట్ల పైకి మంచి చలిలో రగ్గులు కప్పుకుని వెళ్ళారు.  కొంతమంది కృష్ణులవారు కనిపిస్తే ఏమేం కోరుకోవాలో, ఆ వరాల లిస్టు తయారు చేసుకున్నారు.  ఇంకొంతమంది కృష్ణులవారు కూర్చోడానికి కుర్చీలు తీసికెళ్ళారు.  ఒక నిరుపేద రైతు తన తాత ఇచ్చిన వెండిగ్లాసుతో చిక్కటి ఆవుపాలు తీసుకెళ్ళాడు.  ఇల్లా చిన్న, పెద్ద,ముసలీ, ముతకా అందరూ ఆ కృష్ణుని రాక కోసం ఎదురు చూస్తున్నారు.  వీడియో కెమేరాలు తీసుకెళ్ళారు. పన్నెండు గంటలైంది.  అందరిలో టెన్షన్ !  ఎక్కడ కన్ను మూత పడితే ఆ కృష్ణులవారిని చూడలేకపోతామో అని కంటికి కునుకు రాకుండా కంట్లో సుర్మాలు పెట్టుకుని నిద్ర నాపుకుంటున్నారు.  ముసలివాళ్ళని, ' మామ్మగారూ!  మీరు పడుకోండి, ఆ కృష్ణులవారు వచ్చినప్పుడు లేపుతాను.' అంటూ వాళ్ళని యువకులు పలకరిస్తున్నారు.  పాపం కన్ను కనపడని ఒక ముసలామె, కళ్ళు టెస్ట్ చేయించుకోమని, కళ్లజోడు మార్పించుకోమని కొడుకు ఎంత చెప్పినా వినిపించుకోని ఆమె, వెంటనే కొత్త కళ్ళజోడు వేయించుకుని, కృష్ణపరమాత్మ దర్శనం చేసుకుని ముక్తి పొందుదామని ఎంతో ఆశతో ఎదురు చూస్తోంది.  కృష్ణులవారు వచ్చే సమయం ఆసన్నమవుతోంది.  అందరూ కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తున్నారు.  గడియారం మూడు గంటలు కొట్టింది.  ఒక చిన్న మెరుపు వచ్చింది.  తరవాత ఉల్క రాలిపడింది.  తరవాత ఒక చిన్న ఉరుము వచ్చింది.  ఆ తర్వాత పెద్ద శబ్దంతో కాంతి వచ్చింది. ' హే కృష్ణా, ముకుందా, మురారీ...... జయ కృష్ణా ముకుందా మురారీ........' అంటూ ఘంటసాల వారి పాట వీనుల విందు చేస్తోంది. ' అదుగో, కృష్ణులవారు వచ్చేసారు!  వచ్చేసారు!' అంటుండగా ఒక చినుకు పడింది.  తరవాత ఇంకో చినుకు.  అలా వరుణదేవుదు చిలిపిగా ఉరుములు, మెరుపులతో ఆ శ్రీకృష్ణభక్త జనసందోహాన్ని తడిపి ముద్ద చేసాడు. ఈ తండోపతండాల జనమందరూ ఎవరు ఏ ఇంటికి వెళుతున్నారో, ఎవరు ఎక్కడ వున్నారో తెలియని పరిస్థితిలో, ఒక ఇంట్లోంచి వెలుగుతో, ' కన్నా, నిను కనుగొన్నా, వెన్నల దొంగా, మరులను గొన్నా' అంటూ మీరా అనే అమ్మాయి తంబుర మీటుతూ, కృష్ణభజనలు చేస్తోంది. ' అమ్మా, మీరా!  నువ్విక్కడున్నావా?  అందరూ కృష్ణసాక్షాత్కారం కోసం ఎముకలు కొరికే చలిలో మేడలు, మిద్దెలు ఎక్కి కూర్చుంటే, నువ్వొక్కదానివే ఇక్కడున్నావా అమ్మా?' ' నాన్నా!  నీకు కృష్ణ సాక్షాత్కారం కలిగిందా?' ' ఆ.........ఆ..........కృష్ణులవారు వస్తూవుంటే, ఇంతలో ఆ మాయదారి వాన రావడంతో తడుస్తూ వచ్చేసానమ్మా.' ' నాన్నా!  నాకు కృష్ణసాక్షాత్కారం కలిగింది నాన్నా.' ' ఎలా కలిగిందమ్మా?  నువ్వు మాతో పైకి ఆ కృష్ణులవారిని చూడడానికి రాలేదు కదా?' ' కృష్ణుడిని చూడడానికి నేను ఎక్కడికో రావడమేమిటి నాన్నా, నీ పిచ్చి గాని!  నా కృష్ణపరమాత్మ నాలోనే వున్నాడు!' ' అర్థమైందమ్మా మేమెంత అజ్ఞానులమో!' ఆ మర్నాడు అందరూ నిద్రలు లేక, నడుం నెప్పులతో బాధ పడుతుంటే, ఇదే అదనుగా చేసుకుని, కృష్ణుడి పేరుతో మాయ వేషాలు వేసుకుని, మాయ మాటలు చెప్పి ఇళ్ళలో జొరబడి ఘరానాగా దోచుకున్నారు కొంతమంది. ' ఏమండీ, మీకు కృష్ణసాక్షాత్కారం కలిగిందా?' కనిపించిన ప్రతివాళ్ళని ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకుంటుంటే, వాళ్ళు చెప్పే సమాధానాలు ఈవిధంగా వున్నాయి. ' కృష్ణుడు ఎప్పుడు ఏ రూపంలో వస్తాడో గుర్తించటం చాలా కష్టం.  మా యింటికి పొద్దున్నే బ్రాహ్మణ రూపంలో వస్తే, అతిథి మర్యాదలు చేసి, సుష్టుగా భోజనం పెట్టి పంపాను.' ' మా యింటికి చిన్న కుర్రాడి రూపంలో వస్తే డబ్బులిచ్చి పంపాను.' ' మా యింటికి కృష్ణుడి రూపంలోనే వచ్చాడు.  పెరుగు, వెన్న, మీగడలు పెడితే ఆరగించి వెళ్ళాడు.' ' ఆ.........సాక్షాత్తూ ఆ కృష్ణుడే వచ్చాడా మీ యింటికి?  ఐతే ఆయన్నేం వరాలు కోరుకున్నావు?  ఏమిచ్చాడు?' ' నేనడిగే లోపే ఆ మహానుభావుడు నా స్కూటరేసుకుని వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తానని.  శ్రీకృష్ణులవారు ఎక్కిన నా స్కూటరు ఎంత పుణ్యం చేసుకుందో!' ' మా యింటికి కోయదొర వేషంలో వస్తే, ఏమివ్వకుండానే అన్నీ మాయమయ్యాయి.  ఏమిటో...........అంతా కృష్ణమాయ!' అందుకే దేవుడి పేరుతో ఎవరేం చెప్పినా నమ్మేసే భక్తుల్ని మోసం చేసే ఘరానా మోసగాళ్ళు మన వెంటే వుంటారని గ్రహించండి.  అందుకే పుకార్లు నమ్మవద్దు.
****************************
          పుకార్లు వస్తాయి.  జనం నమ్మేవాళ్ళు నమ్ముతారు.  నమ్మని వాళ్ళు నమ్మరు.  దేవుడి గురించినవైతే మరీ మూఢంగా నమ్మేవాళ్ళే ఎక్కువ.  పుకార్లు లేవదీసేవాళ్ళకి అదొక కాలక్షేపం కావచ్చు.  ఎదుటివారికవి చాలా బాధ కలిగిస్తాయి.  ఏదీ చూడకుండా, నిర్ధారించుకోకుండా, ప్రలోభంలో పడిపోయి, దేవుడు మనలోనే వున్నాడు, మన దగ్గరే వున్నాడు అన్న సంగతి మరిచి, దేవుడి పేరుతో రేగే ఈ పుకార్లని నమ్మి మోసపోకూడదు.
***************************
         

No comments:

Post a Comment

Pages