అద్భుత చిత్ర శిల్పి - ఆర్టిస్ట్ అక్బర్ - అచ్చంగా తెలుగు

అద్భుత చిత్ర శిల్పి - ఆర్టిస్ట్ అక్బర్

Share This

అద్భుత చిత్ర శిల్పి - ఆర్టిస్ట్ అక్బర్

భావరాజు పద్మిని 

 'జీవితాన్ని చూడని కళ రాణించదు' అంటారు ఆర్టిస్ట్ అక్బర్ గారు. బాపు గారి తర్వాత ఎక్కువ సంఖ్యలో కధలకు, కవితలకు బొమ్మలు వేసిన ఆర్టిస్ట్ ఈయనే. తన ప్రతిభకు సృజన, సాధన కలిపి, 'తెలుగు బొమ్మను' ప్రపంచస్థాయికి తీసుకువెళ్ళి, విజయకేతనం ఎగురవేస్తున్న ఈ అద్భుత చిత్రకారుడితో ముఖాముఖి చదవండి...
మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి చెప్పండి...
మా నాన్నగారు టీచర్ అండి. ఖమ్మం జిల్లా పాల్వంచ మా స్వగ్రామం. 1967
లో పుట్టాను. మా నాన్నగారికి బదిలీలు అవుతుండడంతో ముత్యాలంపాడు, కోయగూడెం, బోడు వంటి గ్రామాలు తిరిగాము. 2,3 తరగతులు ఒకచోట అలా చదివేవాడిని. 10 వ తరగతి వరకూ ముత్యాలంపాడు వద్ద చదివి, ఇంటర్మీడియట్ కు పాల్వంచ వచ్చేసాను.
చిన్నప్పటి నుంచి మీకు చిత్రకళ పట్ల మక్కువ ఉండేదా ?
3 ,4 తరగతుల నుంచే బొమ్మలు గీసేవాడిని. పుస్తకాల్లో పెన్సిల్ డ్రాయింగ్ చేసేవాడిని. నా చేతిరాత చాలా బాగుండేది. అది చూసిన అందరూ నన్ను 'ఆర్టిస్ట్' అని పిలిచేవారు.  అదే నాకు ఇన్స్పిరేషన్ అయ్యింది. 10 వ తరగతికి వచ్చేసరికి నా ఆర్ట్ లో ఒక పరిణితి వచ్చింది. ఇంటర్ లో సైన్సు చదివాను, బొమ్మలు వేసాను, కాలేజీ లో ప్రశంసలు పొందాను. B.Sc చదువుతూనే , సైన్ బోర్డు లు, పోర్ట్రైట్ లు వేస్తూ, హాస్టల్ లో ఉండేవాడిని.
మీకు గురువులు ఎవరైనా ఉన్నారా ? చిత్రకారుడిగా మీ ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
నాకు గురువులు ఎవరూ లేరండి. మా ఇంట్లో కూడా చిత్రకారులు ఎవరూ
లేరు. డిగ్రీ తర్వాత JNTU లో ఫైన్ ఆర్ట్స్ చెయ్యాలనుకునే వాడిని. కాని 2,3 సార్లు ప్రయత్నించినా, ఒక్క రాంక్ లో మిస్ అయ్యింది. ఇక అక్కడితో ఆ ప్రయత్నం మానేసా. స్టూడెంట్ యూనియన్ లీడర్ ఒకరు నాకు JNTU లోని లైబ్రరీ లోకి ప్రవేశం కల్పించేలా ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అక్కడ లియోనార్డో, పికాసో, మంచ్ వంటి ప్రముఖ చిత్రకారుల పుస్తకాలను చూసి, వారెంత కష్టపడ్డారో తెలుసుకుని, ఎన్నో అవగాహన చేసుకున్నా. ఫైన్ ఆర్ట్స్ విద్యార్ధుల పుస్తకాలను చదివి, ఎన్నో తెలుసుకున్నా. తర్వాత వైజాగ్ లోని ఆంధ్రా యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు ను కలిసి, వారికి నా బొమ్మలు చూపి,  లైబ్రరీ లో కి వెళ్లేందుకు ఇలాగే ప్రత్యేక అనుమతి తీసుకుని, మూడు నెలలు కృషి చేసా. వైజాగ్ ఫైన్ ఆర్ట్స్ ప్రవేశ పరీక్షలో నాకు మొదటి రాంక్ వచ్చింది. కాని, అదే సమయంలో మా నాన్నగారు చనిపోవడం వల్ల, కుటుంబ బాధ్యత మీదపడి, కోర్స్ లో చేరలేకపోయాను.                            
నాన్నగారు సర్వీస్ లో ఉండగా గుండెపోటుతో  పోయారు. మా తమ్ముడికి పెళ్లవడంతో ఆ ఉద్యోగం నాకు ఇస్తానన్నారు. అంతా నన్ను ఆ ఉద్యోగంలో చేరమన్నారు. కాని, నాకు ఆ ఉద్యోగం చేసే ఉద్యోగం చేసే ఆసక్తి లేకపోవడంతో, ఆర్ట్ లోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుని, మా తమ్ముడికే ఇప్పించాను.  సైన్ బోర్డు ఆర్టిస్ట్ లైన నా మిత్రుడితో కలిసి ఉంటూ, పత్రికలకు ఫ్రీ లాన్స్
ఆర్టిస్ట్ గా పనిచెయ్యడం మొదలుపెట్టాను. ఆంధ్రజ్యోతిలో కధలకి, కవితలకి బొమ్మలు వెయ్యడం,  కవర్ పేజి లు వెయ్యడం చేసేవాడిని. అప్పుడు ఆ వర్క్ లు చూసి, 95 లో అనుకుంటాను, నాకు త్రిపురనేని శ్రీనివాస్ గారు, నన్ను కలవమని ఫోన్ చేసారు. ఆయన అప్పుడు వీక్లీ కి ఎడిటర్ గా ఉన్నారు. సండే ఎడిషన్ కు ఇన్ చార్జి గా ఉన్నాను. నా వర్క్స్ చూసి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయని మెచ్చుకుని, ఉద్యోగంలో చేరమన్నారు, చేరాను.
అప్పటినుంచి నా ప్రయాణం సాఫీగా సాగింది. అదే సమయంలో జరిగిన విప్లవ ఉద్యమాలతో నేనూ కలిసి నడిచాను - వీటిలో తెలంగాణా ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, ధనికవాదులు, ముస్లిం వాదం, వంటివాటికి పనిచేసాను. వీటితో కలిసి పని చెయ్యడం వల్ల, దాదాపు ఒక 25, 000 పుస్తకాలకి కవర్ పేజి లు వేసాను. ఇప్పుడు నాకు 47 ఏళ్ళు. బాపు గారి తర్వాత అత్యధికంగా కవర్ పేజి లు వేసిన రికార్డు నాదే !
ఆంధ్రజ్యోతి సండే ఎడిషన్ కి పోర్ట్రైట్ లను కవర్ పేజి లు వేసాను. కె.ఆర్.నారాయణన్ గవర్నర్  గా ఉన్నప్పుడు, ఆయన బొమ్మ కవర్ పేజి గా వేస్తే, ఆయన ఎంతగానో మెచ్చుకుని, నాకు ఆ బొమ్మ ఒరిజినల్ పెయింటింగ్ కావాలని అడిగారు. ఆయన అది తన గదిలో పెట్టుకుంటానని, తన ఆటో బయోగ్రఫీ లో వేసుకుంటానని అన్నారు.
తర్వాత నేను 2000 సం.లో న్యూ యార్క్ లో 'సాక్షి' అని ఒక దళిత స్త్రీ సంస్థ
కోసం 'విమెన్ అండ్ గర్ల్ చైల్డ్ లేబర్ ' మీద  ఒక పెయింటింగ్ షో చేసాను. తర్వాత 2002 లో న్యూ జెర్సీ లో షో చేసాను. హార్వార్డ్ యూనివర్సిటీ లా డిపార్టుమెంటు నా పెయింటింగ్స్ ను సేకరించింది. అది న్యూ యార్క్ టైమ్స్ లో వచ్చింది. తర్వాత విశ్వవ్యాప్తంగా 15 సోలో ఎక్సిబిషన్ లు చేసాను. దుబాయ్, యూరోప్ వంటి దేశాల గేలరీ లకు నా బొమ్మలు ప్రదర్శనకు వెళ్ళాయి. భారత్ లో ఢిల్లీ, పూణే, మద్రాస్ , బెంగుళూరు వంటి చోట్ల అనేక షో లు చేసాను. హైదరాబాద్ లో చాలా ప్రదర్శనలు ఇచ్చాను. దాదాపు 50 గ్రూప్ షో లలో పాల్గొన్నాను. 70, 75 ఆర్ట్ క్యాంపు లలో పాల్గొన్నాను.
వచ్చే ఆదివారం బెంగుళూరు లో ఒక షో ఉంది, నెలాఖరున ఒక షో ఉంది.
నేను ఆర్టిస్ట్ గా నా ప్రయాణం మొదలుపెట్టినా, నేను ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఆర్ట్ డిపార్టుమెంటు హెడ్ గా ఉన్నాను. నా టీం లో అనేకమంది ఆర్టిస్ట్ లు, గ్రాఫిక్ డిసైనేర్ లు ఉన్నారు. జీవిక కోసం ఆ బాధ్యతలు చేస్తూనే, నాకు అభిరుచి ఉన్న కవిత్వం చదువుతూ, బొమ్మలు వేస్తూ ఉంటాను. అవి చూసి, మళ్ళీ వర్క్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడూ చేతిలో 4,5 కవర్ పేజి లు ఉంటాయి. నిన్ననే కత్తి పద్మారావు గారి పుస్తకం ఇచ్చాను, విమల గారి కధల పుస్తకం ఉంది , ప్రసాదమూర్తి కవిత్వం ఉంది, అలాగే వైజాగ్ హుద్ హుద్ తుఫాన్ మీద ఒక లాంగ్ పోయెమ్ పుస్తకం వేస్తున్నారు... ఇలా నాకు రచయతల తోటి సత్సంబంధాలు ఉన్నాయి.
తెలుగులో దాదాపు 200 మంది రచనలతో వచ్చిన 'అమ్మ' అనే కధల సంకలనానికి బొమ్మలు వేసాను, అలాగే 'నాన్న' అనే కధల పుస్తకానికీ నేనే వేసాను.
మిమ్మల్ని అభిమానించే రచయతలు ఎవరు ?
మూ గారు, త్రిపుర గారు, సీతారాం గాని, మోహన్, శిఖామణి, కత్తి పద్మారావు,ఎల్లురి సుధాకర్ గారు, వీరంతా నా బొమ్మే కావాలని
నెలైనా, ఆరు నెలలైనా ఆగి మరీ వేయించుకునేవారు. ఇది నాకు చాలా ఆనందం కలిగించే విషయం. నాకు బొమ్మలు వెయ్యటం యెంత ఇష్టమో, కవిత్వం కూడా అంతే ఇష్టం. నా శ్రీమతి పసుపులేటి గీత మంచి కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు. ఆమె కొంతకాలం జర్నలిస్ట్ గా కూడా పనిచేసింది. మా చుట్టాల్లో కొంతమంది కవులు ఉన్నారు.
సమయం అనుకూలిస్తే, ఇంకా కొన్ని వర్క్స్ చెయ్యాలని ఉంది, కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. 
మీరు ఇల్లుస్త్రేషన్ లు వేస్తారా ? 
నేను ఉద్యోగం మొదలుపెట్టినప్పటి నుంచి 20 ఏళ్ళుగా నేను అదే చేస్తున్నాను. ఆదివారం ఆంధ్రజ్యోతి లోని కవర్ పేజి, నవ్య కవర్ పేజి, సండే
ఎడిషన్ లోని కధలు, వివిధ అనే సాహిత్య పేజి కి బొమ్మలు వేస్తాను. పెయింటింగ్, ఇల్లుస్త్రేషన్, డిసైనింగ్, గ్రాఫిక్స్ చేస్తాను. 
మీకు ఇష్టమైన చిత్రకారులు ఎవరు ? నాకు పికాసో అంటే చాలా ఇష్టము.తర్వాత భారతీయ చిత్రకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన ఎం.ఎఫ్.హుస్సేన్ అంటే చాలా ఇష్టం. ఇంకా హైదరాబాద్లో లక్ష్మా గౌడ్ గారు, ఫవాద్ దంఖానత్ గార్లు వైవిధ్యభరితమైన చిత్రకారులు. ఇంకా చెప్పాలంటే, చాలామంది ఉన్నారు. ఇంకా నాకు ఆర్ట్ లో అమూల్యమైన సూచనలు ఇచ్చినవారు... చిత్రకారులు ఫవాద్ దంఖానత్ గారు. వారు అనేక దేశాలు పర్యటించారు. వారితో నాకు 15 -18 ఏళ్ళ అనుబంధం ఉంది. వారు సమకాలీన చిత్రకారుడికి ఏం కావాలి అన్న సూచనలు చేసారు. హైదరాబాద్ లో వారి పేరుతో ' దంఖానత్ ఆర్ట్ గేలరీ' కూడా ఉంది. 
అసలు 'బొమ్మ' అంటే ఎలా ఉండాలని మీరు అనుకుంటారు ? 
నాకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. సాధారణంగా ,కధలో ఉన్న ఫీల్ ని బొమ్మ వేస్తారు అంతా. నేను కధను సింబాలిక్ గా బొమ్మని మలుస్తాను. కవితైనా అంతే, కవి రాసిన అంశాన్ని విస్తృత పరుస్తాను. బొమ్మలో కవిత్వాన్ని, కధని, ఎక్స్టెండ్ చేస్తాను. అందువల్లే అంతా నన్ను ఇష్టపడతారు. ప్రతివారం ఎంతో మంది ప్రశంసిస్తారు, సింబలైజ్ చెయ్యడం, ఎక్స్టెండ్ చెయ్యడం అనే రెండు పద్ధతుల వల్ల నాకు ప్రత్యేకమైన పేరు వచ్చింది. 
  మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ? 
సోలో షోస్ చెయ్యాలని, గ్రామీణ జీవితం మీద ఇంకు డ్రాయింగ్స్ చెయ్యాలని అనుకుంటున్నాను. ఇందులో నాకు మంచి ప్రతిభ ఉంది. అయితే ఇందుకోసం నేను ఒక 2, 3 నెలలు గ్రామాల్లో గడిపి, వారి జీవితాన్ని స్టడీ చెయ్యాలి. నేను ఊహా చిత్రాలు గియ్యను, అది ఇల్లుస్త్రేషన్ లకు అయినా సరే. చూడకుండా బొమ్మ వెయ్యను. మధ్యలో నేను గ్రామాలకు వెళ్తూ ఉంటాను. అలా వేస్తే అది 'రొమాంటిక్ డ్రాయింగ్ ' అవుతుంది కాని, సీరియస్ ఆర్ట్ కాదు. ఇంకో మాట కూడా చెప్తాను. కవులకైనా, నాలుగు గోడల మధ్య కూర్చుని రాస్తే, అది నిర్జీవమవుతుంది. అలా రాసినవి నిలబడవు కూడా ! 
జీవితాన్ని చూడకుండా ఏ కళా సజీవమవ్వదు. 
శ్రీశ్రీ గారి వాక్కు ఇన్నాళ్ళు నిలిచిందంటే, ఆయన మనుషుల మధ్య తిరిగారు. ఈ కోవలోవే, మిగతా ప్రముఖ రచయతల రచనలు కూడా . 
  మీకు లభించిన అవార్డులు/ ప్రశంసల గురించి చెప్పండి.  
'బొమ్మ బాగుంది' అన్నప్పుడు వచ్చే ఆనందం కంటే ఏ అవార్డు గొప్పది కాదని, నేను నమ్ముతాను. తెలుగు యూనివర్సిటీ అవార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డు వంటివి వచ్చాయి. కాని మంచి మంచి ప్రశంస లు ఇచ్చే సంతృప్తి ఒక ఆర్టిస్ట్ కి అవార్డులు ఇవ్వలేవు. నేను సెల్ఫ్ ట్రైన్డ్ ఆర్టిస్ట్ అంటే
ఎవరూ నమ్మరు. తర్వాత కొందరు ఆర్ట్ కోర్స్ లు చెయ్యమని చెప్పారు. కాని నాకు ఇందులోనే ఒక డిగ్నిటీ ఉందని అనిపిస్తుంది. నేను పుస్తకాలు చదివి నేర్చుకుని, వారితో సమానంగా ఉండడం నాకు గర్వంగా ఉంటుంది. నాకు వేదాంతానికి సంబంధించిన గ్రంధాలంటే చాలా ఇష్టం. ఒక బొమ్మ, కధ, లేక కవిత వేసినవారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని, నేను నమ్ముతాను. 
భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ? 
"ఆర్ట్ నెవెర్ ఎండ్స్" అండి. నిరంతర సాధన చెయ్యాలి. ప్రతిరోజూ కొత్తదనం సృష్టించే ప్రయత్నం చెయ్యాలి. నేను ఇప్పటికీ ప్రాక్టీసు చేస్తాను. ఇప్పటి యువకులకు టెక్నాలజీ అందుబాటులో ఉండడమే పెద్ద లోపం అని నాకు అనిపిస్తుంది. కావలసిన బొమ్మ ఇంటర్నెట్ లో తేలిగ్గా దొరికేస్తుంది. దానివల్ల టైం వేస్ట్ తప్ప, బొమ్మలో జీవం తీసుకురాలేరు. ఆర్టిస్ట్ ఆలోచన కూడా అక్కడ ఆగిపోతుంది. అలా కాకుండా, 'లైఫ్ స్కెచ్' వెయ్యాలి. బస్టాండ్ లలో, రైల్వే స్టేషన్ లలో కూర్చిని, వచ్చేపోయే వారిని చూస్తూ, బొమ్మలు వెయ్యాలి. ఒక్క 2,3 సం. పాటు రోజుకి మూడు గంటలు చొప్పున సాధన చేస్తే, చాలా పర్ఫెక్ట్ లైన్ వచ్చేస్తుంది. మనం పది మంది కంటే పేరు తెచ్చుకోవాలంటే, ఆ పదిమంది కంటే ఎక్కువ కష్టపడాలి కదా !ఒక ఆర్టిస్ట్ ఎంత కష్టపడితే, అంత పైకి రాగలడు, అంత అద్భుతంగా బొమ్మలు వెయ్యగలడు.. ఆర్ట్ కు ఎటువంటి షార్ట్ కట్ లేదు. కష్టపడి, ప్రాక్టీసు చెయ్యడమే మార్గం, అంతే. స్వయంకృషితో చిత్రకారుడిగా ప్రపంచస్థాయిలో పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్ అక్బర్ గారు మరిన్ని సమున్నత శిఖరాలను అధిరోహించి, తెలుగు చిత్రకారులకే తలమానికంగా నిలవాలని మనసారా ఆకాంక్షిద్దాము...  

No comments:

Post a Comment

Pages