తెలుగు భావాల జిలుగులు – పొన్నాడ మూర్తి గారి బొమ్మలు : భావరాజు పద్మిని - అచ్చంగా తెలుగు

తెలుగు భావాల జిలుగులు – పొన్నాడ మూర్తి గారి బొమ్మలు : భావరాజు పద్మిని

Share This

50d89c71-17f2-43f9-8b4f-a055f9682a1d  ఉద్యోగ బాధ్యతల నుంచీ పదవీ విరమణ తర్వాత చాలా మంది, కొత్త జీవనశైలికి అలవాటు పడలేక, ఏమి చెయ్యాలో తోచక,       కొంత నిరాశకు గురౌతూ ఉంటారు. కాని ఆయన, అదొక అవకాశంగా భావించారు. తనకు ఇష్టమైన చిత్రకళా సాధన ప్రారంభించి,   నలుపూ తెలుపూ బొమ్మల్లో తెలుగు మనసుల భావోద్వేగాలను ఆవిష్కరించి, పలువురి మన్ననలు పొందుతున్నారు. ఆయనే   విశాఖ వాస్తవ్యులు, పొన్నాడ మూర్తి గారు. 

  పొన్నాడ వెంకట రమణ మూర్తి గారు 1944 జూలై 1 న కీ. శేషులు  పొన్నాడ శ్యాంసుందర రావు, పొన్నాడ కామేశ్వరి            దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి చిత్రకళ అన్నా, కార్టూన్లు అన్నాచాలా అభిమానం మూర్తి గారికి. ఖాళీ    ఉన్నప్పుడల్లా చూసి వేస్తూ ఉండేవారు, అయితే ఎవరి వద్దా అభ్యసించలేదు. స్కూల్ లో చదివేటప్పటి నుంచీ బొమ్మలు వేస్తూ    పలు బహుమతులు పొందారు. నాటకరంగంలో కూడా మంచి అభిరుచి ఉండేది. దాదాపు ౩౦ నాటికలు వేసారు. ఆయన చిత్ర కళకు ప్రేరణ గురించి, ఆయన మాటల్లోనే...

“నేను పెళ్ళికాక ముందు ఓ రోజు మాలాసిన్హా బొమ్మ వేసి ఓ అమ్మాయికి చూపించాను. 'అబ్బ పెన్సిల్ తో వేసిన ఈ బొమ్మ ఎంత బాగుంది' అంది ఆ అమ్మాయి.savitri నా పెన్సిల్ చిత్రకళ ని ముందుగా ప్రసంశించినది ఈ అమ్మాయే. ఈ అమ్మాయి తర్వాత నా సహధర్మచారిణి గా  రూపాంతరం చెందింది. ఆమే పొన్నాడ లక్ష్మి, నా అర్ధాంగి. నా పెన్సిల్ బొమ్మలకి ప్రేరణ ఇక్కడ ప్రారంభం అయ్యింది.”

విద్యాభ్యాసం తరువాత గ్రీవ్స్ కాటన్ Ltd., భువనేశ్వర్ (ఒడిషా)  లో కార్యదర్శి గా 35  సంవత్సరాలు  పనిచేసారు. 1991 లో ఆంధ్రప్రభ పత్రిక వారు నిర్వహించిన కార్టూన్ పోటీ సందర్భంగా ఓ కార్టూన్ పంపితే అది సాధారణ ప్రచురణకి స్వీకరించబడింది. ఆ స్పూర్తితో తర్వాత అప్పుడప్పుడు కార్టూన్లు పంపించడం, అవి ప్రముఖ తెలుగు పత్రికలలో ప్రచురించబడడం జరిగేవి. అయితే ఈ రంగంలో మరింత కృషి చేసేందుకు తగినంత సమయం దొరికేది కాదుట.  2000 సం. లో  పదవీ విరమణ చేసారు పొన్నాడ మూర్తి గారు. ఇక తర్వాత తన దృష్టిని తనకు అత్యంత ప్రీతికరమైన చిత్రకళపై, కార్తూన్లపై కేంద్రీకరించారు. అయితే ఇక్కడ కూడా ఆయన వైవిధ్యంగా  నలుపూ తెలుపూ పెన్సిల్ బొమ్మలను ఎన్నుకున్నారు. ఎందుకో ఆయన మాటల్లోనే...

sreebabu“చిన్నపటినుండి చిత్రకళ పై అభిరుచి వున్నా తగినంత సాధన చెయ్యడానికి వీలుపడలేదు. నా ఆక్టివిటీ అంతా పదవీవిరమణ తర్వాతే.  పెన్సిల్ అంటే ఏదో అవుట్ లైన్ వేసుకోవడానికే అని కొందరి భావన. నలుపు తెలుపు చిత్రాలు నన్ను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. దానికి పెన్సిల్ బాగుంటుంది అనిపించింది. ఎవరో కాని ఎన్నుకోని ఈ మాధ్యమం లో బొమ్మలు వేస్తూ ప్రయోగాలు చేపట్టటం మొదలెట్టాను. ఈ ప్రయోగాలకి ఫేస్ బుక్ ఓ ఆలంబన అయ్యింది. నేను వేసి, ఫోటోలు తీసి పెట్టిన బొమ్మలను చూసి మిత్రులు ప్రోత్సహించాసాగారు. వీరి అనూహ్య స్పందన నాలో నూతన ఉత్సాహం నింపుతోంది. “

ప్రత్యేకించి రాజ్ కపూర్ నర్గీస్ బొమ్మ, తల్లీ పిల్లల మమతను ప్రతిబింబించే బొమ్మ, మహానటి సావిత్రి బొమ్మ బహుళ ప్రశంశలు పొందాయి. పెన్సిల్ చిత్రకారునిగా మంచి గుర్తింపు లభించింది.

పురస్కారాలు   :  స్వాతి మాసపత్రిక వారు నిర్వహించిన కార్టూన్ పోటీలో మరియు నవ్య వార పత్రిక వారు నిర్వహించిన కార్టూన్ పోటీలలో బహుమతులు gandhiలభించాయి . 2004 సం.లో. ఈనాడు దినపత్రిక వారు నిర్వహించిన జిల్లావారి కార్టూన్ పోటీలో విశాఖపట్నం జిల్లా లో ఉత్తమ కార్టూనిస్ట్ గా పొన్నాడ మూర్తి గారిని ఎంపిక చేసారు. ఈ సందర్భంగా వారు హైదరాబాద్ పిలిచి ప్రముఖ ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ గారి తో ఇంటర్వ్యు ఏర్పాటు చేసారు. అదొక  మధురానుభూతిగా భావిస్తారు మూర్తి గారు.

సన్మానాలు/సత్కారాలు :  2012 అక్టోబర్ నెలలో హైదరాబాద్ లో జరిగిన కార్టూన్ ఫెస్టివల్లో మూర్తి గారి కార్టూన్లు ప్రదర్శించ బడ్డాయి. కార్టూన్ రంగానికి చేసిన సేవకుగాను అక్కడ సత్కారం జరిగింది. ఇటీవల జరిగిన  సమ్మెట ఉమాదేవి గారి “అమ్మ కధలు” పుస్తక ఆవిష్కరణ సభలో ఆంధ్రప్రదేశ్ అధికారభాషాసంఘం అధ్యక్షులు  మండలి బుద్దప్రసాద్ గారి ద్వారా మూర్తి గారి  పెన్సిల్ చిత్రాలకు ప్రసంశాపూర్వక సత్కారం జరిగింది.

krishnadevaraya విశాఖ సంస్కృతి, 64 కళలు అనే అంతర్జాల పత్రికల్లో మూర్తి గారిని గురించిన వ్యాసాలు ప్రచురింప బడ్డాయి. ఇప్పటికీ  ఖాళీ ఉన్నప్పుడల్లా బొమ్మలు గీస్తూ సాధన చేస్తుంటారు మూర్తి గారు. మనసును స్పందింప చేసిన కళాకారుల పోర్ట్రైట్  లు, బాపు బొమ్మలు, తెలుగింటి మమతలు, ప్రకృతి సౌందర్యం మూర్తి గారి కళకు ప్రేరణ అందిస్తాయి.  అడుగంటిపోతున్న తెలుగు భాష, సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే కార్టూన్లు, బొమ్మలు తనకు ఇష్టమని  చెబుతుంటారు. అరవైల్లో ఇరవైలా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే మూర్తి గారు, మరిన్ని బొమ్మలను వేసి, మరెందరికో  మార్గదర్శకులుగా నిలవాలని ఆశిద్దాం !

చిరునామా   : 3-65 SR పురం కాలనీ , P.O. జుట్టాడ, విశాఖపట్నం – 531173 ఈమెయిలు :  ponnada.murty@gmail.com

బ్లాగ్ లింక్: http://ponnadamurty.blogspot.in/

మొబైల్     :  8464041046

No comments:

Post a Comment

Pages